AUCHITHYAM | Volume-4 | Issue-3 | March 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
12. శ్రీమన్మహాభారత వనపర్వం: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం
డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ
సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9966108560, Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download
PDF
వ్యాససంగ్రహం:
పేరుకి ఇది వనపర్వమే కానీ పాండవుల బలాన్ని ద్విగుణీకృతం చేసి, దైవశక్తిని, బ్రాహ్మణ బలాన్ని, శ్రీకృష్ణుని కృపను, శస్త్రాస్త్ర సంపదను, ప్రజ్ఞాపాటవాలను, యుద్ధవిద్యలను వృద్ధిగావించుకున్న పర్వంగా చెప్పవచ్చు. వనపర్వాన్ని నవవిషయపర్వంగా నవద్వారపురిగా చెప్పుకుందాము. ధర్మజుని ధర్మజ్ఞతను చాటిచెప్పే నవఘట్టాల సమాహారమైన ఈ పర్వంలో పాండవులు ధర్మజుని అడుగుజాడలలో ఎలా దివ్యశక్తులను, మానసిక-శారీరక బలాన్ని, సంపాదించారో పరిశీలిద్దాము. “నా బుద్ధి ధర్మమునందే ప్రవర్తించేట్లు చేయమని” యమధర్మరాజు చేత వరం అనుగ్రహించబడిన ధర్మమూర్తి ధర్మరాజు
Keywords: అక్షయపాత్ర – శ్రీకృష్ణపరామర్శ - ద్రౌపదీభీమధర్మజుల – సంవాదములు – అనుస్మృతి, ప్రతిస్మృతి విద్యలు – నారదాదుల ధర్మబోధలు – నహుషప్రశ్నలు – ఘోషయాత్ర – యక్షప్రశ్నలు.
1. ఉపోద్ఘాతము:
కష్టాలతో ప్రారంభమయి అద్భుతవిజయాలతో ముగిసిన పర్వం ఈ వనపర్వం. “ఈ కష్టాలు మనకెందుకు? యుద్ధం చేసి కౌరవులను నిర్జించి రాజ్యభోగాలు అనుభవిద్ధాం” అని ఆవేశంతో పలికిన ద్రౌపదీ-భీములకు, “భీమార్జునులకు కౌరవులను జయించే శక్తి ప్రస్తుతం లేదని” తెలియచెప్పి, ఆ కష్టాలనే అనువైనసమయముగా మార్చుకుని అపారమైన శక్తిసామర్థ్యాలను సంపాదించటానికీ, పాండవ విజయానికీ కారకుడయ్యాడు ధర్మజుడు.
2. అక్షయపాత్ర:
అనుద్యూతంలో ఓడిన పాండవులు హస్తినాపురాన్ని విడిచి ద్రౌపదితో పాటు నగరానికి ఉత్తరాభిముఖులై నిష్క్రమించారు. పౌరులందరూ భీష్మాదులను నిందిస్తున్నారు. ధర్మాత్ములైన పాండవులున్నచోటకే మనమంతా వెళదామని పౌరులంతా మాట్లాడుకుని పాండవులను చాలాదూరం అనుసరించారు. ధర్మరాజు పౌరులకు చాలా సార్లు చెప్పిచూశాడు. మా వలన మీరంతా కష్టాలు పడకూడదు. మాకు అది ఇంకా బాధాకరమని నచ్చచెప్పి కొంతమందిని వెనక్కి మరిలించాడు. రాత్రి సమయానికి 'ప్రమాణం' అనే వటవృక్షం దగ్గరకి చేరుకున్నారు. నీటిని స్వీకరించి విశ్రమించారు. కానీ వారితో అనేకమంది బ్రాహ్మణులు వెంటవున్నారు. తెల్లవారగానే ధర్మజుడు బ్రాహ్మణులకు మరొకసారి చెప్పిచూశాడు. కానీ బ్రాహ్మణులన్నారు, “ధర్మజా! మేము మీ భక్తులము. మీరు ఎక్కడికి వెళితే అక్కడకు వస్తాం. సద్ధర్మంపట్ల దృష్ఠి కల మమ్మలను విడిచి పెట్టటం నీకు తగదయ్యా. రాజా! మా పోషణను గురించిన చింత కూడా నీకు అక్కరలేదు. మేమే స్వయంగా మా అన్నపానాదులను సమకూర్చుకుంటూ మీ వెంట వుంటాము. దయచేసి కాదనకండి” అంటూ అభ్యర్ధించారు బ్రాహ్మణులంతా. అప్పుడు యోగ సాంఖ్య శాస్త్రాలలో నిపుణుడైన శౌనకుడనే బ్రాహ్మణుడు ధైర్వవచనాలు పలుకుతున్నాడు. (ఈ శ్లోకం స్వర్గారోహణ పర్వంలో కూడా వ్యాసుడు చెప్పటం జరిగింది.)
శోకస్థాన సహస్రాణి భయస్థాన శతానిచ/ దివసే దివసే మూఢమావిశంతి న పండితమ్. 2.16
“రాజా! శోకింపదగిన సందర్భాలు వేలకొలదీ వుంటాయి. భయసందర్భాలు వందలకొలదీ వుంటాయి. కానీ అవి మూఢులైన మానవులను నిత్యం ఆవేశిస్తాయి. పండితుల పై ప్రభావం చూపలేవు” అన్నాడు. యాగ సమయంలో వీరందరినీ బంగారు పళ్ళాలలో విందు ఏర్పాటుచేసినవాడిని, అటువంటి ఈ నా అతిధులను నేడు ఎలా పోషించాలి? ఎలా అతిథిని గౌరవించి గృహస్థుధర్మాన్ని ఆచరించాలి? అన్నాడు ధర్మరాజు. రాజా! తపస్సు ద్వారా యోగ సిద్ధిని సాధించు. దాని వలన బ్రాహ్మణుల పోషణాదులు జరుగుతాయని సలహా ఇచ్చాడు శౌనకుడు. అంటే దైవానుగ్రహంతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు, కాబట్టి దైవాన్ని ఆరాధించమని సలహా ఇచ్చాడు. ధౌమ్యుడు సూర్యాష్టోత్తరశతనామాలను ఉపదేశించాడు.
ఏవం భానుమయం హ్యన్నం భూతానాం ప్రాణధారణం/ పితైవ సర్వభూతానాం తస్మాత్ తం శరణం వ్రజ. 3.9
ఆ సూర్యమంత్ర ఉపదేశాన్ని పొంది యుధిష్టిరుడు బ్రాహ్మణుల పోషణ కోసం సూర్యోపాసన గావించాడు. యుధిష్ఠిరుని దీక్షకు సంతోషించిన సూర్యభగవానుడు మండుతున్న అగ్నివలే ఉన్న శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. “రాజా! నీ పట్ల ప్రసన్నుడనయ్యాను. నీవు కోరుకున్నది నీవు పొందగలవు. ఈ పన్నెండు సంవత్సరాలు నీకు అక్షయమైన ఆహారాన్ని నేనిస్తాను. ఇదిగో ఈ రాగి పాత్రను గ్రహించు. ఇది అక్షయపాత్ర. నీవు కోరిన పదార్ధం దీనిద్వారా నీవు పొందుతావు. ద్రౌపది భుజించి, పాత్రను శుభ్రం చేసిన తరువాత ఆ రోజుకు ఇక దీని నుండీ ఏమీ రాదు. మర్నాడు మరలా పొందవచ్చు. నేటి నుండీ పదునాలుగవ సంవత్సరంలో నీవు మరలా రాజ్యాన్ని పొందుతావు అని జరిగేది కూడా చెప్పి సూర్యుడు అంతర్ధానమయ్యాడు.
(యత్ తేsభిలషితం కించిత్ తత్ త్వం సర్వమవాప్స్యసి) అహమన్నం ప్రదాస్యామి సప్త పంచ చ తే సమాః 3.71 గృహీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప యావద్ వర్త్స్యతి పాంచాలీ పాత్రేణానేన సువ్రత 3.72.
ఆనందంతో ధర్మజుడు ధౌమ్యునికి పాదాభివందనం చేశాడు. సోదరులతో భార్యతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఆమెతో పాటు వంటగదికి వెళ్ళి పాత్రలో జలం పోసి దానిని పూజించి సూర్యుణ్ణి స్మరించాడు. అద్భుతమైన చతుర్విధమైన భక్ష్యాలు క్షణాల్లో వారిముందు సిద్ధమయ్యాయి. వాటితో బ్రాహ్మణులందరికీ సంతృప్తిగా భోజనం వడ్డించారు. వేలాదిమందికి సంతృప్తిగా భోజనం పెట్టారు. పిమ్మట సోదరులు, వారి తరువాత యుధిష్ఠిరుడు. యుధిష్టిరుడు కూడా భోజనం చేశాక ద్రౌపది భుజిస్తుంది. ఆరోజుకి ఆ పాత్రలో ఇంక ఏవీ వృద్ధి చెందవు. ఈ విధంగా రాజసూయంలో నిత్యాన్నదానం జరిగినవిధంగానే సూర్యానుగ్రహంతో వనవాస జీవతంలోనూ వేలాది బ్రాహ్మణోత్తములకు అన్నసంతర్పణ చేసిన పుణ్యమూర్తి ధర్మరాజు. ఈ సందర్భంలో సూర్యనారాయణమూర్తి ధర్మజుని ఎలా ఆదరించారో అనే విషయం గురించి కొంత విశ్లేషించుకోవచ్చు.
విశ్లేషణ: 1) భగవంతుని భక్తిగా స్తుతిస్తే శత్రువును కూడా కాపాడుతారు అనటానికి ఇదొక నిదర్శనం కూడా, సూర్యసుతుడైన కర్ణుడిని సంహరించేది ఈ ధర్మజుని తమ్ముడైన అర్జునుడే అని భూతభవిష్యత్తులన్నీ తెలిసిన సూర్యభగవానుడికీ తెలుసు. అయినా సరే, ఆపదలో ఉన్నవారిని ఆదుకోటానికి, అందులోనూ అన్నార్తులను, పైగా బ్రాహ్మణులను ఆదుకోవటం కోసం అక్షయపాత్రను అనుగ్రహించి ధర్మజుని గృహస్థధర్మసాఫల్యం వనవాసంలో కూడా అద్వితీయంగా జరుగుతుందని నిరూపించాడు సూర్యభగవానుడు.
2) కర్ణుడు, ధర్మరాజు ఇద్దరూ కూడా సూర్యాంశమునుండే జన్మించినవారు అని చెప్పుకోవచ్చు. సూర్యుని పుత్రుడు యమధర్మరాజు, ఆ యమధర్మరాజు అంశే ధర్మజుడు. సూర్యుడికి యముడు మరియు వైవశ్వతమనువులు పుత్రులు. అందులో వైవశ్వతమనువు ధర్మశాస్త్రాలు వ్రాశిన ధర్మాత్మడు. యముడు మరియు యముడి అంశతో వచ్చిన ధర్మరాజు కూడా ధర్మమూర్తులుగానే ప్రసిద్ధమయ్యారు.
(వనవాసంలో ధర్మజుడితో వచ్చిన బ్రాహ్మణులకు, పౌరులకు అన్నపానీయాలకు లోటులేకుండా చేయగలిగాడు. ఇలాటి సంఘటనే రామాయణంలో కూడా శ్రీరాముడు ఎదుర్కొన్నాడు. కానీ వనవాసంలో రాముడు స్వయంగా రాక్షసులతో యుద్దం చేయవలసి వస్తుందనే కారణంగా, పౌరులు, బ్రాహ్మణులు నిద్రిస్తున్న సమయంలో వారి కనుగప్పి రాముడు అరణ్యప్రవేశం చేశాడని విజ్ఞులు భావించవచ్చు. రామాయణంలోనూ సూర్య శక్తులుగా శ్రీరాముడు, సుగ్రీవుడు, సూర్యశిష్యుడైన హనుమంతులను చెప్పుకోవచ్చు. ఈ విధంగా రామాయణ భారతాలుకు సాన్నిహిత్యంగా ఉండే చాలా విషయాలు చర్చించవచ్చు.)
3. శ్రీకృష్ణుడి పరామర్శ:
పాండవులు ద్వైతవనానికి చేరుకున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తనవారితో పాటు అక్కడికి వచ్చాడు. పాండవులకు పట్టిన ఈ స్థితిని చూసి శ్రీకృష్ణుడు ధార్తరాష్ట్రులపై కోపించి, “ఆ దుష్టచతుష్టయాన్ని సంహరించి, ఇంకా వారిని అనుసరించినవారిని కూడా సంహరించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని గావిద్దాం. ఇతరులను మోసగించి తాను సుఖించేవాడు చంపదగినవాడే, ఇది సనాతనమైన ధర్మమే” అన్నాడు జనార్ధనుడు. అధర్మపరులందరినీ ఆ క్షణానే భస్మం చేసేంత ఉక్రోషంలో ఉన్న జనార్ధనుణ్ణి అర్జునుడు శాంతింపచేశాడు.
ఆసందర్భంలో ధర్మరాజు అడిగాడు. “శ్రీ కృష్ణా! ఆ సమయంలో నీవెక్కడ ఉన్నావు” అని అనగానే కృష్ణుడు, “రాజా! ఆ సమయంలో ద్వారకలో లేనయ్యా, శాల్వుడిని, అతని విశిష్టమైన విమానాన్ని నాశనం చేయటానికి వెళ్లాను. ఆ విమానం నగరం ఆకృతిలో ఉంటుంది. శిశుపాలుణ్ణి సంహరించాననే కోపంలో వాడు, నేను లేని సమయం చూసి ద్వారకను ముట్టడించాడు. ద్వారకను దాదాపు నాశనం చేసి వాడు నేను లేని కారణంగా వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకుని నేను అతనికోసం అంతా గాలించి చివరికి ఒక సముద్ర ద్వీపంలో పట్టుకుని వానితో యుద్ధం చేసి సంహరించాను. ఆ తరువాత మీ విషయం తెలిసి వచ్చాను రాజా, నేను ద్వారకలోనే ఉండి ఉంటే మీ చేత ఈ ద్యూతం ఆడనిచ్చేవాడిని కాదు. మోసం చేసిన ఆ దుర్మార్గులను శిక్షించేవాడిని” అంటూ అందరికీ ధైర్యవచనాలు పలికి వారి అనుమతితో కృష్ణుడు నిష్క్రమించాడు.
విశ్లేషణ: ఈ విషయంలో ఉన్న ముఖ్యాంశాన్ని సభాపర్వంలో చూపించాము. ద్రౌపదిని రక్షించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుని మాయాద్యూతంనుండీ ఎందుకు తప్పించలేదు? అని. కానీ ఇక్కడ అదే ప్రశ్న ధర్మరాజు అడగగా “నేను ద్వారకలో ఉండిఉంటే నిన్ను ఆడనిచ్చేవాడినికాదు,” అంటున్నాడు పరమాత్ముడు. ఈ సందర్భంలో చెప్పిన నవద్వారపురీ ద్వారకా – అదే మన శరీరము. మాయాద్యూదము ఆడుతున్నంతసేపూ ధర్మరాజు శ్రీకృష్ణపరమాత్మను తలుచుకోలేదనే సంగతి ఆయనే ద్వారక అనే పేరుతో చెప్పినట్టు పెద్దలు చెప్తారు. వ్యాస-వాల్మీకుల అంతరంగాలను తెలుసుకోవాలంటే రామమాయణ-భారతాలలో అయోధ్య అన్నా, ద్వారకాపురీ అన్నా ఇలాంటి భావాలు తీసుకున్నప్పుడే పరిపూర్ణత చేకూరుతుంది. ద్యూదము వంటి వ్యసన సమయాలలో శ్రీకృష్ణపరమాత్ముడిని స్మరించకూడదనే, ధర్మజుడు ఆయన గురించిన ఆలోచన చేయలేదనిపిసస్తుంది. మనసారా భక్తిని నింపుకున్న ద్రౌపదీదేవి “హే ద్వారకావాసిన్, విశ్వాత్మా, విశ్వభావన” అని ఆర్తితో స్వామిని తలుచుకుంటూ అర్థించింది. అంత యుద్ధంలో ఉన్న కృష్ణస్వామి, ధర్మరాజు దగ్గరకు రాని స్వామి, ద్రౌపది స్మరణమాత్రంతోనే ధర్మవస్త్రాలను అందించారు. మానాన్ని కాపాడారు, ఆమె పతివ్రత అని నిరూపించారు.
4. ద్రౌపదీ-ధర్మజుల సంవాదం:
ఆ తరువాత ద్రౌపది ఒకనాటి సాయంత్రవేళ తన బాధను ధర్మరాజుకు చెబుతూ “మునుపు ఇంద్రప్రస్థంలో రాజులందరితో కూడిన నిన్ను ఇలా చూస్తుంటే బాధగా ఉంది. అనేక రుచికర పదార్థాలతో భుజించే నీ సోదరులు నేడు సంన్యాసుల్లాగా కందమూలాలు భుజిస్తూ జీవించటం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎంతటి పరాక్రమవంతుడు ఈ భీమసేనుడు? ఎటువంటి వీరుడు ఈ అర్జునుడు? ఎదురులేని పరాక్రమవంతులైన భీమార్జునులకు ఇటువంటి దుస్థితి కలిగించిన ఆ కౌరవుల మీద నీకెందుకు కోపం రావట్లేదు? వీరపత్నిని పతివ్రతను అయిన నన్ను వారంత అవమానిస్తుంటే ఎందుకు క్షమించావు? రాజా! 'ధర్మో రక్షతి రక్షితః', రక్షించబడిన ధర్మం ధర్మరక్షకుడిని ఎప్పుడూ రక్షిస్తుంది. కానీ నిన్ను మాత్రం రక్షించలేదని భావిస్తున్నాను. రాజానం ధర్మగోప్తారం ధర్మో రక్షతి రక్షితః/ ఇతి మే శ్రుతమార్యాణాం త్వాం తు మన్యే న రక్షతి. 30.8
నీవు మాత్రం నీడ అనుసరించినట్టు ధర్మాన్ని అనుసరించావు. అశ్వమేధ, రాజసూయ, పౌండరీకయాగాలు చేశావు. అయినా జూదంలో నీ బుద్ధికి ఇంతటి మోహాన్ని కలిగించిన విధి ప్రారబ్దాలకు నా నమస్కారం. నీవిలా కష్టాలు పడటం, సుయోధనుడు సుఖాలు అనుభవించటం చూసి నేను దైవాన్ని నిందిస్తున్నాను”. అంటూ ద్రౌపది బాధపడింది. అంతా విని ధర్మనందనుడు “యాజ్ఞసేనీ! నీవు నిపుణమైన మాటలు చెప్పావు. కానీ నీకు తెలీకుండానే నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తున్నావు. నీలాంటి వారు ఇలా మాట్లాడరు. నేను కర్మఫలాన్ని అపేక్షించి కర్మచేయటంలేదు. దానం చేయాలి కాబట్టి దానం చేస్తున్నాను. యజ్ఞం చేయాలి కాబట్టి యజ్ఞం చేస్తున్నాను. ఫలాన్ని కోరి ధర్మం చేయటమంటే ధర్మంతో వ్యాపారం చేయటమే. అటువంటి వాడు నిందింపదగినవాడు. ఈ లోకంలో ఇంకా సహనంతో వర్తించే వారున్నారు కాబట్టే ప్రాణుల పుట్టుక అభివృద్ది సాగుతుంది. ద్రౌపదీ! సహనమే ధర్మం, సహనమే యజ్ఞం, సహనమే వేదాలు, సహనమే శాస్త్రం. ఈ జగత్తంతా క్షమా గుణం చేతనే ధరించబడుతుంది.
క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా వేదాః క్షమా శ్రుతమ్/ య ఏతదేవం జానాతి స సర్వం క్షన్తుమర్హతి 29.36
భరతవంశ వినాశనానికే ఈ కాలం ప్రాప్తించింది. ఈ విధంగా సహనాన్ని వహించటానికి సుయోధనుడు అయోగ్యుడు. అందువలన సహనం నన్ను ఆశ్రయించింది. ఈ సహనమే జితేంద్రియుల సదాచారం. ఇదే సనాతన ధర్మం. అందుకే నేను ఆచరిస్తున్నాను. అంటూ ఆమెకు నచ్చచెప్పాడు.
5. భీమధర్మజుల సంవాదం:
ఇంతలో భీముడు కూడా తన ఆవేదన తనదైన శైలిలో చెప్తున్నాడు. అజ్ఞాతవాసం అంత సులభమనుకున్నావా? ఆకాశంలో సూర్యునిలా ఈ భూమండలమంతా ప్రసిద్ది పొందినవాడివి నీవు అజ్ఞాతంగా ఎలా చరిస్తావు? ఐరావతం వంటి జయశీలుడైన అర్జునుడు అజ్ఞాతంగా ఎలా ఉండగలడు? ఇక నేనంటావా, ఆబాలగోపాలం పిల్లల దగ్గరనుండీ వృద్దుల వరకూ అందరికీ నేను తెలుసు. మేరు పర్వతాన్ని దాచటం సాధ్యమేనా? అజ్ఞాతంలో నా పరిస్థితీ అంతే. అన్నా! మనం ఇప్పటికీ పదమూడు మాసాలు వనవాసాన్ని పూర్తిచేశాం. అస్మాభిరుషితాః సమ్యగ్ వనే మాసాస్త్రయోదశ . 36.32 మాసం సంవత్సరానికి ప్రతీక కాబట్టి ఈ పదమూడు మాసాలనూ పదమూడు సంవత్సరాలుగా స్వీకరించు. అస్తి మాసః ప్రతినిధిర్యథా ప్రాహుర్మనీషిణః 36,33 ఒకవేళ మనం అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తిచేసుకుని వెళ్లాక కౌరవులు మన రాజ్యం మనకు ఇస్తారని నమ్మకం ఏంటి? ఇచ్చినా మరలా నిన్ను జూదానికి పిలిచి మరలా వనవాసం లాంటి పందెం వేస్తే పరిస్థితి ఏంటి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు జూదానికి ఆహ్వానించారు. నీ నియమం వారికి తెలుసు, నీ ఆటతీరు వారికి తెలుసు, కాబట్టి వారికి ఇంక అవకాశం ఇవ్వకూడదు. క్షత్రియులకు వనవాసం కాదు, యుద్దమే శ్రేష్ఠమైనది. అంటూ ఉద్రేక పరిచే ప్రసంగం చేశాడు భీమసేనుడు.
విశ్లేషణ: క్షమాది గుణములు ధర్మరాజుని ఎలా ఆశ్రయించాయి, క్రోధమును జయించిన ధర్మజుడు ఎలా జీవిస్తున్నాడు అనే విషయాన్ని వివరించి, ఫలాన్ని ఆశించి చేసే ధర్మము ధర్మవాణిజ్యమే అని చెప్పారు ఇక్కడ వ్యాసులవారు. నేటి కాలంలో ఈ పదం(ధర్మవాణిజ్యం) యొక్క విలువ విజ్ఞులకు సర్వవిదితమే. అయితే ఇందులో బలాబలాలను ప్రస్తావించకుండా ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నను బట్టి సమాధానపరిచాడు ధర్మరాజు. కానీ భీముడి యుద్ధోత్సాహానికి తగ్గట్టుగా కౌరవబలాల ముందు పాండవబలం అత్యల్పమైనది అని సుస్పష్టం చేశాడు ధర్మనందనుడు.
6. అనుస్మృతి-ప్రతిస్మృతి విద్యలు:
ఇంతలో పాండవుల దగ్గరికి వ్యాసుడు సమీపించాడు. ధర్మజా! నీ మనసులో కర్ణ భీష్మాదుల వలన ఉన్న భయాన్ని గ్రహించాను. ఆ భయాన్ని శాస్త్రీయపద్ధతిలో పోగొట్టటానికి వచ్చాను. నీకు వృద్దికలిగే సమయం సిద్దించింది. అద్భుతమైన సిద్ధిని కలిగించి, పంచభూతాలు వశం చేసుకోగల ప్రతిస్మృతి అనే విద్యను నీకు ఉపదేశిస్తున్నాను. గ్రహించు. ఈ విద్యవలన అర్జునుడు నీ కార్యాన్ని సాధించగలడు. నీవు ఈ విద్యను అతనికి ఉపదేశించు. దీని ప్రభావంతో దేవతలను కూడా ప్రత్యక్షంగా చూడగలము. ఇంద్రుని వద్ద దేవతలందరూ వారి అస్త్రాలను ఉంచారు. ఈ విద్య ప్రభావంతో అర్జునుడు ఇంద్రుని వద్దనున్న సమస్త దేవతాస్త్రాలను సంపాదించగలడు. అని ప్రతిస్మృతి విద్యను ఉపదేశించి వ్యాసులవారు నిష్క్రమించారు. గ్రహించిన ఆ మంత్రాన్ని చక్కగా అభ్యాసం చేశాడు ధర్మరాజు. మంత్రాన్ని పెద్దవానికి ఉపదేశం చేయాలి, (విశ్వామిత్రుడు కూడా బల అతిబల రామునికి చెప్తే రాముడు లక్ష్మణునకు ఉపదేశం చేశాడు).కొంతకాలం గడిచాక ధర్మజుడు అర్జునినికి ఆవిద్య యొక్క విశిష్ఠతను వివరించి మంత్రోపదేశం చేశాడు.
విశ్లేషణ: సాధారణంగా దేవతలను దర్శించవలెనంటే దివ్యచక్షువులు కావాలి. ఈ ప్రతిస్మృతి విద్యప్రభావంతో సకల దేవతలను దర్శించగల శక్తి వస్తుంది. వారి అనుగ్రహాన్ని పొందే శక్తికూడా వస్తుంది. ఈ విద్యాప్రభావంతో అర్జునుడు అతి తక్కువ సమయంలోనే, సురక్షితంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని తపస్సుకు ఉపక్రమించాడు. అలాంటి విద్యను వ్యాసభగవానుడి నుండీ ధర్మజుడు పొందాడు. రెండవదైన అనుస్మృతి అనేవిద్యని లోమశుడు ధర్మరాజుకు తీర్ధయాత్రలు చేయిస్తున్నప్పుడు ఉపదేశించినది. చాలా మహిమాన్వితమైనది. ఈ మంత్రశక్తివలన ధర్మరాజు మహాభారత సంగ్రామంలో ఎందరు చనిపోయారు, ఎవరు మిగిలారు. చనిపోయినవారు ఏ లోకాలకు వెళ్ళారో అంతా దర్శించగలుగుతారు. ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు ఈ వివరాలన్నీ చెప్పటం జరిగింది.
7. లోమశుడు:
స్వర్గలోకంలో ఇంద్రసింహాసనం మీద కూర్చున్న అర్జునుణ్ణిచూసి అక్కడకి విచ్చేసిన లోమసుడనే మహర్షి అతని వివరాలు, శక్తి యుక్తులు తెలుసుకుని ప్రశంసించాడు. ఇంద్రుడు లోమశుణ్ణి భూలోకానికి వెళ్లి అర్జునుని కోసం కలవర పడుతున్న ధర్మరాజుకు స్వర్గలోకంలో అర్జునుడు సంపాదిస్తున్న అస్త్రవిద్యలను గురించి చెప్పి వారిచేత తీర్థయాత్రలు చేయించమని లోమశుణ్ణి ఇంద్రుడు ప్రార్థించి పంపించాడు. సరే అని లోమసుడు భూలోకానికి పయనమయ్యాడు. ఈ లోమశ మహర్షి చిరంజీవులలో అతి ప్రాచీనుడైన మార్కండేయునికంటే పూర్వుడు. ఈయన ఆయుర్దాయం చెప్పటం బ్రహ్మాదులకు కూడా కష్టతరమనే చెప్పాలి. కలియుగప్రమాణం 4,32000, ద్వాపరం దానికి రెండు రెట్లు. త్రేతా యుగం మూడు రెట్లు. కృతయుగం నాలుగు రెట్లు. నాలుగు యుగాలు కలిపితే 4320000, ఈ నాలుగు యుగాలు అవగానే నీలాంటి ఇంద్రుడు అవతారం చాలిస్తాడు. మరొక ఇంద్రుడు వస్తాడు. ఈ నాలుగు యుగాలు కలిపితే బ్రహ్మాగారికి ఒక పగలు. 4320000X2= 8640000 ఇది బ్రహ్మికి ఒక రోజు. ఇలాంటివి 360రోజలు గడిస్తే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అంటే 360X8640000=(3,11,04,000000). అలాంటిది బ్రహ్మగారి ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఆ తరువాత మరొక బ్రహ్మ వస్తారు. ఇప్పుడున్న బ్రహ్మకి ఆయుర్దాయం 51 సంవత్సరాలు. ఆవిధంగా బ్రహ్మగారు మారినప్పుడల్లా ఆయన శరీరం మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది. అన్ని వెంట్రుకలు ఊడేదాకా లోమశుడు జీవించే ఉంటారు. అటువంటి లోమశ మహర్షి ధర్మరాజుచేత అనేక తీర్థయాత్రలు చేయించటానికి వస్తున్నాడని ఈ పర్వం సూచిస్తోంది.
8. నలోపాఖ్యానము (నలదమయంతుల చరిత్ర):
లోమశుడు వచ్చేలోపు ఇక్కడ కామ్యకవనంలో యుధిష్టిరుడు అర్జునుణ్ణి తలుచుకుంటూ తన దుస్థితిని తలుచుకుంటూ రోజులు గడుపుతున్నాడు. ఒకరోజు యుధిష్టిరుని దగ్గరకి మహాత్ముడైన బృహదశ్వమహాముని వచ్చారు. ఆయనకి అర్ఘ్యమిచ్చి అతిథిసేవలు చేశాడు ధర్మనందనుడు. ఆ మహామునికి తన ఆవేదనను తెలుపుకుంటూ - అస్తి రాజా మయా కశ్చిత్ అల్పభాగ్యతరో భువి/ భవతా దృష్టపూర్వోవా శ్రుతపూర్వోSపి వా క్వచిత్ 52.50. మహర్షీ! నావంటి అదృష్టహీనుణ్ణి మీరింతకుముందు ఎవరినన్నా చూశారా? కనీసం విన్నారా? ధర్మం కోసం ఇంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్న నావంటి వాడు ఉండడని నేననుకుంటున్నాను. అనగానే బృహదశ్వుడు- “నాయనా! నీదీ ఒక కష్టమేనా? ఇంతకంటే దురవస్థను పొందిన నల మహారాజు వున్నాడు. అంటూ ధర్మరాజు ప్రేరణతో నలోపాఖ్యానాన్ని వినిపించాడు. పరమ పవిత్రమైన గాథ నలదమయంతుల చరిత్ర. విన్నా, చెప్పినా తరిస్తాము. ధర్మజా! నీకు వనవాసంలో తోడుగా నీ పత్నీ సోదరులు వున్నారు. నీ పురోహితులు, హితులైన బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. అక్షయ పాత్రలో అన్నసంతర్పణలు జరుగుతున్నాయి. ఇంతకంటే సంతోషంగా ఉండటానికి ఏమి కావాలి? కానీ ఎవరి తోడూ లేకుండా నీకంటే ఎక్కువ దుస్థితిని పొంది కూడా ధర్మపధాన నడినచిన వారిలో చిరస్మరణీయుడు నల మహారాజయ్యా. నలోపాఖ్యానంలో కలి చెప్పిన కలిదోష నివారణ శ్లోకం – ఈ క్రిందివారిని కీర్తించినచో కలి వలన ఏ భయమూ ఉండదు. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ।/ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనం।।
విశ్లేషణ: అర్జునుడు వచ్చేవరకూ కూడా ధర్మజుడు అనేక తీర్థయాత్రల, పుణ్యప్రదేశాల విశేషాలను, అనేక ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నాడు. నలుడు మొదలైన పావనచరితుల గాధలను నారదుడు, లోమశుడు, మార్కండేయుడు, బృహదశ్వుడు, ధౌమ్యుడు మొదలైన మహనీయులనుండీ తెలుసుకున్నాడు. ఇక్కడ లోమశమహర్షిగురించి గానీ, నలడిచరిత్రగానీ స్మరించినంతనే పుణ్యప్రదములుగా భావించి సంక్షిప్తంగా చెప్పటం జరిగింది. ధర్మరాజు రాబోయే యుద్ధంలో విజయం సాధించినది ఇలాంటి పుణ్యాలను ఆర్జించిమాత్రమే అని నిస్సందేహముగా చెప్పవచ్చు.
9. నహుషప్రశ్నలు:
“రాజా! నువ్వు సరే అంటే ఇప్పుడే వెళ్లి ఆ కౌరవులను జయించి మనరాజ్యం మనకి వచ్చేట్టు చేస్తాను” అన్న భీముడికి ఈ నహుషప్రశ్నలు ఘట్టం మంచి గుణపాఠం నేర్పించింది. ధర్మరాజు యొక్క ప్రజ్ఞా పాటవాలకి నిదర్శనాలు ఈ నహుషప్రశ్నలు, మరియు యక్షప్రశ్నలు. వనవాస కాలము పదకొండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ఒకనాడు భీముడు వేటాడుతూ వచ్చి కొండ గుహలో మృత్యుభయంకరమైన బలిష్టమైన ఒక పాముని సమీపించాడు. భీముడు దాన్ని పరిశీలించేలోపే భీముడి రెండు బాహువులనూ చుట్టేసింది. ఆ పాముకున్న వరబలంతో భీముణ్ణి గట్టిగా అదిమి పట్టి స్పృహ తప్పేట్టు చేసింది. పది వేలఏనుగుల బలము కల భీముడు మెల్లగా తేరుకుని, దాని పట్టుకి ఆశ్చర్యపోయి “ఓ సర్పశ్రేష్టమా! నీవేవరు? ఎంతో బలంకల రాక్షసులు కూడా నా ప్రతాపానికి సాటిరారు. అలాంటి నన్ను అవలీలగా బంధించి వివశుణ్ణి చేస్తున్నావంటే నీది సామాన్యశక్తి కాదు. నీగురించి తెలియచేయి”. అంటూ తన పరిచయాన్ని చేసుకున్నాడు. శాపవిమోచనంకోరి ఆ పాము తనగురించికూడా చెప్పుకుంది. ఆ సర్పరాజం నహుషుడనే రాజర్షి. చంద్రవంశంలో చంద్రుడి నుండీ ఐదవవాడైన ఆయువు యొక్క కుమారుడు ఈ నహుషుడు అగస్త్యమహర్షిని శాపంతో సర్పముగా మారాడు. “నేను అడిగిన ప్రశ్నలకు విడమరిచి సమాధానాలు చెప్పేవాడు శాపవిముక్తి కలిగిస్తాడు” అని అగస్త్యుడు పలికిన శాపవిమోచనం గురిచికూడా నహుషుడు భీముడికి చెప్పాడు. ఆశ్రమంలో ఉన్న ధర్మరాజుకు భయంకరమైన అపశకునాలు ఎదురయ్యాయి. భీముడి అడుగుజాడలు వెతుకుతూ వారు అజగరాన్ని, అతనికి చిక్కిన భీముణ్ణి చూశారు. గృహీతం భుజగేన్ద్రేణ నిశ్చేష్టమనుజం తదా 179.54. ఆ సందర్భంలో ధర్మరాజు భీముడి ప్రాణరక్షణకై, నహుషుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలుచెప్పాడు. ఈ ప్రశ్నలకే నహుష ప్రశ్నలు అని పేరు. నహుషుడు ప్రశ్నిస్తున్నాడు. బ్రాహ్మణః కో భవేద్ రాజన్ , వేద్యం కిం చ యుధిష్ఠిర 180.20. బ్రాహ్మణుడు ఎవడు? అని మొదటిప్రశ్నవేశాడు. సత్యం దానం క్షమా శీలమానృశంస్యం తపో ఘృణా/ దృశ్యన్తే యత్ర నాగేన్ద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః 180.21
విశ్లేషణ: అప్పటివరకూ ప్రాణభయంతోనూ బలగర్వంతోనూ ఉన్న భీమునికి ఒక మంచి గుణపాఠం చెప్పినట్టయింది ఈ నహుషసమాగమం అనేది. ధర్మరాజు ప్రజ్ఞచేత నహుషుడు మళ్ళీ దివ్యలోకాలకు చేరటం వలన ధర్మరాజు కీర్తి మరింత ద్విగుణీకృతమయింది.
10. ఘోషయాత్ర:
ఇక హస్తినాపురంలోని కౌరవుల విషయానికొస్తే- ఈ విధంగా సాగుతున్న పాండవుల వనవాసజీవితం గురించి చారులద్వారా తెలుసుకుంటున్న దుష్టచతుష్టయానికి, అనేక కష్టాలుపడుతున్న ఆ పాండవులముందు వారి విలాస జీవితాన్ని ప్రదర్శించాలనే దుర్బుద్ధి పుట్టింది. నారవస్త్రాలు ధరించిన పాండవుల ముందు పట్టుపీతాంబరాలు ధరించటం, అలంకారాలను ప్రదర్శించటం దాసదాసీజనసేవలందుకుంటూ వారిముందు డాంబికాలు ప్రదర్శించి ఆనందిద్దామనే నీచపు ఆలోచనకలిగి తద్వారా ఘోషయాత్రను సంకల్పించారు. కానీ దైవం బలీయమైనది కాబట్టి పాండవులను అవమానించి అవహేళన పరిచి, ఆనందిద్దామని ఘోషయాత్ర చేబట్టిన దుర్యోధనాదులు గంధర్వుల చేతిలో ఓడిపోయి ప్రాణాలు అరచేత పట్టుకుని, అదే పాండవుల దయాదాక్షిణ్యాలతో బతికి బట్టకట్టి ప్రాణాలు దక్కిచ్చుకుని వచ్చిన ఘటన ఇక్కడ జరిగింది. వాడు తీసిన గోతిలో వాడే పడ్డాడు. ఘోషా ద్వైతవనే సర్వే త్వత్ ప్రతీక్షా నరాధిప/ ఘోషయాత్రాపదేశేన గమిష్యామో న సంశయః 139.23
విశ్లేషణ: దుర్యోధనుడికి కష్టం కలిగినసందర్భంలో, ధర్మరాజు పక్కనే ఉన్నా రక్షించలేదా అని పెదతల్లి గాంధారి బాధపడుతుంది. అందుకని ఆ తల్లి బాధని అర్థం చేసుకుని ధర్మరాజు ఘోషయాత్రలో దుర్యోధనుడిని రక్షించాడు. కుంతీదేవి అందరినీ(మాద్రితనయులను కూడా) తన బిడ్డలతో సమానంగా చూడగలిగింది. ధర్మజుడు ఆమె గుణాలను పుణికిపుచ్చుకుని పుట్టినవాడు, కాబట్టి అందరి తల్లులను తన తల్లివలే భావించే ఔన్నత్యం ధర్మరాజులో ఉంది. శరణు అన్నవాడిని రక్షించాలి. తనవాడిని, సోదరుడిని రక్షిచాలి, తల్లి కోసం రక్షించాలి. అటు పక్క భీముడిని ఒప్పించాలి. వంశధర్మాన్ని రక్షించాలి. దీనుణ్ణి రక్షించాలి. ఇన్ని బాధ్యతలను స్మరించి కర్తవ్యాన్ని నిర్వహించిన సర్వసమర్థుడుగా ధర్మరాజుని మనం తెలుసుకోవచ్చు.
11. యక్షప్రశ్నలు
ఒకసారి పాండవులు దప్పిక చేత అలిసిపోయి ఒక చోట కూర్చున్నారు. నీరు తీసుకొని రమ్మని నకులుణ్ణి పంపాడు. ఒక సరోవరం దగ్గరకు వెళ్లి నకులుడు నీరు తీసుకోబోతున్న సమయంలో అక్కడ ఉన్న బకము (కొంగ) వారించింది. “ఈ జలములు నా ఆధీనంలోవి. నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నీటిని గ్రహించు. లేదా మరణిస్తావు” అని అన్నది. ఆ మాట లెక్క చేయకుండా నీరు తాగి పడీపోయాడు. వెళ్లిన వాడు ఎంతసేపటికీ రాకపోవడంతో సహదేవుడు బయలుదేరాడు. అతనిదీ అదే పరిస్థితి. తరువాత అర్జునుడు భీముడు కూడా అలాగే చేసి మృతులై పడిపోయారు. ధర్మరాజు వంతు వచ్చింది. ఒంటి కాలి మీద నిలబడి కొంగ, “నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే నీకూ ఇదే గతి పడుతుంది రాజా”! అన్నది. ధర్మరాజు ఆశ్చర్యపొయి ఎవరు నాయనా నీవు? దేవదానవులు కూడా సంహరిచలేని నా తమ్ముళ్లు నీ శక్తికే పడిపోయారు. దయచేసి తెలపండి అని అడిగాడు. నేను యక్షుణ్ణి. నీ తమ్ముళ్లు నా వలనే మరణించారు. కనీసం నీవన్నా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. అనగానే ధర్మరాజు నాకు తెలిసినంతలో సమాధానం చెప్తాను అడగమన్నాడు వినయంగా.
ధర్మరాజా! సూర్యుణ్ణి ఉదయింపచేస్తున్నది ఎవరు? ఆయన చుట్టూ తిరిగేవారు ఎవరు? ఆయనను అస్తమింపచేసేది ఎవరు? ఆయన దేనిలో ప్రతిష్టించబడతాడు? అని సూర్యుని గురించిన ప్రశ్న మొదటిదిగా అడిగాడు. సమాధానంగా ధర్మరాజు – సూర్యుణ్ణి ఉదయింపచేసేది బ్రహ్మ, ఆయనచుట్టూ తిరుగువారు దేవతలు. ఆయనను అస్తమింపచేసేది ధర్మం. ఆయన సత్యమందు ప్రతిష్టించబడతాడు అని విన్నవించాడు. అంటే బ్రహ్మచే ఉదయింపబడి, దేవతలచే పూజింపబడి, సత్యధర్మాలచే తన ధర్మాన్ని పాటిస్తున్న అటువంటి సూర్యుణ్ణి ఉపాసించినవారికి తీరని కోరికంటూ ఇక ఉండదన్నమాట. బుద్ధిమంతుడైవుండి, లోకంలో పూజించబడుతూ, ఇంద్రియార్థాలను అనుభువిస్తూ, ఊపిరితీసుకుంటూ కూడా జీవించనివాడు ఎవడు? అంటే వాడు అన్నీ చేస్తున్నాకూడా మరణించిన వాడితో సమానం. వాడెవడు? ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః/ సమ్మతిః సర్వభూతానామ్ ఉఛ్వసన్ కో న జీవతి. దేవతలను, అతిథులను, కుటుంభీకులను, పితరులను, తనకు తాను, పోషింపలేని వాడు ఊపిరితీసుకుంటున్నా కూడా జీవించనట్టే లెక్క. అలాగే భూమికన్నా బరువైనది ఏది? ఆకాశంకన్నాఉన్నతమైనది ఏది? గాలికన్నా వేగవంతమైనది ఏది? గడ్డి కన్నా తరచగా ఉన్నదేది? దానికి సమాధానంగా చెప్తున్నాడు. భూమికన్నా బరువైనది తల్లి, ఆకాశంకన్నా ఉన్నతమైనవాడు తండ్రి, మనస్సు గాలికన్నా వేగం కలది. గడ్డికన్నా తరచైనది చింత. అందుకే ఆ చింతను విడిచిపెట్టాలి. అని సమాధానం చెప్పాడు ధర్మజుడు. ఈవిధంగా అనేక ప్రశ్నలకు ధర్మరాజు సముచిత సమాధానాలు చెప్పి యక్షుణ్ణి సంతృప్తి పరిచాడు. ఇవన్నీ మహాభారతంలో మనకు జ్ఞానవృద్ధిని కలిగించే ముఖ్యాంశాలు.
చివరికి సంతోషించిన యక్షుడన్నాడు- “నీ సోదరులలో ఒకరిని బ్రతికిస్తాను. ఎవరు కావాలో కోరుకో”? అన్నాడు. (యముడు పెట్టిన మొదటి పరీక్ష ఇది. ఇంకా రెండు ముఖ్యమైన పరీక్షలు ముందు ముందు ఉన్నాయి. వాటి గురించి వివరంగా స్వర్గారోహణ పర్వంలో చెప్పుకుంటాము). ఇది మరీ చిక్కుప్రశ్న. ధర్మరాజు నకులుణ్ణి బ్రతికించమని కోరాడు. అదేంటయ్యా భీమార్జునులను కాదని నకులుణ్ణి బ్రతికించమని అడిగావేంటి అని అడిగాడు యక్షుడు. దానికి ధర్మరాజు అన్నాడు. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః/ తస్మాత్ ధర్మం న త్యజామి మా నో ధర్మో హతోsవధీత్. ధర్మాన్ని చంపితే అది మనల్ని చంపుతుంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని విడవను. దెబ్బతిన్న ధర్మం మమ్ము దెబ్బతీయకూడదు. నా తండ్రికి ఇద్దరు భార్యలు. కుంతి-మాద్రి. నాకు ఆ ఇద్దరు తల్లులూ సమానమే. కుంతి కుమారుడిగా నేను ఉన్నాను. అలాగే మాద్రి కుమారుడుగా నకులుణ్ణి బ్రతికించమని కోరాను. ఆ సమాధానం వినగానే, నాయనా! నీవు అర్ధకామాలకన్నా కరుణాగుణాన్ని గొప్పదిగా భావించావు కాబట్టి నీ సోదరులు అందరినీ బ్రతికిస్తాను అన్నాడు.
విశ్లేషణ: ధర్మబోధన వేరు, వాటిని ఆచరించటం వేరు. యుధిష్ఠిరుడు కేవలం ధర్మాలు చెప్పటమే కాకుండా ఆచరణలో ఆ ధర్మాన్ని పాటించినవాడు. ఆ పుణ్యవృత్తము వలన కలిగిన మేధస్సుతోనే యక్షప్రశ్నలు లాంటి సందర్భాలలో అత్యంత కఠినమైన ప్రశ్నలకు కూడా విశేషమైన సమాధానాలను చెప్పాడు. ముందు తన నలుగురు సోదరులూ జలాశయంలోని నీరు త్రాగి పడిపోతే, ఎంతకీరాని సోదరుల కోసం తాను వెళ్ళాడు. చచ్చి పోయి పడివున్న సోదరులను చూడగానే ముందుగా వారు మానవాతీత శక్తితో మరణించారని గుర్తించాడు. ఎందువలనంటే వారిని సామాన్య మానవులెవరూ వధించలేరు. పోనీ వెనుకనుండీ ఏ జంతువు వలనన్నా చనిపోయారా అని చూస్తే వారి శరీరాలమీద ఎటువంటి గాయమూలేదు. పైగా నలుగురిమీద ఏదైనా జంతువు దాడి చేసిందా అనుకుంటే, మరి నలుగురి మీద దాడి చేసిన జంతువు తనమీద కూడా దాడి చేయాలి కదా. అలా జరగలేదు కనుక ఇది జంతువుల వలన జరిగిన హాని కాదని అర్థం చేసుకున్నాడు. పోనీ జలాశయంలో విషపూరితమైన నీరు త్రాగటం వలన మరణించారా అనుకుంటే, విష ప్రయోగానికి వారి శరీరాలు రంగు మారాలి. అలా కూడా జరగలేదు. ఇలా తన బుద్దికి పదును పెట్టి మరీ నిశిత పరిశీలనలతో ఇది కేవలం మానవాతీత శక్తి వలన జరిగినదే అని అర్థం చేసుకున్నాడు. ఇంతలో యక్షుడు పలుకులతో నిర్థారించుకున్నాడు. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటమే కాకుండా చివరికి యక్షుడు పెట్టిన విశేషమైన పరీక్షలో కూడా ధర్ముడిని సంతోష పెట్టాడు. అదేమిటంటే యక్షుడు నలుగురిలో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకోమనగానే, నకులుడిని బ్రతికించమని అడగటం. యుద్ధానికి తోడ్పడే భీమార్జునులను వదిలి కేవలం మాద్రి పుత్రుడిని ఒకడిని బ్రతికించాలనే ధర్మంతో నకులుడిని కోరుకున్నాడు. తన సొంత తమ్ముళ్ళు అయిన భీమార్జులను వదులుకుని మరీ, సవతి తల్లి అయిన మాద్రి కుమారుడిని కోరుకోవటంలోనే ఆయన ధర్మాచరణ విశేషమైనది అని తెలిసిపోతుంది. మాద్రి సతీసహగమనం చేసే సమయంలో కుంతీదేవికి తన పిల్లలను అప్పగించింది. కుంతీ దేవి ఆ బిడ్డలను తన బిడ్డలుగా చూసుకుంటానని మాట ఇచ్చింది మాద్రికి. మరి తల్లి మాటను పిల్లలే కదా నిలబెట్టాల్సింది. ఆ నిర్ణయానికి యక్షరూపంలో వచ్చిన ధర్ముడు సంతోషించాడు.
12. ముగింపు:
కౌరవులు, వనములలోని పాండవులు కష్టాలు పడి, బలహీనపడిపోయి, ప్రజాదరణ పోగొట్టకుని, ఇక తరిగి రాజ్యం పొందలేని స్థితికి, యుద్ధంలో విజయాన్ని చేరుకోలేని స్థితికి వస్తారని భ్రమపడ్డారు. కష్టకాలాన్ని కూడా ధర్మజుడి ధర్మదీక్షతో తమకు అనుకూలంగా మలచుకొని, వ్యాస, మార్కండేయాది మహర్షుల ఆశీస్సులతో వృద్ధిచెందారు పాండవులు. పేరుకి ఇది వనపర్వమే కానీ పాండవుల బలాన్ని ద్విగుణీకృతం చేసి, దైవశక్తిని, బ్రాహ్మణ బలాన్ని, శ్రీకృష్ణుని కృపను, శస్త్రాస్త్ర సంపదను, ప్రజ్ఞాపాటవాలను, యుద్ధవిద్యలను పెంచుకున్న పర్వంగా చెప్పాలి.
ద్రౌపదీ-భీముల సంవాదసమయంలో ధర్మరాజు చూపిన రాజనీతి, సూక్ష్మదృష్టి మానవమాత్రుడు ఊహించలేనిది. (భారవి రచించిన కిరాతార్జునీయంలో చెప్పినట్లు--) దుర్యోధనుడు ప్రజాదరణ పొందుతూ అందరికీ పదోన్నతులను, అభ్యుదయాన్ని, కలిగిస్తున్నాడు అని వనేచరుడు చెప్పగానే ద్రౌపదాదులు ధర్మరాజు అసమర్థతను నిందించారు. కానీ శాంతమూర్తి అయిన ధర్మరాజు అంతకు మించిన ప్రణాళికను రచించాడు. స్థాయిని మించి, తగని సమయానికి చేసే ప్రజాపధకాలను అమలు చేసే రాజు(దుర్యోధనుడు) ఎంత కాలంలో పతనమైపోతాడో అంచనా వేసుకున్నాడు. ఈ ఘట్టం ధర్మరాజు రాజనీతిజ్ఞతకు నిదర్శనము.
ధర్మకుశలుడైన ధర్మరాజు చెప్పిన నహుష-యక్షప్రశ్నల సమాధానాల ద్వారా వ్యాసుడు మానవాళికి ఎన్నో మార్గదర్శకాలను అందించాడు. ఇంకా ఈ పర్వమునందున్న సైంధవపరాభవము, మార్కండేయుడు చెప్పిన సృష్టి రహస్యాలు మొదలైన అంశములు పాఠకసహృదయులు ఆశ్వాదించగలరు.
13. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే.
- పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు 2023.
- ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
- మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత.
- రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
- రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
- శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "JUNE-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-May-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు
మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "JUNE-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.