AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
10. "నీలికళ్ళనేల" కవిత్వం: ధిక్కారస్వరం
కె. అమృత జ్యోత్స్న
పరిశోధకులు, తెలుగు విభాగం,
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం,
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9490428866, Email: amrutajyothsna@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.02.2025 ఎంపిక (D.O.A): 28.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
పల్లిపట్టు నాగరాజు కవిత్వం లోని శైలి, రాయలసీమ యాస, కవితాసౌందర్యాన్ని పరిచయం చేయడమే ఈ పరిశోధన వ్యాసం ప్రధాన ఉద్దేశం. తన తొలి కవితా సంపుటి “యాలైపూడ్సింది” తోనే కేంద్ర సాహిత్య యువపురస్కారం అందుకున్న కవి పల్లిపట్టు నాగరాజు కలం నుంచి వెలువడిన మరో కవితా సంపుటే “నీలికళ్ళ నేల”. అనాదిగా దళితులపై జరిగే అవమానాలు ఆగాయిత్యాలను వారుభరిస్తూ వారి దుఃఖాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను, ఆత్మాభిమానంను వర్ణించేదే ఈ ”నీలి కళ్ళ నేల”. తన తొలి పుస్తకం యాలైపూడ్సింది తోనే అనేక సాహిత్య అభిమానులను ఏర్పరచుకున్న ఈ పల్లిపట్టు నాగరాజు ఈ “నీలి కళ్ళ నేల” సైతం ఏమాత్రం నిరాశ పరచదు. తన తొలి కవితా సంపుటి తోనే కేంద్ర సాహిత్య యువపురస్కారం రావడం, అనేక సాహిత్య సంస్థల నుంచి పురస్కారాలు వరించడంతో అతను బహుశావిజయంతో మత్తులో ఉండిపోయాడా? అని అనుకునే వారి ఆలోచనలను వదిలించేలా తన కవిత్వాఝరితో మరింత ముందుకు సాగేలా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉంటుంది ఈ కవితా సంపుటి. రామమోహన్ రాయ్, కడియాల వారి తెలుగుకవితావికాసం, కె.కె.రంగనాథాచార్యులు ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు మరియు పల్లిపట్టు నాగరాజు కవితలపై వచ్చిన వ్యాసాలు నా పరిశోధనా వ్యాసానికి ఆధారంగా నిలిచాయి. పల్లిపట్టుపై వచ్చిన పరిశోధనాత్మకవ్యాసాలను దృష్టిలో ఉంచుకొని విశ్లేషణాత్మక ప్రయోగాలను ఆధారం చేసుకుని యుద్ధ ఘీంకారస్వరం, మతవిద్వేషకుడిగా, ఐక్యతవిలువలు అర్ధం అయ్యేలా వ్యాసాన్ని విభజించి రాశాను. పల్లిపట్టు నాగరాజు కవిత్వంలో సామాజిక చింతనామయమైన వస్తువుతో పాటు రాయలసీమ యాస కూడా తోడై ఇంకా దళితస్పృహ, బహుజనుల ఆవేదన, సమాజంలో మార్పు అవసరాన్ని, సమానత్వం ప్రాముఖ్యతను, వ్యక్తిగత బాధ్యతలను స్పష్టంగా తెలియజేసే భావనలు ఉన్నాయని వాటిని తెలియజేయాలనే ఆలోచనతో ఈ వ్యాసాన్ని పరిమితం చేసుకున్నాను. ఈ వ్యాసం ఆధారంగా భవిష్యత్తులో నాగరాజు కవిత్వంలోనికవితా శిల్పం గురించి అలంకారాల గురించి పరిశోధన చేసే అవకాశం ఉంటుంది.
Keywords: నీలికళ్ళ నేల, పల్లిపట్టు నాగరాజు, వచన కవిత్వం, రాయలసీమ యాస
1. ఉపోద్ఘాతం
అభ్యుదయ రీతిలో ప్రతి కవిత విప్లవంగా, కొన్ని పల్లె బ్రతుకుల హృదయానికి దగ్గరగా ఉండేలాగా కవిత్వం రాసి మొదటి కవిత సంకలనానికే కేంద్ర సాహిత్యయువ పురస్కారము (2022)పొంది ఈ తెలుగు సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన వారు పల్లిపట్టునాగరాజు గారు.బహుజన వ్యక్తుల మనుగడ, సామాజిక సమస్యలు, సర్వ మానవ సౌభ్రాతృత్వం, స్నేహశీలత ప్రధాన లక్ష్యాలుగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించే తన నుంచి వచ్చిన మరో పుస్తకమే “నీలి కళ్ళ నేల”.పదునైన ప్రశ్నించే శైలి, రాయలసీమ యాస, రైతు కరువు,దళిత సమస్యలు, బహుజన బాధలు ఇలా ఓ వైపు ధారాళంగా ప్రశ్నిస్తూ , మరో వైపు మట్టి వాసనలతో హృదయ తరంగాలపై అమృత వర్షినిగా వర్షించే 55 రకాల వ్యంగస్త్రాలతో కూడిన అంబులపొదే ఈ “నీలికళ్ళ నేల”.
2. పరిచయం
పల్లిపట్టు నాగరాజు ‘నీలికళ్ల నేల’ కవితాసంపుటి కవితలను గమనించినట్లయితే బహుజనుల సమస్యలను చూపడమే కాకుండా, వాటి పరిష్కారాలను కూడా సూచించేలా రాశారు. ఇదే సాహిత్యంలో సామాజిక బాధ్యత అనేది ప్రధాన భావన. రచయిత తన రచన ద్వారా సమాజంపై ఒక స్పష్టమైన ప్రభావం చూపగలిగితే ఆ రచనలు నుండి సమస్యలు అందరికీ కనిపిస్తాయి, కానీ ఆ సమస్యల మూలాలు, వాటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయన్నది అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ ఈ కవి తన పరిశీలనతోనో లేక స్వయంగా అనుభవించో ఆయా సమస్యల్ని లోతుగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారాలను ప్రతిపాదించాడనేది స్పష్టమవుతుంది.ఈ కవితలలో సమాజంలోని పలు సమస్యలతో పాటు, వాటి పరిష్కార మార్గాలను కూడా చర్చించారు. ఆయా కవితలు పాఠకుడిలో ఆలోచనలు రేకెత్తించటమే కాకుండా, సమాజంపై తన బాధ్యత ఏంటి అన్న దానిపై స్పష్టతను ఇస్తాయి.
3. రాయలసీమ యాస భాష:
కవి పల్లిపట్టు నాగరాజు రాయలసీమ వాసి కావడంతో వీరి కవితలన్నీ సీమ నుడికారంతో నిండి వున్నాయి.రాయలసీమలో ఉన్న గుణం,స్వచ్ఛత పాల లా తేట తెల్లంగా ఉంటాయి. పాలు చిక్కగా ఉన్నను మృదువుగా ఎలా ఉంటాయో అలాగే వీరి వీరు వాడిన భాష కూడా పాలవలే స్వచ్ఛంగాను మృదువుగా ఉంటుంది.చదివే పాఠకుడికి కూడా మేధో బలాన్ని ఇచ్చేలా, స్వచ్ఛమైన పల్లెటూరి పలకరింపులా, సరైన నాయకత్వలేమి స్థితిని తెల్పేలా, బాహుజనుల ఆర్త నాదంలా, దళిత సమస్యల పై ఎక్కుపెట్టిన అస్త్రంలా ఉంటాయి.
4. ఆత్మీయ శైలి
పల్లిపట్టు నాగరాజు కవితలు కేవలం కల్పనలతో, వర్ణనలతో నిండి ఉండదు. వాస్తవిక చిత్రన, సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, సాంఘిక సత్య శీలత, మానవతను పెంచేవిగా సమానతను చాటేదిగా ఆత్మీయ శైలితో ఒక అందమైన పలకరింపులా ఉంటాయి.
ఉదాహరణకు.,
ఉదయం తరగతి గదిలోకి
చీమలు
కొన్ని బారులు కట్టివచ్చాయి
చెప్పే పాఠం అంత తీయగా ఉందో
పాఠం వింటూ ప్రశ్నలవుతున్న
పిల్లల మాటలంత మధురంగా ఉన్నాయో?
****
పిల్లలు
చీమల్ని కన్నార్పకుండా చూస్తున్నారు
చీమలు పిల్లల్ని పైకెత్తి చూస్తున్నాయి
కులం వదిలీ
కుళ్ళు వదిలి
కలిసికట్టుగా ఉండే
ప్రపంచం ముందు తలెత్తుకుని బతకవచ్చని
పాఠం చెబుతున్నట్టు
అందమైన బొమ్మను చిత్రించిన నిమిషాలవి.!
తరగతి గదిలో చీమలు (తరగతి గదిలో చీమలు - పుట. 35)
చీమలు సాధారణంగా చక్కెర ఏ వైపు ఉంటే ఆవైపుకు పయనిస్తాయి.ఇక్కడ తరగతి గదిలోకి వచ్చాయి అంటే పిల్లల మాటలు అంత మధురంగా ఉన్నాయని అందంగా వర్ణిస్తూనే పిల్లలకి హితబోధ చెబుతున్నట్టు ఉన్నాయట.కలిసికట్టుగా ఉండాలని బోధిస్తూనే మనలోని సత్య వాక్యాలను చెరిపేస్తే తమలా కుట్టి పోవాలని కూడా చెబుతున్నాయని ఓవైపు చీమలు, పిల్లల పుస్తకాలలోని అక్షరచీమలు కలిసి గొంతెత్తి పాడుతున్నాయట.
5. జగమంత కుటుంబ భావనా తీరు :
మనిషి మనిషిపై చేసే పెత్తనం సరి కాదని, “భారతదేశం నా మాతృభూమి”అన్నప్పుడు మనమందరిదీ ఓకే కుటుంబం కాదా? అనే ప్రశ్నలోనుంచి బహుశా ఈ కవితలు పుట్టాయేమో.
మురికి బొమ్మ అనే మరో కవితలో..,
శుభ్రం చేయాల్సిందేదో
శుభ్రం చేయకుండా
చేతులు కడుక్కుంటాం
కాళ్ళు కడుక్కుంటాం
కడగాల్సిందేదో మిగిలే ఉంటుంది.
**** ***** *****
చన్నీళ్ళతోనో
వేడినీళ్లతోనో
తృప్తిగా తలంట స్నానాలు చేసి
ఉతికిన బట్టలు కట్టి వీధిలోకి నడుస్తాం
ఉతకాల్సిందేదో
రుద్దిరుద్ది శుద్ధి చేసుకోవాల్సిందేదో
మిగిలే ఉంటుంది.
**** ****** ******
నిజమైన శుద్ధి అనేది చేతులు కడుక్కుంటేనూ,కాళ్ళు కడుక్కుంటేను, వేడి నీళ్లతో చన్నీళ్ళతో స్నానాలు చేస్తే రాదని నిజమైన శుద్ధి మానసికంగా చేయాలని ఇతరులపై ఏర్పడే చెడు ఆలోచనలను ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు వదిలినట్టు శుభ్రం చేయాల్సింది శుభ్రం చేసుకుని జగమంతప్రపంచంలోకి అడుగు పెట్టాలని సూచించారు.
మరో కవితలో..,
ఎంత వ్యామోహం మనకు
ఈ మట్టి పైన
మట్టి నిర్మిస్తున్న సమస్త అందలాల పైన
పిడికెళ్ల మట్టి కింద
పిడికెడు మట్టి అయిపోయేదానికి
ఎంత తపిస్తున్నామో?
ఎంతగా పాకులాడుతున్నామో?
ఉత్తి చేతులతో వెళ్లిపోవడానికి
వెళ్లే ముందు చేతిలో చెయ్యేసి
చేతి గుర్తులు గానైనా మిగులుతున్నామా?
బతికిన నేలమీద
మన పేరు పది వసంతాలు
పరిమళిస్తూ ఉండడమే జన్మ సార్థకమని
ఎన్ని చదువుకోలేదు..!? (మురికి బొమ్మ - పుట. 55)
జీవితం శాశ్వతం కాదని మరణం కూడా ఉందని, గుర్తు చేస్తూ బ్రతికినన్నాళ్లు మనిషిగా బ్రతకాలని,మనిషితనపు మట్టిపై మనసు ఉండాలని,వట్టి మట్టి పైన కాదని,పోయాక పిడికెడు మట్టయిపోయే మనము మట్టిపై నిర్మిస్తున్న భవనాలపై తపనలు ఉండకూడదు అని ఉట్టి చేతులతో వెళ్లిపోయే మనం ఈ మట్టి పై వ్యామోహలు వద్దని జగమంతా మనదైన భావన ఉండాలి అని చెబుతోంది ఈ కవిత.కానీ నేడు ప్రేమలు భవనాలు, ధనం, ఇతరత్రా వస్తువులపైనే తప్ప సాటి మనుషులపై లేకుండా పోతోంది మరి.
“ఎరుపు పిట్ట పాఠం “ అనే కవితలో
వరి కోళ్లు గుచ్చుకొని
గాయపడ్డ నా చూపుడు వేలుతో
నుసాలు మీద ఎద్దు గిట్టల ముద్రల్లో
నీ పేరు రాసుకుని మురిసిపోతూ
నువ్వొస్తావన్న
మిట్ట మధ్యాహ్నం మిడండలో
మోదుగా చెట్టు కాడ చెమట చుక్కనవుతున్నాను
సెలప సెలపగా ఉన్న కాలువ బురద నీళ్లలో
కొంగలు తానమాడి
మబ్బులై ఆకాశానికి ఎగిరిపోతున్నాయి
సుట్రూగాలి దుమ్మెత్తి పోస్తూ దూరంగా పోయింది
నా ఎదుట చూపులను ఎక్కిరిస్తూ
నా ఎదురు చూపులను ఎక్కిరిస్తూ ఉత్తుత్తిపిట్ట మాత్రం ఉండి పాడుతా ఉంది. (ఎరుపు పిట్ట పాఠం, పుట -93)
…… …….. …….. …….
తన ప్రేయసిని తలుచుకుంటూ కూడు పెట్టని కులం దేముంది? గుండెల్లో పెట్టి చూసుకుని తన గుణం చూడమంటూ,మనసులోనే లేఖ రాశాడని,ఈ పూటైనా కులం కట్టు ముళ్ళు తెంపుకొని తన గుండెలపై వాలిపోవాలని,కులం దేముంది? కూర ఏముంది?అని వట్టి మాటలు చెప్పడం మానేసి తన ప్రేమ కోటలో కొలువు తీరుతావా? అంటూ తన ప్రేయసిని తలుచుకుంటూ రాసిన ఓ భగ్న ప్రేమికుడి లేఖ గా ఈ కవితను భావించవచ్చు.
6. దళిత సమస్యలపై అక్షర యుద్ధం :
వీరి జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామంలో జన్మించి ఒకవైపు బీదరికంలో కూడిన కష్టనష్టాలను ఎన్నింటిలో భరిస్తూ, బడుగు జీవుల జీవితాల బాధను, ఆవేదనను, ఆక్రోశాన్ని తాను స్వయంగా అనుభవించి తన కలం ద్వారా మన ముందుకు తెచ్చి ఎన్నో ప్రశ్నలను కవిత రూపంలో సంధిస్తారు.
దళిత ఆత్మగౌరవ స్వరం పల్లిపట్టు నాగరాజు గారిది.తన కవితల ద్వారా దళితుల చైతన్యానికి దళితులపై జరిగే అరాచకాలు అన్ని ఎండగట్టడానికి పూనుకున్నాడు. దళిత చైతన్యం అంటూ ఉద్బోధిస్తూనే సమకాలీన రాజకీయ ఎత్తుగడలను, విపత్కర ధోరణులను తప్పు పట్టడం మనం వీరి కవితలలో గమనించవచ్చు.కాయ కష్టం చేసి పండించే పంటకు, పశువులు కాసి తీసిఇచ్చిన పాలకు లేని అంటుతనం తమకు మాత్రమే ఎందుకని నినదీసినట్లుగా, ఇంకా కుక్క, కోతి,పిల్లిని ప్రేమించే మనిషి మరియు ఎద్దును వెంకటేశ్వరుడు అని, ఆవును నంది అంటూ, పామును, కుక్కను,పందిని సైతం దేవతలతో దేవత వాహనాలు గాను పశుపక్షాదులను కూడా గౌరవించే మనిషి తోటి మానవుడిని మాత్రం లెక్కించడం లేదని వాపోతున్నాడు. కులం పేరిట అణగదొక్కబడే జాతి పక్షాన నిలిచి వాకాల్తా పుచ్చుకున్న న్యాయవాదిలా అక్షర యుద్ధమే చేశారు.
భూమి నుదుటిమీద కవిత్వపు బొమ్మ అనే కవితలో..
ఆశల అక్షాంశాలు
ఊహల రేఖాంశాలు
ఆలింగనాల భూగోళమంతా
నేను కవిత్వమై తిరుగుతూ ఉంటాను
అఘాతాల గాధల్లో
అంచు లోయల గాలుల్లో
ఊగుతున్న ఆకుల కొసన
రాలుతున్న మంచు బిందువుల్లో అమరులైన
వేలాది సూర్యబింబాలలో
నేను కవిత గానం చేస్తుంటాను (భూమి నుదుటిమీద కవిత్వపు బొమ్మ, పుట-85)
భూమి పైన ఎన్నో ప్రకృతి అందాలతో పాటు నలుగుతున్న జీవచ్చవాలు ఎన్నో ఉన్నాయని, వాటిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగటం లేదని,అవమానాలు వివక్షల ముళ్ళ కంపల్లో తిరిగేది ఎందరో,విద్వేషపు శూలాలలో,విషపురుగుల కోరల్లో చిక్కుకున్నది ఎందరో, అన్యాయపు గాజు పెంకులు గుచ్చుకున్నది ఎవరికో,ఆకలి పేగులతో అల్లాడేది ఎందరో అంటూ వాపోతూ ఈ బాధలన్నీ తన ఒంట్లో దిగబడి ఈ కవిత్వమై గొంతు విప్పుతున్నాడని,నిప్పు కల్లు లాంటి ఈ వాక్యాల్లో చదువుతుంటే మనకు తెలుస్తోంది.
‘రెప్ప వాలని పాట’ అనే మరో కవితలో..
అర్థాకళి పుండు
నిద్ర కంటిలో నలుసు
అవమానపు బాధ
ఆత్మ అభిమానపు గొంతులో ముళ్ళు
రగిలే కన్నీళ్లు
కంఠంలో నిలుపుకున్న భైరాగి స్వామి
కంటికి కొనుక్కు లేకుండా చేసే చీకటి గానం
వేకువ తాకేనా??
వెలుగు తాకేనా??
‘రెప్ప వాలని పాట’(పుట -43)
ఈ లోకము దళితులపై చూపించే అవమానపు గాయాలని తట్టుకుంటూ, తన దుఃఖాన్ని దిగుల్ని దిగమింగుకొని, తను కార్చే కన్నీరు చెరువులా మారినేల తడుస్తోందట అయినా ఈ చెవిటి లోకం తన బాధను ఎలా గ్రహిస్తుందని వాపోతున్నాడు అనే కవితలో.
“మనసు రెక్కల కిటికీ”అనే కవితలో
మనిషిని చూస్తే
చెట్టు భయపడుతున్నట్టే
అడవులు భయపడుతున్నట్టే
నదులు భయపడుతున్నట్టే
గాలి నేల కూడా కలవర పడుతున్నట్టే నువ్వు భయం సోకి పారిపోయావా?
మనసు రెక్కల కిటికీ (పుట -98)
*** ***** ********* ***
ప్రతిరోజు ప్రతి ఉదయం పలకరించే పిచ్చుకను తలుచుకుంటూ ఎప్పుడూ వస్తావుకదా!మరి ఈరోజు ఎందుకు రాలేదు? అంటూ మనిషిని చూస్తే నరికేస్తాయేమోనని చెట్లు,అడవులు భయపడతాయి, కాలుష్యం చేస్తారని నదులు,గాలి భయపడుతుంది.మరి నేనేమైనా నిన్ను చేస్తానని భయపడుతున్నావా?తను దళిత వ్యక్తి అని తన ముసుగురంగు ముఖం, చేతులు, శరీర రంగును చూసి సాటి మనిషి భయపడుతున్నట్టు నువ్వు కూడా నన్ను చూసి భయపడుతున్నావా?అలా అయితే వింతఏముందిలే! అంటూ ఓ దళిత వ్యక్తిగా మనుషుల నుంచి ఎటువంటి హానికరమైన వాతావరణం తనకు ఎదురవుతుందో బాధపడుతూ,ప్రకృతికి కూడా ఈ సాటి మనుషులు ఎటువంటి హానికరమైన చర్యలను కలిగిస్తున్నారో రెండిటినీ కలుపుతూ వర్ణిస్తూ ఈ మధ్యలో పిట్ట నలుగుతున్నదని వర్ణించడమైనది.
7. ధిక్కారస్వరం :
ఏదో ఒకటి చేయాల
ఈ ముదనష్టపువాన కురిసి కురిసి
కొట్టాలన్నీ ఉరిసి ఉరిసి
రొచ్చురొచ్చయ్ పోయాయి
గొడ్డు బిడ్డలు గెడ్డెలా తింటాయి?
కంటి నిండా నిద్ర ఎలా పోతాయి?? కసువెత్తి, పేడ దీసి శుద్ధిచేయాలా
పసుపు యాపాకో కలిపి
కట్టుగొయ్యలుకాడ జోరీగలు వాలకుండా కళ్ళాపుజల్లాల!
**** ***** *****
ఏదో ఒక వైదికం జేసి
గొడ్ల నైనా బిడ్ల నైనా కాపాడుకోవాల
బిడ్డలు బతికే కాలాన్ని కంటిలో ఒత్తులేసుకుని మరి
కాపాడుకోవాల! (వైదిగం జెయ్యాల-పుట-45)
ఇలాంటి ధిక్కార ధోరణితో సాగే కవితలు ఈ పుస్తకం నిండా అనేకం ఉన్నాయి.చిన్న చినుకుల మొదలైనట్టు కనిపించే ఈ కవిత ప్రతి హృదయంలో పెద్ద తుఫాను రేపెడుతుంది.దేశంలోని అవినీతి ఆరాయింపుకు నీతి కారం పోయాలా అంటూ తనకు తెలిసిన ఏదో వైద్యాన్ని కవితతో నిశ్చయంగా, నిర్భయంగా చెబుతున్నారు.
కులం వాసన అనే కవితలో
నీ కులం వాసన ముందు
నా కోరవాసన ఏ పాటిది…!? (కులం వాసన-పుట-74 )
ప్రతి కులము తాను మరో కులం కన్నా వేరే గొప్ప అనుకుంటుంది.ఒక కులాన్ని మరొక కులం పీడించే సాంఘిక ధర్మం ఏర్పడి ఉమ్మడి జీవితాన్ని నాశనం చేస్తోంది.కొన్ని కులాలకు ఎక్కడలేని సామాజిక గౌరవం తక్కిన వాటికి తక్కువ స్థానం ఇవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. ఈ కవిత కుల వ్యవస్థ మీద వేసిన ఓ మొట్టికాయ.నీకు నచ్చిన ఏ దిశలోనైనా నడవండి కులం అనే పెనుభూతం మార్గంలో ఎదురు కాక తప్పదు. మీరు ఆ భూతాన్ని అంతం చేయకుండా మీకు రాజకీయ సంస్కరణ ఉండదు,ఆర్థిక సంస్కరణ ఉండదని అనడానికే “నీ కులం వాసన ముందు…నా కూరవాసన ఏ పాటిది “అనే వాక్యాలు రాయగలిగారు.
8. ముగింపు
- మాటలను తూటాలుగా మలచడం తెలిసిన కవి వీరుడు పల్లిపట్టు నాగరాజు.ఇంటిపేరు పల్లెతనం ఉన్న వంటబట్టించుకున్న ఉద్యమం మాత్రం తీవ్రమైనది.
- కేవలం కల్పనలతో వర్ణనలతో కవిత్వం నిండి ఉండకూడదు. వాస్తవిక చిత్రన, సామాజిక స్పృహ,సామాజిక చైతన్యం,సాంఘిక సత్య శీలత అనేవి కవికి అవసరం.మానవతను పెంచేవిగా సమానతను చాటేదిగా కవిత్వం ఉండాలి.అందుకు నిదర్శనం ఈ కవితా సంపుటి. “నీలి కళ్ళ నేల” అనే పేరు పెట్టారంటే దీని వెనక ఎంతో లోతైన భావనను మనం అర్థం చేసుకోవాలి.యుగయుగాలుగా ఎన్నో అవమానాలు, అఘాయిత్యాలు నిప్పుల గుండంలో కాలిపోతూ ఆ పెను మంటలని ఆరిపేందుకు సిద్ధపడుతున్న అట్టడుగు సమూహదుఃఖమని,కోపమని,ఆవేశమని,ఆవేదనని,ఆత్మ అభిమానపురూపమని దీని అర్ధం.ఈ కవితా సంపుటిలోని కవితలు మనకు ఒక సామాజిక సందేశాన్ని అందించడమే కాదు, వ్యక్తిగత మరియు సమాజపు బాధ్యతలను గుర్తు చేస్తాయి. పాత ఆచారాలను మార్చడం, సాంఘిక, ఆర్థిక, మరియు రాజకీయ వ్యవస్థల్లో న్యాయాన్ని స్థాపించడం వంటి అంశాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.
- ‘యాలైపూడ్సింది’ అనే కవిత సంపుటిలో చూసిన దిక్కార స్వరమే ఇందులోను కనబడుతుంది.ఈ కవితా సంపుటిలో ఎక్కువగా దుఃఖంలోనే తత్వం, జీవితం, పోరాటం చవిచూశారు కాబట్టే వేల వేల సంవత్సరాల తీరని దుఃఖంలో నుంచి వస్తున్న కవిత్వంలా సాగుతున్నాయి వీరి కవితలు.అంబేద్కర్ ఆలోచనలు,నగేష్ బాబు వంటి దళిత కవుల వారసత్వం , రాయలసీమ యాస చేరడంతో మరింత ఘాటుగా, సహజ సిద్ధంగా తనకు గల దళిత ధిక్కార ధోరణి అందిపుచ్చుకొని రాసిన రాజకీయ బహుజన కావ్యమే ఈ “నీలికళ్ళ నేల”.
9. పాద సూచికలు:
- వైదిగం జెయ్యాల కవిత-పుట-45
- దేవుడి పాలన కవిత-పుట 23)
- తరగతి గదిలో చీమలు కవితపుట -35
- భూమి నుదుటిమీద కవిత్వపు బొమ్మ (పుట 85)
- ఎరుపు పిట్ట పాఠం(పుట 93)
- మనసు రెక్కల కిటికీ(పుట 98)
- కులం వాసన-కవితపుట-74
- రెప్ప వాలని పాట కవితపుట-43
10. ఉపయుక్తగ్రంథసూచి:
- నాగరాజు, పల్లిపట్టు. నీలి కళ్ల నేల. ఛాయా సెంటర్. హైదరాబాద్, 2025
- నాగరాజు, పల్లిపట్టు. యాలైఫూడ్సింది. కవి సంగమం ప్రచురణ, 2020
- రంగనాథాచార్యులు, కె.కె. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు. ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్, 1982
- రామమోహన్ రాయ్, కడియాల. 'తెలుగు కవితావికాసం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్, 1982
- రామారావు, సంపత్ కుమార్ వచన పద్యం, లక్షణ చర్చ. నాగార్జున ప్రింటర్స్, ముషీరాబాద్
సమీక్షలు
- శ్రీనివాస్, గంగాపురం. కట్టిపడేసే కవిత్వంపల్లెపట్టు కవిత్వం. దిక్సూచి ఆన్-లైన్ మాసపత్రిక
- కవిత్వ పట్టు తెలిసిన పల్లిపట్టు. సృజన నేడు. 25-12-2022
- కేతిరెడ్డి యాకుబ్ రెడ్డి, దళిత విప్లవజమిలి నేత పల్లిపట్టు"_భూమిపుత్ర27-7-2022
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

