AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
8. తెలుగులో గ్రంథపరిష్కరణ: ఆవశ్యకత, సమస్యలు

డా. టి. ఎస్. వెంకటేశ్
సీనియర్ ప్రాజెక్టు ఫెలో
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9989233481, Email: tsv50798@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 18.02.2025 ఎంపిక (D.O.A): 28.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
తెలుగుసాహిత్యాన్ని తాళపత్ర రాతప్రతుల నుండి అచ్చురూపంలోనికి తీసుకువచ్చే క్రమంలో సాగే ప్రక్రియ గ్రంథపరిష్కరణ. అచ్చుయంత్రం కనుగొన్న తర్వాత తాళపత్రగ్రంథాలన్నీ ప్రచురణబాట పట్టాయి. ఈ ప్రచురణక్రమంలోనే పరిష్కరణ ఆవశ్యకత మరింత పెరిగింది. మన ప్రాచీన తాళపత్రగ్రంథాలను సేకరించడం ఒక ఎత్తు అయితే వాటిని పరిష్కరించటం మరొక్క ఎత్తు అయ్యింది. ప్రచురించటంకంటే పరిష్కరణ మరింత క్లిష్టమైన ప్రక్రియగా నిరూపితమైంది. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఒక తాళపత్రగ్రంథాన్ని అచ్చులోకి తెచ్చి పరిష్కరించే క్రమంలో గ్రంథ పరిష్కర్తకు విభిన్న రాకాల రాతప్రతులతోపాటు, భిన్నలేఖకుల లేఖనదోషాలు, విభిన్న పాఠాంతరాలు, పాఠభేదాలు, ప్రక్షిప్తాలు, అపపాఠాలు, క్రమభంగం, స్ఖాలిత్యాలు,గ్రంథపాతాలు మొదలైన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వీటిని ఆయా గ్రంథాలకు లభించిన వివిధ రాతప్రతులతో పోల్చి విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి, కవి హృదయాగతమైన మూలానికనుగుణమైన శుద్ధపాఠాలతో తీర్పు చెప్పటమే పరిష్కర్త అసలైన కర్తవ్యమవుతుంది. తెలుగులో సి.పి. బ్రౌన్, మానవల్లిరామకృష్ణ కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, నిడదవోలు వేంకటరావు, కందుకూరి వీరేశలింగం వంటి ఎంతోమంది మహామహులు గ్రంథాలను సుష్ఠుగా పరిష్కరించి గ్రంథపరిష్కరణకు దారులు వేశారు. పరిష్కరణలో వారుపాటించిన నియమాలు, పద్ధతులు సశాస్త్రీయమైనవి, మేరునగసదృశమైనవి. తెలుగులో గ్రంథపరిష్కరణకు సంబంధించిన పరిశోధనలు పెద్దగా రాలేదు.ఆచార్య దేవళ్ల చిన్నికృష్ణయ్య వంటివారు వరాహపురాణాన్ని సంశోధితంగా పరిష్కరించి, గ్రంథపరిష్కరణ విధానాలను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఎస్.ఎమ్.కత్రే ఆంగ్లంలో రాసిన An Introduction to Indian Textual Criticismఅనే గ్రంథానికి తెలుగులో ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లుగారు అనువదించిన భారతీయ గ్రంథపరిష్కరణ ప్రవేశిక,ఆ తర్వాత ఆచార్య ఆర్వీయస్ సుందరంగారి గ్రంథ పరిష్కరణ శాస్త్రం అనే పుస్తకం, ఆచార్య సి.గోవిందరాజుల సంపాదకత్వంలో గ్రంథపరిష్కరణవిధానాలు అనే వ్యాస సంకలనంలో కొన్ని చెదురు ముదురు వ్యాసాలు కనిపిస్తాయి. అయితే సాకల్యంగా గ్రంథ పరిష్కరణలో ఎదురయ్యే సమస్యలు, వాటి పద్ధతులకు సంబంధించి ప్రత్యేకమైన పుస్తకాలు, పరిశోధనలు రాలేదని చెప్పవచ్చు. ఆధునిక సమాజంలో ప్రాచీనసాహిత్యం పట్ల, రాతప్రతుల ప్రతుల అధ్యయనాల పట్ల శ్రద్ధ తగ్గిపోతూ ఉంది. అందువల్లనే అనేక తాళపత్ర రాతప్రతులు పరిష్కరణకు నోచుకోక గ్రంథాలయాల్లో, కొంతమంది సాంప్రదాయిక, ధనవంతుల ఇళ్లలో క్రిమిద్రష్టమై మగ్గిపోతుండటం గమనించదగిన విషయం.కావుననే ప్రాచీన తెలుగు, తాళపత్ర రాతప్రతుల పరిష్కరణ, లిపి సంస్కృతులపట్ల నేటి యువతరానికి ఒక అవగాహన కల్పించి వారిని పరిష్కరణవైపు ఆసక్తి చూపడానికి ఈ వ్యాసం దోహదపడగలదని భావిస్తున్నాను.
Keywords: గ్రంథపరిష్కరణ, సమస్యలు, లిఖిత ప్రతులు, లేఖనదోషాలు, లేఖన సంప్రదాయద్యోతక రూపాలు, పాఠాంతరము, ప్రక్షిప్తము, అపపాఠము
1. ప్రవేశిక:
అచ్చుయంత్రం కనుగొన్న తర్వాత మన తాళపత్రగ్రంథాలన్నీ ప్రచురణ బాట పట్టాయి. ఈ ప్రచురణ క్రమంలోనే పరిష్కరణ ఆవశ్యకత మరింత పెరిగింది. మన ప్రాచీన తాళపత్రగ్రంథాలను సేకరించడం ఒక ఎత్తు అయితే వాటిని పరిష్కరించటం మరొక్క ఎత్తు అయ్యింది. ప్రచురించటం కంటే పరిష్కరణ మరింత క్లిష్టమైన ప్రక్రియగా నిరూపితమైంది. తెలుగుసాహిత్యాన్ని తాళపత్ర రాతప్రతుల నుండి అచ్చురూపంలోనికి తీసుకువచ్చే క్రమంలో సాగే ప్రక్రియ గ్రంథ పరిష్కరణ. తెలుగులో గ్రంథ పరిష్కరణ కొత్తవిషయమేమీ కాదు. సంస్కృత భారతాన్ని అనువదించటానికి పూనుకొన్న నన్నయ తన అనువాదానికి అవసరమైన ప్రతిని ఎంచుకోవటంలో పడ్డక్లేశము, అందుకోసం చేసిన పరిశ్రమ అంతా ఒక విధంగా తెలుగులో గ్రంథపరిష్కరణకు ప్రారంభమనే చెప్పవచ్చు. మన ప్రాచీనకవులందరికీ సంస్కృతగ్రంథాలను అనువదించే క్రమంలో ఇటువంటి క్లేశం ఎదురయ్యే ఉంటుంది. శ్రీనాథుడు నైషథంలో చెప్పిన ప్రణాళికలో చివరగా ‘‘మాతృకానుసారంబుగ’’ అనటంలో ‘మాతృక’ అంటే అనువదించటానికి ఎంచుకొన్న మూలప్రతి విషయంగానే భావించాలి. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న తాళపత్రగ్రంథాలను తెలుగునాట ఎంతోమంది మహామహులు పరిష్కరించి గ్రంథపరిష్కరణకు దారులు వేశారు.
2.1 గ్రంథపరిష్కరణ - అర్థం, నిర్వచనం:
మానవనాగరికతకు భాష ఒక చిహ్నమైతే, ఆ నాగరికత సంస్కృతీరూపంలో ప్రవర్థితమవటానికి గ్రంథం దోహదం చేస్తుంది. వ్యవహారరూపంలోని భాష లిఖితరూపంలోకి మారి గ్రంథంలోనికి ప్రవహించి గ్రాంథికమవుతున్నది. ‘పరిష్కరించుట’ అనే మాటకు సంస్కృత నిఘంటువు1లో ‘‘పరిష్కారః పరిష్కృతిః పరిష్క్రియాసీ’’ అనే సమానార్థకపదాలు కనిపిస్తాయి. ఇందులో “పరిష్కారః” అంటే చక్కబెట్టడం, ‘పరిష్కృతిః’ అంటే తగవుతీర్చడం, ‘‘పరిష్క్రియాసీ’’ అంటే అలంకరించడం అని అర్థం. విశేషణ రూపంలో ‘పరిష్కృత’ అంటే అలంకరింపబడినది, వండబడినది అని నిర్వచించబడినది.
బ్రౌణ్యం: ‘పరిష్కరించు’ అనే మాటకు సి.పి. బ్రౌన్- To trim, to dect, make clear or evident: to settle, arrange or adjust, toget through, finish, to derce, to decide అనే అర్థాలు సూచించాడు. ఇంకా పరిష్కరణ అనే మాటకు ఇంగ్లీషులో Finishing, purgation, purge, purging, refinement, refilling, retouching, satisfaction మొదలైన వివిధ నానార్థాలున్నాయి.
సూర్యరాయాంధ్ర నిఘంటువు: పరిష్కరించు అనే దానికి చక్కవెట్టు, అలంకరించు, శుద్ధిచేయు అనే అర్థాలను సూచించింది.
శ్రీహరి నిఘంటువు:
‘పరిష్కరణము’’ అనగా గ్రంథాదులను దోషము లేకుండా సంస్కరించుట, వివాదాలను తేల్చుట అనే
అర్థాన్ని సూచించింది.
2.2 గ్రంథపరిష్కరణ:
‘‘కవి ఉద్దేశించిన లేక కవిచేత నిర్ణయింపబడిన పాఠాన్ని మనకు ఇంచుమించు యథాతథంగా అందజేయాలన్న భావనతో ఆయా గ్రంథ సంపాదకులుపడ్డ శ్రమను, ఎదుర్కొన్న సమస్యల్ని తెలుపుతూ సూచించే పరిష్కారమే గ్రంథ పరిష్కరణగా చెప్పవచ్చు. అంటే గ్రంథకర్త హృదయానుసారంగా, గ్రంథ రచనకాలానికి మనసును వెళ్ళగొట్టి, ఆనాటి లేఖనరీతులను ఒంటబట్టించుకుని, గ్రంథానికున్న వివిధ ప్రత్యంతరాలను, పాఠాంతరాలను పరిశీలించి కవి హృదయానికి సమీపంగా ఉన్న పాఠాలను కనుగొని మూలగ్రంథం తేటతెల్లమయ్యేటట్లు గ్రంథాన్ని లోపరహితంగా, నిర్దుష్టంగా పఠనయోగ్యంగా తీర్చిదిద్దటాన్నే ‘‘గ్రంథ పరిష్కరణ’’ అంటారు.
పైన తెలిపిన నిర్వచన భావాన్నే ఎస్. ఎమ్. కత్రే2 “The skill based and Methodocal exercise of the Human intellect and settlement of Texts’’ అని తెలియజేశాడు. గ్రంథ పరిష్కరణ మానవుని మేథస్సుకు పదునుపెట్టే అద్భుత నైపుణ్యంగా చెప్పుకోవచ్చు.
పై నిర్వచనాలను బట్టి పరిశీలిస్తే ‘గ్రంథ పరిష్కరణ’ అనేది గ్రంథానికి సంబంధించింది. గ్రంథాన్ని పద్ధతిప్రకారం అన్నివిధాల చక్కదిద్దటం, శుద్ధపాఠాలతో అలంకరించటం, పాఠాంతరాలను పోల్చి ప్రాచీన కాలంనుండీ కవులు తమ గ్రంథాలను తాళపత్రాలు (తాటియాకులు), బూర్జపత్రాలు మొదలైన వాటిలో రాస్తూ వచ్చేవారు. కాలక్రమేణా ఆ తాళపత్రాలు విరిగిపోవటం, అక్కడక్కడా క్రిమిద్రష్టం కావటం,అప్పటి లేఖనం సరిగాఅర్థంకాకపోవటం లాంటివేకాక ఒకే గ్రంథానికి ప్రచార నిమిత్తం భిన్నకాలాల్లో, భిన్న ప్రదేశాల్లో భిన్న లేఖన సంప్రదాయం కలిగిన ప్రతులు ఏర్పడటం, ఆప్పటి లేఖకుల లేఖన దోషాలవల్ల ఏర్పడిన విభిన్న పాఠభేదాలు, అపపాఠాలు, ప్రక్షిప్తాలు, లేఖనస్ఖాలిత్యాలతోపాటు లుప్తమైనటువంటివి మొదలైన కారణాలవల్ల గ్రంథం తప్పులతడకగా తారుమారైపోతూ ఉంటుంది. మూలగ్రంథంలోని పాఠాలు, మూలగ్రంథకర్త (కవి) అభిప్రాయాలు స్పష్టంగా అర్థంకావు. ఇలాంటి గ్రంథాన్ని మనకు లభిస్తున్న వివిధ రాతప్రతులతో పోల్చి పాఠాంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి, దోషాలు సరిదిద్ది, శుద్ధ పాఠాలను నిర్ణయించి మూలగ్రంథానికి దగ్గరగా గ్రంథాన్ని అర్థవంతమైన రీతిలో క్రమపద్ధతిలో చక్కదిద్దే ప్రయత్నాన్నే గ్రంథ పరిష్కరణగా భావించవచ్చు.
గ్రంథాన్ని చక్కదిద్దటమంటే గ్రంథాన్ని ఏలోపంలేకుండ నిర్దుష్టంగా పాఠకులు చదువుకోవటానికి అనుకూలంగా సందేహాలకు తావులేకుండా చేసి పెట్టడమే. గ్రంథ పరిష్కరణపై వేటురి ప్రభాకరశాస్త్రి-
‘‘గ్రంథ పరిష్కరణ ఒక అసిధారావ్రతం. వేయికళ్ళతో చూసి చేసినా తమ అభిప్రాయాలకు అనుగుణంగా పాఠాన్ని దిద్దాడనే విమర్శ విసిరేవాళ్ళు ఎందరో ఉంటారని’’ పేర్కొన్నారు3.
గ్రంథపరిష్కరణ తెలుగులో బహుముఖీనమైన పరిశ్రమతో
కూడుకొన్న ప్రక్రియ. ఒక గ్రంథ పరిష్కరణ విధానాన్ని పోలి మరొక్క గ్రంథ పరిష్కరణ ఉండదు. ఏ
గ్రంథానికాగ్రంథం పరిష్కరణకు కొత్త సమస్యగా పరిణమించి ఉండటం తెలుగులో కనిపించే ధోరణి. అందుకే గ్రంథ
పరిష్కరణపై మానవల్లి రామకృష్ణకవి తమ అనుభవాలను తెలుపుతూ ‘‘ఎట్లో నూతన కవిత
చెప్పుట సులభము కాని పరకవి హృదయం గుర్తించి శాస్త్ర విషయమున నతని పులుకులనూహించి తెచ్చుట దుర్ఘటమనుట
విజ్ఞులెల్లరెఱింగిన విషయమే
కదా!’’4 అని పేర్కొన్నాడు. ఒక ఉత్తమగ్రంథాన్ని పరిష్కరించి ప్రకటించటానికి ముందు
పరిష్కర్తలు పొందే వేదన ఎలాంటిదో పాఠకలోకం తెలుసుకుని వారి శ్రమను గుర్తిస్తే, సర్వదా వారికి ఋణపడి
ఉండవలసి వస్తుంది.
2.3 గ్రంథ పరిష్కరణ – ఆవశ్యకత, సమస్యలు:
అక్షరాలు లిఖింపబడని ప్రాచీనకాలంలో మౌఖికంగా జ్ఞానప్రసారం జరిగింది. క్రమంగా లిపి ఏర్పడటంతో జ్ఞానం విస్తరించింది. ప్రాచీనకాలంలో భూర్జవృక్షాల లోపలి బెరుడుపైన, నీర్ఖోస్ దారుఫలకాలపైన, తాళపత్రాల మీద, కొన్ని జంతు చర్మాలపైన, లోహాలపైన, శిలలపైన, ఇటుకలపైన రాసే వారు. కాగితం ప్రవేశించాక మిగిలిన వాటి అవసరం క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్రమంగా లేఖనమే వృత్తిగా కలిగినవాళ్ళు బయలుదేరారు. మానవుని ఇతర క్రియలలాగే లేఖనం కూడ నిర్దుష్టం కాదు. కాబట్టే శాసనాలు చెక్కేటప్పుడు, భూర్జపత్రంమీద తాళపత్రం మీదగాని, కాగితం పైన రాసేటప్పుడు పొరపాట్లు సహజంగానే దొర్లేవి. తద్ద్వారా అసాధువులైన పదాలు, అనవధానత వల్ల వదిలివేసే అక్షరాలు ప్రవేశించాయి.
ప్రాచీనగ్రంథాలకు తరువాతి కాలంలో అనేకప్రతులు తయారయ్యి, మూలగ్రంథానికి భిన్నమైన మార్పులు జరగడం ప్రారంభమైంది. వైదిక సారస్వతమంతా ఒకతరానికీ, మరొకతరానికీ మౌఖికంగా విస్తరిస్తూ సంరక్షించబడినది. వైదికేతర సాహిత్యం మౌఖిక ప్రసారమాధ్యమంద్వారా కాకుండ రాత పూర్వకంగా విస్తృతిని పొందుతూ వచ్చిన కారణంగా ఆయా గ్రంథాలకు వీలైనన్ని లిఖితప్రతులు ఆయా ప్రాంతీయ భాషాలిపులలో ఏర్పడ్డాయి. తరువాతి తరాలకు జ్ఞానాన్ని అందించే విషయంలో లిఖితప్రతులకు ఉన్న సౌలభ్యం మౌఖికవిజ్ఞాన ప్రసారంలో లేదు. అయితే ఈ గ్రంథాలను లిఖించే లేఖకులందరు ఒకే విధమైన ప్రతిభాపాండిత్యాలు కలిగి ఉండరు. అందుకే అల్లసాని పెద్దన ‘‘ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ కలిగినగాక’’.... అని అన్నాడు. ఇక్కడ ‘‘ఊహ’’ అంటే కవిఊహ అని అర్థం. అంటే కవిహృదయాన్ని తెలిసి ఉండటమని భావించవచ్చు.
లేఖక, పాఠకులలో ముఖ్యులెవరని అంటే లేఖకుడనే చెప్పాలి. ఎందుకంటే పాఠకునికి శుద్ధప్రతిని అందించేది లేఖకుడే కదా? లేఖకులను కూడ మూడు రకాలుగా విభజించి పరిశీలించవచ్చు. కవి హృదయాన్ని ఆవిష్కరిస్తూ లక్ష్యలక్షణ పరిజ్ఞానం కలిగి నిర్దుష్టంగా రచన చేయగల నేర్పుగలవారు ఉత్తమ లేఖకులు. రెండవ తెగకు చెందినవాళ్ళు మక్కికిమక్కీ రాసేవాళ్ళు. అంటే శాస్త్ర పరిజ్ఞానం ఏమాత్రం లేకుండా యథాతథంగా రాసేవాళ్ళు. తగిన పాండిత్యం లేకపోయినా ఒప్పుల్ని తప్పుగా, తప్పుల్ని ఒప్పుగా భావించి రాసేవాళ్ళు మరో రకంవాళ్ళు. అయితే ఈ మూడు తరగతులకు చెందని మరొక్క వర్గం ఉంది. వీరు కవి పాఠాలలో స్వీయకవిత్వాన్ని ప్రక్షేపించేవాళ్ళు. ఇటువంటి వాళ్ళనుద్దేశించి ఒక చాటుపద్యం ప్రచారంలో ఉంది. (చాటుపద్య రత్నాకరము,సంపా.దీపాల పిచ్చయ్య శాస్త్రి, నెల్లూరు, 1995, పుట. 315)
ఉ. ‘‘మేదిని
నాథుడల్గినను మించిన కార్యము చక్కసేయ స
మ్మోదమెలర్పగా గణక
ముఖ్యుని సఖ్యములెస్స యెట్లనన్
ఆదట కాలుడల్గియు
‘గతాయు’వటన్నను చిత్రగుప్తు డా
‘గా’
దొలగించి శా మొదట గ్రక్కున వ్రాసి సజీవుఁజేయడే”
ఇందులో యముడు ఒకప్రాణిని గతాయు: అని చెబితే దాన్ని చిత్రగుప్తుడు దాన్ని చిత్రగుప్తుడు తన లేఖన నైపుణ్యంచేత ’గ’ స్థానంలో ’శ’చేర్చి ’శతాయు’చేసి వర్థిల్లజేసినాడు. అందుకే గణకులతో తగాదా, వైరం పెట్టుకోకూడదంటారు. ఇటువంటి లక్ష్యలక్షణ పరిజ్ఞానశూన్యులైన లేఖకుల వలన మూలగ్రంథాలకు ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. మూలగ్రంథం భ్రష్టమయ్యే అవకాశం ఉంది. బిందువు, విసర్గ, అస్పష్టమైన రాత, పదాలమధ్య విరామం, కొమ్ము సరిగా ఇవ్వకపోవటం, పంక్తిభేదాల్ని పాటించకపోవటం, పదవిచ్ఛేదం సక్రమంగా చేయకపోవటం, రాతలోని వేగం వీటివలన కూడ తాళపత్ర గ్రంథాల్లో దోషాలు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది.
గ్రంథ పరిమాణం మరీ పెద్దదయితే దాన్ని ఒకరు
లేదా పెక్కురు లేఖకులు కలిసిగానీ నకలు చేసే అవకాశం ఉంది. పైగా ఇవి ఒకే ఆధారప్రతి నుండి చేయటంగానీ
వేరువేరు కాలాల్లో రాయబడ్డ వేరువేరు ప్రతులనుండి గానీ చేసే అవకాశమూ లేకపోలేదు. అలాంటి గ్రంథంలోని
విభిన్న భాగాల కాలక్రమాన్ని, ఆ లేఖనసామగ్రి స్వభావాన్ని తెలుసుకోవాలంటే ఆ లిఖితప్రతిని ఎన్నిచేతులు
కలిసి సిద్ధం చేసాయో విశ్లేషించాల్సి ఉంటుంది. ప్రతి లేఖకునిలోను అతనికే ప్రత్యేకమైన కొన్ని
అలవాట్లుంటాయి. అవి లేఖన రీతులలోను, కొన్ని ప్రత్యేకదోషాలు చేయటంలోను ఎంచుకునే పాఠంలో చూపే పక్షపాత
వైఖరిలోను ఉంటాయి. లిఖితప్రతిని సునిశితంగా నిరంతరం అధ్యయనం చేయటంద్వారా మాత్రమే అలాంటివి తెలుస్తాయి.
పరంపరాగత గ్రంథాలలో లేఖకులవలన కలిగే పాఠభేదాలను మూడు రకాలుగా విభజించింవచ్చు.1) యాదృచ్ఛికాలు 2)
బుద్ధిపూర్వకాలు 3) కొంత యాదృచ్ఛికం, కొంత బుద్ధిపూర్వకం కలగలిసినవి.
2.4 లిఖిత ప్రతుల్లో లేఖకులు ప్రధానంగా చేసే లేఖనదోషాలు:
లేఖనదోషాలు:
ఇవి లేఖకునికి సరైన పాండిత్యం లేకపోవడంవల్లనో
ఏమరుపాటు, అజాగ్రత్తవల్ల కలిగే దోషాలు. లేఖకులు ఇలాంటి సందర్భాల్లో తాము రాసిన ప్రతిని మళ్ళీ ఒకసారి
జాగ్రత్తగా పరిశీలించి ఉన్నా లేక పండితుల సహాయంతో సరిచూసుకొని ఉన్నా ఇటువంటి ప్రమాదాలు జరిగేవి
కాదు.
ఉదా:
తాళపత్రాల్లో ఉన్న రూపం |
ఉండవలసిన రూపం |
ఆచంద్రర్కము |
ఆచంద్రార్కము |
నరసింహ్వ |
నరసింహ |
వయిస్యులు |
వైశ్యులు |
సూద్రులు |
శూద్రులు |
అఇన |
అయిన |
ఎంతచక్కని లేఖకుడయినా ప్రతులు ఎత్తి
రాసేటప్పుడు దృష్టిదోషంవల్లో, అలసటవల్లో, అనవధానతవల్లనో తెలియకుండానే లేఖనంలో దోషాలుగా మారిపోతాయి.
పరిష్కర్త గ్రంథాన్ని పరిష్కరించాలనుకొన్నప్పుడు ప్రాథమికంగా ఇటువంటి లేఖన దోషాల్ని సరిచేసి
పెట్టాలి.
లేఖన సంప్రదాయద్యోతక రూపాలు:
ప్రాచీనకాలంలో గుణింతాలు, పదాలు రాసే రాతపద్ధతికి, ఆధునికకాలంలో రాసే లేఖన విధానానికి భేదాలు కనిపిస్తాయి. అంటే గ్రంథాన్ని పరిష్కరించాలంటే ప్రాచీనలేఖనవిధానాన్ని ఆధునిక లేఖనవిధానానికి అనుగుణంగా మార్చుకోవాలి. లేకుంటే అప్పటి కొన్ని వర్ణాలు, సంకేతాలు ఇప్పటి మన రాతలో లేకపోవచ్చు. అలాంటప్పుడు పాఠకులు చదవాలంటే గ్రంథం సరిగా అర్థం కాదు. ఇలాంటి వాటిని పరిష్కర్త గుర్తెరిగి సరిచేయాల్సి ఉంటుంది.
వర్ణాలు |
ప్రాచీన రూపం |
నేటికాలపు రూపం |
1. పదాదిలో అత్వానికి ఎత్వం రాయడం |
చెంద్రుడు |
చంద్రుడు |
చెక్రవర్తి |
చక్రవర్తి |
|
2. పదాదిలో ఎత్వానికి అత్వం రాయడం |
చన్నయ |
చెన్నయ |
చాయన్వలె |
చేయన్వలె |
|
3. వలపల గిలక |
కీత్తిన్ |
కీర్తి |
4. బిందుపూర్వక ద్విత్వ హల్లు |
కొంద్దరు |
కొందరు, అంక్కిలి-అంకిలి |
5. పూర్ణబిందుపూర్వక - అద్విరుక్తహల్లు |
యెరింగి |
యెరిగి |
6. పదమధ్య - అజ్లోపము |
అడ్గితేను |
అడిగితేను |
అందుకే ప్రాచీన రాత పుస్తకాలను పాఠకునికి తగినంత భాషా పరిచయం, పదప్రయోగ సందర్భం,అర్థరీతి తెలిసి ఉండాలి.చదివేటప్పుడు ఇటువంటి లేఖనసంప్రదాయరూపాల్ని ఆధునిక లేఖన సంప్రదాయంలోకి మార్చి గ్రంథాల్ని, గ్రంథంలోని పాఠాలను సరిచేయాలి. రాతప్రతుల్లో ఇలాంటి లేఖనరూపాలను పరిష్కర్త జాగ్రత్తగా పరిశీలించి భాషాదోషాలు, వర్ణదోషాలు లేకుండా గ్రంథాన్ని, గ్రంథభాగాల్ని సవరించి ప్రచురణకు సిద్ధం చేయాలి.
అదే విధంగా లేఖనవిధానంలో ర-ఠ గా, ఖ-క గా, ఘ-గ గా, జ-జు-బ-బు గా కనిపిస్తాయి. లిఖితప్రతులలో ఇలాంటి లేఖనసమస్యలెన్నో తరచుగా కనిపిస్తుంటాయి. పరిష్కరణలో ప్రాథమికంగా ఇలాంటివాటిని గ్రంథ పరిష్కర్త జాగ్రత్తగా గుర్తించి సవరించాల్సిన అవసరమెంతైనా ఉంది.
2.5 పాఠాంతరము - ప్రక్షిప్తము – అపపాఠము:
తాళపత్ర రాతప్రతుల పరిష్కరణలో ప్రధానంగా మూడు
విధాలైన పాఠాలు కనిపిస్తాయి. అవి 1)పాఠాంతరం 2) ప్రక్షిప్తము 3) అపపాఠం. వీటిని ఆయా గ్రంథాలకు లభించిన
వివిధ రాతప్రతులతో పోల్చి, విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి, కవి హృదయాగతమైన మూలాని కనుగుణమైన
శుద్ధపాఠాల తీర్పుచెప్పటమే అసలైన గ్రంథ పరిష్కరణ అవుతుంది.
2.5.1 పాఠాంతరము లేదా పాఠభేదము:
గ్రంథాలకు పరంపరగా లిఖింపబడిన ప్రతులలో ఒక
పాఠానికి సమాంతరంగా కనిపించే మరొక పాఠాన్ని పాఠాంతరము లేదా పాఠభేదము అంటారు. ఇది కవి హృదయానికి
దగ్గరగాఉన్న మరొక్క అర్థవంతమైన మాట కావచ్చు. ఇది ఛందోభంగాన్ని కలిగించటంగానీ, తాత్పర్యార్థానికి భంగం
కలిగించటం గానీ చేయదు. అన్నివిధాల మూలపాఠమే అనిపించేంతగా కనిపిస్తుంది. శుద్ధపాఠానికి కొంత
కిందిస్థాయిలో ఉంటూ లిఖితప్రతుల్లో ఒకప్రతితో మరొక్క ప్రతితో సంవదించని ఇటువంటి భాగాలను పాఠాంతరాలు
అంటారు.
ఉదా: 13వ
శతాబ్దికి చెందిన మంచనకవి రచించిన కేయూర బాహుచరిత్రలో
’5
ఉ. బాలరసాల పుష్ప నవపల్లవ కోమల
కావ్యకన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె
సత్కవుల్
హాలికులైన
నేమి మరియంతకు నాయతి లేనినాడు గౌ
ద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై. (కే. బా. చ.
1-13)
ఈ పద్యంలో ‘పుష్ప’కి
బదులు ‘సాల’ అని, మూడవపాదంలో ‘మరియంతకు నాయతి లేనినాడు’ అనే వాక్యానికి బదులుగా ‘గహనాంతర సీమల
కందమూల’ అనే పాఠాంతరాలతో పోతన (15వ శతాబ్దం) చెప్పిన చాటుపద్యంగా ప్రసిద్ధికెక్కింది. కానీ పై
పద్యభావాన్ని గమనిస్తే భాగవత కర్తయైన పోతన స్వభావానికి అనుగుణంగా ఉందేకానీ మంచన స్వభావానికి ఏ విధంగానూ
సరిపోదని పరిశోధకులు భావించారు. (గ్రంథ పరిష్కరణ-బ్రౌన్
పూర్వరంగం, వ్యాసం, కె.వి.రాఘవాచార్య, గ్రంథపరిష్కరణ విధానాలు, సంపా, ఆచార్య చిట్రాజు గోవిందరాజులు, జ్యోత్స్న పబ్లికేషన్స్,తిరుపతి,
2008)
అదేవిధంగా పరంపరాగత ప్రతుల్లో
లేఖకదోషాలవల్ల కలిగే పాఠాంతరాలకు ఉదాహరణగా నన్నయభారతంలోని అవతారికను చూద్దాం.
ఉదా: సారమతిం గవీంద్రులు
ప్రసన్న కథా కవితార్థయుక్తిలో
నారసిమేలు నానితరులక్షరరమ్యత
నాదరింపనా
నారుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునం
మహా
భారత సంహిత రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్
(ఆం.మహా.భా. ఆది 1-26)
పై పద్యంలో ‘కథాకలితార్థయుక్తి’ అనే పాఠాంతరం మిగిలిన రాతప్రతుల్లో కనిపిస్తోంది. ఇది రాతలో అస్పష్టత మూలంగా ఏర్పడిన పాఠాంతరం. మొదటి పద్యపాదంలో ‘లి’ అనే అక్షరాన్ని ‘వి’ గా అర్థం చేసుకుని లిఖించడం వల్ల ఏర్పడినది. ప్రసన్న ‘కథాకవితార్థయుక్తి’ అంటే ప్రసన్నకథ యొక్క కవితార్థంయొక్క యుక్తి అని, ‘ప్రసన్నకథాకలితార్థయుక్తి’ అంటే ప్రసన్నమైన కథతో కూడుకొన్న అర్థాల సంయోజనం అవుతుందని విశ్వనాథసత్యనారాయణ సూచించారు (గ్రంథ పరిష్కరణ-బ్రౌన్ పూర్వరంగం, వ్యాసం, కె.వి.రాఘవాచార్య, గ్రంథపరిష్కరణ విధానాలు,సంపా,ఆచార్య చిట్రాజు గోవిందరాజులు, జ్యోత్స్న పబ్లికేషన్స్, తిరుపతి, 2008)
పాఠాంతరాలను ఈవిధంగా పరిష్కరించకుంటే పాఠకునికి గ్రంథమూలం అర్థంకాదు. మూలగ్రంథకర్త హృదయాన్ని అవగతం చేసుకోలేము.
సి.పి.బ్రౌన్ తెలుగులో అసంఖ్యాకంగా వేమనపద్యాల్ని సేకరించి పాఠపరిష్కరణ చేసి, కాగితాల్లో రాయించి భద్రపరిచాడు. అలాగే వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. బ్రౌన్ పాఠ పరిష్కరణలోని కొన్ని విశేషాల్ని డా॥ వేటూరి ఆనందమూర్తి పాఠపరిశీలన చేస్తూ రాసిన పీఠికలో6 ఈ క్రింది పద్యాన్ని చూడండి.
ఆ.వె. ఇహంబనందె సుఖము ఇంపార
లేకున్న
పరమునందు సుఖము
బడయుటెట్లు
మొదలు చావు లేక తుదనెట్లు
గల్గురా
విశ్వదాభిరామ వినురవేమ! (పారిస్ ప్రతి పద్య సంఖ్య - 11)
పై పద్యంలో మూడవపాదంలో ‘చావు’ అనే
పదం ఉండకూడదని దాని బదులు ‘చేవ’ అని ఉండాలని, చేవ అంటే శక్తి అని అర్థం వస్తుంది కానీ
ఉచ్చారణలో చేవ, చావుగా మారి పాఠభేదానికి దారితీసింది. దాన్ని బ్రౌన్, వావిళ్ల వారుకూడ చావుగానే
గ్రహించి ప్రచురిస్తూ వచ్చారు. అదే పారిస్ప్రతిలో (బ్రౌన్ ఆంగ్లంలోకి తర్జుమా చేసింది)
వేమనపద్యం 130వ పద్యంలో ‘‘మొదలలేని చేవ తుదనెట్లు
గల్గురా’’ అని ఉండటం గమనార్హం. మొదలు
‘‘చావు’’ పదానికి బదులు ‘‘చేవ’’అని ఉండాలని
సందర్భానికనుగుణంగా కవి హృదయానుగతమైన పాఠాన్ని వేటూరి ఆనందమూర్తి పరిష్కరించి సూచించారు. ఇట్లా జన
వ్యవహారానికి అనుకూలంగా పరంపరాగత ప్రతుల్లో పాఠభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పరిష్కర్త మూలప్రతులను
పరిశీలించి కవి హృదయాగతమైన శుద్ధపాఠాన్ని అందుబాటులోకి తేవాలి.
2.5.2 ప్రక్షిప్తము:
దీనినే అధికపాఠం అనికూడ అంటారు. గ్రంథాలకు ప్రతులు తయారుచేసే లేఖకులు మాతృకలోని పద్యాలనడుమ తమ పాండిత్యప్రకర్షతోను లేదా స్వీయకవితా ప్రదర్శన నిమిత్తమై ఉన్న విషయాన్నే మరొక్క విధంగా కుదించైనా, విస్తరించైనా రాసినా లేక తాను స్వయంగా చెప్పినదాన్ని రాసి ఇరికించినా అధికపాఠమవుతుంది. ఇవి కాలాంతరంలో మూలంలోనున్న పద్యాలేనన్న భ్రమను కలిగిస్తాయి. ఉదాహరణకు భాస్కర రామాయణంలో కనిపించే కొన్ని పద్యాలు, ఘట్టాలు ప్రక్షిప్తాలుగా కనిపిస్తాయి. (గ్రంథ పరిష్కరణం తీరుతెన్నులు,వ్యాసం,ఆచార్య రవ్వా శ్రీహరి,గ్రంథ పరిష్కరణ విధానాలు, సంపా,ఆచార్య చిట్రాజు గోవిందరాజులు, జ్యోత్స్న పబ్లికేషన్స్,తిరుపతి,2008)
ఉదా: నన్నయభారతం ఆదిపర్వంలో(1-35) భారతయుద్ధ క్రమాన్ని వర్ణించే సందర్భంలో
చ. పదిదినంబులు
భీష్ముడాహవభారకుండు,గురుండు పం
చదివసంబులు,గర్నుడుం
దివసద్వయంబు,దినార్థమం
దుదితతేజుఁడు శల్యుడత్యధికోగ్ర వీరగదా
రణం
బది దినార్థము గాగనిట్లు మహాభయంకర వృత్తితోన్
(ఆం.మహా.భా.ఆది.1- 35)
యుద్ధంలో పద్దెనిమిది రోజులలో పాల్గొన్న కౌరవ సేనాధిపతులను వివరించాడు. ఈ తరలపద్యంలోని భావాన్నే క్రమాలంకారంగా వర్ణించిన కందపద్యమొకటి ప్రక్షిప్తం కిందివిధంగా కనిపిస్తోంది.
క. పదిదినములయిదు
ప్రొద్దులు
పదపడిరెణ్నాళ్లు
నొక్కపగలుంరేయుం
ముదమున
రణమొనరించిరి
నదిసుత గురుకర్ణ శల్య నాగపురీశుల్
’7
ఈ పద్యం వేములవాడ భీమకవి రచించిన భారతంలోనిదని, అథర్వణుడు రచించిన భారతంలోనిదనే రకరకాల వాదాలూ ఉన్నాయి. ఆభారతగ్రంథాలు మనకు అలభ్యాలు. ముఖ్యంగా మూలగ్రంథంలోలేనివి, మూలగ్రంథకర్త భావాలకు విరుద్ధమైనటువంటివి ప్రక్షిప్తాలవుతాయి. రామాయణం, మహాభారతంలాంటి ప్రసిద్ధంగా ప్రచారంలోఉండే గ్రంథాలకు, కాలాంతరంలో ఆయాలేఖకులు తమ సొంత ప్రజ్ఞాపాటవాలతో పాఠకుల్ని బాగా ఆకర్షించాలనో, పాఠకుల సౌలభ్యంకోసమనో ఇటువంటివి చేర్చటంవల్ల ఇలా జరుగుతుంటుంది.
2.5.3 అపపాఠము:
కవి ఉద్దేశించిన లేక కవిచేత నిర్ణయించిన పాఠాలకు భిన్నంగా లేఖకులు చేర్చే పాఠాలను అపపాఠాలంటారు. వీటినే అశుద్ధపాఠాలంటారు. ఇవి మూలానికి ఏమాత్రమూ దోహదం చేయకపోగా మూలగ్రంథ స్వరూపాన్ని వికృతం చేయటంలో దోహదపడతాయి.
ఉదాహరణకు భాస్కర రామాయణంలోని ఆరణ్యకాండలో ముద్రితప్రతులన్నింటిలో-(గ్రంథ పరిష్కరణం తీరుతెన్నులు,వ్యాసం,ఆచార్య రవ్వా శ్రీహరి,గ్రంథ పరిష్కరణ విధానాలు, సంపా,జ్యోత్స్న పబ్లికేషన్స్, తిరుపతి, 2008)
‘‘మిహిర సమాన తేజుఁడు సుమిత్ర
తనూజుఁడు గొల్వగా ముదా
వహములయ్యె దత్సమయవాసరముల్
గురువంశభర్తకున్’’ అనే పద్యం కనిపిస్తుంది.
అంటే సూర్యసమానతేజుడైన లక్ష్మణుడు తనను
సేవిస్తుండగా రామునికి వనవాసపు రోజులు సుఖావహములైనవని పద్యభావం. ఇక్కడ రాముడనే అర్థంలో ‘గురువంశ
భర్తకున్’ అని ప్రయోగింపబడింది. రాముణ్ణి ఇక్కడ ‘గురువంశభర్త’ (గొప్పవంశంలో
రాజైనవాడు) అని పేర్కొనటంలో ఔచిత్యం లేదని, ఇది అనౌచిత్యమనే విమర్శ వచ్చింది. పోనీ గసడదవాదేశంగా
భావించి ‘కురువంశభర్తకున్’- అనటానికి అసలే ఆస్కారం లేదు. అయితే తాళపత్రప్రతుల్లో
ఆరాతీస్తే ‘‘రఘువంశభర్తకున్’’ అనే పాఠమే కనిపిస్తోంది. లేఖకుడు భారతానికి
సంబంధించిన ప్రతులు రాయటం వల్ల అటువంటి ప్రభావంతో ‘‘రఘువంశ భర్తకున్’’
అనే చోట ‘‘గురువంశ భర్తకున్’’ అనే పాఠాన్ని పొరపాటుగా చేర్చటంవల్ల
ఇటువంటి అపపాఠం చోటుచేసుకుంది. ఇలాంటివి లేఖకుల పొరపాట్ల మూలంగా జరుగుతూ ఉంటాయి.
ఎంత పండితుడైనా, లేఖకుడైనా
చూసి రాసేటప్పుడు ఏదోషమూ చేయకుండా రాయటం కుదరదు. అలాంటప్పుడు ఇకసాధారణ లేఖకుల పరిస్థితి ఎలాఉంటుందో మనం
అర్థం చేసుకోవచ్చు. అజాగ్రత్త, తెలియమి, మూలంకన్నా మెరుగుపరచాలన్న అత్యుత్సాహం మొదలైన అనేకాంశాలు
లేఖకులు పొరపాట్లు చేసేందుకు కారణాలవుతాయి.
ఉదా॥ కుందమాలలోని శ్లోకాన్ని చూడండి
‘‘వామేన నీవారలతాం కరేణ - జానుం
సమాలంబ్యచ దక్షిణేన
పదే పదే మే పదమాదధానా - శనైః శనేరేతు
ముహూర్తమార్యా॥’’ (కుందమాల,
ప్రథమాంకం)
పైశ్లోకం లక్ష్మణుడు వనవాస సందర్భంలో సీతతో పలికిన పలుకులలోనిది. ఎడమచేతితో నీవారలతను, కుడిచేతితో మోకాలిని ఆధారంగా చేసుకుని గంగవైపు మెల్లగా నడవమని లక్ష్మణుడు సీతతో చెప్పే సందర్భం. ఇందులో ‘నీవారలత’ అంటే మిక్కిలి సన్ననైన లత. దానిని ఆధారంగా చేసుకొని నడవడమనేది సాధ్యపడే విషయం కాదు. అసలిక్కడ ఉన్న శబ్దం ‘నీవార’ కాదు. ‘వానీర’ అని ఉండాలి. ‘నీవార’ శబ్దానికి బహుళ ప్రచారం ఉండి, అది ‘వానీర’ శబ్దం కన్నా ఎక్కువ పరిచితమై ఉన్న కారణంగా లేఖకుడు ‘వానీర’ బదులుగా గ్రంథప్రతిలో ‘నీవార’ శబ్దాన్ని రాసాడు. అందుచేత అర్థంలో అనౌచిత్యం ఏర్పడినది. ఇటువంటి అపపాఠాలెన్నో ప్రసిద్ధమైన రాయాయణ, భారత, భాగవత గ్రంథాల్లో చోటుచేసుకుని ఉండటం గమనించవచ్చు.
అంతేకాక లేఖకులు ప్రతులు రాసేటప్పుడు
అనవదానతవల్లనో, దృష్టిదోషంవల్లనో గ్రంథభాగాల్లో పొరపాటున తొందరపాటుతో కొన్నింటిని వదిలివేయటం
జరుగుతుంది. వాటిని స్ఖాలిత్యాలు అంటారు. వాటిలో కొన్ని అక్షరాలు, పదాలు, పద్యపాదాలులేదా కొన్ని పద్యాలు
ఉండే అవకాశం ఉంది. ఇలాంటివాటిని పరిష్కర్త తన మేథోశక్తినంతా కూడగట్టుకొని నిశితంగా పరిశీలించి
గ్రంథాన్ని చక్కదిద్దాలి. ప్రతులు సిద్ధంచేసే లేఖకులవలన కలిగే దోషాలతోపాటు వందల సంవత్సరాలుగా ఉన్న
తాళపత్రాలు క్రిమిద్రష్టం కావటం, తాళపత్రాలలోని కొన్ని ఆకులు విరిగిపోవటం, ఛిద్రంకావటం, గ్రంథపాతాలుండటం
వంటి కారణాలవలన కూడ తాళపత్ర గ్రంథాలను పరిష్కరించవలసిన అవసరం ఏర్పడుతోంది. ఉన్న పాఠాలు లోపించటం ఒక
సమస్య అయితే అదనంగా పాఠాలు చేరటం మరొక సమస్య. ఒకదానికి బదులు మరొకటి కూర్చటంవల్ల ఏర్పడ్డ దోషాలతోపాటు
లిపికి సంబంధించిన దోషాలు కూడా కొన్ని కనిపిస్తాయి. ఇటువంటి సందర్భంలో తాళపత్ర గ్రంథాలను
పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
3. ఉపసంహారం:
- తాళపత్ర రాతప్రతులనుండి గ్రంథాన్ని పరిష్కరించి,అచ్చుకు సిద్ధం చేసే సమయంలో పైన పేర్కొన్న అనేక విధాలైన సమస్యలు కనిపిస్తాయి. వీటిని ఆయా గ్రంథాలకు లభించిన వివిధ రాతప్రతులతో పోల్చి విమర్శనాత్మక దృష్టితో పరిశీలించి, కవి హృదయాగతమైన మూలానికనుగుణమైన శుద్ధపాఠాలతో తీర్పుచెప్పటమే పరిష్కర్త అసలైన కర్తవ్యం.
- తెలుగులో సి.పి,బ్రౌన్ మానవల్లి, వేటూరి, నిడదవోలు వేంకటరావు, కందుకూరివంటి ఎంతోమంది మహామహులు గ్రంథాలను పరిష్కరించి గ్రంథపరిష్కరణకు దారులు వేశారు.
- తెలుగులో ఉస్మానియా వారు ప్రచురించిన ఒక్క ఆంధ్ర మహాభారతానికి తప్ప మరే ఇతర కావ్యాలకు సంశోధిత ముద్రణలు వెలువడలేదు.
- తెలుగులో ప్రసిద్ధంగా ఉన్న ఎన్నోకావ్యాలను సంశోధితంగా పరిష్కరించి, ముద్రించాల్సిన అవసరమెంతైనా ఉంది. ఆధునిక సమాజంలో ప్రాచీన సాహిత్యం పట్ల, రాతప్రతుల ప్రతుల అధ్యయనాల పట్ల శ్రద్ధ తగ్గిపోతూ ఉంది. అందువల్లనే అనేక తాళపత్ర రాతప్రతులు పరిష్కరణకు నోచుకోక గ్రంథాలయాల్లో, కొంతమంది సాంప్రదాయిక, ధనవంతుల ఇళ్లలో క్రిమిద్రష్టమై మగ్గిపోతుండటం గమనించదగిన విషయం.
- కావుననే ఈ వ్యాసం ప్రాచీన తెలుగు, తాళపత్ర రాతప్రతుల పరిష్కరణ, లిపి సంస్కృతులపట్ల నేటి యువతరానికి ఒక అవగాహన కల్పించి వారిని పరిష్కరణవైపు మొగ్గుచూపడానికి బాటలువేయగలదని నా అభిమతం.
- తద్ద్వారా నేటికీ అసూరంపశ్యలుగా మగ్గిపోతున్న ఎన్నో అముద్రిత, అపరిష్కృత తాళపత్ర రాతప్రతులెన్నో పరిష్కరణకు నోచుకొని ప్రచురణ భాగ్యం పొందగలవని భావిస్తున్నాను.
4. సూచికలు:
- అకారాది అమర నిఘంటువు
- S.M Katre – An introduction to Indian textual
criticism
- వేటూరి ప్రభాకరశాస్త్రి పీఠికలు – మున్నుడి
- మానవల్లి కవి రచనలు - సకలనీతి సమ్మతము, పుట.112
- తెలుగు చాటువు-బి.శ్రీనివాసాచార్యులు,బి.నళినీకాంతరావు,మద్రాసు.1983,పుట.32
- ఆచార్య ఎన్.గోపి. వెలుగులోకి తెచ్చిన 1730 నాటి వేమన పద్యాల ప్యారిస్ ప్రతికి వేటూరి ఆనందమూర్తిగారి పీఠిక
- శుభకృన్నామ సంవత్సరం 1842-43 నాటి ఆదిపర్వం ముద్రితప్రతి1-135 ప్రక్షిప్త పద్యమునకు క్రమసంఖ్య లేదు.
5. ఉపయుక్తగ్రంథసూచి:
- గోపి, ఎన్. వేమన పద్యాలు. పారిస్ ప్రతి, స్వీయ ప్రచురణ,1990
- గోవిందరాజులు, చిట్రాజు. సంపా, గ్రంథ పరిష్కరణ విధానాలు,జ్యోత్స్న పబ్లికేషన్స్, తిరుపతి, 2008
- మానవల్లి కవి రచనలు-ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురణ,1972
- వేంకటేశ్వర్లు, బూదాటి. భారతీయ గ్రంథ పరిష్కరణ ప్రవేశిక,మూలం.ఎస్.ఎమ్.కత్రే, తెలుగు అనువాదం- ద్రావిడ విశ్వ విద్యాలయ ప్రచురణ, 2012
- వేటూరి ప్రభాకరశాస్త్రి పీఠికలు, ప్రథమ భాగం – మున్నుడి, తి.తి.దే ప్రచురణలు, 2012
- శ్రీ రంగాచార్య, ఆధునిక సాహిత్య విమర్శరీతులు, వ్యాసం. సంపా. డా. లక్ష్మణ చక్రవర్తి, హైదరాబాద్
- శ్రీనివాసాచార్యులు, బి. నళినీకాంతరావు, బి. తెలుగు చాటువు. మద్రాసు, 1983
- శ్రీహరి, రవ్వా. ఉభయభారతి. వరరుచి పబ్లికేషన్స్, 2015
- Katre, S.M- An Introduction to Indian Textual Criticism, Deccan College and Research Centre, Puna.1942
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "JUNE-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-May-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు
మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "JUNE-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.