AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. ఆచార్య సుదర్శనరాజు రచనలు : ఉద్యమసాహిత్యవిమర్శ
డా. మెండా దేవానంద్ కుమార్
తెలుగు శాఖాధ్యక్షులు,
డా. లకిరెడ్డి హనిమి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మైలవరం, ఎన్.టి.ఆర్. జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440781819, Email: devanand76kumar@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 09.12.2024 ఎంపిక (D.O.A): 28.01.2025 ప్రచురణ (D.O.P): 01.02.2025
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత ఎంతో శక్తివoతమైనది. కవి తను చెప్పదలచిన విషయం ఎటువంటి నియమ నిబంధనలకులోను కాకుండా స్పష్టంగా చెప్పవచ్చు. ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు అంటరాని కులంలో పుట్టి, ఆంధ్రవిశ్వవిద్యాలయ ఆచార్యునిగా, కవిగా, విమర్శకునిగా ఎదిగిన వ్యక్తి. వీరు అనేకరచనలను చేశారు. వాటిలో ముఖ్యమైనవి పౌరాణికరూపకాలు, దళితకవిత, సుదర్శని, సులోచని, కవిరాజు నాటకాలు-హేతువాద దృక్పథం, ఆధునికసాహిత్యవిమర్శ సిద్ధాంతాలు-సూత్రాలు రచించి దళితజాతి అభ్యున్నతి కొరకు పాటుపడ్డారు. వీరిపై పరిశోధనా వ్యాసాo రాయడానికి ముందు వారిని వ్యక్తిగతంగా కలుసుకున్నాను. వారు రచించిన పుస్తకాలన్నిటిని అధ్యయనం చేశాను. విశ్లేషణాత్మక పద్ధతిలో నా పరిశోధనలను కొనసాగించాను. పరిశోధనా వ్యాసాన్ని మూడు భాగాలుగా విభజించాను. మొదటి భాగoలో ఆచార్య కొండపల్లి వారి బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం., రెండో భాగంలో వారి సాహిత్య జీవితం, మూడవ భాగంలో దళితుల అభ్యున్నతి కొరకు స్థాపించిన సంస్థలను వివరించాను. దళితులు సమాజంలో గౌరవప్రదమైన స్థితికి చేరుకోవాలనే లక్ష్యముతో నా పరిశోధనను కొనసాగించాను.
Keywords: వ్యాసం, విమర్శ, ఉద్యమం, దళితవాదం, హేతువాదం, అస్తిత్వం, సాహిత్యపీఠం
1. ఉపోద్ఘతం :
చతుర్వర్ణా వ్యవస్థలో చోటే దక్కని పంచముడు అనాదిగా అణిచివేయబడ్డాడు. దుర్బర దారిద్యం నుండి గట్టేక్కడానికి చేయని ప్రయత్నం లేదు. ఎందరో దళిత యోధులు భావి తరాల స్వేచ్చకోసం ప్రాణ త్యాగాలు చేసారు. మరెందరో కలమెత్తి కదన రంగలో దూకారు. వీరుల త్యాగాలను గజ్జే కట్టి పాట రూపంలో పాడుకున్నారు. వేదన భరిత బురద నుండి బువ్వ పుట్టించిన అంటరాని కులంలో పుట్టి, చదువును నమ్ముకొని తామర పుష్పం వలే కాంతులు వేదజల్లుచున్న ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు గారి సాహితి జీవితాన్ని విశ్లేషించడం వ్యాస ముఖ్య ఉద్దేశ్యం.
2. రచయిత పరిచయం:
ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు గారు జక్రయ్య – రత్నమ్మ పుణ్య దంపతులకు కలిగిన ఆరుగురు సంతానంలో తొలిచూరు బిడ్డగా 1954 జూలై 29న గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం మోపర్రు గ్రామన నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను లూథరన్ ఎలిమెంటరీ స్కూల్ మోపర్రులో 1-5వ తరగతి వరకు పూర్తిచేశారు. హైస్కూల్ విద్యను సెయింట్ పాల్స్ హై స్కూల్ ఫిరంగి పురంలో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీలను వి ఎస్ ఆర్ కళాశాల తెనాలిలో పూర్తిచేశారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నందు 1981లో ఎం.ఎ తెలుగును అభ్యసించారు.
సెంట్రల్ యునివర్సిటి ఆఫ్ హైదరాబాద్ నందు ఆచార్య ఆనందారామం గారి పర్యవేక్షణలో “కవి రాజు నాటకాలు - హేతువాద దృక్పదo” అనే అంశం పై పరిశోధన చేసిన మొదటి వ్యక్తిగా 1983లో ఎం.ఫిల్ పట్టా పొందారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం విశాఖపట్నం నందు ఆచార్య అత్తలూరి నరసింహారావు గారి పర్యవేక్షణలో పౌరాణిక రూపకాలు – భావ విప్లవం” అనే అంశంపై 1989లో పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందారు. 1994న ఆంధ్ర విశ్వ విద్యాలయం తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బాద్యతలు స్వీకరించారు. 22 సంవత్సరాలు వివిధ హోదాల్లో అప్రతిహతంగా పనిచేశారు. 1) పౌరాణిక రూపకాలు – భావ విప్లవం (1990), 2) దళిత కవిత (తొలి తెలుగు దళితకవితా సంకలనం) (1991), 3) కవిరాజు నాటకాలు – హేతువాద దృక్పథం, 4) సుదర్శిని (పరిశోధన వ్యాస సంపుటి), 5) సులోచని (వ్యాస సంపుటి), 6) సుహితాక్షరాలు (సాహిత్యవ్యాసాలు), 7) వచన కవిత్వం – క్రైస్తవ ప్రభావం, 8) దళిత కవుల మరణం – కవితాస్మరణం, 9) దళిత సాహిత్య వ్యాసావళి మొదలైనవి వీరి రచనలు.
“రాబోయే రోజుల్లో జాతి సంక్షేమ భారాన్ని మోయవలసిన బాధ్యత యువతే” అన్న డా. బి ఆర్ అంబేద్కర్ గారి స్పూర్తితో వారి శత జయంతిని పురస్కరించుకొని 1991లో ‘దళిత కవిత’ అనే తొలి దళిత కవితా సంకలనం ఆవిష్కరించారు. యువ పరిశోధకులతో దళిత సాహిత్యం పై విస్తృతంగా పరిశోధన చేయించారు. ఉత్తమ రచనలను ప్రచురించడానికి 1991లో దళిత సాహిత్య పీఠం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. కవి ఆవిష్కరించిన నూతన కావ్యాన్ని పాఠకుడు రస దృష్టితో కావ్య పఠనం చేయును. వీరిద్దరిని అనుసంధానం చేసే మూడో వ్యక్తి విమర్శకుడు. నీతి విలువలు, సమాజ విలువలు సౌందర్య విలువలు మానవ విలువలు, సహానుభూతి, సునిశిత దృష్టి,నిజాన్ని నిర్బయంగా చెప్పే నిబద్దత కలిగిన బుద్ది జీవి, ధన్య జీవి విమర్శనాగ్రగణ్యుడు ఆచార్య కొండపల్లి.
3. దళితసాహిత్యోద్యం: విమర్శనావ్యాససంపుటి :
ఆచార్య కొండపల్లి రచించిన “సులోచని” విమర్శన వ్యాస సంపుటి మొదటి వ్యాసంగా ఆంధ్ర సాహిత్యంలో డా. అంబేద్కర్ రాశారు. “ఆధునిక తెలుగు సాహిత్యంపై ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తులలో డా.అంబేద్కర్ ముఖ్యులు. వారి ఉద్యమ జీవితానికి ప్రభావితులైన ఎందరో కవులు రచనలు చేశారు. రావూరు ఏకాంబరం గారు అంబేద్కరో నరసింహ అనే కావ్యాన్ని రాశారు”.1 రెండో వ్యాసంగా ‘ఆంధ్ర బెర్నార్డ్ షా కవిరాజు’ రాశారు. భావ విప్లవ విధాత కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అనేక అహేతుక అంశాల్ని ఖండిస్తూ తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించారు.
ఆచార్య కొండపల్లి రచించిన సులోచని వ్యాససంపుటి యావత్తు హేతువాద దృక్పథం కనిపిస్తుంది. “హేతువాద జ్యోతిని వెలిగించి, నిద్రణమైన మనవాళికి జాగృతి కల్పించి, భావ విప్లవానికి జీవితాన్నిఅంకితం చేసిన భావ విప్లవ విధాత, శతావధాని, సంఘ సంస్కర్త ఆంధ్ర బెర్నార్డ్ షాగా త్రిపురనేని రామస్వామి చౌదరిని అభివర్ణించారు”.2 పదకొండో వ్యాసం ‘భావవిప్లవ రూపకాలు –కవిరాజు ప్రభావం’ పన్నెడో వ్యాసం ‘కులిరాజు నాటకం–రచన ప్రాశస్త్యం’
పదమూడో వ్యాసం ‘శంబుక వధ – హేతువాద దృక్పథం’గా రచించారు.
కుసుమ ధర్మన్న కవి, డాక్టర్ బోయి భీమన్న తొలి తరం దళిత కవుల్లో మిక్కిలి గుర్తింపు పొందారు. దళిత కవిత్వానికి వీరు రెండు కళ్లు. దళిత సమాజం వెనుకబడి ఉండటానికి ముఖ్య కరకాలైన నిరక్షరాస్యత, అనారోగ్యం, ఆత్మన్యూనత మత్తుపానీయాలకు భానిసత్వం, బాల్య వివాహాలను కథ వస్తువులుగా స్వీకరించారు. ఆచార్య కొండపల్లి రచించిన సుదర్శిని వ్యాస సంపుటి ఎనిమిదో వ్యాసంలో కుసుమ ధర్మన్న ’మాకొద్దీ నల్లదొరతనం’ కవితా ప్రాముఖ్యం విశ్లేషించారు.
“1942 వ సంవత్సరంలో అంబేద్కర్ ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేసినప్పుడు కుసుమ ధర్మన్న చేత ప్రభావితమైన ప్రజలు ఆయనకు బ్రహ్మ రధం పట్టారు. 1933లో హరిజనశతకం, నల్లదొరతనం అనే సుధీర్ఘమైన 56 చరణాలు కలిగిన పాటను రాశారు”3. దళిత సాహిత్యంలో మేరు పర్వతంలా వెలుగొందే దళిత సూర్యుడు డాక్టర్ బోయిభీమన్న. ఆచార్య కొండపల్లి రచించిన సుదర్శిని వ్యాస సంపుటి తొమ్మిదో వ్యాసంలో బోయి భీమన్న”గుడిసెలు కాలిపోతున్నై కవితా ప్రాశస్త్యం” నందు కవి గొప్పతనం ఎంతో ఆర్తితో వివరించారు. “పాలేరు , కూలిరాజు, రాగ వశిష్ట, ఆదికవి వాల్మీకి మొదలైన నాటకాలు బొమ్మ దీపసభ మధుబాల అశోక వనంలో రాముడు మొదలైన కావ్యాలు రాశారు. గుడిసెలు కాలిపోతున్నై చాలా శక్తివంతమైన గద్య కవితల సంపుటి”4 గా అగ్ర స్థానంలో నిలచింది.
4. బ్రాహ్మణీయ వ్యవస్థను ప్రశ్నించిన బౌద్ధo :
దళితుల దుస్థితికి కారణమయిన మనుధర్మ శాస్త్రం, బ్రాహ్మణ భావజాలాన్ని ప్రశ్నిస్తూ ఆచార్య కొండపల్లి వారు రాసిన ‘నేటి వ్యవస్థ-బౌద్ధ ఔన్నత్యం’ అనే వ్యాసంలో-
“జంతుబలులతో, మూఢనమ్మకాలతో, సాంఘిక అసమానతలతో అస్తవ్యస్తంగా వున్ననాటి సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చాడు బుద్ధుడు. అహేతుక యజ్ఞయాగాదుల్ని దైవభావాన్ని వాటిని సృష్టించిన బ్రాహ్మణీయ వ్యవస్థను ప్రశ్నించి సామాజిక సమానత్వాన్ని నెలకొల్పడానికి నిర్విరామ కృషి చేసాడు. బుద్ధుడి తర్వాత భిక్షువులతోపాటు మౌర్య చక్రవర్తులు బౌద్ధ ప్రచారంలో భాగస్వాములయ్యారు. రాజాశ్రయంతో సంఘంలో సమానత్వం నెలకొని బౌద్ధం దేశవిదేశాల్లో వెల్లివిరిసింది. అది బుద్ధుడు ఆనాడు తెచ్చిన సాంఘిక విప్లవం. బౌద్ధం ప్రజలమతంగా పరిఢవిల్లడంతో వైదిక మతం సన్నగిల్లి పౌరోహిత్యపు పెత్తనం దిగజారిపోయింది. ఈ స్థితి నుండి హైందవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అనేక కుతంత్రాలతో దాడులకు, హింసకు విధ్వంసానికి వైదిక మత నాయకులు పూనుకున్నారు. క్రమేపీ బౌద్ధం ఈ దేశంలో కొంత క్షీణిస్తూ వచ్చింది. అయినా దాని ఉత్కృష్ట భావజాల ప్రభావం భారతీయ తాత్త్యిక మత సాంఘిక సాహిత్య సాంస్కృతిక రాజకీయాలపై అమితంగా ఆనాటి నుండి ఈనాటి వరకు అనుస్యూతంగా ప్రసరిస్తూనే వచ్చింది.”5
భారత దేశంలో మహోన్నతమైన తాత్విక చింతనను ప్రసాదించిన బౌద్ధమతము సర్వ ప్రాణుల పట్ల భూతదయతో మెలిగేవిధంగా చేసింది. కర్మ, దేవుడు, పునర్జన్మ, యజ్ఞయాగాదులకు విలువివ్వని బౌద్ధం దళితులకు స్వాంతన కలిగించింది.
5. అగ్రకులహకారo పై తిరుగుబాటు :
1985 సం.లో జరిగిన చుండూరు సంఘటన నేపధ్యంగా దళిత సాంఘికోద్యమo ఉగ్రరూపం దాల్చింది. దీనితో పాటు 1990 సం.లో డా॥ బి.ఆర్. అంబేద్కర్ శతజయంతిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులతో భారీ ఎత్తున నిర్వహించడం ఆయనకు భారతరత్నను ప్రకటించి పార్లమెంటు సెంట్రలోల్లో నిలువెత్తు చిత్రపటాన్ని ఆవిష్కరించడంలాంటి సంఘటనలతో దళితుల్లో నూతన చైతన్యం పోరాట స్ఫూర్తిని ఆత్మ గౌరవ భావన కలిగాయి. దళిత దళితేతర కవులు కూడా ఈ భావజాలంతో కవిత్వాన్ని ఉద్యమంగా ఉదృతంగా రాశారు. ఇందులో భాగంగా విలక్షణమైన పదునైన గీతరచన కూడా చోటుచేసుకున్న సంఘటనలతో ఆచార్య కొండపల్లివారు ‘గీత రచన – దళితాభ్యుదయం’ అనో పదునైన వ్యాసం రాశారు.స్వాతంత్ర్యోద్యమ, వామపక్షోద్యమ నేపధ్యాలలో కూడా దళిత కవులు రాసిన గీతాలు చోటుచేసుకున్నాయి.దోనేపూడి మోహన ప్రసాద్ 1992 లో రాసిన ‘దళిత రధం కదిలింది’ అనే గేయంలో-
“దళితరధం కదిలింది
దురితుల గుండదిరింది
సమతకై – మమతకై
సాగి ముందు కెళుతుంది
అణగదొక్కబడిన జాతి
ఆ మోసం తెలుసుకుంది
తలెత్తుకు తిరగాలని
తపన చెందుతూవుంది’’
దురాగతుల గుండెలదిరేట్లు దళితులంతా సమతా మమతకై ముందుకు సాగేలా దళితరథం కదిలిందని, అణగదొక్కబడిన జాతంతా గతకాలంలో జరిగిన మోసల్ని తెలుసుకున్నారని చెప్పారు.
6. దళిత కవుల కవితా స్మరణం :
దళిత సమాజంలోని బడుగు, బలహీన వర్గాల సమస్యలపై ఎత్తిన కలం దించకుండా కవిత్వం అనే ఆయుధంతో సమర శంఖారావం పూరించి పిన్న వయ్యస్సులోనే లోకం విడిచిన దళిత కవులను స్మరిస్తూ ‘దళిత కవుల మరణం కవితా స్మరణం’ అనే వ్యాస సంకలనాన్ని సుదర్శనరాజు ప్రచురించారు. “ఈ పుస్తకంలో చోటు చేసుకున్న అందరి కవులతో నాకు ప్రత్యక్ష పరిచయం, సాన్నిహిత్యం వుంది. కొందరితో ఆత్మీయ మైత్రీబంధం కూడా వుంది. అందుకే వారి మరణాలకు అందరిలాగే నేనూ దుఃఖించాను.” అని ముందుమాటలో వీరు పేర్కొన్నారు.
ముఖ్యంగా 40 సం॥లకు మద్దూరి నగేష్ బాబు, 48 సం॥కు కలేకూరి ప్రసాద్, 50 సం॥లకు పైడి తెరేష్ బాబు, 56 సం॥లకు నేతల ప్రతాప్ కుమార్ మృతి చెందారు. ఇది సాహితీ జగత్తుకు, ప్రత్యేకించి, దళిత సాహిత్య ఉద్యమానికి తీరని లోటు. వాటిలో ఆయా కవుల దృక్పథాల్ని, దళితాభ్యుదయానికి వారు సృష్టించిన సాహిత్యాన్ని, సాంఘిక ఉద్యమాల్లో భాగస్వామ్యాన్ని గూర్చి పలువురు కవులు, రచయితలు వ్యాసాలు, కవిత్వం, పాటలు రాశారు. అందులో స్తుతి, స్మృతి, నివాళులుగా కవిత, పాటల రూపంలో వచ్చిన కవిత్వాన్ని ఈ సంకలనంలో విశ్లేషణాత్మకoగా వివరించారు.
“సమాజంలో వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల్ని ప్రశంసించడం, స్తుతించడం, స్మరించడం పరిపాటి. ఆయా వ్యక్తులు మరణించినపుడు వారి సేవల్ని స్మరించుకుంటూ స్మృత్యంజలి ఘటించడం కన్పిస్తుంది. సర్వసాధారణంగా ప్రశంసలు కూడా మరణానంతరమే అధికంగా వెల్లువెత్తుతాయి. మృతులతో ఉన్న సాన్నిహిత్యం వల్ల, ఒకే రంగంలో కొనసాగటం వల్ల మైత్రీబంధం అధికంగా ఉంటుంది. అందుకే దళిత కవులు కాలం చేసినపుడు దళితులతో పాటు ఇతరులు కూడా స్తుతి స్మృతికి సంబంధించిన కవిత్వం రాశారు. దళిత కవులు కాస్త ఎక్కువగానే ఈ తరహా కవిత్వాన్ని సృష్టించారు”6
ఇదే రీతిలో అకాలంగా మరణించిన దళిత కవుల్ని గూర్చి, ప్రఖ్యాతి గాంచిన వారిని గూర్చి విస్తారంగా స్తుతి స్మృతి కవిత్వం వెలువడింది. వీరిపై ప్రత్యేక సంస్మరణ సంచికలు కూడా వచ్చాయి.మద్దూరి మరణించినపుడు అనేక మంది కవిమిత్రులు శ్రేయోభిలాషులు వారికి స్మృత్యంజలి ఘటిస్తూ కవిత్వాన్ని రాశారు. అలా రాసిన వారిలో పైడి తెరేష్ బాబు ఒకరు. వీరు రాసిన ‘ప్రేమలేఖ’ అనే కవితలో –
“నలుపూ తెలుపు ఓటమి గెలుపుల మధ్య
వంతెనలా పరుచుకున్న నిలువెత్తు వర్ణచిత్రం
ఆరడుగుల గొయ్యిలో కప్పెట్టబడింది
ఇక నగేష్బాబు అంటే జ్ఞాపకం మాత్రమేనా...?
గొంతుకూ అక్షరానికి మధ్య గిలగిల కొట్టుకులాడిన శబ్దం
ఆఖరికి అక్షరాల్లో స్థిరపడిపోయింది
ఇక నగేష్ బాబు అంటే కవిత్వం మాత్రమేనా...?
వూహకూ వాస్తవానికి మధ్య
ఉద్రేకానికీ ఉద్యమానికీ మధ్య
భావజాలానికీ అహంభావజాలానికీ మధ్య
కరచాలనాలకూ... ఖడ్గ చాలనాలకూ మధ్య
అరిచి మెరిసి మాట్లాడి పోట్లాడి దొర్లాడి పొర్లాడి
బందాడి వెన్నాడి వూగాడి తూగాడి నవ్వీ ఏడ్చి అలిసి
పోయాడు. చనిపోయాడు నగేష్ బాబు చనిపోయాడు”
వీరి మరణానికి అనేక మంది కవులు, రచయితలు స్మృత్యంజలి ఘటించారు. ఒమ్మి రమేష్ బాబు ‘యువర్’ అనే కవితలో కలేకూరి అకాల మృతికి చింతిస్తూ-
“మనిషి పాటగా మారే
మనోహర దృశ్యాన్ని
చూసుంటారా ఒక్కసారైనా మీరు!
చేతిలో అక్షరాలు... కంట నక్షత్రాలు
పిలిచాడో వశీకరణమే...
అతను గాలినీ... గాలిని అతను
ఏకకాలంలో శ్వాసిస్తూ, ధ్యాసిస్తూ, లాలిస్తూ
ఉండేవాడొకప్పుడు లేనేలేడిప్పుడు
అతనే నా జానపద కళా రవీ పవి కవీ
అద్దిరబన్నా నా ముద్దుల కన్నా
నమ్మాలని లేదా అయితే నా కంటితో చూడు”
అని వారి సాహితీ వైశిష్ట్యాన్ని ప్రశంసిస్తూ స్మృత్యంజలి ఘటించారు. ఇందులో దళితులపై జరిగే అక్రమాలపై దాడి చేసేవారని, అన్యాయాలకు గురైన వారికి కొండంత అండగా ఉండేవారని, వారి మాటల్లో విలక్షణత, ఆలోచనల్లో అభ్యుదయ భావాలు వెల్లివిరిసాయని విన్నవించారు. శాంతం, ఆగ్రహం వారి వదనంలో సందర్భానుసారం ప్రస్పుటమయ్యేవని పేర్కొన్నారు.ప్రసాదమూర్తి రాసిన ‘నువ్వే మా ఆత్మగౌరవం’ అనే కవితలో సమాజంలో నిత్యం దళితులపై జరిగే అకృత్యాలపై ప్రచండ యుద్ధం చేసిన వీరుడిగా అభివర్ణించారు. ఆయన గమనాన్ని కదిలే కరవాలంగా, వెలుగు రేఖగా భావించారు. దళితకవుల సభలపై, రచనల పై హేళనగా చూసే వర్గ శత్రువులు ఈ మరణాలకు సంతోషిస్తున్నారన్నారు. అయితే కవులు గతించినా వారి ప్రబోధాలు నిత్యం చైతన్యాత్మకంగా దళితోద్యమాల్ని నడిపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
7. ముగింపు:
- ఈ భూమి మీద రెండు రకాలైన మనుషులుంటారు. మొదటి రకం వ్యక్తులు తమ పని ఏదో తాము చేసుకుపోయేవారు.. రెండో రకం వ్యక్తులు ఇతరుల కోసం సహానుభూతితో పని చేసే వారు.
- ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు గారు రెండో కోవకు చెందిన మహా వ్యక్తి. వ్యాసమనే ఆయుధంతో సామాజిక రుగ్మతలపై కలంతో కవాతు చేశారు. వారి గూర్చి చెప్పవల్సింది కొండంత ఉన్న రేఫ మాత్రంగా వివరించాను.
- శిష్యుల అభ్యున్నతిని నిరంతరం కాంక్షించే మిత్రుడిలాంటి గురువు ఆచార్య కొండపల్లి గారికి గుండెలోతుల్లోంచి కృతజ్ఞతలు తెలుపుతు వ్యాసాన్ని మూగిస్తున్నాను.
8. పాదసూచికలు:
- సులోచని, పుట సంఖ్య – 01
- సులోచని, పుట సంఖ్య – 12
- సుదర్శిని, పుట సంఖ్య – 33
- సుదర్శిని, పుట సంఖ్య – 38
- సుహితాక్షరం, పుట సంఖ్య – 09
- దళిత కవుల మరణం కవితా స్మరణం, పుట సంఖ్య - 15
9. ఉపయుక్తగ్రంథసూచి:
- కుబేర్, ఎన్. (2016). డా. బిఆర్. అంబేద్కర్ విశ్లేషణాత్మక అధ్యయనం, నవతెలంగాణ, హైదరాబాద్.
- మలిఖార్జునరావు, జి. (1982). డా. అంబేద్కర్, వాహిని ప్రచురణ, విజయవాడ.
- సుదర్శన రాజు, కొండపల్లి. (2001). సులోచని. దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం.
- పైదే. (1995). సుదర్శిని. దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం
- పైదే. (2015). సుహితాక్షరం. దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం.
- పైదే. (2023) దళితకవుల మరణం కవితాస్మరణం, దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

