AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
13. మహాభారతం: అశ్వమేధపర్వ ఆంతర్యార్థం
బుక్కే ధనక నాయక్
పరిశోధక విద్యార్థి, తెలుగు శాఖ,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,
నాగార్జున నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ధర్మం, అధర్మం, మోసం, కుట్ర, భార్యాభర్తల మధ్య అనుబంధం, కుటుంబ బాంధవ్యాలు, కుటుంబ ఆంతర్యాలు, సమాజంలో స్పృహలేమి తనం, వెన్నుపోటు, యుద్ధంలో నయవంచన, ఎత్తుకు పైఎత్తులు ఎన్నో రకాల సంఘటనలతో సంఘర్షణలతో మహాభారత చిత్రీకరణ సాగింది. వేదవ్యాసుడి చేత సంస్కృతంలో లిఖించబడిన మహాభారతం తెలుగులో నన్నయ్య చేత అనువాదం ప్రారంభమైంది. ఆంధ్ర మహాభారతాన్ని ప్రస్తుత సమాజంలో కథగా మాత్రమే తెలుసు. పాఠకులకి ఇదొక సాంఘిక స్పృహగా అందులోను శాంతియుతంగా నడిచిన అశ్వమేధపర్వము కమనీతని గురించి మరో కొత్త కోణంతో తెలియజేస్తూ ప్రస్తుత సమాజంలోని కవులకి, రచయితలకి తిక్కన యొక్క రచన వైశిష్టాన్ని మరొక్కసారి వివరిస్తూ నాటికీయతని ప్రస్తుత కవులు, రచయితలు తమ రచనలలో ఉపదేశాత్మకమైనటువంటి సంఘటనలు కూడా చేర్చగలగడం ఒక విధిగా మరియు సమంజసమని భావిస్తూ అశ్వమేధ పర్వాన్ని ఒక మార్గదర్సిగా, దిక్సూచిగా స్వీకరించి నూతన కోణాన్ని సాహిత్య పరిశోధకులు పాఠకులు, కవులు రచయితలు మొదలైన వారికి తెలియజేయడం ఈ వ్యాసం ఉద్దేశం.
Keywords: పౌండ్ర, అశ్వమేధం, పీనుగుపెంట, తత్వజ్ఞానం, మేఘసంధి.
1. ఉపోద్ఘాతం:
అశ్వమేధయాగము ముహూర్తము సమీపింగానే వ్యాసుడు మొదలైన ఋత్విక్కులు వేదహితముగా ధర్మరాజు చేత యాగదీక్ష చేయించారు. ధర్మరాజు దండము ధరించి కృష్ణాజినము మీద కూర్చున్నాడు. తరువాత యాగాశ్వమును పూజించి యాగాశ్వమును వదిలి పెట్టాడు. యాగాశ్వము బయలు దేరింది. అర్జునుడు గాడీవము చేతబూని తన సైన్యముతో యాగాశ్వముకు రక్షణగా వెంబడించాడు. హస్థినాపుర ప్రజలందరూ పురవీధులలో రెండు వైపులా నిలిచి అర్జునుడిని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదాలు వినయంగా స్వీకరిస్తూ అర్జునుడు యాగశ్వముకు రక్షణగా బయలుదేరాడు. అర్జునుడి వెంట యజ్ఞవల్క్య శిష్యుడు మరికొంత మంది బ్రాహ్మణులతో అర్జునుడి వెంట బయలుదేరాడు. యాగాశ్వము ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ త్రిగర్తదేశంలో ప్రవేశించింది. త్రిగర్తాధీశుని కుమారులు, మనుమలు ఉత్సాహవంతులై అశ్వమును పట్టడానికి ముందుకు ఉరికారు. అర్జునుడు వారితో అనునయంగా ఇలా చెప్పాడు. రాకుమారులారా ! ఇది ధర్మరాజుతో విడువబడిన యాగాశ్వము. దీనికి కీడుతలపెట్టిన అది ధర్మరాజుకు కీడుతలపెట్టిన దానితో సమానము. మనలో మనకు వైరము ఎందుకు సఖ్యతతో ఉంటాము. ధర్మరాజు నాతో మహాభారత యుద్ధములో రాజులందరూ మరణించారు. ప్రస్తుతము వారి కుమారులు మాత్రమే ఉన్నారు. నీవు వారిమీద దయ చూపించు. వారిని చంపవద్దు. వారికి మనమధ్య కల బంధమును వివరించి వారితో స్నేహబంధాన్ని వృద్ధి చేయ ప్రయత్నించు అని చెప్పాడు. కనుక నేను మీతో పోరాడను. మీరు కూడా ధర్మరాజుతో సఖ్యతను ఏర్పరచుకుని మీ ప్రాణములు రక్షించుకోండి. అని వినయంగా పలికిన అర్జునుడి మాటలను పెడచెవిన పెట్టిన త్రిగర్తాదీశుడు సూర్యవర్మ అర్జునుడి మీద శరవర్షము కురిపించాడు. అర్జునుడికి యుద్ధము చేయక తప్పలేదు కనుక సూర్యవర్మ బాణాలను మధ్యలోనే తుంచి వేసాడు. సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ అన్నకు తోడుగా యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు అతడి బాణములను కూడా మధ్యలోనే తుంచివేసి వారిని యుద్ధరంగము నుండి తరిమివేసాడు. తరువాత కేతువర్మ తమ్ముడు ధృతవర్మ అర్జునుడిని ఎదిరించి తన బాణకౌశలముతో అర్జునుడిని మెప్పించాడు. అర్జునుడు అతడి బాణములను మధ్యలో తుంచుతూ అతడిని వదిలివేసినా అతడు అర్జునుడి మీద వాడి అయిన బాణములు వేసి బాధించాడు. అర్జునుడు కోపించి అతడిమీద వాడి అయిన బాణ ప్రయోగము చేసాడు. అతడు అర్జునుడి చేతి మీద వేసిన బాణము దెబ్బకు అర్జునుడు గాండీవమును జారవిడిచాడు. అది చూసిన త్రిగర్తసేనలు హర్షధ్వానాలు చేసినా సైన్యాధీశులు మాత్రము అర్జునుడు ధర్మరాజు మాట మీద గాండీవము జారిపడినా ఊరుకున్నాడు కాని అర్జునుడు కోపించిన మనమంతా భస్మముకాక తప్పదు అని చెప్పి అర్జునుడికి ఎదురుగా వారంతా నిలిచారు. ఇంతలో అర్జునుడు కింద పడిన గాండీవమును చేత పట్టుకుని పిడుగుల వంటి బాణములను ప్రయోగించి త్రిగర్త సైన్యాలను పీనుగుపెంట చేసాడు. త్రిగర్తదేశ సైన్యాలు చెదిరిపోగా మిగిలిన వారు అర్జునుడిని శరణువేడారు. అర్జునుడు వారిని వెంబడించక వదిలివేసాడు. ఇలా అర్జునుడు త్రిగర్తసైన్యాలను జయించాడు. ఇటువంటి సన్నివేశాలతో అశ్వమేధ పర్వము గొప్పతనాన్ని పరిశీలిద్దాం.
2. అశ్వమేధ పర్వము - మార్గద్శకత్వం:
“ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తీయు - నర్థార్థులకు విపులార్ధములను
ధర్మార్థులకు నిత్య ధర్మ సంప్రాప్తియు - వినయార్తులకమహావినయమతియు
బుత్రార్థులకు,బహుపుత్ర,సమృద్ధియు- సంపదర్థుల కిష్టసంపదలును,
గావించుచెప్పుడు,భావించివినుచుండు- వారికి నిమ్మహాభారతంబు, .....
భక్తి యుక్తులైన భాగవతులకు”1 మరియు
భారతంబు మహాభాగవతంబు శ్రీ
వల్లభుండు భక్తవత్సలుండు
భవ భయంబులెల్ల బాపి యిష్టార్థసం
సిద్ధి గరుణతోడ జేయునట్లు”2
అంటూ మహాభారత ప్రాశస్త్యాన్ని నన్నయ అవతారికలో పేర్కొన్నాడు. ఏ కోరికతో భారత పట్టణ శ్రవణాలు చేస్తారో వారికి ఆ ఇష్ట సిద్ధి కలుగుతుందన్న విషయాన్ని తెలిపే పై పద్యం అక్షరాల అశ్వమేధ పర్వానికి సరిపోతుంది. ధర్మరాజు ఇష్టార్థసిద్ధి కోసం చేసిన మహా యజ్ఞం అశ్వమేధ యజ్ఞం.
మహాభారత ఆంధ్రీకరణకు పూనుకున్న నన్నయ పర్వ సంగ్రహాన్ని పేర్కొంటూ జయ భారతంలోని అశ్వమేధ పర్వ-అనుగీత పర్వాలను రెండింటిని ఒకటిగా కూర్చి అనువాదభారతంలో అశ్వమేధ పర్వంగా మలిచాడు. అశ్వమేధ యాగారంభంతోని ఈ పర్వం ప్రారంభం కావడం, కృష్ణుని అనుజ్ఞతో ధర్మరాజు యజ్ఞ నిర్వహణ కోసం కావలసిన సన్నాహాలు చేసుకోవడంతో పాటు యజ్ఞ నిర్వహణ చివరికి యజ్ఞ సమాప్తితో ఈ పర్వకత పూర్తవుతుంది. అందువల్ల దీనికి అశ్వమేధ పర్వం అన్న పేరు సార్ధకం చేసే తలపు నన్నయకు ఉన్నట్లు గ్రహించవచ్చు. శ్రీ వల్లభుడు అయిన విష్ణువు భక్తులను కాపాడినట్లుగా భారతం కాపాడుతుంది అన్న విశేష ప్రయోగం కూడా ఈ పర్వానికి సార్ధకమే. కృష్ణుడు దగ్గర ఉండి భక్తులైన ధర్మరాజాదులను కాపాడిన తీరు మహోదాత్తంగా వర్ణితమైన పర్వం అశ్వమేధ పర్వం.
అశ్వమేధ యజ్ఞ ప్రారంభం, సంవర్తుడుమరుత్తుల ఉపాఖ్యానం, స్వర్ణకోశ సంప్రాప్తి, ఉత్తర గర్భంలో అశ్వత్థామ అశ్ర ప్రభావంతో దగ్గుడైపోయి శ్రీకృష్ణుని చేత సంజీవితుడైన పరీక్షితుని జననం, అర్జునుడు అశ్వాన్ని అనుసరించడం, అనేకమంది రాజులతో అర్జునుడు యుద్ధం చేయడం, చిత్రాంగదా కుమారుడై బబ్రువాహనుడు అర్జునునితో యుద్ధం చేయడం, అశ్వమేధ మహాయజ్ఞంలో నకులోపాఖ్యానం అనుగీత, బ్రాహ్మణ గీత, గురు శిష్య సంవాదాలనే అంశాలు కలిపి ఈ పర్వం బహుభంగుల విస్తరిల్లింది. ఇందులోని ఉపాఖ్యానాధులన్ని అశ్వమేధ యజ్ఞం కొరకే కావటంతో ఈ పర్వానికి అశ్వమేధమనే పేరు సార్థకమైంది.
3. అశ్వమేధ పర్వం-నామ వైశిష్ట్యం:
అనేక అనుబంధ కథలతో కూడుకొని అశ్వమేధ వైశిష్ట్యంను చాటిన అశ్వమేధ పర్వం మహాభారతంలోని 18 పర్వాలలో 14వ ది. స్వర్గస్తుడైన భీష్మ పితామహునికి తిలోదకాలు అర్పించి బాధపడుతున్న ధర్మరాజును ఓదార్చడానికి భీమర్జునులు, ధృతరాష్ట్రుడు మొదలైన వారంతా ప్రయత్నిస్తారు. విదురుడు చెప్పిన హితం వినకపోవడం, సుయోధనుని దురహంకారం కారణంగా నా బుద్ధి కూడా ధర్మం తప్పడం వల్ల ఇంతటి ఘోరం సంభవించింది. గాంధారికి, నాకు నువ్వే దిక్కు కనుక నువ్వు శోకం మాని మమ్మల్ని శాంతింప చేయమని ధృతరాష్ట్రుడు ధర్మరాజును అర్తిస్తాడు.
యుద్ధంలో నీ బంధువులంతా ఉత్తమ గతులే పొందారు. వారికోసం నీవు దుఃఖించకూడదు. వ్యాస నారదాది మహర్షులు నీకు చేసిన ఉపదేశాలు గుర్తుచేసుకొని గొప్పదక్షిణలిచ్చి యజ్ఞాలు, అతిధి పూజలు చేయమని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు వ్యాసుని వైపు చూసి నమస్కరించి మీ ప్రేమాభిమానాలు మా పైన ప్రసరింపజేసి అనేక విధాలుగా మమ్మల్ని రక్షించారు. నాకు అరణ్యవాసం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి. లేనిచో పితామహుని, కర్ణుని చంపిన నాకు ప్రశాంతత కలగదు. ఈ పాప పరిహారం కోసం ఏదైనా మార్గాన్ని ఉపదేశించమంటాడు. అప్పుడు వ్యాసభగవానుడు ధర్మరాజా! నీ హృదయంలోని పాపకర్మ శంక తొలగిపోవాలంటే యజ్ఞ యాగాలు, దానాలతో పోగొట్టుకోవచ్చు. కనుక అధికంగా దక్షిణలిచ్చి అశ్వమేధ యాగం చేసి నీ మనస్థాపాన్ని పోగొట్టుకోమని చెపుతాడు. రఘురాముడు, పూరుడు , భరతుడు మొదలైన సార్వభౌముల లాగానే నువ్వు కూడా దానతత్పరుడవు కమ్మని ఉపదేశిస్తాడు.
అశ్వమేధ యాగం రాజుల పాపాలు పోగొట్టగల శక్తివంతమైందని నేను కూడా విన్నాను. కనుక మహానుభావా! నువ్వు చెప్పినట్లే యాగాన్ని నిర్వహిస్తాను. కానీ అశ్వమేధానికి అవసరమైన భూరి దక్షిణలు ఇవ్వటానికి నా వద్ద ధనం లేదు. యుద్ధంలో మరణించిన నరపతుల సతులు, సుతులు శోకంలో ఉన్నారు కనుక వాళ్ళధనం ఉపయోగించడం న్యాయం కాదు. అదీకాక దుర్యోధనుడు దుష్టులందరినీ ఒకచోట చేర్చి అధికంగా ధన వ్యయం చేశాడు. అందువల్ల ఎక్కడా ధనం సంపాదించే మార్గం లేదు. దయచేసి మార్గం చూపించమని ధర్మరాజు వ్యాసున్ని వేడుకుంటాడు.
వ్యాస మహర్షి కొంచెం ఆలోచించి ముత్తుని యజ్ఞంలో బ్రాహ్మణులు వారికి ఎక్కువ వదిలిన ధనం హిమాలయంలో ఉందని, అది స్వేచ్ఛగా వాడుకోమని సూచించి ధర్మరాజు కోరిక మీద మరుత్తుని చరిత్రను వివరిస్తాడు. అయినా శోకం వీడని ధర్మరాజుతో వాసుదేవుడు రాజా! లోలోపల దుఃఖపడుతుంటే నిర్మల కర్మానుష్టానం సాధ్యపడదు అంటూ వృత్రాసుని కథ వినిపిస్తాడు. నిష్కామంగా యజ్ఞాచరణ చేయమంటాడు. మిగిలిన నారదాది ఆప్తులు కూడా ధర్మరాజుకు హితోపదేశం చేస్తారు. సుక్షత్రియ ధర్మంతో రాజ్యపాలన చేయమని చెపుతారు దాంతో ధర్మరాజు దు:ఖోపశమనం పొంది అశ్వమేధ యజ్ఞ నిర్వహణకు పూనుకుంటాడు. వ్యాసుడు వెళ్లిన తర్వాత ధృతరాష్ట్రునితో కలిసి భీష్మునికి ఉత్తరక్రియలు పూర్తి చేసి హస్తినాపురం చేరుతాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుని అనుమతితో రాజ పాలన చేయడం ప్రారంభిస్తాడు.
కృష్ణుడు ద్వారకకు వెళ్లడం కోసం ధర్మరాజును అనుమతి కోరే సమయంలో అర్జునుడు తనకు యుద్ధ సమయంలో చేసిన బోధను మరోసారి చెప్పమని ప్రార్థిస్తాడు. మరోసారి ఉపదేశించడం సాధ్య కాదని కృష్ణుడు సిద్ధ, కాశ్యపుల సంవాదాన్ని, పరశురామ వృత్తాంతాన్ని, యమజనక సంవాదాన్ని, కూడుకున్న విప్రదంపతులు సంవాదం చెబుతాడు. కృష్ణార్జునలు హస్తినాపురానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఉదంక మహామునిని సందర్శించి అతనికి కృష్ణుడు విశ్వరూప సాక్షాత్కారాన్ని కలిగించాడు. ఉదంకుడు కృష్ణుని చూసి ఆశ్చర్య చకితుడౌతాడు. తన మహాత్భాగ్యానికి అమితానందం చెంది 'నమః పురుషోత్తమా యతే 'అంటూ ప్రార్థన చేస్తాడు.
“పుండరీకాంక్ష! యీభువనమంతయు- భవత్పాదపంకేరుహవ్యాప్తమయ్యే,
నంబరం బెల్లను నావృతమయ్యే నీ- మహిత సముజ్వలమస్తకముల
నంతరిక్షము తావకాద్భుతకుక్షి- దేశంబుల చేసంచన్నమయ్యే
భవదీయ మహనీయ బాహర్గళా నిచయా - పిహితములయ్యేనన్నిధిశలు”3 మరియు
బహు చరణముల బహుశిరోభాగముల ను
బహుజఠరముల బహు భుజా ప్రకరములను
దేవ యిట్లు సర్వంబును నీవయై త
నర్చితిది నాదు తను మనంబు దనిపె”4
అంటూ కృష్ణుని విశ్వరూపాన్ని వర్ణిస్తూ చేసిన ప్రార్థన మనోహరంగా సాగుతుంది. ఆ తర్వాత కృష్ణుడు ద్వారకానగరం చేరుకొని దేవకి వసుదేవులకు, బలరాముడికి నమస్కరిస్తాడు. వసుదేవుని కోరికపై రణవృత్తాంతాన్ని సంగ్రహంగా వివరిస్తాడు అభిమన్యవదా వృత్తాంతాన్ని విని అందరు దుక్కిస్తారు.
ధర్మరాజు అశ్వమేధ యాగ నిర్వహణ కొరకై కావలసిన హిరణ్య స్వీకరణ కోసం హిమవత్పర్వత ప్రాంతాలకు బయలుదేరి దేవపితృ పూజలు ఆచరించి, శచిపతిని అర్చించి వ్యాసము నీ కర్తవ్య బోధతో మహర్షులను, తమ్ములను కలుపుకొని నిధిని సొంతం చేసుకుంటాడు.
ద్వారకా నగరం నుండి అందరూ హస్తినాపురానికి చేరుకుంటారు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామ కాస్త్రానికి ప్రాణాలు కోల్పోయిన ఉత్తర గర్భస్థుడైన పరీక్షిత్తుని కృష్ణుడు బ్రతికిస్తాడు. అశ్వమేధ యజ్ఞం నిర్వహణ కోసం ప్రయత్నాలు ప్రారంభించి, అశ్వమేధ అశ్వం వెంట వెళ్ళమని అర్జునుని నియమిస్తాడు కృష్ణుడు. అర్జునుడు అశ్వాన్ని అనుసరిస్తూ త్రిగర్త దేశాధీశులతోనూ, సింధు దేశాధిపతితోను సంగ్రామం చేస్తాడు. తన కుమారుడైన బబ్రువాహనుని చేత కొట్టబడి భూమిపై కూలిన అర్జునుడు సంజీవని మనిచేత మరలా జీవిస్తాడు.
అటు పిమ్మట జరాసంధుని కుమారుడు మేఘసంది. శిశుపాలుని కుమారుడు ఏకలవ్యుని కుమారుడు మొదలైన వారందరినీ వశపరచుకొని, పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక అధిపతులను ఓడించి, గాంధార దేశంలో శకుని కుమారుడిని శమింపజేసి సమస్త దేశాలలోనూ యదేచ్ఛగా తిరిగి వచ్చిన అశ్వం వెంట హస్తినాపురానికి చేరుతాడు అర్జునుడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడం, ఆ పరంపరలో అర్జునుడు అశ్వమేదాశ్వాన్ని అనుగమించి జయయాత్ర చేసి యజ్ఞ పరిసమాప్తికి తోడ్పడటం వివరించింది కనుక ఈ పర్వం అశ్వమేధ పర్వంగా పేర్కొనబడటం సముచితమై ఇతివృత్త వైశిష్యాన్ని చాటుతుంది.
తిక్కన రచనలో ఇతివృత్త కథనం ఎంత నాటకీయ శిల్పాన్ని కలిగి ఉందో అశ్వమేధ పర్వం చక్కగా నిరూపిస్తుంది. తెలుగువారి పలుకుబడిని, ధైర్యసహసాలను వెల్లడిచేసిన ఇతివృత్తం అనేక ఉపకథలతో కూడి అలరారింది.
4. ఉపదేశ వైశిష్ట్యం:
యుద్ధ సమయంలో వినిపించిన ప్రబోధాత్మకమైన విషయాలు మరలా వినిపించమని అడిగిన అర్జునునితో ఆ విషయాలు చర్విత చర్వణం చేయకూడదన్న శ్రీకృష్ణుడు, తత్వ జ్ఞాన స్థిరీకరణాది విశేషాలు వివరిస్తాడు. కాశ్యకుడు అని బ్రాహ్మణునికి ఒక సిద్దయోగి వివరించిన తత్వాన్ని చెపుతాను వినుమని కృష్ణుడు ఉపదేశిస్తున్నట్లుగా అశ్వమేధ పర్వంలో ఉపదేశించబడింది. శరీరం ధర్మసాధనము, ధర్మానుష్టానం వలన లోలోపల విజ్ఞాన జ్యోతి ప్రాధూర్భవిస్తున్నది. కనుక శరీర ఆరోగ్యం విషయమై మానవుడు ఎప్పుడూ ఏమరరాదు. ఇది మిక్కిలి ఆత్మహితకరమైన పద్ధతి. మానవునికి ఏమరపాటు కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. చెబుతాను వినుమన్న సిద్దుడు కశ్యపునితో-
“తన సత్వమును బలంబును దన కయ్యేడు కాలంబు నారయగాదలంప
డాహారములుగొను నవియును నగునవి గానివి యనువివేకంబు బుద్ధి
జోనుపడు బహుళభోజన మొక మరి చేయు నొకమరి దుర్నిష్ట నుపవసించు
గలకాలమును నపక్వంబును గురు దుష్ట విషమ విరుద్ధము విపుల రసము”5
“నైనయన్నము దా నరయక భుజించు,
గడుపుపై గుడ్చు, దిననిద్రగూరు సురత పరతనొందు,బెల్లాయాసపడు విమూడు
డతని బాధించు దోషత్రయంబు గెరలి”6
అంటూ వివరించాడు. మానవుడు చేసే విచక్షణారహిత కర్మల వల్ల ఏమరుపాటు పొందగలడన్న పై పద్యం కవి పరిశీలనా శక్తిని, శాస్త్ర జ్ఞానాన్ని వెల్లడిస్తుంది.
ఆత్మ నిగ్రహం మాట మరచిపోయి లేనిపోని పనులతో మిక్కిలి ఆరాటపడుతూ మూఢుడుగా విహరించే వానిని వాత, పిత్త, శ్లేష్మాది రోగాలు అనుదినం పీడిస్తున్నాయి. అనుచిత భోగాలపై విపరీత ఆసక్తి కలిగిన శరీరంలో సుదీర్ఘ రోగాలు ఉదయిస్తాయి. ఎడతెగని కామ కోప ఆవేశాల వల్ల దేహం కుంగి కృషిస్తుంది. పైత్య వికారం లోపల విజృంభించడం వల్ల శరీర మర్మాలన్నింటినీ నాశనం చేసి చివరకు ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. స్లేష్మం అధికం కావడం వల్ల అవయవాలన్నింటికీ జడత్వంతో పాటు, దేహానికి వైవర్యం వస్తుంది. క్రమంగా ఆ శ్లేష్మం కుత్తుకకు అడ్డుపడి ఊర్ధ్వశ్వాసను నిరోధించడం వల్ల జీవుడు నిలువలేక మరణిస్తాడు. వాతం ప్రకోపించి శరీరంలో నలువైపులా వ్యాపించి విపరీతమైన వేదన, దుస్సహాయమైన రుగ్మతలను కలిగిస్తుంది. అందువల్ల శరీరం పట్టు తప్పిపోయి మానవుడు మరణించే వరకు దారితీస్తుంది.
వాత పిత్త శ్లేష్మాధులు కూడా వ్యాపిస్తే అది దారుణ సన్నిపాతమై చిట్టచివరకు చికిత్స లేమి చేత ప్రాణాలు హరిస్తాయి.
“ఆదిసృష్టి బ్రధానమను తత్త్వ మంబుజా, సనుండు కల్పించి చేతనమొనర్చే
క్షరమండ్రుదాని దత్పర మగు తత్త్వంబు,నక్షరమనియును నమృతమనియు
నార్యులు చెప్పుదు రమ్మిథనంబున, యందు సంపన్నంబు లఖిలభూత
జాలంబులకును సంజనకంబులైన బీ, జము, లిదిశ్రుతి వాక్యసంభ్రుతార్థ”7
మరియు
“మతడు కలిగించే, గమనమునాగమనము
జీవరాశికి గావున నావిధమున
నది భ్రమించుచునుండు బుణ్యాతిశయము
కతన జీవాత్ముడొకడు తన్ గాంచినపుడు”8
అని తత్వ జ్ఞాన విశేషాలను వివరించిన తీరు హృదయంగమం. బ్రహ్మ మొట్టమొదట సృష్టి చేసినప్పుడు ప్రధానమని తత్వాన్ని సృష్టి చేసి దానికి జీవచైతన్యాన్ని ప్రసాదించాడు. దానికే ’క్షరము’ అని పేరు. దానికన్నా అధికమైన తత్వమే అక్షరమని, అమృతమని ఆర్యులు పేర్కొంటారు. సమస్త ప్రాణికోటి సృష్టికి ఆదిహేతువులైన బీజాలు ఆ అక్షరాలలోనే అంతర్నిహితాలుయ్యాయి. వేద వాక్యాలలోని పరమార్ధం ఇదే. అని తెలిపి జీవుడు కర్మ పరత కేవలం జాడ్యం అని విస్పష్టంగా గ్రహించిన తర్వాత మోక్షాన్ని చేరుతాడు. చివరకు శ్రీకృష్ణుడు అర్జునునితో ఆ సిద్దుడిని నేనేనని చెప్పి ఇంకా జీవాత్మ పరమాత్మల సంబంధాన్ని ఉపదేశిస్తాడు. బ్రహ్మ విద్యా రహస్యాలను, మోక్ష సాధక విషయాలను సూటిగా ఉపదేశం చేసి అటు పిమ్మట బ్రాహ్మణ గీతలను, అంతర్యాగ ప్రకారములను వివరిస్తాడు. ఇంద్రియాలకు, మనసుకు కలిగిన సంవాద సారాంశాన్ని వినిపిస్తాడు. మనసు సుస్థితిని పొందితే ముక్తిని కలిగిస్తుందని చెప్పి, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవ దత్త ధనంజయాది దశ వాయువుల స్థితిని అవి తిరుగాడే విషయాలను సవివరంగా వివరిస్తాడు.
జీవాత్మ స్వరూపాన్ని నిరూపించి, మనసు, బుద్ధి, అహంకారాది తత్త్వాలను కూడా సవిస్తారంగా ఉపదేశిస్తాడు. అవ్యక్త నామతత్వ వివేచన చేస్తూ సృష్టిలో ఏదీ దేనికంటే శ్రేష్టమో, ఎందుకో చక్కగా వెల్లడిస్తాడు శ్రీకృష్ణుడు. సత్య పరిపాలనా విశిష్టాన్ని ఉపదేశించడంతో అశ్వమేధ పర్వంలోని ఉపదేశ వైశిష్ట్యం వెల్లడి కాగలదు.
భారతంలోని అశ్వమేధ పర్వానికి గల విశిష్టతలో ఉపదేశ విశిష్టత పేర్కొనదగిన స్థానాన్ని పొందింది. అసలు జీవాత్మ తత్వాన్ని మొత్తం కడు విపులంగా చక్కని నాటకీయ ధోరణిలో ఉపదేశించిన అశ్వమేధ పర్వం ఉపదేశ బోధనాపరంగా మహిమాన్వితమై మానవ మేధస్సును పదును పెట్టగలధనటం సముచితం. మానవుడు చేయవలసిన అతిథి పూజ, దేవతార్చన మొదలైన ఆధ్యాత్మిక, సాంప్రదాయాది విలువలను సైతం ఈ పర్వం చక్కని ధోరణిలో తెల్పి భారతీయ సనాతన ధర్మాలను, సంప్రదాయాలను పాఠకుల కందించి పంచమ వేదంగా భారతాన్ని నిలిపిందనటానికి ఈ అశ్వమేధ పర్వం ఒక చక్కని ఉదాహరణ.
5. ముగింపు:
సశాస్త్రీయంగా, సర్వాంగ సుందరంగా, మనోహరంగా నిర్వహించబడిన అశ్వమేధ యజ్ఞ నిర్వహణ అనంతరం జరిగిన సువర్ణ, భూ, గో దానాదుల వివరం, వాటి వైశిష్ట్యం తెలిపి ఆ తరువాత అతిథి పూజా వైభవాన్ని చక్కగా అశ్వమేధ పర్వం తీర్చిదిద్దింది. ఈ పర్వం యావత్తు ప్రసన్నమైన కథా కథన ధోరణి ప్రస్ఫుటమౌతుంది.
అంతేగాక ఈ పర్వం రాజరిక లక్షణాలను, శాస్త్రీయ పాలనను, ధర్మాచరణ వైశిష్యాన్ని తెలుపుతూ మహాభారతం ధర్మశాస్త్రంగా కీర్తి పొందటానికి సంపూర్ణ అవకాశాన్ని కల్పించింది. అడుగడుగునా ఉపదేశాత్మకము, ప్రబోధాత్మకము అవుతూ ఈ పర్వం భారతానికి కావ్య లక్షణాన్నీ అద్ది మహాభారతం మహాకావ్య శాస్త్రమన్న విమర్శకుల భావనలను నిజం చేస్తుంది. ఇటువంటి క్రతులనేకంగా మహాభారతంలో నిర్వహించినట్లు తెలిపిన ఈ అశ్వమేధ యాగ విషయం మాత్రం అనేక సందర్భాల్లో ప్రయోగించబడటం, అదే పేరుతో ఒక పర్వాన్ని సైతం రచించడం వల్ల అశ్వమేధ యాగ విశిష్టతతో పాటు అశ్వమేధపర్వ వైశిష్ట్యం వెల్లడవుతుంది.
తిక్కన 14 పర్వాలను ఒక కోణంలో అనువదించినప్పటికీ అశ్వమేధ పర్వాన్ని మాత్రం మహోన్నతంగా తీర్చిదిద్దాడు అనడానికి అడుగడుగున ఈ పర్వంలో ఉపదేశాత్మకమైనటువంటి భావవ్యక్తీకరణ, హేతువాద దృక్పథం నన్నయ నుంచి పునికి పుచ్చుకున్న సూక్తివైచిత్రి, రసాత్మకతను కూడా నాటకంగా రూపొందించి ప్రస్తుత సమాజంలోని పాఠకులకి రచన వైశిష్టాన్ని మరియు రచన అంటే ఏమిటో స్పష్టంగా వివరించారనిపిస్తుంది. మహాకవి తిక్కన భావోద్వేగాన్ని అర్థం చేసుకుని, నాటికీయ మైనా రచనను మరియు ఉపదేశాత్మకమైన రచనను చేసే ప్రయత్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.
6. పాదసూచికలు
- నన్నయ,ఆంధ్రమహాభారతం, ఆదిపర్వం,మొదటి ఆశ్వాసం, పుట. 12
- నన్నయ,ఆంధ్రమహాభరతం, ఆదిపర్వం, మొదటి ఆశ్వాసం, పుట. 13
- తిక్కన, ఆంధ్రమహాభరతం, అశ్వమేదపర్వం తృతీయ ఆశ్వాసం, పుట. 300
- కవిత్రయం భారతం అశ్వమేధపర్వం తృతీయ ఆశ్వాసం, పుట. 327
- తిక్కన కావ్యశిల్పం, పుట. 101
- తిక్కన శిల్పము తెలుగుతోట పుట. 111
- తిక్కన, ఆంధ్రమహాభారతం పుట. 401
- తిక్కన, ఆంధ్రమహాభారతం పుట. 402&403
7.ఉపయుక్తగ్రంథసూచి:
- కాటంరెడ్డి, వెంకటరెడ్డి (2010). అధ్యాపకవిజయం అక్షర కోచింగ్ సెంటర్, కర్నూల్.
- తిక్కన (1992). ఆంధ్రమహాభారతం, తెలుగు అకాడమీ, హైదరాబాదు.
- దామోదరనాయుడు, క్రోసూరు. (2001). కవిత్రయభారతం,ప్రతిపర్వవివేచనం,
- నీలిమప్రింటర్స్, గిద్దలూరు.
- నన్నయ. (1996). ఆంధ్రమహాభారతం, తిరుమల దేవస్థానవిద్యా పీఠం, తిరుపతి.
- నన్నయ. (1990). ఆంధ్రమహాభారతం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
- రామకోటి శాస్త్రి, కేతవరపు. (1997) తిక్కన కావ్యశిల్పం, రాఘవేంద్ర పబ్లికేషన్స్, కడప.
- సత్యనారాయణ, విశ్వనాథ. (1998) తిక్కన శిల్పముతెలుగుతోట, విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ.
- సత్యవతి, తేళ్ళ. (2004). అశ్వమేధపర్వాధిపత్యం, విశాలాంధ్రపబ్లికేషన్స్, విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

