AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. గురజాడ రచనలు: సామాజికమైన మార్పు
డా. కె. మమత
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు
భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ &ఆర్ట్స్, కాచిగూడ,
హైదరాబాద్, తెలంగాణ
సెల్: +91 9440402691, Email: mamathatelugu1@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సామాజిక మార్పును తన రచనల ద్వారా కోరుకొని ఆ వైపు ఆలోచనాత్మకమైన అడుగులను ఆధునిక యుగం తొలి నాళ్ళలోనే వేసిన మహా కవి గురజాడ అప్పారావు. సంఘ రుగ్మతలను రూపుమాపేందుకు తన రచనలను బలమైన ఆయుధాలుగా మార్చి పోరాటం జరిపిన సాహిత్య సమరశీలి. అనాగరికతలను ధైర్యంగా ప్రశ్నించి ప్రతి మనిషిలో స్వదేశాభిమానాన్ని ఉరకలెత్తించిన అభ్యుదయ కవి. చైతన్యాన్ని కవిత్వానికి ఊపిరిగా మలచి ప్రజలకు మార్గదర్శనం చూపిన జనజాగృత సూత్రధారి గురజాడ. కన్యాశుల్కం నాటకం, దిద్దుబాటు వంటి కథల ద్వారా పరిపూర్ణమైన పరిణామాన్ని సంఘం నుండి ఆకాంక్షించిన సంస్కర్త. వ్యవహారిక భాషా వినియోగానికి తన రచనల్లో అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన భాషా యోగి. పరిశోధకునిగా, కవిగా సమాజపు లోతుల్ని విశ్లేషనాత్మకంగా అర్థం చేసుకొని తన రచనల ద్వారా పరిష్కారాలను నిర్దేశించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నవ్యాంధ్ర సాహిత్య యుగకర్తగా భావంలో, భాషలో సంఘ సంస్కరణకు దారులు వేసిన మహనీయుడు. కన్యాశుల్కంలో మధురవాణి మనస్తత్వం, గిరీశం లౌక్యం, విస్తృతమైన భాషా పరిజ్ఞాన చమత్కారం గురజాడలోని అతీతమైన నాటకీకరణ శక్తిని నిరూపించాయి. తన సాహిత్యంతో సాంఘీక దురాచారాల నిర్మూలనకు పూనుకున్న గురజాడ దార్శనికుడు. కొండు భట్టీయం వంటి నాటకాలలో వాడుక భాషను ఆయన వినియోగించిన తీరు ప్రత్యేకంగా పేర్కొనదగింది. పూర్ణమ్మ, కన్యక వంటి గేయాలను గుండెను తాకే భావాలతో గురజాడ మలచిన తీరు ఎంతో ఆలోచనాత్మకం. ముత్యాల సరాలు వంటి గురజాడ రచనలు ఆధునిక వచన రచనా వికాసానికి ఎంతో తోడ్పడ్డాయి. చైతన్య శీలతను రంగరించుకొని మానవతా స్పర్శతో, అభ్యుదయ చేతనతో తన రచనను సామాజిక మార్పుకు ఆయుధంగా మలచిన మహనీయ కవి గురజాడ.
Keywords: గురజాడ, నాటకాలు, వ్యవహారభాష, సంఘసంస్కరణ, సమాజోద్ధరణ.
1. ఉపోద్ఘాతం:
తన రచనలతో తెలుగు సాహిత్యాన్ని మార్గనిర్దేశనం చేసిన ఆధునిక యుగపు మహాకవి గురజాడ అప్పారావు. సామాజిక మార్పును కోరుకొని అదే లక్ష్యంతో చైతన్యవంతమైన, ఆలోచనాత్మకమైన రచనలు చేసి రుగ్మతలను రూపుమాపేందుకు దోహదపడ్డ సంస్కర్తగా ఆయన ముద్ర బలీయమైంది. మారాల్సిన సమాజం కోసం ఆధునిక యుగం తొలినాళ్ళలోనే పోరాటం చేసేందుకు తన రచనలను తిరుగులేని అస్త్రాలుగా ఎక్కుపెట్టిన సమరశీలి. అనాగరికతలను నిలేసిన, మహాదార్శనికుడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రతి గుండెలో స్వదేశాభిమానాన్ని మొలకలెత్తించిన మహనీయుడు.
చైతన్యశంఖం పూరించిన కవిగా ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని హెచ్చరించారు. వట్టిగొప్పలు చెప్పడం కన్నా పూనుకొని ఏదైనా ఒక మేలు చేసి చూపమని ప్రజలకు నిర్దేశించిన అభ్యుదయశీలి. జనజాగృత సూత్రధారిగా తన దేశభక్తి గేయ పంక్తుల ద్వారా గురజాడ కనిపిస్తారు. దేశాన్ని ప్రేమిస్తూ మనుషుల మధ్య మంచిని పెంచమని సందేశించిన సంస్కరణశీలి. కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, నీపేరేమిటి, మాటామంతీ వంటి ఎన్నో రచనల ద్వారా ఆ నాటి సామాజిక దుస్థితిని వెల్లడించి అవసరమైన మార్పుకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు. గురజాడ కన్యాశుల్కం నాటకం ఎంతో ప్రజాదరణను పొంది ఆయన పేరును చిరస్థాయిగా నిలిపింది. దిద్దుబాటు కథ గురజాడలోని రచనా పరిపూర్ణతకు, ఆధునికతకు నిదర్శనంగా నిలిచింది.
వ్యవహారిక భాషకు తన రచనలలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిన మహాకవి గురజాడ. బెంగాలీకి ఠాగూర్లా తెలుగులో వ్యవహారిక భాషా వినియోగానికి గురజాడ ఎంతో తోడ్పడ్డారు. రచయిత గానే కాకుండా గురజాడ చరిత్రకారులుగా కూడా పేరొందారు. ఆనంద గజపతి తాళపత్రాలు, శాసనాల పరిష్కరణ కోసం గురజాడనే ప్రత్యేకంగా నియమించారు. కవిగా, పరిశోధనకునిగా, అధ్యాపకునిగా, చరిత్రకారునిగా సమాజ సంస్కర్తగా బహుముఖంగా భాసించిన ప్రజ్ఞాశీలి.
2. గురజాడ జీవనరేఖలు:
గురజాడ విశాఖపట్నం జిల్లా రాయవరం గ్రామంలో 21 సెప్టెంబరు 1862లో వెంకటరామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. విజయనగరంలోనే దాదాపు ఆయన జీవితం గడిచింది. చీపురుపల్లిలో విద్యాభ్యాసం జరిగింది. తండ్రి మరణంతో గురజాడ చంద్రశేఖర్ శాస్త్రి అనే ఒక కళాశాల ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో విద్యాభ్యాసాన్ని కొనసాగించి పూర్తి చేశారు. 1894లో ఎంఆర్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేసి విధులను నిర్వహించారు. పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా 1887వ సంవత్సరంలో విజయనగరలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని అనర్గళంగా మాట్లాడారు. 1888లో విజయనగరంలోని వాలంటరీ సర్వీస్ కార్ప్స్ లో సభ్యునిగా పనిచేశారు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1891లో గురజాడకు లెక్చరర్గా పదోన్నతి లభించింది. 1911లో మద్రాస్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యులయ్యారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ కార్యక్రమాలలో కూడా కీలక భూమిక నిర్వహించారు.
3. గురజాడరచనలు- సామాజికత:
నవ్యాంధ్ర సాహిత్య యుగకర్తగా భాషలో, భావంలో విప్లవాన్ని రగిల్చిన సాహిత్యకారుడు గురజాడ. సంఘసంస్కరోణద్యమాన్ని బలపరచడానికీ, తెలుగు భాష నాటకరంగానికి అనుకూలమైనది కాదన్న అపోహ నెదుర్కోవడానికీ, నేను కన్యాశుల్కాన్ని రాశాను అని ఆ నాటక పీఠికలో స్వయంగా ఆయనే రాశారు. కన్యాశుల్కం నాటకంలో ఎంతో కీలకమైన మధురవాణి, గిరీశం వంటి పాత్రలను సృష్టించి ఆ పాత్రల ద్వారా ఆనాటి సామాజిక దుస్థితిని, పరిస్థితులను గురజాడ స్పష్టంగా వెల్లడించారు. మధురవాణి మనస్తత్వం, గిరీశం లౌక్యం, అంతులేని భాషా పరిజ్ఞాన చమత్కారం గురజాడలోని అసమానమైన నాటకీకరణ శక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. అలా తన సాహిత్యం ద్వారా సంఘంలోని దురాచార నిర్మూలనకు పూనుకున్నారు.
నిజానికి తెలుగులో కన్యాశుల్కం వంటి చక్కని నాటకం మరొకటి రాలేదన్నది విమర్శకులు, పండితులే అభిప్రాయపడ్డారు. ప్రదర్శనాయోగ్యంగా ఉండేందుకు కన్యాశుల్కాన్ని ఆయనే సంక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. ఇంకో నాటకం కొండు భట్టీయం కూడా ఆయన ప్రతిభకు ఉదాహరణగా నిలిచింది. వాడుక భాషను నాటకాలలో ఎంతో అద్భుతంగా అప్పారావు వినియోగించారు. గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాషాకృషిని నిజం చేస్తూ అప్పారావు వాడుక భాషలో చక్కని రచనలు చేసి ఆయన మార్గాన్ని ఎంతో సుగమం చేశారు. కొత్త పాతల మేలు కలయికగా కమ్మని తెలుగుదనం ఉట్టిపడే శబ్దంతో అప్పారావు రచనలు ఆ రోజుల్లో ఎందరినో ఆకట్టుకున్నాయి. సూటిగా గుండెను తాకే భావాలతో పూర్ణమ్మ, కన్యక వంటి గేయాలను ఆయన రచించారు. హృదయం జలదరించి కన్నీరు కార్చే పరిస్థితిని పాఠకులకు ఆ రచన కలిగించింది.
గురజాడ “కాసులు” అన్న ఖండ కావ్యంలో -
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును/ ప్రేమనిలిపిన ప్రేమ నిలుచును
అంటూ ఆదర్శ ప్రేమ అంటే ఏమిటో చక్కగా చెప్పారు. సంఘ సంస్కరణ ప్రియుడైన భర్తను ఒక సామాన్య కుటుంబంలోని స్త్రీ ఏ విధంగా భావిస్తుందో ముత్యాల సరములులో అత్యంత సహజంగా చిత్రించారు. అమాయకత్వంతో ఆ స్త్రీ మాటలు వింటే పాఠకునికి క్రోధం రాకపోగా వర్ణాశ్రమ ధర్మ శృంఖలాలు ఆమెను ఎంతగా బంధించి వేశాయో తెలిసి జాలి కలుగుతుంది. లవణ రాజుకల జ్ఞాన వాసిష్టం లోనిదేనైనా గురజాడ దానికి అపూర్వ శోభను సమకూర్చారు. అవాస్తవికమైన విషయమైనప్పటికీ దానిని చదివినంత సేపు పాఠకుడు వాస్తవిక జగత్తులోనే విహరిస్తున్న అనుభూతిని పొందుతాడు. గ్రీక్ కథను కథా వస్తువుగా తీసుకొని రచించిన డామస్ పితియన్ అన్న పద్య కథానికలో ఆదర్శమైత్రి ఎలా ఉంటుందో చెప్పారు. లంగ రెత్తుము, దించు లంగరు అనే రెండు ప్రథమ ప్రపంచ యుద్ధ జ్వాలలు ఆవహించిన కాలంలో రాసినవి. ఆంధ్ర భాషకు ముత్యాలసరం అనే చక్కని ఛందస్సును గురజాడ అందించారు. ప్రజల వాడుక భాషలో ఉండి, మృదు మధురమైన పదాల పొందికతో, ఇంపు సొంపులు కలిగిన గురజాడ ముత్యాల సరాలు ఆంధ్ర భాషా వధూటికి మహోజ్వల మణిహారంగా భాసించాయి.
అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయి, మందగించక ముందు అడుగేయి/ వెనకబడితే వెనకేనోయ్
అని దేశభక్తి గీతంలో హెచ్చరించి ఎప్పటికప్పుడు నూతనోత్సాహాన్ని గురజాడ నింపారు. బంకిం చంద్రుని వందే మాతరం, రవీంద్రుని జనగణమన, ఇక్బాల్ హిందుస్తాన్ హమారా వంటి ప్రసిద్ధ గీతాలు దేశంను ప్రేమించుమన్న గీతానికి పోలికకు రావన్న చర్చ కూడా సాగింది. ఏదేమైనా 1910లో గురజాడ రాసిన దేశభక్తి గీతం పల్లెపల్లెలో మారుమ్రోగింది. ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలుకగా ఆ పలుకులు విని దేశాభిమానం పొంగులెత్తిన విధంగా దేశభక్తి గీతానికి యువతరం నీరాజనం పట్టింది.
4. ముగింపు:
నిండైన మానవతావాదిగా, నిరంతర అధ్యయనశీలిగా, నిత్యనూతనునిగా తన అన్ని రచనలలో గురజాడ విశిష్టంగా వెలుగొందారు. గురజాడ రచించిన కన్యాశుల్కం ఎంతో మందిని ఆలోచింపజేసి ఈ దురాచారాన్ని సమాజం నుండి తరిమేసేందుకు ఎంతో తోడ్పడింది. ఆధునిక వచన రచనా వికాసానికి, తెలుగు భాషాభివృద్ధికి ముందుండి తన సమకాలికులకు, తదనంతర తరాల వారికి గొప్ప మార్గదర్శనం చేశారు. 1913లో పదవీ విరమణ చేశాక కొంత కాలానికి అనారోగ్యం పాలయ్యారు. 30 నవంబర్ 1915వ సంవత్సరంలో తన 54 సంవత్సరాల వయస్సులో గురజాడ మృతి చెందారు. సమూల సామాజిక మార్పును కోరుకున్న చైతన్యశీలత ఉన్న మహాకవిగా, సంఘ సంస్కర్తగా, ఆలోచనాశీలిగా, అభ్యుదయ వాదిగా, మానవతావాదిగా గురజాడ స్థానం ఎంతో విశిష్టమైంది.
5. ఆధార గ్రంథాలు :
- అప్పారావు, గురజాడ. (2015). దేశభక్తి తదితర గేయాలు. శత వర్ధంతి ప్రచురణ. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ.
- గురజాడ సాహిత్య సర్వస్వం. (2012). తెలుగు అకాడెమి, హైదరాబాదు.
- చంద్రశేఖర్రెడ్డి, రాచపాళెం. (2008). కొన్ని కావ్యాలు- కొందరు కవులు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
- చంద్రశేఖర్రెడ్డి, రాచపాళెం. (2012). విమర్శ-2011. చినుకు ప్రచురణలు, గాంధీనగర్, విజయవాడ.
- నారాయణరావు, వెల్చేరు. తెలుగులో కవితా విప్లవాలు స్వరూపం.విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
- రవి, తెలకపల్లి. (2015). గురజాడ యుగస్వరం. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ.
- రవి, తెలకపల్లి. (2015). దార్శినికుడు గురజాడ. సంకలనం. ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

