headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. ‘బండి’ నవలలు: మాండలిక ప్రయోగాలు

బుక్కే ధనక నాయక్

పరిశోధకులు, తెలుగు & ప్రాచ్యభాష విభాగం,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నాగార్జున నగర్,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8187056010, Email: dhanakanaikbukke111@gmail.com
DOWNLOAD PDF


వ్యాససంగ్రహం:

పాఠకుడు ఒక రచనను చదివి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే భాష అవగాహన ఎంతో అవసరం. అంటే పాఠకుడికి ఆ రచన యొక్క భాష కచ్చితంగా తెలిసి ఉండాలి అని అర్థం. తెలుగు భాషా చరిత్రలో భాష పొందిన పరిణామాలు చాలానే ఉన్నాయి. కొన్ని శతాబ్దాలు కావ్యభాష లేదా పండిత భాష పాఠక లోకానికి యమపాశంలా చుట్టుకుంది కారణం కావ్యభాష సాధారణ వ్యక్తికి అర్థం కాకపోవడమే. కానీ రానురాను కావ్యభాష అంతరించి వ్యవహారికభాష మౌఖికంగానూ రచన సాహిత్యంలోనూ విస్తరణ జరిగింది. దీని ద్వారా సాధారణ వ్యక్తికి కూడా ఈ భాష అర్థం అవుతుంది. ప్రధాన కారణం మాండలికమే. బండి నారాయణస్వామి అనంతపురం మాండలికాన్ని ఉపయోగించారు. కోస్తా తెలంగాణ ప్రాంతంలో అసభ్యకరంగా ఉపయోగించే పదాలు అనంతపురం మాండలికంలో సభ్యొక్తి పదాలుగా ఉంటాయి ఇవి ఈ ప్రాంతంలో సాధారణమైన పదాలే. రాకిల రామయ్య, పసరి గోపన్న మొదలైన విమర్శకులు బండి నారాయణస్వామి ఉపయోగించిన మాండలికాన్నీ విమర్శించారు. వీరి విమర్శలకు బదులుగా బండి ఉపయోగించిన మాండలికాలు సబబుగానే ఉన్నాయని సమర్ధిస్తూ బండి నవలల్లోని కొన్ని మాండలిక ప్రయోగాలను వివరించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

Keywords: మాండలికం, పొద్దు, కమ్మ, కురవ, అష్టాంగ రుధిరం, పాప రెక్క.

1. ఉపోద్ఘాతం:

సాధారణమైన మనిషి  బ్రతుకు పోరులో ప్రకృతితోనే పోరాడి నిర్జీవస్థితి నుంచి సజీవస్థితికి సాగే ప్రయాణంలో కులం నుంచి పాలక అరాచకీయ వ్యవస్థ నుంచి తననుతాను కాపాడుకుంటూ  జీవితాన్ని నిలదొక్కుకునే కథలను, నవలలను సృష్టించిన ఘనత బండి నారాయణస్వామికే దక్కుతుంది.. 1987 నుంచి రచనా వ్యాసంగంలో 40కు పైగా కథలు, గద్దలాడతండాయి, రెండుకలల దేశం, మీరాజ్యం మీరేలండి, శప్తభూమి, అర్ధనారి వంటి నవలలు రాసి అనంతపురం మాండలికాలను  కేంద్ర సాహిత్య అకాడమీ స్థాయికి ఊరేగించారు. ఈయన రచనలకి కథాకోకిల, అప్పాజోస్యుల- విష్ణుభట్ల, కొలకులూరి మరియు ఎన్టీఆర్ పురస్కారాలు లభించాయి. శప్తభూమి నవలకు తానా పురస్కారంతో పాటు 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.

2. మాండలికం ప్రస్తావన

ఏ మనిషికైనా భాష మొదట పరాయిదే! దానిని సమయానుసారం క్రమక్రమంగా నేర్చుకోవాల్సి వస్తోంది అటుపైనే భాష మనకు సొంతమవుతుంది. ప్రపంచంలోని ఏ భాషైనా ఈ క్రమాన్ని పాటించవలసిందే!  నోమ్ చోమ్స్కీ అనే భాషా శాస్త్రవేత్త” స్వత సిద్ధ వాదంలో “ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదననే భాషా శాస్త్రవేత్తలందరూ అంగీకరించారు. ప్రపంచంలో దాదాపు 7 వేలకు పైన భాషలు ఉన్నాయి. చాలా భాషల్లో మాండాలికాలు చోటు చేసుకున్నాయి. తెలుగు భాషలోను ఇదే జరిగింది. బ్రహ్మీలిపి నుండి దక్షిణబ్రహ్మీలిపి, ద్రావిడము, గ్రాంథిక, శాసన, వ్యవహారిక, ప్రామాణిక, మాండలికాలుగా తెలుగు భాష క్రమక్రమంగా పరిణామం చెందుతూనే ఉంది.  మాండలికాలు వ్యవహారిక భాష నుంచి పుట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సామాన్యుడికి ఏమాత్రం అర్థంకాని గ్రాంథికభాష నుంచి వ్యవహారికంలో భాషను తీర్చిదిద్దడానికి “గిడుగు రామ్మూర్తి పంతులు” చేసిన కృషి తెలుగు తెలిసిన ప్రతి మనిషికి గుర్తే ఉంటారు. 1962లో బద్రిరాజు కృష్ణమూర్తి “మాండలిక పద కోశం” అనే పరిశోధన  గ్రంథంలో మండలికాలను ఉత్తర (తెలంగాణ), దక్షిణ (రాయలసీమ), మధ్య (కోస్తాంధ్ర), పూర్వ/కళింగ (ఉత్తరాంధ్ర) మండలికాలు అని నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఒక నిర్దిష్టమైన భూభాగంలో మాట్లాడే భాషల మార్పును మాండలికమంటారు. బండి నారాయణస్వామి అనంతపురం ప్రాంతానికి చెందినవాడు. ఈయన నవలలన్నీ దక్షిణ (రాయలసీమ) మాండలికంలోనే రాయబడ్డాయి.

మండలం అంటే  ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది. అలాగే తెలుగు భాషలో భాషాభేదాలున్నాయి. మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు. ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది. ఏ ప్రాంతనికి చెందిన భాషా భేదమైనా తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది. మాండలిక భాషని న్యూన ప్రామాణికం (Substandard form)గా చూస్తారు. అంటే ప్రధాన భాషకన్న తక్కువగా – చిన్నచూపు ఉంటుంది. మాండలిక భాష వ్యవహార ప్రధానమైనది. కొందరు మాండలిక భాషలో రచనలు చేసినా సార్వజనీనంగా ఉండే అవకాశం తక్కువ. మాండలికభాషల్ని అవగాహన చేసుకోవడం అనేది ఆయా ప్రాంతాలతో ప్రత్యక్ష సంభంధం కలిగినపుడు సులభం అవుతుంది. ప్రధాన భాషలు పరిసరాల భాషల ప్రభావం వల్ల భాషా స్వరూపం మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణా తెలుగుపై ఉర్దూ ప్రభావం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళిక పరిస్థితుల ప్రభావం చేత కూడా మాండలిక పదాలు ఏర్పడుతూ ఉంటాయి. సముద్రతీరంలోని వాళ్ళ భాషాపదాలు, ఎడారి ప్రాంతంలోగల భాషాపదాలు భిన్నంగా ఉంటాయి. కులాన్ని బట్టి, వృత్తిని బట్టి, మతాన్ని బట్టి మాండలిక భాషాభేదాలు ఏర్పడతాయి. మనదేశంలో కొన్ని కులాల భాష ప్రత్యేకంగా ఉంటుంది. కమ్మరి, జాలరి, వడ్రంగి మొదలైనవారి భాష ప్రత్యేకంగా ఉండి వృత్తి మాండలికాలుగా వ్యవహరింపబడతాయి. క్రైస్తవమతస్థులైన తెలుగువారి భాషకి, హిందూ మతస్థులైన తెలుగువారి భాషకి భేదాలు గమనించవచ్చును.

మాండలికాల ప్రయోగంలో బండి నారాయణస్వామిదే అందెవేసిన చేయ్యి. మన మాతృభాషను కాపాడాలనుకుంటున్న ప్రభుత్వమొకటి, మాతృభాషను విస్మరిస్తున్న ప్రభుత్వం మరొకటి.  ఏదేమైనాప్పటికీ ప్రస్తుత సమాజంలోని వ్యక్తులు మాతృభాషను మాట్లాడితే తమ చుట్టుపక్కల వారిలో  తక్కువైపోతాం అన్న భావనకు దిగజారారంటే మన మాతృభాష స్థాయి ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే “మట్టి పిసుక్కుని బతికే తన తల్లిని  స్నేహితుల ముందు ఈమె నా తల్లి అని చెబితే ఎక్కడ నా స్నేహితులు నవ్వుకుంటారో అని దిగులుచెందే పిల్లలమై పోతున్నాము”1) (తెలుగు భాషా చరిత్ర) మాతృభాషను ఎడమచేతి నుంచి జారవిడిచి  విదేశీభాషలను నెత్తిన పెట్టుకుంటున్న ప్రస్తుత సమాజంలో తన మాతృభాషకు, మాండాలికానికి అగ్రతాంబూలమిచ్చి రచనలు చేస్తూ దేశ స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించిన రచయిత బండి నారాయణస్వామి. ఈయన తన పుట్టిననేల రాయలసీమకి  రాయలసీమ మండలికాన్నీ ప్రపంచ స్థాయికి తెలిసేలా చేయడానికి మాడలికాలను  ఊరేగిస్తున్నారు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు

3. గద్దలాడతండాయి ఇతివృత్తం

గద్దలాడతండాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్ళ నాటి సీమ సామాజిక జీవితంలో వచ్చిన అలజళ్ళను, పొంతనలేని వైరుధ్యాలను కథనం చేసింది. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉంటూ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యస్థానంలో ఉండేది. ఇతర సామాజికవర్గాలు, రెడ్లలోనే అవకాశాలు రానివాళ్లూ దిక్కు తెలియని ఒక శూన్యతలో నిరాశానిస్పృహల్లో ఉండేవాళ్ళు. అప్పుడున్న రాజకీయపరమైన ఖాళీని పూరించిన తెలుగుదేశం పార్టీ రూపంలో ఒక ఆసరా దొరికేసరికి వాళ్ళంతా అందులోకి దూకారు. అప్పటికీ అవకాశాలు రానివాళ్ళు పదే పదే పార్టీలు మార్చారు. ఈ ఉరవళ్ళలో ఎప్పుడూ కరువు తాండవించే అనంతపురంజిల్లా సామాజిక జీవితంలో ఒక సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్ని కథనం చెయ్యాలని రచయిత అనుకోవడం వల్ల గద్దలాడతండాయి ఇతివృత్తం అనివార్యంగా సాంఘికేతివృత్తం అయ్యింది. అందువల్ల ఇందులో మనకు ఒక నాయకుడు, ఒక నాయిక అంటూ కనబడరు. సామాజిక జీవితం ఎలా ముక్కలుగా ఉంటుందో అలా ఇతివృత్తం కూడా శకలాలు శకలాలుగా ఉంటుంది. ఆనాటి సమాజం అంతటినీ ఒక కట్టకట్టి ఒక చిన్న నవలికగా మలచడం నారాయణస్వామికే సాధ్యమైంది

4. గద్దలాడుతండాయి నవల ఇతివృత్తం.

“పొద్దు మునుగుతాండె
కాకులు గూళ్ళు చేరతాండె,
ఆకాశంలో కొంగలు వంకర
గీతాలు గీస్తా తెల్లదాదం మాదిరి
కొట్టక పోతాండె.”2)

పశువులు ఇండ్లకు మల్లుతాండె. అక్కడక్కడ మేత మేపుకొని నీళ్లు తాపే దానికి ఎద్దుల్ని ఏట్లోకి తోలుకొచ్చే వడ్డె లింగప్ప.  ఆ ఏరు ఎండిపోయిండె. బర్రెముకలు బైటపడే అస్తిపంజరం మాదిరి ఉండె. పగలంతా ఎండకు కాలిన ఇసుక కాళ్లకు ఇంకా వెచ్చగానే తగులుతాండె. ఆ ఎండిపోయిన ఏట్లో, ఇసుకలో నిలబడి జంపుగా చూస్తే పడమటి దిక్కు ఆకాశం నెత్తురోడుతా ఉన్నట్లు కనిపిస్తాండె”3) ఇక్కడ  వాతావరణ పరిస్థితిని వర్ణిస్తూ రాయలసీమ నేల కరువు స్థితి ఈ విధంగా ఉంటుందని బండి నారాయణస్వామి మాండలికాన్ని ఉపయోగిస్తూ పాఠకుల మనసులో నిలిచిపోయారు.

5. మీరాజ్యం మీరేలండి నవలా అంశం

రాయలసీమ అనంతపురం ప్రాంతంలో అగ్రకులాల వారి అరాచక పరిస్థితుల గురించి అణగబడినటువంటి కులాలు ప్రశ్నించగా అగ్రకులాల వారి దౌర్జన్యాలు మితిమీరుతూ ఉంటాయి. అణగబడిన కులాల వారి చేత మనిషి మలాన్ని ఎత్తించడం, వేతనం ఇవ్వకుండా గుడ్డు చాకిరీ చేయించుకోవడం గొంతులో సూలాలతో పొడిపించడం సమాజం ఉన్నంతవరకు ఈ రాజ్యం మాదే మా రాజ్యాన్ని మేము ఏలుతాం అని అడగబడిన వర్గాలకు రాచరిక పాలనను చూపించడం.
పల్లెటూరు లోని కొత్త పరిచయాల సందర్భంలో…

యా ఊరన్న నీది?”
“మా అమ్మది ఈ ఊరే!
ఎవరి బిడ్డ?
“వన్నూరు సాహెబ్ బిడ్డ”
ఓహో నువ్వు వన్నూరు సాహెబ్ మనవడివి అన్నమాట పింజరొల్లన్నమాట!
మాది పండమేటి గ్రామం ఏం కులం?
కమ్మొల్లం.4)
“ఓహో అయితే నువ్వు మా వాడివే అన్నా మాట.   అయితే మీరు కూడా కమ్మోళ్లేనా?  కాదు కురవొల్లం మరి నన్ను మీలోకి కలుపుకుంటావే?
దానికి వేరే లెక్కుంది లే బ్బీ” 5).

ఈ సందర్భపు మాటల్లో అనంతపురం  గ్రామాల్లో అప్పటి పలకరింపులు కులాలతో ముడిపడివుందని  రచయిత తెలిపిన తీరు అక్కడి వాడుక భాష పాఠకులను ఆలోచింపచేస్థాయి. అక్కడి నిరక్షరాస్య ప్రజల హావభావాలను కళ్ళకు కనిపించేలా విస్తరింప చేస్తాయి.

6. రెండు కలల దేశం నవలా అంశము

రెండు కలల దేశం అనే నవల సహదేవుడు అనే పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సహదేవుడే ఈ నవల యొక్క కథా వస్తువు. సహదేవుడు ఇందులో ఒక రచయిత. రచయిత బాల్యం నుండి తన జీవితంతో పాటుగా గ్రామం, ప్రాంతం, దేశంతో పాటుగా వీటిల్లో సంభవించే పరిణామాల నేపథ్యంగా రచన కొనసాగుతూ ఉంటుంది, తన కులం కోసం మనిషి తనాన్ని కోల్పోవడం శాపంగా రచయిత భావిస్తాడు. వ్యక్తిత్వం పణంగా పెట్టి తన కులం, కులాన్ని బట్టి ఏర్పడిన రాజకీయ పార్టీలు, అధికారంలోను, అధికారానంతరం వీళ్ళ మధ్య జరిగిన మారణ హోమాలు, అధికారం కోసం విప్లవ పార్టీలు చేసే హత్యలు, అన్నీ మన కళ్ళ ముందు జరిగే వాస్తవాలు. వీటిని మానవ ప్రగతిగా మనషితనంగా భావించకపోవడం వాటిని విమర్శకు పెట్టడం అందుకు పరిష్కారం మార్గం చూపించాలని తహత సైతం కనిపిస్తుంది. కుల రాజకీయాల పట్ల సహదేవుడికి ఎలాంటి మక్కువ కలిగింది అనే ప్రధాన అంశమే ఈ నవల యొక్క ముఖ్య కథ వస్తువు.

“నా పేరు మునిశప్ప. నా భార్య పందులు కాసే అతని తిడుతూ ఉంటే ఆ ఎరికల మనిషి మాత్రం.. మా పందులే లేకపోతే మీ ఇండ్ల ముందు ఎప్పుడూ పీతికుప్పలే” 6)
 “బుజ్జికి దొడ్డికికడిగి కాళ్లుకడిగి పాపరెక్క పట్టుకొని ఇంట్లోకి ఎత్తుకుపోతూ నా భార్య ఏం సామి  కాపీ ఇమ్మంటావా ఇంకోసారి?

పక్కింటి పార్వతక్కయ్య పాచిగిన్నెలు బయటపడేసుకొని వాటిని తోమటానికి టెంకాయ పీచు బూడిద తీసుకురావడానికి లోపలికి పోగానే ఆశగా ఒక పంది గిన్నెలు వైపే చూస్తూవుంది. నేను దాన్ని తోలి వచ్చేటప్పటికి ఇనుప రేకుకు బిగించిన కర్రతో మా నాయన వచ్చినాడు”7).

ఈ మాటల్లో సీమ గ్రామాలలో ఇళ్ళ చుట్టుపక్కల అపరిశుభ్రం  అక్కడి ఎత్తిపొడుపు మాటలు, ఆడవాళ్ళ ఇంటిపనితీరు కళ్ళకు కట్టినట్టు చూపించారు బండి. అర్థ పరిణామంలో భాగంగా సభ్యోక్తి, మృదూక్తి  ఉచ్చారించకూడని మాటలు కూడా పల్లెటూర్లలో ఉచ్చారిస్తారని తెలుస్తుంది. అక్కడ ఇది తప్పేమీ కాదు సర్వసాధారణమైన విషయమని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

7. శప్తభూమి నవల ఇతివృత్తం

శప్తభూమి నవలలో కథా వస్తువు 18వ శతాబ్దం నాటి రాజకీయ సామాజిక సాంస్కృతిక అగ్రకులాల దౌర్జన్యాల గురించి.

అనంతపురంలోని ఎల్లప్ప అనే ఒక గొర్రెల కాపరికి సిద్ధ రామప్ప నాయుడు అనే రాజు జెట్టి పదవిని సమర్పించాడు. దానికి ప్రతిఫలంగా తన రాజు కోసం  రాజు యొక్క ఔనత్య పాలన కోసం ఎప్పుడూ వర్షపు చినుకు కూడా స్ఫురించని ఆ ప్రాంతం పైన వర్షం పడాలని ఎల్లప్ప జట్టి శ్రీశైలం మల్లికార్జున స్వామికి తనని తాను సమర్పించుకోవడానికి వెళ్లి ఇలా ప్రార్థిస్తాడు.  “అష్ట దిశలలోని అష్టభైరవుల్లారా నా అష్టాంగాల రుధిరంతో మిమ్మల్ని అభిషేకిస్తాను. ఆరాధిస్తాను. నా దేవుని కోసం నేను ఇట్లా, నా మాంసాన్ని ఖండిస్తున్నాను”8) అంటూ తన శరీరభాగాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి తుదిశ్వాస విడుస్తాడు. ఈ సంఘటనతో రాయలసీమ ప్రాంతంలోని మూఢాచారాలను కూడా బండి నారాయణస్వామి వవివరించారు.

నాగేంద్రప్ప వంకాయ కయ్యలు నాటే అవి నీళ్లు నీళ్లు అని     ఆశగా అరిచినట్లు ఉండే”9)

“తల్లి చనుల్ని పెదవులతో వెతుక్కుంటూ అత్రపడే పసిపిల్ల మాదిరి అవి కూడా నీళ్లపక్క ఆశగా చూసినట్లు ఉండే”10) ఈ రెండు వర్ణనలు బండి నారాయణస్వామి అనంతపురం ప్రాంతంలో కరువు ప్రభావం ఏ స్థాయిలో ఉందో కళ్ళ ముందు పరిచారు.  ఈ రకమైన అనంతపురం యాసను కలగలుపుతూ పాఠకులకు స్వచ్ఛంగా అర్థం అవ్వడానికి ఈ మాండలికాలు చాలా ఉపయోగపడ్డాయి.

8. ముగింపు:

రాకిల రామయ్య, బండి మాండలికం – బూతు పురాణం, పసిరిక గోపన్న బండి నిర్జీవ మాండలికం పేరిట ఆంధ్రజ్యోతి, సాహితీ ప్రస్థానం పత్రికలలో విమర్శించిన తీరు పూర్తిగా రాయలసీమ అనంతపురం మాండలికాన్ని ప్రశ్నించినట్లు అనిపిస్తుంది.

నిజానికి రాయలసీమ మాండలికంలో నాటు పదాలు ఉన్నాయి అని ఎవరైనా ప్రశ్నిస్తే, నేను కూడా ఉన్నాయి అనే భావిస్తాను. అయితే అవి అసభ్యకరమైనటువంటి మాటలు అయితే కాదు ఆ ప్రాంతంలోని సర్వసాధారణమైనటువంటి మాటలుగానే అంగీకరించాలి. కారణం నిరక్షరాస్యత కావచ్చు, వృత్తిరీత్యా వ్యవహారాలలో కావచ్చు, వలస ప్రభావం కావచ్చు. ఉదాహరణకి పేడ అనే పదాన్ని తీసుకున్నట్లయితే కోస్తాంధ్రలో పెంట, తెలంగాణలో పెండ, ప్రకాశం పండే అలా రకరకాలుగా పిలవడం సాధారణమైన అంశము. 

రావిశాస్త్రి కోస్తా మాండలిక రచనలు, దాశరధి కృష్ణమాచార్యులు రాసిన తెలంగాణ మాండలిక రచనలు, పోరంకి దక్షిణామూర్తి రాసిన గుంటూరు, కృష్ణ మాండలిక రచనలలోని మాడలికాలలోని హాస్యము లోకనిరుక్తి మొదలైనటువంటి అంశాలను స్వకరించినట్లే బండి నారాయణస్వామి రచనల్లోనే అనంతపురం మండలికాలను కూడా అంగీకరించాలని నా ముఖ్య భావన.

9. పాదసూచికలు:

  1. వెలమల సిమ్మన్న, తెలుగు భాష చరిత్ర, పుట 173. ఆ
  2. బండి నారాయణస్వామి, గద్దలాడుతాండై, పుట 154, భాగం5
  3. పైదే. పుట 163, భాగం11
  4. బండి నారాయణస్వామి, మీ రాజ్యం మీరేలండి, పుట 63
  5. పైదే. పుట 103
  6. బండి నారాయణస్వామి, రెండు కలల దేశం, పుట 34, భాగం 18
  7. పైదే. పుట 63, భాగం 23
  8. బండి నారాయణస్వామి, శప్తభూమి, పుట 81
  9. పైదే. పుట 107
  10. పైదే. పుట 209 , భాగం24

ఉపయుక్తగ్రంథసూచి:

  1. నారాయణస్వామి, బండి, గద్దలాడతండాయి, (2021). అన్వేక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
  2. నారాయణస్వామి, బండి, మీరాజ్యం మీరేలండి, (2021). అన్వేక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
  3. నారాయణస్వామి, బండి, రెండు కలలదేశం. (2021). అన్వేక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
  4. నారాయణస్వామి, బండి, శప్తభూమి. (2022). అన్వేక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
  5. నారాయణస్వామి, బండి, శప్తభూమి. అన్వేక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
  6. నారసింహ, చగవేలు. మన నవల పుట్టుక. (2018). ధాత్రి పబ్లికేషన్స్, కర్నూల్.
  7. వారారాజు, కుందేటి. మాండలిక సేవ. (2016). పుణ్యక పబ్లికేషన్స్, విశాఖపట్టణం.
  8. సిమ్మన్న, వెలమల. తెలుగు భాషా చరిత్ర. (2018). విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ.
  9. సుబ్బయ్య, వల్లంపాటి. నవలా శిల్పం. (2011). విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]