ఉపోద్ఘాతం:

ఆనాటి వరకు రాతిపలకలపైన, రాగిపలకలపైన పడియున్న ఆంధ్ర సరస్వతికి కావ్యకంచుకాన్ని తొడిగిన కీర్తి నన్నయ్య గారికే దక్కింది. నారాయణ శబ్ద భవం నన్నయ. ఆయన ఆదికవి.  ఆయన గురించి చాల సంగ్రహంగా చెప్పుకోవాలంటే - ఆయన ఆంధ్రకవిత్వవిశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడున్ను. నన్నయభట్టు లోని భట్టు పదం ఆయనకు నాలుగు శాస్త్రాల్లో గల కులంకశామైన ప్రజ్ఞను చాటుతో౦ది. ‘చతుశ్శాస్త్ర పారంగతో భట్ట:’  అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక నన్నయగారు మహాభారతావతారికలో తన కవితారీతులను వివరిస్తూ –

సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలితార్థయుక్తి లో

నారసి మేలునానితరులక్షరరమ్యత నాదరింప నా

నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెను౦గునన్ మహా

భారతసంహితారచనబంధురుడయ్యె జగద్ధితంబుగన్ 

అని చెప్పడం వల్ల ఆయన కవితలో ప్రసన్నకథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తినిధిత్వ౦ అనే లక్షణాలున్నాయని తెలుస్తో౦ది. ఇక ఆయన కవితలో ఉన్న మరో విశేషం వృత్తౌచిత్యం. అంటే ఏ సందర్భంలో ఏ వృత్తం ప్రయోగించాలో  ఆ సందర్భంలో ఆ వృత్తాన్ని ప్రయోగి౦చడం.  సంగ్రహంగా కొన్ని పరిశీలిద్దాం.

నన్నయ్య - వృత్తౌచిత్యం:

ముందుగా ఉదంకోపాఖ్యానం పరిశీలిద్దాం. అందులో ఉదంకుడు సర్పరాజులను స్తుతించే ఘట్టంలో కవి ఉత్పలమాల, చంపకమాలలను ప్రయోగించడం ఒక విశేషం. ఉత్పలాలు ఉదంకుని భక్తిని, చంపకాలు పాములకు వాటిపట్ల గల అనురక్తిని సూచిస్తున్నాయి.

చంపకమాల :

బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సురస్సరజ్ఝరీ

మహిత మహామహీధర మజస్ర సహస్ర ఫణాలి దాల్చి దు

స్సహతర మూర్తి కిం జలధి శాయికి పాయక శయ్యయైన న

య్యహిపతి దుష్కృతా౦తకు డనంతుడు మాకు ప్రసన్ను డయ్యెడున్ 

 

చంపకమాల:

 అరిది తపోవిభూతినమరారుల బాధలు వొ౦ద కుండగా

నురగుల నెల్లగాచిన మహో రగ నాయకుడానమత్సురా

సుర మకుటాగ్ర రత్న రుచిశోభిత పాదున కద్రి నందనే

శ్వరునకు భూషణం బయిన వాసుకి నాకు ప్రసన్ను డ య్యె డున్

ఉత్పలమాల :

గోత్ర మహా మహీధర నికు౦ జ ములన్ విపినంబులం గురు

క్షేత్ర గయా ప్రయాగముల ఖేలన నొప్పి సహాశ్వ సేనుడై

ధాత్రి  పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడీ క్షణ

శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు  బ్రసన్నుడయ్యెడున్

 

ఉత్పలమాల :

దేవమనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప స౦

భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కత కోప విస్పుర

త్పావకతాపితా ఖిల విపక్షులునైన మహానుభావులై

రావత కోటి ఘోరఫణి రాజులు మాకు ప్రసన్నులయ్యెడున్ 

 

అలాగే దుష్యంతుడు కణ్వమహాముని ఆశ్రమంలో ప్రవేశించే ఘట్టంలో కవి మానిని, కవిరాజవిరాజితం అనే రెండు వృత్తాల్లో ఆశ్రమవర్ణన చేశారు.

మానిని:

 ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు   ఠావుల జొంపములం

బూచిన మంచి యశోకములన్ సురపొన్నల (బొన్నల గేదగులం

గాచి బెడంగుగ ( బండిన యా సహకారములం గదళీ తతులం

జూచుచు వీనులకిoపెసగెన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్.

 

కవిరాజవిరాజితం:

చనిచనిముందటనాజ్యహవిర్ధృతసౌరభధూమలతాతతులం 

బెనగొని మ్రాకులకొమ్మలమీద నపేతలతాంతములైనను బా

యని మధుపప్రకరంబుల(జూచి జనాధిపుడంత  నెఱిoగె తపో

వనమిది యల్లదె దివ్యమునీంద్ర నివాసము దానగునంచునెడన్

ఈ రెండు వృత్తాలు వాడడం ద్వారా దుష్యంతుడు అభిమానవతి (మానిని) యైన ఒక యువతిని చూస్తాడని, ఆమె సామాన్యయువతి కాదని పక్షి రాజులచే పోషి౦పబడిందని (కవిరాజవిరాజిత) సూచితమౌతోంది. అంతే కాకుండా మరో విశేషముంది. మానిని లోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే కవిరాజవిరాజితం అవుతుంది. దీని ద్వారా ఒక్కరిద్దరౌతున్నారనే సూచన కూడ కనిపిస్తోంది.

అదే విధంగా ఆదిపర్వం పంచమాశ్వాసంలో పాండురాజు, మాద్రి ఏకాంతంగా నివసిస్తున్న వనప్రదేశాన్ని నన్నయ్య గారు రెండు లయగ్రాహి వృత్తాల్లో వర్ణించారు. అవేంటో చూద్దాం :

లయగ్రాహి :

కమ్మని లతాంతములకుమ్మొనసివచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ములెసగం జూ

తమ్ములలసత్కిసలయమ్ములసుగంధి ముకుళమ్ములను నానుచుముదమ్మొనరవాచా

లమ్ములగు కోకిలకులమ్ముల రవమ్ము మధురమ్మగుచువిన్చె ననిశమ్ము సుమనో భా

రమ్ముల నశోకనికరమ్ములును చంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్

(ఆది /పంచమ/138)

లయగ్రాహి:

చందనతమాలలతలందు నగరుద్రుమములందు గదళీవనములందు లవలీ మా

కందతరుషండములయందు ననిమీలదరవిందసరసీవనము లందు వనరాజీ

సందళితపుష్పమకరందరసముం దగులుచుందనుపు సౌరభమునొంది జనచిత్తా 

నందముగ బ్రోషితులడెందములలoదురగమందమలయానిలమమందగతివీచెన్

( ఆది/పంచమ/139)

సాధారణంగా లయగ్రాహి వృత్తం అంత ప్రసిద్ధమై౦దేమీ కాదు. ఒక వేళ ప్రసిద్ధి కలదే అయినా, నన్నయగారికి ఆవృత్తం చాల ఇష్టం అనుకున్నా ఆయన  ఒక వృత్తంలో వర్ణన చేయవచ్చు. లేదా మూడో నాలుగో లేదా ఆపైన మరెన్నో   వృత్తాల్లో వర్ణి౦చొచ్చు. కాని ఆయన కేవలం రెండు మాత్రమే స్వీకరించారు. అదే విశేషం. లయగ్రాహి అంటే నాశనాన్ని కలిగించేది. ఇక్కడ ఈ రెండు లయగ్రాహివృత్తాలు అతిత్వరలో సంభవి౦చ బోయే పాండురాజ, మాద్రుల మరణాన్ని సూచిస్తున్నాయి.   

ఇక కౌరవులు, పాండవులు గురుదక్షిణార్థం ద్రుపదుణ్ణి పట్టుకోడానికి వెళ్లి నప్పుడు వారి సమరోత్సాహాన్ని ఉత్సాహవృత్తంలో నన్నయ మహాకవి వర్ణించారు.

 

ఉత్సాహవృత్తం:

ఏల దీనినెడయు జేయ నీ క్షణ౦బ యేగి పాం

చాలు బట్టి తెత్తమధిక శౌర్య లీలమెరయగా

బోలుననుచు బెరిగి రాజపుత్రులరిగి యార్చి పాం

చాలుపురము ముట్టికొనిరసంఖ్యబలసమేతులై

(ఆది /షష్ఠ /65).

ముగింపు:

ఈ వ్యాసంలో స్థాలీపులాకన్యాయంగా కొన్ని అంశాలే పొందు పరిచాను. మిగిలినవి చదువరులు స్వయంగా నన్నయ్యగారి సాహిత్యాన్ని చదివి గ్రహి౦చగలరు. ఒక వేళ ఇవన్నీ కాకతాళీయంగా దోర్లినవే అని ఎవరైనా భావిస్తే  వారికొక నమస్కారం.

ఉపయుక్తగ్రంథాలు:

1. కవిత్రయ భారతం - TTD ప్రచురణ.

2. సువృత్తతిలకం - క్షేమేంద్రమహాకవి, వ్యాఖ్యానం. పుల్లెల శ్రీరామచంద్రుడు, సురభారతీ ప్రచురణ.

3. సువౄత్తతిలకం - పద్యానువాదం - వేంకటరామకృష్ణ కవులు, కవిత మాసపత్రిక ప్రచురణ.