AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-9 | September 2022 | ISSN: 2583-4797

4. వట్టికోట జైలు లోపల కథలు - ప్రజారాజకీయాలు

చిరంజీవి వోనె,

పరిశోధక విద్యార్ధి, తెలుగు విభాగం,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్‌. చరవాణి: 9177270403


ఉపోద్ఘాతం:

వట్టికోట ఆళ్వారుస్వామి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌ సమీపాన ‘మాధవరం’ అనే గ్రామలో 1 నవంబర్‌, 1916న నిరుపేద శ్రీ వైష్ణవ బ్రాహ్మణ దంపతులు శ్రీమతి సింహంద్రిమ్మకు, శ్రీమాన్‌ రామచంద్రా చార్యులకు జన్మించాడు. స్వయంకృషితో చదువుకొని విజ్ఞానవంతుడై గొప్ప రచయితగా సాహిత్యంలో స్థానం పొందాడు. అదే క్రమంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గోని ప్రజల మనిషిగా ఎదిగాడు వట్టికోట ఆళ్వారుస్వామి రచయితగా, ఉద్యమకారుడిగా సమానంగా కృషి చేశాడు. గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. గ్రంథమాలను స్థాపించి సాహిత్యావ్రేచురణలు చేసి పాఠకులను పెంచాడు. సాహిత్యాసక్తిని కల్గించాడు. ఒక పంటల వాడుగా, హోటల్‌ సర్వర్‌గా, ప్రూప్‌ రీడర్‌గా, సామాన్యునిగా జీవితం ప్రారంభించిన వట్టికోట కమ్యూనిస్ట్‌ పార్టీలో సభ్యునిగా ఉద్యమకారునిగా గొప్ప సాహిత్య సృష్టికర్తగా రూపొందాడు, తెలంగాణలో ఆయన పాల్గోనని ఉద్యమం లేదు.

1943 ఆంధ్రప్రాంతంలో ఆరంభమైన అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకు తెలంగాణ నుంచి ఎకైక ప్రతినిధిగా వట్టికోట ఆళ్వారుస్వామి హాజరు అయ్యారు. కాంగ్రెస్‌ ఆలోచనాపరుడిగా సంఘ సంస్కరణకు పాటుపడే విమర్శకుడిగా, కార్యశీలిగా ఆళ్వారుస్వామి గుర్తింపు తెచ్చుకోన్నాడు. గ్రంథాలయోద్యమం, నేత్రికోద్యమం, సత్యాగ్రహాల్లో విశిష్ట భూమిక పోషించాడు.

వట్టికోట గారు నిత్యం ప్రజల సమస్యలపై పోరాటాం చేసేవారు. నగర ప్రాంతంలో కార్మికలు సమస్యల పరిష్కారం కోసం వారు కృషి చేస్తూ వచ్చేవారు. 1944లో గుమస్తాల సంఘంను నెలకొల్పాడు. వెట్టి చాకిరీకి దగ్గరగా బతుకులులీడుస్నున్న కార్మికులకోసం వారానికికొక సెలవు దినాన్ని ఇతర రాయితీలను పోరాటం చేసి సాధించారు. వారి కోసం ‘గుమాస్తా’ పత్రికనునడిపాడు. 1946లో హైదరాబాదులోని రిక్షాలను నిజాం సర్కారు రద్దు చేయడానికి సిద్ధం అయింది. అది తెలిసిన వెంటనే రిక్షా కార్మికులందరిని ఏకం చేసి ప్రభుత్వ నిర్ణయానిన వెనక్కి తీసుకునే దాక వట్టికోట పోరాటంచేశాడు. రైల్వేశాఖ వారు తాత్కాలిక ఉద్యోగులను తీసివేసినపుడు ఆళ్ళారుస్వామి వారితో కలిసి ఉద్యమం కొనసాగించారు.

1938 నుంచి 1961లో చనిపోయే వాటి వరకు తెలంగాణ చైతన్యానికి, పోరాటానికి అనునిత్యం పాటుబడ్డ స్వార్థత్యాగి ఆళ్ళారుస్వామి ఆయన కథలు, నాటికలు, నవలలు రాశాడు. మొదటి నవల దేశోద్ధారక గ్రంథమాల తరపున 1955 జనవరిలో ప్రచురితమయింది. దాని పేరే ప్రజల మనిషి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది.ఈ నవలలో తెలంగాణ జనసామాన్యతో పాటు, సర్వ సామాన్యంగా అందరూ మాట్లాడే భాషను సంభాషణల్లో రాశాడు. ‘గంగు’ నవల ‘ప్రజల మనిషికి’ కొనసాగింపు, గంగు నవలలో కమ్యూనిస్టు పార్టీ తెచ్చిన చైతన్యం పోరాట స్ఫూర్తి వర్ణించబడినాయి.

వట్టికోట 1946-51లో జైలులో వున్నప్పుడు రచించిన కథలను 1952లో ‘జైలు లోపల’ పేరుతో దేశొద్ధారక గ్రంథమాల 13వ ప్రచురణగా అంటె జైలు ఉంచి విడుదల కాగానే గ్రంథమాలను పునరుధ్దరించి దాని తరుపున ఈ కథల సంపుటిని ప్రచురించాడు. దీనిలో ఆరు కథలు ఉన్నాయి. ఇవి గాక సుజాత స్రవంతి. తెలుగుతల్లి మొదలైన పత్రికల్లో ‘ధర్మారాజు’ మొదలూన కలం పేర్లతో వట్టికోట వ్రాసిన కథలు 15 దొరుకుతున్నాయి.

వట్టికోట వారు ఎక్కడ ఉన్నా అక్కడి దుర్వ వ్యవస్థను బాగు చేయాలని తపన పడ్డాడు. జైలులో వున్న పరిస్థితులను చూసి స్పందించాడు. ఆయన జైలులో ఉన్న ఖైదీల జీవిత నేపథ్యం చేత చలించిపోయే వట్టికోట ‘జైలు లోపల’ కథలను రచించారడు. ఈ కథలు నిజంగా జరిగిన సంఘటనలు నిజమైన జీవితాల చేత ప్రేరణను పొంది వ్రాసి కథలే కొన్ని కథల్లో ఖైదీల సామాజిక జీవితం నేపథ్యం అయితే కొన్ని కథల్లో రాజకీయ పరిణామాలు నేపథ్యంగా వున్నాయి.

ఈ కథానికల్లో జైలే కథా స్థలం, 1940`50 మధ్య కాలమే కథ కాలం, ఈ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం, నిజాం వ్యతిరేక పోరాటం రెండు ఉన్నాయి. జైలు పరిసరాలే కథానికలలోకి, జైలులో ఉన్న పాత్రలకీ విస్తరిస్తుంది. జైలు బయట వున్న పాత్రలను కూడ ప్రభావితం చేస్తుంది. కష్టజీవుల కోసం ఉద్యమకారుల కోసం, వర్గ సమాజం ఈ లోకంలో నిర్మించిన నరకం పేరే జైలు. జైలు ఒక పెద్ద తలకిందులవ్యవహారం, జైల్లో ఉండవలసిన నేరుస్తులంతా బయట స్వేచ్ఛా ప్రపంచంలో వుంటారు. బయట ఉంవల్సిన మంచి వాళ్ళంతా జైలు లోపల ఉంటారు. నెహ్రు గారు అన్నట్టు ‘‘మన దేశంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్నున్న వారిలో నూటికి 85 మంది నేర ప్రపృత్తి గలవారు కాదు, తక్కిన 15 మంది కూడ స్వభావత: నేరగాండ్రు కారు, పరిస్థితులే వారినావిధంగా చేశాయి’’. ఐతే ‘జైలు లోపల’ కథల్లో జైల్లో ఉన్నవాళ్ళంతా అమాయకులే అని మనం నమ్మితే చాలు ఆళ్వారుస్వామి కథల ప్రయోజనం నెరవేరినట్లే.

‘‘జైలు లోపల’ కథల్లో మొదటి కథ ‘పరిగె’. తెలంగాణ పల్లెలో సామాన్యుని జీవితం ఎంత దీనంగా వుండేదో ఈ కథ చెప్తున్నది. వెట్టిచాకిరి చేసే కింది కులాల వాళ్ళకు వాళ్ళ పొట్ట పోసుకోవటానికి సమయం ఉండేదికాదు. గ్రామంలోని దొరలకు, గ్రామాధికారులకు, దౌరాలకు వచ్చే ప్రభుత్వోద్యుగులకు జీతబత్తాలు లేకుండా పనులు చేయాలి. ఈ కథలో మల్లయ్య ఖానాపురంలో వంతు మాదిగ, కూతుర్ని కన్న తల్లి చనిపోయింది. జీవితమంతా వెట్టిచాకిరి చేసి కండలు కరిగించిన తండ్రి మంచం పట్టాడు. ప్రేమతో పెంచి పెద్ద చేసిన చెల్లెలుకు తండ్రికి ఇంత తిండి పెట్టని స్తితిలో వున్నాడు మల్లయ్య ఒకరోజు మల్లయ్య వెట్టిచాకిరికి పోయి సాయంత్రం వచ్చాడు. ఆకలితో మలమలమాడుతన్న తండ్రికి, చెల్లెలుకు తినటానికి ఏమైనా గింజలు సంపాదించి తస్తానని బయలుదేరిన మల్లయ్య ఒక చెనలో పరిగె కర్రలను పోగు చేసుకొని కట్ట కట్టుకొని సంతోషంగా బయలుదేరుతాడు. ఇంతలో అజానుబాహువైన రైతు వచ్చి తన కల్లంలోంచి ధాన్యం కట్టలను దొంగిలించాడని పోలీసు పటేలుకు అప్పజెస్తాడు. చెల్లెలును పక్క గ్రామానికి వంతుకి పంపి పోలీసు పటేలు మల్లయ్యను పోలీసులకు అప్పజెప్పాడు. మల్లయ్యకు దొంగతనం నేరం క్రింద మూడు నెలలు జైలు శిక్ష పడుతుంది. జైలులో వున్నప్పుడు తండ్రి మరణించాడని చెల్లెలు ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయిందని ఇల్లు పాడుపడిరదని మల్లయ్యకు తెలుస్తుంది. ఆ వార్త విని మల్లయ్య గత్యంతరం లేక పెద్దగా ఏడుస్తాడు, తపిస్తాడు అది ఖైదీ మల్లయ్య జీవితం.

‘పతితుని హృదయం’ కథలో ఉరిశిక్ష నిషేధింపబడాలన్న విషయాన్ని వట్టికోట చర్చించాడు. ఒక ఖైదీ ఉరితీయబడ్డాడని తెలిసిన గండయ్య చాలా చలించిపోతాడు. ‘ఓ మనిషి ఇంకో మనిషి చేతులు కట్టి ఉరిపెట్టి వేలాడ దీస్నే చచ్చిందాక గుడ్లు మిటకరిస్తూ చూడటానికి అక్కడ నిలుచున్నవాండ్ల కేటా మనసోప్పిందో’ నాకైతే అతని సీనిగెను చూడటానికి కూడ మనసొప్పలేదురా’ అని గండయ్య విచలితుడవుతాడు. విద్య, విజ్ఞానం లేక వేరే పని చేయలేక నేరం చేసేవాళ్ళ పరిసరాల ప్రభావంతో నేరాలు చేస్తున్నారు. వాళ్ళను బాగు చేస్తే బాగు పడ్డారు కాని ఉరి తీయటమన్నది మానవత్వానికి విరుద్ధమని మట్టికోట అభిప్రాయం. ఆ రోజుల్లో ఒక వైపు నిజాం ప్రభుత్వంతో పోరాటంలో మునిగి తేలుతూ కూడా వట్టికోట పౌరహక్కులు, మానవ హక్కుల గురించి ఆలోచించాడు. ఉరిశిక్ష వుండకూడదని రద్దు కావాలని మానవతా దృక్పథంతో బాదపడ్డాడు.

‘విధిలేక’ కథలో నర్సయ్య పేదరికం, నిరుద్యోగం, నైరాశ్యంతో విధిలేక వేరే మార్గం లేక క్రమంగా దొంగ అవుతాడు. మూడు నెలల కఠిన శిక్ష పడుతుంది. బీదతనం, నిరాదరణ, నిరుద్యోగం, దుష్టసహవాసం, వీటి ఒత్తిడి వల్ల నేను ఈ విధంగా అయ్యాను. నా వంటి వాళ్ళు తయారు కావటానికి కారణమైన దుష్ట శక్తుల గురించి ఆలోచించండి. దుష్ట జూడ్యమైన బీదతనం విషక్రిములను ఊరు పేరు లేకుండా చేయండి. చేయాల్సి కర్తవ్యం మీరు బాగా గుర్తించాలె. అని నర్సయ్య కాంగ్రెస్‌ వాదితో అంటాడు. ఎన్నికల్లో గెల్చి రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్తవ్యాన్ని వట్టికోట ఇక్కడ గుర్తు చేసాడు. బీదతనాన్ని తొలగించకపోతే నర్సయ్య లాంటి చీడ పురుగులు తయారవుతారు నర్సయ్య జైలులో వుండగానే అతని భార్య ఆకలి బీదతనం భరించలేక లక్ష్మయ్య అనే దొంగను పెండ్లి చేసుకొని నర్సయ్య జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా నర్సయ్య జీవితం మంట గలుస్తుంది. ‘విధిలేక ! విధిలేక ! అంటూ జైలు గోడల మధ్య నర్సయ్య బుసకోడ్తూ వుండిపోతాడు.

‘మా కంటే మీరేం తక్కువ’ కథ చిన్నదే. కాని ఆ కథలో చెప్పిన విషయం ఆనాటి సమాజాన్ని విమర్శిసున్నది. రంగడు, వెంకడు దొంగలు, వాళ్ళున్న జైలుకు ప్రభుత్వం చేత నియమింపబడిన జైలు విజిటర్‌గా ఇంద్రసేనారెడ్డి వస్తాడు. అతన్ని చూసి రంగడు, వెంకడు గుర్తుపడ్తాడు ‘మా రాజులు కష్టపడ్డందుకు గట్టెక్కిను మేము వున్న చోటనే ఉన్నాం. పాపపు పుటకలు అంటాడు రంగడు. కొందరు 1948 సెప్టెంబర్‌ 17న పాలిసి చర్యతో నిజాం లొంగుబాటు కావటంతో పోరాట విరమణ చేశారు. అటువంటి వారు ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా సంపాదించుకొని లౌక్యం పాటించరని ఈ ఇంద్రసేనారెడ్డి వృత్తాంతాన్ని బట్టి తెలుస్తుంది.

ఈ సంపుటిలో ‘మెదడుకు మేత’ కథ చాలా పెద్దది. ఈ కథలో వట్టికోట హిందూ ముస్లింల మధ్య కోట్లాలలు చెలరేగటానికి అసఖ్యతకు కారణాలను విశ్లేషించారు. ఒకటి హిందూ ముస్లింలలో వున్న విభిన్న ఆచారాలు అలవాట్లు వాళ్ల మధ్య అసహనం కలగటానికి కారణాలు కాగా, వాళ్ళ వాళ్ళ మతసంప్రదాయాల విభిన్నత మరో కారణం అని ఈ రెండు విషయాల్లో ఇద్దరూ సహనం వహించి పరస్పరం గౌరవించుకోవటం చేత సఖ్యత సమకూడుతుందని కమ్యూనిస్టు భావాలు గల మోహన్‌బాబు పాత్ర మూలంగా వట్టికోట చెప్పాడు. ‘అవకాశమిస్తే’ కథలో చాలా తేలికైన సంభాషణలతో హస్యపూర్ణంగా నడిచింది, పాత్రలు గంభీరమైనవి కావు. సంభాషణాలు గంభీరంగా లేవు ఈ కథలో వట్టికోట ధ్వనింప చేసిన విషయాలు గంభీరమైనవి, పోరాటంలో పాల్గోన్న వాళ్ళు కొందరు ఎట్లా అన్ని విధాల బాదపడ్డారో చిత్రించాడు. మామూలు కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళు అక్కడే వుండి పోయారు. వాళ్లను పట్టించుకొనేవాళ్ళు లేక పోయారు. ఇటువంటి సంఘటనలతోనేమో జైలు నుంచి విడుదలయ్యాక 1951, 52ల్లో వట్టికోట రాజకీయాలకు విముక్తడయ్యాడు పార్టీకి దూరంగా వున్నాడు. వట్టికోట ఆళ్వారుస్వామి మొదట్లో రచించిన కథల కన్న ‘జైలు లోపల’ కథలు భాష శైలిలో, కథననం, కథన శిల్పంలో ఉత్కృష్టమైనవి. అంటే ఆయన కథా రచనలో చేసి సాధన, కథన శిల్పంలోని ప్రస్థానం తెలుగు సాహిత్యంలో కొన్ని ఉత్తమమైన, అపురూపమైన కథలను సృష్టించారు. అవి తెలుగు సాహిత్యంలో గౌరవాన్ని తెచ్చి పెట్టాయి.

వ్యవస్థతో రాజీపడి రాయదలచుకున్న వాళ్ళకు, దానితో సంఘర్శస్తూ రాసిన వాళ్ళకు పొంతన వుండదు. నిరంతరం సంఘర్షణలో సంభవించిన అగ్ని పుంజాలే ఆళ్వారు రచనలు అని చెప్పవచ్చు. ఒక హోటల్‌ కార్మికుడు రచయిత కావటం ఆశ్చర్యం కాకపోవచ్చు. కాని రచయితలనే ఆశ్చర్యపరిచే రచయిత కావటం మాత్రం అనుహ్యం. సాహిత్య సృజన అన్నది ఆళ్వారుకు పేరు తెచ్చి పెట్టే వ్యాపకం కాదు. ప్రజలు చైతన్యపరిచే వాహిక.

వట్టికోట నవలల్లోగాని, కథల్లోగాని వాస్తవికతను తగిన సరళ సులభ భాషాశైలిని ప్రయోగించాడు. ఆయన వస్తువును ఎంత సరళంగా మన ముందుంచుతాడో శైలి కూడా సరళంగా వుంటుంది. నవలాకారునిగా, కథల రచయితగా, వ్యాస రచయితగా, పత్రికా నిర్వాహకుడిగా, గ్రంథాలయ నిర్మాతగా తెలుగు సాహిత్యంలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన తరాన్ని తన తరువాతీ తరాలనూ ప్రభావితం చేసిన తెలంగాణ విమోచనోద్యమ కథా రచయిత ఆళ్వారుస్వామి జీవితం, సాహిత్యం, వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయం.

ఉపయుక్త గ్రంథాలు:

  1. సుజాతరెడ్డి, ముదిగంటి, తెలంగాణ తొలి తరం కథలు
  2. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, తెలుగు అకాడమి
  3. ఆళ్వారుస్వామి, వట్టికోట, జైలు లోపల కథలు
  4. మల్లయ్య, కాలువ, తొమ్మిది పదుల ‘తెలంగాణ కథ’
  5. పదేళ్ళ తెలుగుకథ విభిన్నధోరణులు, ఈమాట
  6. వేణుగోపాల్‌, అమ్మంగి, వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు - ఒక పరిశీలన
  7. ఆచార్య రామారావు, ఎస్వీ, 20వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర