AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-12 | November 2022| ISSN: 2583-4797

5. మౌసలత్రయ పర్వములు : ధర్మ సూక్ష్మములు

జక్కె పద్మ,

తెలుగు అధ్యాపకురాలు, (NET, SET, DL) TSWRDC, నల్గొండ.
పరిశోధకురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం.
సెల్:7702154421, email: jpadma1979@gmail.com

ప్రొఫెసర్ కొంకా యాదగిరి

విశ్రాంత తెలుగు ఆచార్యులు,
తెలుగు విభాగం, కాకతీయ విశ్వవిద్యాలయం.


ఉపోద్ఘాతము:

‘‘మహాభారతము జ్ఞాన విజ్ఞానాల పెన్నిధి’’ ఇది మానవులకు అడిగిన కోరికలను తీర్చే కామధేనువు వంటిది. చతుర్విధ పురుషార్థములను సంపూర్ణముగా అందించే అక్షయపాత్ర వంటిది. ‘‘మహాభారతము సర్వగుణ రత్నాలకు ఆకరమై ఉన్నది.’’ అనగా సముద్రము, మేరు పర్వతములు సర్వరత్నములకు నిధులుగా విలసిల్లినట్లుగానే మహాభారతము కూడా సర్వ మానవులకు నిధి వంటిదని అర్థం. వ్యాసుడు (వైశంపాయనుడు – జనమేజయునితో) ఆదిపర్వంలో ఈ విధంగా చెప్పించినాడు.

శ్లో ॥     ధర్మే చార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ ।

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తిన తత్‌ క్వచిత్‌ ॥

జనమేజయ రాజా! ‘‘మానవుడు తెలుసుకోవాల్సిన విషయాల్లో ధర్మం, అర్థం, కామ పురుషార్థ సంబంధములో గాని, మార్గములో గానీ తెలుసుకోదగిన విజ్ఞానం ఈ గ్రంథంలో ఏది ఉన్నదో అదే ఇతర వాఙ్మయంలో ఉంది. ఇందులో లేనిది ఎందులోనూ ఉండదని అర్థం.’’

ధర్మం, అర్థం, కామం, మోక్షం మొదలైన నాలుగింటి యొక్క సముదాయము అందరికీ ఉపయోగకరమైనది అవసరమైనది తెలుసుకోదగినది. అయితే ‘‘ఈ నాలుగు పదాలకు అనుబంధంగా నాలుగు ‘చ’కారాలను కూడా వ్యాసమహర్షి శ్లోకంలో నిబంధించినట్లుగా తెలుస్తున్నది.’’ అనగా ధర్మంతో పాటు అధర్మమును, అర్థముతో పాటు అనర్థమును కామముతో పాటు దు:ఖమును, మోక్షముతో పాటు సంసారమును కూడా తెలియజేశారు. అంటే మంచితో పాటు చెడును కూడా తెలుసుకున్నప్పుడే మానవుడు దానిని ఉపేక్షించాలి. దేనిని వదిలేయాలనే విషయాలను గ్రహించగలుగుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని విశ్లేషించారు.’’

‘‘ధరతి లోకా నితి ధర్మ:’’ అనగా లోకాలను ధరించేది ధర్మము” ప్రజల చేత ధరింపబడేది ధర్మము అని మరొక అర్థము. అంటే ఈనాడు ప్రపంచమంతా ప్రశాంతంగా ఉందంటే కారణం మానవులు ధర్మాన్ని పాటించడం వల్లే. ఇంకా అధర్మం జరుగుతూనే ఉంది కానీ సమాజం అధర్మం జరిగిన ప్రతిచోట చట్టం తన పని తాను చేస్తూ శిక్షిస్తూనే ఉంది. కనుక మానవుల నిత్యజీవిత విధానంలో ధర్మమే ప్రధానమని తెలుస్తుంది. నాలుగు వేదాలయినటువంటి ఋగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అదర్వణ వేదములలో చెప్పబడిన ధర్మాలే తరువాత పురాణాలలో ఇతిహాసాలలో ఆఖ్యానోపఖ్యానాల వేదాల్లోని సారమే మహాభారతంలో ఉంది కాబట్టి భారతాన్ని ‘‘పంచమవేదమని” పిలుస్తున్నాము.

ప్రస్తుతం మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలలో ఇలాంటి ధర్మానికి సంబంధించిన ధర్మసూక్ష్మాలను పరిశీలించినట్లయితే అనేక అంశాలు మనకు కనబడుతున్నాయి.

  1. ‘‘కాలవేది’’ కృష్ణుడు:

యాదవ కుమారులు మునులను ఆట పట్టించడం, మునులు శపించడం, వారు మరలిపోవడం తెలిసినా కృష్ణుడు దానిని నివారించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కృష్ణుడు కాలవేది. అనగా కాలాన్ని మార్చడం సాధ్యం కాని పని. ఒకవేళ మార్చినా అది సృష్టికి విరుద్ధమని తెలిసినవాడు. చెడును నిర్మూలించడానికే కృష్ణభగవానుడి అవతారమెత్తినవాడు కావున యుగాంతం జరుగవలసిన సమయం ఆసన్నమైనది  కావున ఏదో ఒక రూపంలో అంతమవ్వాల్సిందే అని తెలిసినవాడు. భూత, భవిష్యత్తు వర్తమాన కాలాలను నిత్యం గమనం చేయించేవాడు కావుననే కృష్ణుడు నిశ్చల స్వభావుడై ఉండిపోయాడనే ధర్మం వెల్లడవుతుంది.

అలాగే వ్యాసుడు కూడా కాలవేదియే. ఈ ఇద్దరికి భవిష్యత్తులో జరుగబోయేది తెలుసుకావుననే నిశ్చలంగా ఉంది కౌరవ, పాండవ యుద్ధానికి ధర్మక్షేత్రాన్ని వ్యాసుడు నిర్ణయిస్తే, యాదవ నాశనానికి సముద్రతీరాన్ని కృష్ణుడు నిర్ణయించాడు. అంటే మరణాలు కూడ ఒక పుణ్యస్థలంలో జరగాలని నిర్ణయించిన కాలవేదులు.

అందుకే కృష్ణుడు రథం అదృశ్యమయిపోయినా కూడా ఎలాంటి బాధను వ్యక్తం చేయకుండా నిశ్చల స్వభావంతో ఉండగలిగాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైన మహోన్నతమైన వ్యక్తులు ఎలాంటి ఆవేశాలను వ్యక్తం చేయకుండా ఉంటారనే ధర్మసూక్ష్మం తెలుస్తుంది.

  1. తుంగపరకలే రోకళ్ళయిన కాలవైపరీత్యం:

‘‘విధి చిన్నచూపు చూస్తే, తాడే పామవుతుంది” అనే మాట మనం నిత్యం వింటూనే ఉంటాము. వాస్తవానికి తుంగపరక  వలన చిన్న దెబ్బకూడా తగలదని తెలుసు. అయినా అక్కడ కాలవైపరీత్యం వలన రోకలిని పొడిగా చేసి సముద్రంలో కలపడం ప్రమాదం జరుగకూడదని చేసినట్లుగా వున్నా, అదే రోకలిపోడి శక్తిగా మారి తుంగలో ప్రవేశించి, తుంగయే మరణాయుధాలుగా మారడం అనేది యాదవ నాశనం జరుగడానికి విధి ఆడే నాటకం అని అర్థమవుతుంది. కృష్ణుడి ఆజ్ఞతో స్త్రీలను, ఏనుగులను, గుర్రాలను ద్వారకానగరిలో చేర్చడానికి బయలుదేరిన యాదవ వీరుడైన బభ్రుడు కూడా ఒక బోయవాడు విసిరిన తుంగపరకకు మరణించాడు అనేది కాలవైపరీత్యమే. ఈ యాదవ కలహాన్ని గమనించినట్లయితే ‘‘యాదవులు సహజముగ ఆవేశ స్వభావులు.’’ అంటే వారు సహజంగా ఆవేశ స్వభావాలు అనే మాటే వారిలో వారే కలహించుకోవడానికి ఆయుధమయ్యే లాగ మునుల శాపం అనే నెపం కారణమయ్యేలాగ చేసింది కాలం. మానవజీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంటే ఈ మౌసల పర్వంలోని ఈ యాదవ కలహం మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తుంది.

  1. వేటగాడు ఏడ్వడం - కృష్ణుడు ఓదార్చడం:

కృష్ణుడు తాను కూడా అవతారం ముగించవలసిన సమయం ఆసన్నమైనదని తెలుసుకొని పూర్వం దుర్వాసముని వలన పొందిన శాపమును ఉపయోగించి తానే మాయ కల్పించి ఒక వేటగాడికి జింక పిల్లవలె కనిపించే భ్రాంతిని కల్పించి తన ప్రాణ త్యాగం చేసేలా నిర్ణయం తీసుకుంటాడు. కృష్ణుడు సంకల్పించి నట్లుగానే జరగడం, వేటగాడు దగ్గరకు వచ్చి కృష్ణుడని తెలిసిబోరున విలపించడం చూసిన కృష్ణుడు అది నీ తప్పుకాదు, ఇది ఇలా జరుగనుంది అని అతడిని ఓదార్చడంలో కృష్ణుని ధర్మతత్వం అర్థమవుతుంది.

‘‘ధర్మ రక్షణమునకై దయావిధేయమగు ఖేలంబున” అనే తిక్కన పద్యంలో ఆ విష్ణుమూర్తి ధర్మం యొక్క రక్షణ కోసం అనేక అవతారాలు ధరిస్తూనే ఉంటాడని దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని భగవద్గీతలోనే చెప్పబడినది. ఈ కార్యక్రమాలను నిర్వర్తించడం భగవంతుడికి ఒక ఆట ఆడినంత తేలిక అని వివరిస్తుంది. భగవంతుడు తలుచుకుంటే అసాధ్యమును సుసాధ్యం కూడా చేయగలడు. ఉత్తర కుమారుడు పరీక్షిత్తు మరిణించినప్పుడు ఎంతో ప్రేమతో బ్రతికించినవాడు, ఈనాడు యాదవులందరూ కొట్టుకొని మరణిస్తుంటే ఆపడం లేదు అంటేనే కృష్ణుడు ధర్మరక్షణార్థం చూస్తూ ఉండి పోయాడని అర్థమవుతుంది.

‘‘కృష్ణుడు తలుచుకుంటే కాలచక్రాన్ని మార్చగలడు కానీ అలా మార్చడానికి ఇష్టపడలేదు.’’ మునుల శాపంను అనుసరించే అంతా జరుగుతుందని నిశ్చయించుకున్నట్లు అర్థమవుతుంది.

  1. అర్జునుడు వసుదేవునికి పితృకార్య నిర్వహణ:

తండ్రి మరణం తర్వాత కుమారుడు తండ్రికి పితృకార్యాన్ని, దహన సంస్కారాలను చేయాల్సి ఉంటుందని ప్రస్తుతం మనకు తెలిసినదే. ఇక్కడ యాదవ కలహాల ద్వారా యాదవులంతా మరణించిన తరువాత కృష్ణుడు అర్జునుడు వస్తాడని వసుదేవుడికి చెప్పి బలరాముని వద్దకు వెళ్ళిపోతాడు. అంటే కృష్ణుడు తండ్రి మరణం చూడకుండా, కృష్ణుడు మరణించే విషయం తండ్రికి తెలియకుండా ఉంటుంది. అలాగే తండ్రి కార్యక్రమాలను చేయడానికి తన ప్రాణానికి ప్రాణమైన నర నారాయణ స్వరూపులలోని నరుడైన అర్జునుడికి బాధ్యత అప్పగించినట్లుగానే దారకున్ని పంపించి అర్జునుడిని తీసుకురమ్మనడం శ్రీకృష్ణుని అంతరంగ ధర్మ రహస్యం అని తెలుస్తుంది. ఈ విధంగా దారకుడు ద్వారక గురించి చెప్పగానే అర్జునుడు బయలుదేరి రావడం, వసుదేవున్ని ఓదార్చడం, చివరగా వసుదేవుడు మరణించగా, కృష్ణుని స్థానంలో వసుదేవునికి కుమారునిగా వ్యవహారించి పితృకార్యక్రమాలను నిర్వహించి ఆపద్ధర్మంగా నిలిచాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడిని వెతుక్కుంటు వెళ్ళిన అర్జునుడు శ్రీకృష్ణుడి మృతదేహాన్ని చూచి బోరున విలపించి మరణవార్త ద్వారకా నగర వాసులకు తెలపడం ఈ సమయంలో మంచిది కాదు అని భావించి ఆ అడవిలోనే శ్రీకృష్ణుడి దహన సంస్కారాలకు అగ్నిని, కర్రలను ఏర్పాటు చేసి కృష్ణుడికి కూడా పితృకార్యక్రమాలను నిర్వర్తించి తన ధర్మనిరతిని చాటుకున్నాడు.

అలాగే తర్వాత బలరాముని మృతదేహమును కూడా గమనించిన అర్జునుడు బలరామునికి కూడా దహన సంస్కారాది కార్యక్రమాలను నిర్వర్తించాడు. అయితే ఇక్కడ బలరాముడు పెద్దవాడు కదా, కృష్ణుడికి ముందుగా కార్యక్రమాలను నిర్వర్తించాడు. అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. కానీ అర్జునుడు కృష్ణున్ని వెతకాలనే ఆలోచనతో మాత్రమే బయలుదేరడం, కృష్ణున్నే ముందుగా గుర్తించడం వలన బలరాముని ఊహా కానీ, ప్రస్తావన కానీ అర్జునుడికి రాలేదు కావున ఇది ధర్మబద్ధమైనదే అని తెలుస్తుంది. మరొక విధంగా ఆలోచించినా కూడా కృష్ణుడు విష్ణుమూర్తి అంశ, బలరాముడు ఆదిశేషువు అంశ కావున ఈ విధంగా చూచినా కూడా ధర్మబద్ధమైనదేనని తెలుస్తున్నది.

ఇక్కడ ఇంకొక ముఖ్యవిషయం ఏమనగా విష్ణుమూర్తి సాక్ష్యాత్తు భగవంతుడు. కానీ ద్వాపర యుగమునందు మానవ రూపంలో కృష్ణుడిగా జన్మించాడు. కావున మానవుని వలె దేహమును వదలడం వలన మృతదేహమునకు దహన కార్యక్రమాలను నిర్వర్తించడమే ధర్మం కావున జ్ఞానమూర్తి కృష్ణుడు అవతారం చాలించి వెళ్ళినా కూడా మానవ విధానం ధర్మపద్ధతులు పాటించినట్లు మనకు తెలుస్తుంది. కానీ శ్రీకృష్ణుడు స్వశరీరంతోనే వైకుంఠమునకు ప్రవేశించినట్లు శ్రీ మహాభారత తత్వ పురాణంలోనూ, బ్రహ్మాండపురాణంలోనూ ఉన్నది. ‘‘తన స్వరూపమును ప్రకాశింపజేయుటే భగవంతుని జన్మయనబడును. శ్రీకృష్ణుడు దేహమును త్యజింపకుండియే త్యజించిన దేహామువలె స్వస్వరూపముతో సమానమయిన యొక యాకృతిని జూపియుండెను. దీనిచే దగ్థము చేయబడినట్లు చెప్పబడియున్న ఆకారము అప్పటికప్పుడు చూపబదనదగుటచే దానికి యట్టి సంస్కారము జరిగినదని తెలుస్తుంది.’’

  1. అర్జునుడు బలరామకృష్ణుల మరణవార్తను వారి భార్యలకు చెప్పి క్షమాపణ కోరుట:

శ్రీకృష్ణబలరాములను వెతుకుతూ వెళ్ళి వారి మృతదేహాలను కనిపెట్టిన అర్జునుడు వారిని ద్వారకకు తీసుకొని వచ్చే సమయం లేనందున అంటే తెల్లవారితే ద్వారక సముద్రంలో మునిగిపోనున్నది కావున, మిగిలిన ప్రజలందరిని కాపాడవలసిన బాధ్యత అర్జునుడిదే కాబట్టి అర్జునుడు వారికి అడవిలోనే దహన సంస్కారాలు నిర్వహించినట్లు దు:ఖిస్తూ చెప్పుకుంటూ క్షమాపణ కోరుతాడు. ఈ విషయమే తన అంతరంగ మందు బాధపెట్టుచున్నదని వారిని వేడుకోవడం అర్జునుడి గొప్పదనం.

  1. అర్జునుడి వ్యధ - వ్యాసమహార్షి బోధ:

రుక్మిణి, జాంబవతి మొదలగు స్త్రీలు సహగమనం చేయగా అర్జునుడు బోరున విలపించి దు:ఖంతో నిండిన ముఖంతో వ్యాసమహర్షి వద్దకు వెళ్ళగా, వ్యాసుడు అర్జునున్ని ఎందుకు దు:ఖిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడు వ్యాసునితో యాదవ నాశనం, శ్రీకృష్ణబలరాముల నిర్యాణం జరిగినదని ఏడుస్తూ చెప్పి, నేను నా శక్తినంతా కోల్పోయాను. ఎవరినీ రక్షించలేకపోయాను అని విలపిస్తాడు. దీనివలన నా మనస్సు గాయపడినది, శోకమయమవుతున్నది. నేను ఏమి చెయ్యాలో చెప్పండి అని ఏడుస్తాడు. అప్పుడు వేదవ్యాసుడు ‘‘అర్జునా! కాలం అనుకూలమైతే మానవులకు బుద్దీ, తేజస్సూ, వివేకమూ కలుగుతాయి. అదే కాలం వ్యతిరేకమైతే ఇవన్నీ నశిస్తాయి.’’ కాలానికి ఎదురుతిరగడం సరైన పద్ధతి కాదని కృష్ణుడు యాదవనాశనం జరుగుతున్న కూడా ఏమి అడ్డగించకుండా ఉన్నాడు అంటే కృష్ణుడు చేయలేక కాదు. సమస్తలోకములను నడిపించేవాడు కృష్ణుడు. అతడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అది ధర్మానికి విరుద్ధం అవుతుంది. కాబట్టే కానున్న కార్యం కావలసినదేనని తలిచాడు అని వివరించాడు. అలాగే మీరు అయిదుగురు ఈ భూమి మీద చెడును నివారించడానికే జన్మించారు. చేయవలసిన కార్యక్రమములను పూర్తి చేశారు. కాబట్టి మీ ఆయుధాలు ఇక మీదట పనిచేయవు. జ్ఞానులు శోకించరు, గర్వించరు అని శ్రీకృష్ణుని ద్వారా విన్నా కదా. కాబట్టి ఇక మీదట నీవు శోకించకుండా మీరు కూడా వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించి దేహాములను వదిలేయండి అని బోధ చేస్తాడు.

  1. వ్యాసమహార్షి చేసిన బోధను అర్జునుడు ధర్మరాజుకు వివరించుట:

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత నాకు ‘‘ఈ రాజ్యం వద్దు నేను పరిపాలించను” అని బాధపడుతున్న సమయంలో అర్జునుడు రాజు నిర్వర్తించాల్సిన విషయాలను ధర్మరాజుతో చర్చిస్తాడు. ఇంత కష్టపడి చేసిన యుద్ధం రాజ్యం వదిలి వెళ్ళడానికా, క్షత్రియుడు ‘‘యజ్ఞయాగాది కర్మలు చేయాలి” అని రాజ ధర్మసూక్ష్మాన్ని వివరిస్తాడు.

అదే విధంగా ప్రస్తుత మౌసల పర్వంలో వ్యాసుడు చెప్పిన ధర్మనీతి సూత్రాన్ని, జ్ఞానుల ప్రవర్తనను కూడా అర్జునుడు ధర్మరాజుకు వివరించడంతో మౌసల పర్వం పూర్తవుతుంది. ఇక్కడ అర్జునుడు చెప్పిన ఈ రెండు విషయాలను గమనించినట్లయితే ఒకటి ధర్మరాజు రాజ్యపరిపాలన చేయనన్నప్పుడు క్షత్రియ ధర్మం గురించి చెప్పి ‘‘ప్రజలు వారి వారి ధర్మాల్ని అతిక్రమించకుండ’’ చూసే రాజు యొక్క బాధ్యత చెప్పడం, అలాగే పాండవులు వచ్చిన పని పూర్తయినది కావున దేహ త్యాగం చేయాలని చెప్పే విషయం కూడా కాలంతో పాటు నడవాలనే ధర్మప్రవర్తనను కలిగినట్లు తెలుస్తుంది.

అర్జునుడు ధర్మరాజుతో వ్యాసుడు చెప్పిన అంశాలను విన్న వెంటనే ధర్మరాజు దేహత్యాగమునకు సిద్ధపడి అదే విషయాన్ని అర్జునుడికి చెప్పగా అర్జునుడు కూడా అందుకు అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని భీమనకుల దేవులకు కూడా చెప్పగా వారందరూ కూడా ధర్మరాజు మార్గంలో నడవడానికి సిద్ధపడడమే మహాభారతంలోని ధర్మసూక్ష్మం. పంచపాండవులు, ద్రౌపది కర్మను త్యజించాలని, మహాప్రస్థానం చేయాలని నిశ్చయించుకుంటారు.

ఈ విధంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని రాజ్యం, ఐశ్వర్యం, ప్రాణం అనే వాటిపైన ఆశ లేకుండా ధర్మంగా నడవడమే పాండవులు ధర్మాన్ని అనుసరిస్తారు అని పేరు రావడానికి కారణం.

  1. ధర్మరాజు ఇంద్రునితో శునకం గురించి పోరాడడంలో ధర్మనిష్ఠ:

మహాప్రస్థానం ప్రారంభమయ్యి పంచ పాండవులలోని నలుగురు పాండవులు, ద్రౌపది పడిపోయి కేవలం ధర్మరాజు, కుక్క మాత్రమే మిగలగా ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజును తన రథంలో స్వర్గానికి రమ్మంటాడు.

అప్పుడు తనవెంట ప్రారంభం నుండి నడిచిన కుక్క కూడా వస్తుందని ధర్మరాజు, రాకూడదని ఇంద్రుడు వివాదం జరుగుతున్న సందర్భంలో కుక్క తనను నమ్ముకొని ప్రారంభం నుండి ప్రయాణం చేస్తున్నది కావున అది రాకుండా నేను కూడా రాలేను అని

“…………… నత్యంత ధృఢభక్తి నాశ్రయించి

పుర మేను వెడలునప్పుడు మొదల్‌ గా దోన!

చనుదెంచె నీ భవ్య సారమేయ ………

ధర్మరాజు తన సమత్వ ధర్మాన్ని చాటినాడు. ఇది ఇంద్రుడు ధర్మరాజు ధర్మత్వం అందరికి తెలియజేయడానికి, ధర్మరాజును పరీక్షించడానికి పెట్టిన ఒక ధర్మ పరీక్ష.

ఇంద్రుడు ధర్మరాజుతో ‘‘నీ ప్రియురాలైన ద్రౌపదిని వదిలావు, నీ మాట జవదాటని సోదరులని వదిలావు” వారెవరి మీద లేని మమకారం ఈ కుక్కమీద ఎలా వచ్చింది” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు వారందరూ మరణించారు. వారిని బ్రతికించే శక్తి కూడా నాకు లేదు. నేను ఎంత ఏడ్చినా వారు తిరిగిరారు. కానీ ఈ కుక్క ప్రాణాలతో ఉంది. నాతోనే ప్రయాణం చేస్తుంది. నన్నే నమ్ముకుంది కావున దీనిని వదలలేనని సమాధానమిస్తాడు.

ధర్మరాజు కుక్కను కూడా తనవెంట అనుమతించాలని కోరిన సమయంలో సమాజానికి ఉపయోగపడే, అనుసరించాల్సిన కొన్ని నియమాలను కూడా వివరిస్తాడు. ఆపదలను రక్షించుమని శరణుకోరిన వారిని, స్నేహితులకు, ద్రోహం చేయడం, ఇంటి ఇల్లాలును చంపడం, బ్రాహ్మణుల  ధనాన్ని దొంగిలించడం వంటి మొదలగు పనులు అన్ని కూడా అపరాధముతో కూడుకున్నవి. అలా చేయడం ద్వారా పాపాన్ని, అధర్మాన్ని అంటిపెట్టుకున్నట్లే అవుతుంది అనే ధర్మసందేశాన్ని కూడా ఈ పద్యం ద్వారా అందించారు.

  1. యమధర్మరాజు ధర్మరాజు ధర్మనిరతిని కొనియాడుట:

            ఒకనాడు మంచినీటి కోసం వచ్చి నీ నలుగురు సోదరులు మరణించినప్పుడు నేను ప్రత్యక్షమై ఎవరో ఒకరినే బ్రతికిస్తాను ఎవరు కావాలో కోరుకో అన్నప్పుడు నీవు ధర్మంగా ఆలోచించి కుంతి సంతానంలో నేను మిగిలాను, మాద్రి సంతానంలో ఎవరూ బ్రతికిలేరు కావున నకులుడిని బ్రతికించుమని కోరుకున్నావు. అలా కోరుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అది నీకు మాత్రమే సాధ్యమని ధర్మరాజు యొక్క ధర్మనిరతిని యమధర్మరాజు కొనియాడాడు.

  1. నారదుడు:

ఎంతో మంది రాజుల యొక్క గొప్పతనాలను, కీర్తి ప్రతిష్టలను, ప్రశంసలను విన్నాము కానీ వారెవరు కూడా ఈ విధంగా స్వశరీరంతో స్వర్గప్రవేశం చేయలేదు. ఇది నీకు మాత్రమే సాధ్యమయినది అంటే నీవెంత ధర్మనిష్ట పరుడివో అర్థమవుతుంది. “దానముల దపంబులను దద్దయు బేర్గలయట్టి వారలనే” అనే పద్యంలో నారదుడు ధర్మరాజుతో అంటాడు.             

  1. సోదరులు ఉన్నచోటే తనకు స్వర్గం అనే ధర్మరాజు ధర్మసూక్ష్మం:

బ్రతికి ఉన్నన్ని రోజులు అగ్రజుని మాటే వారి మాటగా ఉన్న సోదరులు ధర్మరాజుకు ప్రాణం. అందుకే స్వర్గానికి ఇంద్రుడు రమ్మన్నపుడు నీ సోదరులు స్వర్గంలోనే ఉన్నారు. అనడం వల్లనే ధర్మరాజు స్వర్గప్రవేశం చేశాడు. స్వర్గానికి వెళ్ళిన వెంటనే సుఖాలను అనుభవిస్తున్న దుర్యోధనుడిని చూచిన ధర్మరాజు ముందుగా నా సోదరులను, ద్రౌపదిని చూపించమని అడుగుతాడు. వారు ఉన్నచోటే నేనూ ఉంటాను. ‘‘అది పుణ్యలోకమైనా, పాప లోకమైనా వారున్నదే నేనూ ఉండే లోకం, వేరే లోకాలు ఎంత గొప్పవైనా నాకొద్దు” అని అనడంలో ధర్మరాజు ఏ స్వర్గ సుఖాలను ఆశించకుండా తన ప్రాణమైన సోదరులు మాత్రమే కావాలనడంలో ధర్మరాజు వ్యక్తిత్వం తెలుస్తున్నది.

‘‘………………………………… నాదు తమ్ములం

గను గొను నంతకున్సుఖముగా గొన నయ్యెద

అనే పద్యంలో వారుండే చోటు సుఖాన్నిచ్చేదైనా సరే, దు:ఖాన్నిచ్చేదైనా సరే అక్కడే నేనుంటాను అనడంలో అందరి మెప్పును పొందే వ్యక్తిగా ధర్మరాజు కీర్తికెక్కినాడు. ఈ విధంగా ధర్మరాజును గమనిస్తే ధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఏయే గుణాలను కలిగి ఉంటే సమాజం కీర్తిస్తుందో, విశ్వం పరీరక్షించబడుతుందో తెలుస్తుంది. ధర్మాన్ని అనుసరించడమైనా, ధర్మాన్ని కాపాడటమైన ఎంత నిష్ఠగా ఉంటే సాధ్యమో ధర్మరాజు వల్లనే తెలుస్తుంది.

  1. రాజైన వాడికి నరక దర్శనం తప్పనిసరి:

ధర్మరాజు స్వర్గంలోకి ప్రవేశించగానే దుర్యోధనుడు స్వర్గసుఖాలను అనుభవిస్తున్నట్లు ఉండటం తట్టుకోలేకపోతాడు ధర్మరాజు. అలాగే తన సోదరులు ద్రౌపది నరకం అనుభవిస్తున్నట్లు భ్రాంతిని కలుగజేస్తాడు ఇంద్రుడు. వీటిని చూచి భరించలేక ధర్మదేవతా నీవు గ్రుడ్డిదానివా? న్యాయం లేదా అని వ్యధ చెందుతాడు.

‘‘ఈగ కాలియంత యేనియు బాపంబు!

వీరి వలన గనుట వినుట గలుగ

డొక్కనాడు….

అనే పద్యంలో నా సోదరులు ఈగ కాలు అంతటి పాపము కూడా ఏ ఒక్కనాడు చేసి ఉండరు. అలాంటి వారు ఇంతటి నరకం అనుభవిస్తున్నారా అని దు:ఖించి దూతను వెనక్కి వెళ్ళి పొమ్మంటాడు. ఆ వెంటనే ఇంద్రుడు వచ్చి మానవ రూపంలో వున్న నీకు యోగం సిద్ధించబోతుంది. నీవు క్షత్రియుడివి. నీవు ఎలాంటి తప్పు చేయకున్నా రాజు అనే వాడికి నరకం కొంతైనా అనుభవించక తప్పదు. కావుననే ఈ కొంచెమైన భ్రాంతి కలిగినది.

ముగింపు:

“లౌకిక సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మ స్వధర్మానుసరణను విడువరాదు” అనేక విధి విధానాలను అనుసరించవలసి సమయంలో కూడా ధర్మం తప్పకుండా నడవడమే ధర్మతత్వజ్ఞులు అని మహాభారతం నిరూపిస్తున్నది. ఈ విధంగా ధర్మతత్వ కావ్యంగా నిలిచినది మహాభారతం. దీనినే “ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, వేదాంతులు వేదాంతమని, పౌరాణికులు బహు పురాణ సముచ్ఛయమని, కవి వృషభులు మహాకావ్యమని” ప్రస్తుతించిన మహాభారతాన్ని వ్యాసప్రబోధిత ధర్మాన్ని కవిత్రయం వారు ఆంధ్రదేశంలో తెలుగుభాషలో మహాకావ్యరూపంలో ప్రతిష్ఠించారు.”

 

ఆధార గ్రంథాలు:

  1. ఆంధ్రమహాభారతము - ధర్మతత్వము
  2. తిక్కన మహాభారము – మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు
  3. మహాభారతము, ఉప్పులూరి కామేశ్వర రావు
  4. తిరుమల తిరుపతి దేవస్థానం - మహాభారతము
  5. వ్యాసభారత పరివస్య
  6. వ్యాససాహితీ సంహిత