AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

ISSN: 2583-4797
Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-12 | November 2022| ISSN: 2583-4797

3. తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి సంఘటనాత్మక కవిత్వం: విశ్లేషణ

మేకల శ్రీనివాసరావు

పరిశోధక విద్యార్థి, ఆంధ్ర యూనివర్సిటీ,
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం.
సెల్: 8185070004,, email: mekalasrinivasarao29@gmail.com


Keywords:  కవిత్వం, తెన్నేటి, లక్ష్మీనరసింహమూర్తి, సంఘటనాత్మకకవిత్వం, దళితకవిత్వం.

ఉపోద్ఘాతము:

మానవ జీవితంలో వివిధ సంఘటనలు సంయుక్తం, సంఘజీవిగా ఉండటం అనేది దీనికి ప్రధాన కారణం. కుటుంబం, సమాజం, వ్యవస్థలో అన్ని వ్యక్తులతో కూడినవి కనుక పుట్టుక నుండి మరణం వరకు వ్యక్తిగత, సామూహిక ఘటనలెన్నో  జీవితంలో పెనవేసుకుని ఉంటాయి. ఆనందం, విషాదం, పండగలు, పోరాటాలు, చర్యలు నిర్ణయాలు, నిశ్చయాలు, అనుభూతులు, అనుభవాలు అన్ని సంఘటనలతో కూడుకొనే ఒక బాధాకర సంఘటన్నో, ఓ సంతోషకరసంఘటన్నో, మరేదో ఘట్టాన్నో వ్యక్తి జీవితంలోనూ, సమాజ చరిత్రలోనో చెరిగిపోని ముద్ర వేసి అలా నిలిచిపోయే నైజంతో ఉండిపోయేవి. వ్యక్తి యొక్క పుట్టినరోజు నుండి ప్రపంచ దేశాల మధ్య జరిగే దౌత్యాలు, యుద్ధాలు వంటి బృహత్కార్యాల వరకు సంఘటనలమయమే. గతాన్ని గమనిస్తే భవిష్యత్తుకి బాటలు వేసిన ఘటనలు అనేకం ఉంటాయి అలాగే వర్తమాన సందర్భాలు రేపటికి చరిత్రగా మారి అనేక కార్యాల సమూహంగా ఉంటుంది. ఇందులో ఎన్నెన్నో సంఘటనలు కలగలిసి ఉంటాయి. కవిత్వీకరణలో సంఘటనాత్మకత కవిత్వం కొంత నాటకీయతనీ, ప్రత్యక్ష అనుభవాల్ని చరిత్రని కనుల ముందు నిలుపుతుంది. వాస్తవిక ఆధారంగా సాగాల్సిన విధి విధానము ఉంటుంది గనుక రచయిత భావాజాలం, విజ్ఞత, స్పందనలో ఏ అంశాలపై ఉంటాయో తెలిసే అవకాశం ఉంటుంది. తెన్నేటి లక్ష్మీనరసింహ మూర్తి గారు కొన్ని ఘటనలను పాఠకుల ముందుంచి వాటి నుండి కొంత నేర్పాలని  జ్ఞాపకాలని ప్రయత్నించడం, మరికొన్నింటి ద్వారా జ్ఞాపకాలను తట్టి లేపడం జరిగింది. సంఘటనలను కవిత రూపంలో తీర్చి తన ప్రతిభని, ఆలోచనలను పంచుకున్నారు. వాటిని పరిశీలించి ఆ విషయాలను ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.

కవిపరిచయం:

ఆంధ్రప్రదేశ్లోని పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో నిడమర్రు మండలం మారుమూల గ్రామమైన పెద నిండ్రకొలంలో శ్రీ వెంకట రామారావు సుబ్బలక్ష్మి పుణ్య దంపతులకు 16.04.1965న జన్మించిన తెన్నేటి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన చిన్ననాటి నుండి తెలుగు భాష పై మక్కువ పెంచుకున్నారు ఒకటి నుంచి ఇంటర్ వరకు తమ మండలంలో పూర్తిచేసి, కందుకూరి, స్వామి వివేకానంద, గుర్రం జాషువా, చిలకమర్తి, నెహ్రూ వంటి వారి వలన తెలుగు భాష పై మక్కువ పెంచుకొని భీమవరం ఓరియంటల్ కళాశాలలో బి.ఎ. (ఓఎల్) చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఎం. ఏ చేసి అనంతరం బి. యిడి. కూడా పూర్తి చేసారు. తెన్నేటి తమ గురువుగారైన శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారి వద్ద తెలుగు భాషలో పలు మెలకువలు ఆపోశన పట్టారు. తెన్నేటి లక్ష్మి నరసింహ మూర్తి ప్రస్తుతం గణపవరం మండలం అర్థవరం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా ఉన్నారు. మాస్టర్ గారి సాహిత్య సేవకు నిరంతరము సేవలందిస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తున్న వారి శ్రీమతి దర్భ రమా ప్రతిభ గారు గణపురం జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ (పి. యస్)గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె శ్రీమతి ఘంటసాల సాయి జ్యోత్స్న అల్లుడు విజయ్ కృష్ణ (క్లర్క్) స్టేట్ బ్యాంక్ గూడూరు. ఒక కుమారుడు సాయి తేజ (సి.ఎ) చదువుతూ, తమ వంతు సహాయ సహకారం తండ్రికి అందిస్తుంటారు.     

ఒక పక్క పంతులుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరోపక్క సమాజంలో చైతన్యాన్ని విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం సామాజిక అవగాహన కల్పించడం కోసం ఎన్నో కవితలు, కథలు,నాటకాలు రాస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందారు. పాఠకుల అభినందనలు పొందిన తెన్నేటి మాస్టర్ గారు ఒక్కపొడి, సిగరెట్, అమ్మ అక్షరం, మొదలైన కవితలు 1000 వరకు రాసారు.  తెన్నేటి మాస్టర్ గారి కవితలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, అస్త్రం, నేటి నిజం, స్ఫూర్తి, తెలుగు విద్యార్థి, ఆంధ్ర డైరీ, పూర్ణిమ, బావ తరంగణి, మొదలైన పత్రికలలో ప్రచురించబడుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా సెప్టెంబర్ 05.2016 గురుపూజోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయపురస్కారం తెన్నేటి మాస్టర్ అందుకున్నారు.

1. దారుణ ఘటనలు:

సత్యం-అసత్యం, మంచి-చెడు, హింస-అహింస, మానవత్వ-దానవత్వం, అన్ని మనిషి వెలుగు-నీడల్లా కలిసి ఉంటుంటాయి. వీటిలో ఏది సరైనదో అటు వెళ్లడం అనేది మంచి వ్యక్తిత్వం. మనిషి మనసు చంచలం మరియు పట్టు లేనిది. దాన్ని నియంత్రించే ఆత్మసాక్షి ద్వారా మనల్ని మనము తట్టి లేపుకుంటూ విచక్షణతో నడుచుకోవాలి. కానీ మనిషిలో మృగం కొందరిలో అప్పుడప్పుడు నిద్ర లేస్తుంది. ఆ సమయంలో దారుణాలు జరగొచ్చు. మరికొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోవడం అవి కొంత పైశాచికానికి నిదర్శనంగా ఉండి మానవ సంబంధాలను, విజ్ఞతన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా ఉంటాయి. అలాంటి సంఘటనలను ఇతివృత్తాలుగా కలిగి ఉన్న కవితలను ఈ ఉపయోగంలో వివరిస్తున్నాను.

అర్థం లేని అగ్రహావేశాలకు బస్సులను తగులు పెట్టే సంఘటనలను తప్పని చెప్తూ'పరిగెత్తనివ్వండి'అనే శీర్షికలో వెలువరించారు. బస్సు అనేది ఒక వస్తువు అయినా దాని ఆత్మఘోషలోతన గలాన్ని రచయిత వినిపించారు. సమ్మెలో, రాస్తారోకోలు, పార్టీల గొడవలు, వర్గ పోరులు వంటివి జరిగేటప్పుడు ప్రభుత్వ రవాణా వాహనమైన బస్సులను తగలబెట్టడం వంటివి అల్లరి మూకలు చేస్తుంటాయి. ఇది ఎంతో హేయమైన చర్యగా అభివర్ణించి'బస్సు'పాత్ర మాటల్లో ఆవేదనకి రూపాన్ని ఇచ్చారు.

కవిత:  నాకెందుకీ శిక్ష..? / ఏ పాపం చేశాను నేను...? / నన్నెందుకు తగుల బెడ్తున్నారు...? / నేనే కదా జగతి ప్రగతి రథచక్రాన్ని/ మెరుపులా పరుగెత్తే ఎర్ర రథాన్ని / అతి సామాన్యుడి పుష్పక విమానాన్ని/ అందర్నీ సకాలంలో గమ్యాలకు చేర్చదాన్ని / ప్లీజ్... నన్ను పరుగెత్తనివ్వండి / కక్షల కార్పన్యాలతో పని చేయకండి / ఆగ్రహ జ్వాలల్లో నన్ను మంట చేయకండి / నేను ఆగితే స్తంభించదా ప్రగతి / నేను సాగితే పరుగెడుతుంది జగతి / పరిగెత్తనివ్వండి... నన్ను / సదా మీ సేవలో....

విశ్లేషణ:

ఈ అంతర్మథనం మనకి మనమే చేసుకుంటున్నా ఆర్థికనష్టానికి, వ్యక్తిత్వలోపానికి, పైశాచికతానికి సాక్ష్యాలు. తనని శిక్షించవద్దని, సదా మీ సేవలో పరిగెత్తనివ్వమని బస్సు ఆక్రోచిస్తుంది. కొన్ని లక్షల ఖరీదు చేసే బస్సుని ప్రయాణికుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యార్థం ఏర్పాటు చేస్తుంది. ఈ బస్సుని ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తుంటారు. నిజానికి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే మన నెత్తిపైనే పన్నుల రూపంలో అదనంగా పడుతుందన్న పడుతుందన్న అంచనా లేక, ఉన్న కూడా అదేదో పెద్ద హీరో నిజంగా తలచే మూకలా అర్థం పర్థం లేని పనులు. ఫిబ్రవరి 2, 2000 లో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థుల పర్యటన బస్సులపై పెట్రోల్ బాంబు విసిరి తగలబెట్టగా అందులో 42 మంది బాలికలు, ఇద్దరు లెక్చరర్లు ఉన్నారు. అందరూ ఎలాగోలా కిందకు దిగగలిగినా ముగ్గురు ఆడపిల్లలు సజీవ దహనం అయ్యారు. మరియు 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన జయలలితకు ఒక హోటల్ కేసు విషయంలో వ్యతిరేక తీర్పు వచ్చిన సందర్భంలో జరిగింది. ఇలాంటి సంఘటనలో అడుగంటిన మానవత్వానికి ప్రతీక. మనిషి మృగంగా మారితే సందర్భాలు ఏమైనా బస్సులు తగలబెట్టడం అనే ప్రభుత్వ ఆస్తి ధ్వంసనలు సహింపరానివని తెలియచెప్పారు.

అభివృద్ధిని కాలరాయడం తగనది. ఎక్కడ ఏ రాదాంతం జరిగినా బస్సులను అగ్నికి ఆహుతి చేసే ఘటనలు ఎన్నోసార్లు పునరుత్తమవుతున్నాయి. మా ఆవేశాలు వినాశనానికి దారి తీసేవిగా ఉంటాయని బెదిరింపు చర్యలతో  ప్రజల్లోనూ, ప్రభుత్వాలలోనూ కలిగించి పంతాన్ని చెల్లించుకోవడానికి చేసే పనికిమాలిన పని. ఇలాంటివి చేసేవారు, చేయించేవారు సంఘద్రోహులు అనవచ్చు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసే వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి. అలా విలువైనవి తగలబడిపోతే ప్రజలకే నష్టం అని గ్రహించాలని ఈ సంఘటన ఇతివృత్తంగా ఎంచుకొని ఆలోచింపజేశారు. ప్రగతికి అడ్డుకట్ట వేసే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

2. పోరాట ఘటనలు:

చరిత్రలో యుద్ధఘటనలో, పోరాటాలు ఎప్పుడు ప్రత్యేకమైనవే. న్యాయాన్యాయాల మధ్య జరిగేవిగా, విజయం కోసం ఇరువైపులా వారు యోచించడం, రక్తసిక్తుల వ్యూహాలు అన్ని ఒక కారణంతో ఒక ఫలితం కోసం ఏర్పడుతుంటాయి. అవి  రెండు దేశాల మధ్య కావచ్చు, ఇరు ప్రాంతాల నడుమ కావచ్చు, ఇద్దరు ప్రముఖ వ్యక్తులకు మధ్య ఏర్పడిందైనా కావచ్చు. ఏ పోరాటమైన హేతువు లేకుండా ఏర్పడదు అది సహేతికమా, కాదా అన్నది కారణాన్ని అనుభవిస్తుంది. కానీ గెలుపు మాత్రం ఎవరి వైపు బలం అధికమో వారి వైపు ఉంటుంది. ఆ మలుపును మాత్రం ఓ బృహత్ పరిణామానికి దారి తీసేదిగా చెప్పవచ్చు. అలా చరిత్రలో గుర్తుండిపోయే ఆ తరహా సంఘటనలను రచయిత కవిత రూపంలో మలిచారు. వాటిని ఇప్పుడు పరిశీలిస్తున్నాను.

ఎన్నో వందల సంవత్సరాల పూర్వం బ్రిటిష్ వారి మీదకు తిరగబడిన మొదటి స్వాతంత్ర్య సంగ్రహం గురించి' నూట యాభై వసంతాలు'(1857-2007)లో కనులకు గట్టారు. భారతదేశంలో అనాదిగా రాచరికపు పాలన ఉండేది. రకరకాల ఆంక్షలు, శాసనాలను చేసారు. దీంతో కొందరు దేశభక్తులు వారిపైకి తిరగబడ్డారు. అదే తొలి స్వాతంత్ర్య సమరంగా చరిత్రకెక్కింది. ఆ యుద్ధ విశేషాలను ఇక్కడ తెలియజేశారు.

కవిత: భారతీయుల ఆత్మభిమానాన్ని తట్టి లేపిన ఉద్యమం/ తరతరాల భారతీయుల దాస్య శృంఖలాల ఛేదనం / తొలిగా ఊపిరూలూదిన ఝాన్సీ లక్ష్మీబాయి సంకల్పం/ తాంతియాతోపే, నానాసాహెబ్ల ఆలోచన దర్శకత్వం / తెల్లవారిపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వైనం / వేలాది సైనికుల విరోచత పోరాట చైతన్యం / అఖండ భారత విముక్తికై జరిగిన తొలి పోరాటం / అంచెంచల పోరాటాల కందిన వారసత్వం సంగ్రామం / మలితరం వారికి నినాదమైన వందేమాతరం / భారతజాతి యావత్తుకు దేశభక్తి ప్రేరేపితం / 1857 నాటి తొలి స్వాతంత్రయ ఉద్యమం / నూట యాభై వసంతాల చారిత్రక స్మరణం/ ప్రతి భారతీయుల దేశభక్తి నిరూపితం.

విశ్లేషణ:

బానిసలుగా బ్రతకలేనని మా దేశంలో మాపై ఆంక్షలు ఏంటనే తిరుగుబాటు ఆత్మజ్ఞానంతో కూడిన పోరాటమే 1857 సిపాయిలు తిరుగుబాటు. రాజకీయ, సాంఘిక, మత సంబంధ, ఆర్థిక సైనిక కారణాలు ప్రథమ, స్వాతంత్ర్య సంగ్రామానికి కారణాలయ్యాయి.' వెల్లస్లీ' సైన్య సహకార పద్ధతి; డల్హౌసీ రాజ్యసంకరణ సిద్ధాంతం, కారన్ వాలిస్ శాశ్వత భూమి శిస్తూ విధానం వంటివి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, ఈశ్వరీ కుమారి దేవి, తులసిపూర్ రాణి వంటి వారి నాయకత్వంలో తిరుగుబాటు పోరు జరిగింది. యుద్ధంలో బ్రిటిష్ వారిదే పై చేయి అయినా తర్వాత చేసిన స్వాతంత్ర్య పోరాటానికి తొలిమెట్టు అయింది. కొందరిలోనో, కొన్ని ప్రాంతాలోనో రగిలిన అసంతృప్తి అణిచివేతకు గురవుతుంది కనుక దేశ ప్రజలందరూ సంఘటితం కావాలనే పాఠాన్ని నేర్పించిందన్న విషయాన్ని తెలిపారు.

ఒక చారిత్రక విజయం వెనుక ఎందరివో త్యాగాలు, బలిదానాలు ఉంటాయి. అన్యాయానికి తలవంచితే బానిస బతుకులవుతాయి. కనీసం భవిష్యత్ తరాలైన బాగుండాలంటే ముందు తరం వారు తిరగబడి చైతన్యాన్ని ఒక ఉద్యమంలా మార్చే స్ఫూర్తిని అందించాలి. 1857 పోరాటం ఎన్నో పాఠాలు నేర్పింది. అధునాతన ఆయుధాలతో ఉండే బ్రిటిష్ వారిని యుద్ధంతో గెలవలేమని, దేశ ప్రజలందరూ ఒకటైతే తప్ప పరాయి పాలన అంతం కాదని ఐకమత్యం, అహింసా మార్గం ఆచరిస్తే స్వాతంత్ర్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చునని సూచించింది. ప్రఖ్యాతి ఎంత బలవంతుడైన'చలి చీమల చేత చిక్కిన ఏనుగు' లా చావక తప్పదని ఈ సంఘటన ద్వారా అభిప్రాయపడ్డారు.

ముగింపు:

సంఘటనాత్మకతంలో రచయిత సామాన్యుల జీవితాలు, సమాజం, అంతర్జాతీయ చరిత్ర వంటి కోణాలతో పాటు ప్రతి అంశాన్ని  స్పృశింపజేసేలా ఇతివృత్తాలను ఎంచుకున్నారు. ముఖ్య ఘటనలు జీవితాల్లోకి ప్రవేశించడం వాటి ఫలితాల ప్రభావం ఏవిధంగా ఉంటుందోనన్న విషయంలో ప్రత్యక్ష పరోక్షాలుగా ఆలోచింపజేశారు. దారుణ, పోరాట, పండగల, ఎన్నికల, నోట్ల రద్దు, సాంకేతిక అభివృద్ధి పాటింపులు వాటిలో గత, వర్తమానాలతో పాటు భవిష్యత్తుకి  ఆ సంఘటనలెల ముద్ర పడిపోయాయోనన్న విషయాన్ని కూలంకసంగా చర్చించి వేదికలుగా కవితలను మలిచారు.

పరిశీలన గ్రంధాలు:

  1. లక్ష్మీ నరసింహమూర్తి, తెన్నేటి, (2022). అక్షరగోదావరి (కవితాసంపుటి) గోదావరి సాహితీప్రభ, గణపవరం.
  2. లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరు, (1965) అఖిలభారత కవయిత్రులు, ఆం.సా. అకాడమీ, హైదరాబాద్.
  3. విశ్వనాథరెడ్డి, కేతు, (2000). దీపా దారాలు, సాహితీస్రవంతి, చిక్కడపల్లి, హైదరాబాద్.
  4. శిఖామని (సంజీవరావు), (1998). దళితసాహిత్యతత్త్వం, సాహిత్యవిమర్శ, లిటరరీ సర్కిల్, హైదరాబాద్.
  5. శిలాలోలిత, (2006). కవయిత్రుల కవితామార్గం, సాహితీ స్రవంతి, హైదరాబాద్.
  6. శివరామకృష్ణ, గుడిపాటి, పెన్నా (సం.)-కె. శివారెడ్డి పీఠికలు, పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాద్, 2008.
  7. సత్యనారాయణ, కంభంపాటి-మార్క్సిజం మూల సూత్రాలు, గత తార్కిక భౌతిక వాదం, స్వీయ ప్రచురణ, హైదరాబాద్, 1999
  8. సిమ్మన్న, వెలమల-తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, విశాఖపట్నం, 2005.
  9. సుందరం, ఆర్వీయస్ -ఆంధ్రుల జానపద విజ్ఞానం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలు, హైదరాబాద్, 1993
  10. సుందరం, ఆర్వియస్ -జానపద సాహిత్యం, యువ భారతి ప్రచురణ, హైదరాబాద్, 1992
  11. సుబ్రహ్మణ్యం, జి.వి -సమలోచనం, ఆధునిక ఆంధ్ర సాహిత్య ప్రక్రియలపై సమీక్ష, యువ భారతి, హైదరాబాద్, 1980.
  12. సుబ్రహ్మణ్యం జి.వి -సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1991.
  13. స్కైబాబ- జిల్ జలా, (ముస్లిం వాద కవిత్వం), నీలగిరి సాహితీ, నల్గొండ,1998.
  14. సోమసుందర్, అవంత్సా -  కవిత్వం కాలాతీత కాంతిరేఖ, కళాకేళి ప్రచురణలు,పిఠాపురం,1984
  15. కుటుంబరావు,కొడవటిగంటి - చరిత్ర వ్యాసాలు(వ్యాస ప్రపంచం -2)విప్లవ రచయితల సంఘం,ఆంధ్రప్రదేశ్,డిసెంబర్,2006