AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-5 | May 2022

4. కందుకూరి వారి శాకుంతల నాటకానువాదం

‘శతావధాని’ డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ

తెలుగు సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్,
ప్రశాంతినిలయం క్యాంపస్, శ్రీసత్యసాయి జిల్లా. ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
సెల్: 9247859580.


పరిచయం:

కందుకూరి వీరేశలింగం గారు కవి, భావుకుడు, ధిషణారమణీయుడు, గ్రంథకర్త, ప్రవక్త, సంస్కర్త, యుగకర్త. తెలుగు భాషాకాంతకు వారు పెట్టిన చక్కని అలంకారాలలో ఉత్తమోత్తమైనది నాటకానువాదం. అందులోనూ శాకుంతలం. కందుకూరి వారి ఈ శాకుంతల నాటకానువాదాన్ని రవ్వంత పరిచయం చేసే ప్రయత్నమే ఈ పరిశోధనపత్ర సమర్పణలో ముఖ్యోద్దేశం.కందుకూరి వీరేశలింగ కవికృత గ్రంథములు - మూడవ సంపుటము - భాషాంతరీకృత నాటకములు అనే శీర్షికతో 1950లో ఒక గ్రంథం ప్రచురితమైంది. ఇందులో చమత్కార రత్నావళి మొదలు వినీసు వర్తక చరిత్రము వరకు 8 అనువాదనాటకాలున్నాయి. అందులో శాకుంతలనాటకం, రత్నావళి, మాళవికాగ్నిమిత్రం, ప్రబోధచంద్రోదయం అనే నాలుగూ సంస్కృతానువాదాలు. మిగిలినవి ఆంగ్లానువాదాలు. వీటిలో శాకుంతల నాటకానువాద నేపధ్యాన్ని, అనువాద విధానాన్ని సోదాహరణంగా ఇప్పుడు పరిశీలిస్తాను.


శాకుంతల నాటకానువాదం - కందుకూరి:

ఖండాంతరాలలో కూడా ప్రసిద్ధికెక్కింది మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం. సంస్కృతనాటకాలలో సర్వోత్కృష్టమైన శాకుంతలంలోని మొదటి రెండంకాలను కందుకూరి దాదాపు 1860-80ల మధ్య  అనువదించారు. కారణాంతరాల వల్ల మిగిలిన భాగాన్ని అప్పుడు పూర్తిచేయలేదు. 1883 జూలై, ఆగస్టు నెలల్లో కందుకూరి వారి మిత్రులు ఈ నాటకాన్ని తెలుగులో ప్రదర్శిస్తే బావుంటుందని సూచించడంతో మిగిలిన అయిదంకాలను చాలా తొందరగా పూర్తిచేసి, మొదటికూర్పును 1883 అక్టోబరు 25న ప్రచురించారు.

అయితే వీరేశలింగం గారు అనువదిస్తున్న రోజుల్లోనే సమకాలీనకవులు కూడా ఈ ప్రయత్నం చేశారని సహదేవ ప్రకాశరావు గారి వ్యాసం తెలియజేస్తోంది. శాకుంతలానువాద నేపథ్యంలో చోటుచేసుకున్న అస్పష్టతకు వివరణగా కవిగారు దీన్ని కొన్నాళ్ళు వాయిదా వేయడం వెనుక ఉన్న విషయాలను గురించి ‘‘కందుకూరి నాటకాల పరిశీలనము’’ అన్న వ్యాసంలో ఇలా ఉంది -‘‘కవిగారు 1875లో శాకుంతల నాటకాన్ని తెనిగింప పూనుకొన్నారు. రెండంకాల్ని తెనిగించి 1876లో ‘వివేకవర్ధని’లో ప్రచురించారు. విశాఖపట్టణంలో పరవస్తు వెంకట రంగాచార్యులుగారు అభిజ్ఞాన శాకుంతలాన్ని తెనిగించి ‘విద్యాభివర్ధని’ పత్రికలో ప్రకటిస్తున్నారని తెలిసి యా పత్రికను తెప్పించుకొని చదివి వారి యాంధ్రీకరణం ముగిసిన తర్వాత తాము ఆంధ్రీకరించవచ్చనే తలంపుతో కవిగారు తమ రచనను మానివేసారు. ఎంతకూ పరవస్తువారి ఆంధ్రీకరణం వెలువడక పోవడంచేత వీరు శాకుంతలాన్ని సమగ్రంగా తెనిగించి 1888లో ముద్రించారు.’’ (శ్రీకందుకూరి నాటకాల పరిశీలనము, పుట. 19)ఈ విధంగా 1883, 1889, 1896లలో మూడు కూర్పులను వీరేశలింగం గారే ప్రచురించారు. ఈ కూర్పులనుండి 1931లో ముద్రితమైన ఏడవకూర్పు వరకు కందుకూరి వారి నాటకానువాదగ్రంథం లభ్యమౌతోంది. సుమారు 1960-80 దశకాల్లో వీరి పద్యగద్యాత్మకమైన అనువాద నాటకం పాఠ్యాంశంగా ఉండడం గమనించవచ్చు. ఇందులోని పాత్రలు పరిచయం, కవివిషయం, అంకాల వారీ కథాసంగ్రహం, ప్రశ్నోత్తరాలు, పాత్రల గుణశీలాలు, నాటకంలోని ముఖ్యమైన వాక్యాలు, పద్యపాదాలతో కూడిన సందర్భసహిత వ్యాఖ్యలు మొదలైన వాటితో విద్యార్థుల కోసం ఒక కరదీపిక కూడా ప్రచురితమైంది.

అనువాదం - ప్రణాళిక:

కలకత్తా ప్రతి ఆధారంగా రెండంకాలను రాసినా, తరువాత కూర్పులో మూలశ్లోకాలలో చాలా ప్రక్షిప్తాలను గుర్తించి వాటిని తొలగించారు. అలాగే మిగిలిన అయిదంకాలను అనువదించడానికి వేరు వేరు ప్రాంతాలలో దొరికిన నాలుగు ప్రతులను ఆధారంగా పెట్టుకుని, పాఠభేదాలు కనిపించినప్పుడు ఏది చక్కగా ఉందో పరిశీలించి దానినే అనువాదానికి స్వీకరించారు. మొదటి రెండంకాలలో వీరేశలింగం గారి శైలిలో కాఠిన్యం కనిపిస్తుంది. తరువాతి అయిదంకాలలో సులభశైలి కనిపిస్తుంది. పాఠకులు, ప్రేక్షకుల సౌకర్యార్థమే కందుకూరి వారు అయిదంకాలను సరళంగా అనువదించి పూర్తిచేశారని తెలుస్తోంది.

శాకుంతల నాటకం - ప్రదర్శనలు:

కవిగారు వారి స్వీయచరిత్రలో ఈ నాటకప్రదర్శనలకు సంబంధించిన ప్రస్తావనలు అక్కడక్కడా చేశారు. ‘‘1902 లో గుంటూరునందు ప్రథమ వితంతుద్వాహము జరిగినది. అక్టోబరు 11 ... మరునాటి రాత్రి నా గౌరవార్థము గుంటూరు నాటక సమాజమువారు మద్విరచితమైన శాకుంతల నాటకమును ప్రదర్శించిరి.’’(స్వీయచరిత్ర సంగ్రహము, కందుకూరి వీరేశలింగము, సంక్షిప్తము : కొడవటిగంటి కుటుంబరావు, పుట. 127)

నాందీ శ్లోకం - అనువాదం:

ప్రార్థించినా, ప్రార్థించక పోయినా, ధ్యానించినా, ధ్యానించకపోయినా కనిపించే భగవంతుడి ప్రత్యక్ష రూపాలున్నాయి. ప్రాణుల ప్రమేయం లేకుండా, నియమబద్ధంగా నడిచే ప్రాకృతికశక్తులన్నీ వాటిని నడిపిస్తున్న అలౌకికశక్తి తాలూకూ ప్రత్యక్షరూపాలే. ఈశ్వరుడు ఎనిమిది ప్రత్యక్ష రూపాలలో నిత్యమూ దర్శనమిస్తూనే ఉంటాడని ఈ నాందీశ్లోకం సూచిస్తోంది.

యా సృష్టి - స్రష్టురాద్యా, వహతి విధిహుతం యా హవిః - యా చ హో త్రీ, యే ద్వే కాలం విధత్త:, - శ్రుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వం. యాం-ఆహుః సర్వ బీజ ప్రకృతిః - ఇతి, యయా ప్రాణినః - ప్రాణవంత:, ప్రత్యక్షాభిః - ప్రపన్నః -  తనుభిః - అవతు - వః తాభి రష్టాభి రీశః. (నాందీశ్లోకం). 

ఈశ్వరుడికి ఎనిమిది ప్రత్యక్ష స్వరూపాలు. మొదటిది సృష్టికర్త సృష్టించిన మొదటిసృష్టి. అంటే జలం. నీరు. రెండవది, యథావిధిగా హోమం చేయబడ్డ హవిస్సును దేవతల కందజేసే అగ్ని. ‘అగ్నిముఖావై దేవాః’ అని శ్రుతి. మూడోది, ‘యా చ హోత్రీ’. యజ్ఞం చేసే యజమాని రూపం. యజ్ఞంలోక క్షేమం కోసం మాత్రమే చేసే పుణ్యకార్యం కనుక ఆ యజ్ఞం జరిగేంతసేపూ, యజ్ఞకర్త అయిన యజమానిని శివుడి ప్రత్యక్షరూపంగా భావిస్తారు. ‘యాజమాన-ఆహ్వాయా మూర్తిః విశ్వస్య శుభాదాయినీ’. యజమాని అనే పేరుగల మూర్తి జగత్‌ సంక్షేమం చేకూర్చగలదు. నాలుగూ, అయిదూ రూపాలు కాలాన్ని నియంత్రించే సూర్య చంద్రులు. ఆరో ప్రత్యక్షరూపం, శబ్ద విషయం గుణంగా కలిగి విశ్వమంతా వ్యాపించి నిలిచినా ఆకాశం. ఏడోది, ఈ పృథ్వి. ఇది సర్వబీజాలకూ వృద్ధికి మూలం కదా, ఈశ్వరుడి ఎనిమిదో ప్రత్యక్షరూపం వాయువు. ‘యయా ప్రాణినః ప్రాణవంతః’. దేనివల్ల నయితే ప్రాణులకు ప్రాణమనేది కలుగుతుందో, ఆ ప్రాణవాయువు ఈశ్వరస్వరూపమే గదా! ఈ ఎనిమిది ప్రత్యక్ష రూపాలుగల ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక, అని మహాకవి కాళిదాసు ప్రార్థన. ఈ నాందీశ్లోకానికి చక్కని అనువాదాన్ని కందుకూరి వారు అందించిన తీరును పరిశీలించండి.

ఉ. ఎయ్యది యాద్యమౌ నజుని సృష్టికి, హవ్యము నేది తాల్చు, దా

నెయ్యది సోమయాజి, మఱి యేయవి కాలవిభాగమిచ్చు రెం,

డెయ్యది తాల్చి శబ్దగుణ మెల్లెడ నిండును, హేతుభూతమౌ

నెయ్యది సర్వభూతముల, కెయ్యది ప్రాణము ప్రాణికోటి కెం ద,

య్యతులాష్ట దేహముల నందు శివుండిడు మీకు భద్రముల్‌!

జలం, అగ్ని, సూర్యచంద్రులు, ఆకాశం, పృథ్వి, వాయువు, అన్నది వీరు కూడా వాచ్యం చెయ్యకుండా సూచనప్రాయంగానే అనువదించారు. ‘హోత’ అన్న ఒక్క విషయాన్ని మాత్రమే ‘హోత్రీ’ పదానికి సమానంగా ‘సోమయాజి’ అని వాచ్యం చేశారు. ‘తనుభిః’ అన్నది దేహముల అని, ‘అవతు’ అన్నది ‘భద్రముల్‌’ అని స్వీకరించి భావానువాదం చేసారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమాని శివుడికి అష్టమూర్తులు కాబట్టి వాటిని యధాతథంగా స్వీకరించి వృత్తపద్యంలో పంచపాదిగా అనువదించారు.


ప్రథమాంకం - అనువాదం:

మునుల మధ్య వనంలో నివసిస్తున్న శకుంతల విలాసం గురించి చెపుతూ, ఆమె సహజమైన సౌందర్య సౌకుమార్యాల వల్లే ఆకర్షణీయంగా ఉంది, అంటాడు. దుష్యంతుడు మొదటిసారిగా శకుంతలని చూసినప్పుడు మనసులో అనుకున్న మాట.

‘‘సరసిజ మనువిద్ధం శైవలేనాపి రమ్యం

మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్ష్మీం తనోతి

ఇయమధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వీ

కిమివహి మధురాణాం మండనం నాకృతీనాం’’ (1.19)

అందంగా లేని నాచుతో కూడినదైనా పద్మం అందంగానే కనబడుతుంది. చంద్రుళ్ళో మచ్చ నల్లగా ఉన్నా, అది అతనికి కొత్త శోభల్ని కలిగిస్తూనే ఉంటుంది. ముతకచీర కట్టుకున్నా ఈ సన్నని తీగ లాంటి అమ్మాయి అధిక మనోజ్ఞురాలిగా కనబడుతోంది. సహజమైన అందం ఉన్నవాళ్ళకి అలంకారం కానిదేది? అంటూనే చక్కని ఉపమా, అర్థాంతరన్యాసాలంకారాలతో పాఠకుల మనసుదోచుకునేలా కందుకూరి వారు ఈ శ్లోకాన్ని అనువదించారు. 

చ. నలినము శైవలంబున బెనంగొని యుండియు రమ్యమే యగున్‌,

మలినకళంకముం గలిగి మంజులత న్వహియించు జంద్రుడున్‌,

చెలువున మించె నీజలజనేత్రయు వల్కలధారణంబునన్‌,

తలపగ సుందరాంగులకు దాను విభూషణ మేది గా దిలన్‌? (పుట. 356)

శకుంతల శరీరానికి ఆమె కట్టుకున్న బట్ట తగనిదే అయినప్పటీకీ అలంకారశోభను ఎంతగానో పెంచుతోందని చెప్తూ ఉపమను మించిన చక్కని అర్థాంతరన్యాసాలంకారంతో కవిగారు మూలాన్ని అతిశయించేలా ఈ చంపకమాల పద్యాన్ని సంతరించారు. దుష్యంతుడు శకుంతలను చూసి ఆమె బ్రాహ్మణ కన్యయోమో అని అనుకుని తర్వాత మనస్సమాధానం చేసుకునేటప్పుడు -

అసంశయం క్షత్రపరిగ్రహక్షమా

య దార్య మస్యా మభిలాషి మే మనః

‘‘సతాం హి సందేహ పదేషు వస్తుషు 

ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః’’ (1.21)

పరమ పవిత్రమైన నా మనసు ఈమెని కోరుకుంటోంది. కనుక ఈమె తప్పకుండా క్షత్రియకన్యయే. ఎందుకంటే, సత్పురుషులకు ఏ విషయంలోనైనా సందేహం వస్తే, వాళ్ల అంతఃకరణ, ప్రవృత్తులే వాళ్లకి ప్రమాణాలు అవుతాయి. ఇందులో కావ్యలింగ, అర్థాంతరన్యాసాలంకారాలున్నాయి. ఈ విశ్వజనీన భావాన్ని అంతే రసరమ్యంగా వీరేశలింగం గారు ఇలా అనువదించారు.

తే.గీ. ‘‘నృప పరిగ్రహ యోగ్య, యీ నెలత నిజము,
కాక, నామది నిర్దోష మీకె నెట్లు

దవులు?’’ ‘‘నెందు సందేహ వస్తువులయందు 

నాత్మ గతులె ప్రమాణంబు లార్యులకును!’’ (పుట. 358-359)

వంశస్థ వృత్తంలో ఉన్న మూలాన్ని భావం చెడకుండా ఒక తేటగీతిలో అనువదించిన తీరు అద్భుతమేనని చెప్పాలి.

ద్వితీయాంకం - అనువాదం:

శాకుంతలంలో, దుష్యంతుడు శకుంతలని చూసి మనసులో ఏమనుకుంటున్నాడో ప్రథమాంకంలో చెప్పేస్తాడు. రెండో అంకంలో దుష్యంతుడు తన స్నేహితుడితో మళ్ళీ మెదలు పెడతాడు. అది పరాకాష్ఠకి వెడుతుంది. దుష్యంతుడు సిగ్గు వదిలేసి ఇలా అంటాడు. అనాఘ్రాతం పుష్పం, కిసలయ మలూనం కరరుహై రనావిద్దం రత్నం, మధు నవ, మనాస్వాదిత రసమ్‌ అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూప మనఘం  న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః (2.10)ఈమె వాసన చూడబడని పువ్వు. ఏ గోళ్ళ చేతా గిల్లబడని చిగురుటాకు. కన్నం తొలవబడని రత్నం. రుచి చూడబడని తియ్యని కొత్తతేనె. చేసుకున్న పుణ్యాలకి పరిపూర్ణమైన ఫలం. ఎవడు ఈ అమ్మాయిని అనుభవించాలని బ్రహ్మ వ్రాసిపెట్టాడో! నాకు తెలియదు.రసికులంతా దీన్ని విరహతాపంలా చిత్రీకరిస్తుంటారు. కాని, ఈ శ్లోకంలో కనిపించే నిర్లజ్జని బట్టి కాళిదాసు దుష్యంతుడి వ్యామోహానికి పరాకాష్ఠగా దీన్ని మలిచాడనిపిస్తుంది.

ఉ. వాసన చూడనట్టి ప్రసవంబు, నఖంబుల ద్రుంపనట్టి నూ

త్నాసమపల్లవంబు, బరు లానని క్రొవ్విరితేనె, సూచి వి

న్యాసము లేని రత్నము, మహాతత పుణ్యఫలంబు బోలు నా

భాసురగాత్రి సోయగ మెవండు భుజింప విరించి వ్రాసెనో! (పుట. 376-377)

పరులానని క్రొవ్విరి తేనె, సూచి విన్యాసము లేని రత్నము అన్న అనువాదవాక్యాలు కాళిదాసు హృదయాన్ని ఆవిష్కరిస్తున్నా...  అందులోని తెలుగుదనం వీరేశలింగం గారి భావనాచమత్కృతిని పట్టిచూపిస్తున్నాయి. భోక్తారం అన్న పదానికి సమానార్థంగా భుజింప అని కవిగారు వాడారు. చూసినవెంటనే అమాంతం తినేయాలనిపించేంత అందం శకుంతలదన్న లోకోక్తి ఇక్కడ వ్యక్తమౌతోంది. అయితే భోక్తారం అన్న పదానికి భుజింప అన్న యధామూలపదానివాదం కంటే, మరికొంత సరళంగా ఉండే - పొందాలనే, అనుభవించాలనే భావాన్ని వాచ్యంచేసే మరేదైన పదాన్ని వాడి ఉంటే పద్యం మరింత సుందరంగా ఉండేది.ఈ విధంగానే రసరమ్యమైన అనువాదంతో తృతీయాంక కథ కూడా నడిచింది. 

చతుర్థాంకం - అనువాదం:

"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా  తత్రాపి చ చతుర్థోంస్కః తత్ర శ్లోక చతుష్టయమ్‌" అనే ప్రసిద్ధమైన శ్లోకమొకటుంది.’ సంస్కృత కావ్యాలలో నాటకం మనోహరమైనది. నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలము, అందులోను నాలుగవ అంకము, దానిలో నాలుగు శ్లోకాలు రమ్యమైనవి‘. ఈ నాలుగు శ్లోకాలలో యాస్యత్యద్య అనే శ్లోకం మొదటిది.

యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా

కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషం చింతా జడం దర్శనమ్‌

వైక్లబ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకసః

పీడ్యంతే గృహిణః కథంను తనయా విశ్లేష దుఃఖైర్నవైః  (4.5)

‘ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళునని నా హృదయం మిక్కిలి దుఃఖంతో కూడుకొన్నది. కన్నీటిని అణచుకొన్నందుకు గొంతు డగ్గుత్తికతో వుంది. చింత వలన చూపానటం లేదు. పెంచిన అమ్మాయిని అత్తవారింటికి పంపుటకు అరణ్యవాసినైన నాకే  ప్రేమ వలన యిట్టి అధైర్యము కలిగితే యిక గృహస్థులు, కని పెంచిన వారు తమ కుమార్తెను క్రొత్తగా భర్త యింటికి పంపుటకు యెంతటి వియోగ దుఃఖాన్ననుభవిస్తారో... ఇదీ శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతున్నప్పుడు ఆమె పెంపుడు తండ్రిjైున కణ్వమహర్షి దుఃఖించిన తీరు.

ఆయన ఒక చోట ‘వనౌకసః సంతోస్పి లోకజ్ఞా వయమ్‌‘ అడవులలో తిరుగువారైనప్పటికీ మేము లోకం  తెలిసినవారమంటాడు. ఒక లౌకికమైన అమ్మాయి తండ్రి, కూతురును భర్త యింటికి పంపునప్పుడు కన్నీరు మున్నీరయ్యే  బాధను తపస్విjైున, అరణ్యవాసిjైున కణ్వమహర్షి అనుభవించి చూపాడు. అనుప్రాస, వ్యతిరేకాలంకారాలున్న ఈ శ్లోకానికి చక్కని ప్రసాద గుణాన్ని రంగరించిన కందుకూరి వారి భావానువాదాన్ని గమనించండి.

ఉ. కొందలమందె డెందము శకుంతల తా నిపుడేగు నంచయో

క్రందుగ బాష్పరోధమున గంఠమునుం జెడె, దృష్ఠి మాంద్యముం

బొంద, యొకింత పెంచిన తపోధనులే యిటు గుంద నెంతగా

గుందుదురో తమంత గనుకూతుల బాయ గృహస్థు లక్కటా!! (పుట. 407)

నాలుగు శ్లోకాలలో రెండవదైన ‘‘పాతుం న ప్రథమం’’ అనే శ్లోకంలో కణ్వమహర్షి చెట్లతో మాట్లాడుతున్నాడు.

పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా

నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్‌

ఆద్యే  వః  కుసుమప్రసూతిసమయే యస్యా భవ త్యుత్సవః

సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వై రనుజ్ఞాయతామ్‌   (4.8)

సమాసోక్తి అలంకారోక్తమైన ఈ శ్లోకంలోని ప్రకృతి - మానవ మమైకత్వాన్ని చంపకమాలలో కందుకూరి వారు అలతి అలతి పదాలతో అనువదించారు. 

చ. ‘‘ఎవతె జలంబు మీ కిడక యెన్నడు ద్రాగదు తాను ముందుగా

నెవరితె ప్రేమచే జిదుమ దీప్సిత భూషణమయ్య మీ చిగు

ళ్ళెవతెకు మీరు తొల్త ననలెత్తుట పండువుగాగ నుండు నా

ప్రవిమల గాత్రి యేగు సతి పజ్జకు నంద రనుజ్ఞ యీయరే! (పుట. 408)

కాళిదాసు తన కావ్యాలలో చెట్లకు చాలా ప్రాముఖ్యాన్నిచ్చారు. ఈ శ్లోకంలో కణ్వమహర్షి  చెట్లతో మాట్లాడుతూ - ‘మీకు నీళ్ళు పోసి మీరు త్రాగిన తర్వాతనే శకుంతల నీరు త్రాగుతుంది. అట్లా కాక ఆమె ఒకరోజైనను నీరు త్రాగలేదు. ఆమెకు అలంకారాలంటే యెంత యిష్టమున్నను మీపై ప్రేమచే చిగురాకైనను కోయలేదు. మీకు తొలిపూత వచ్చినప్పుడు ఆమె గొప్ప పండుగ చేసుకొనేది. అటువంటి శకుంతల నేడు అత్తవారింటికి వెళ్ళుతున్నది. కనుక మీరు ఆనతినివ్వండి‘  అంటాడు. ఆశ్రమ వాసులకు చెట్లు , జంతువులతోనే కదా సాంగత్యము. ఆయన వాటితో అంత కలసిపోయాడు మఱి. అందుకే వాటితోనే తన బాధ వెళ్ళబోసుకుంటున్నాడు. అదే సహజత్వమంటే.

శ్లోక చతుష్టయంలో మూడవది అస్మాన్‌ సాధు అనే శ్లోకం. ఇందులో దుష్యంతునికి సందేశాన్ని పంపునపుడు కణ్వమహర్షి యెంతో హుందాగా వ్యవహరించాడు. ఒక వైపు ఆయన చక్రవర్తి. మఱియొక వైపు తనకు అల్లుడు. పెండ్లి ప్రత్యక్షంగా పీటలపై చేసినది కాదు. ఆయనకు తెలియకుండా శకుంతలను గాంధర్వ వివాహమాడి చూలాలిగా చేసి వెళ్ళాడు. అగ్నిహోత్రం వలన ఆ విషయం తెలుసుకొన్న కణ్వమహర్షి యోగ్యుడైన భర్తను పొందావని శకుంతలను అభినందిస్తాడు. అది ఆ విధంగా జరగవలసి వున్నదని తపస్సంపన్నుడైన ఆయనకు తెలిసే వుంటుంది. అలాగే దుష్యంతునికి సందేశాన్ని పంపుతూ -

అస్మాన్‌ సాధు విచింత్య సంయమ ధనానుచ్చైః కులం చాత్మనః

త్వయ్యస్యాః  కథమప్యబాంధవకృతాం స్నేహ ప్రవృత్తించ తామ్‌

సామాన్య ప్రతిపత్తిపూర్వక మియం దారేషు దృశ్యా త్వయా

భాగ్యాయత్త మతఃపరం న ఖలు త ద్వాచ్యం వధూబంధుభిః  (4.16)

‘నేను తపస్సే ధనముగా కలవాడను. నీవు ఉత్తమకుల సంజాతుడవు. బంధువులు కల్పించుకొనక నీవై నీవే ఈమెను ప్రేమించి పెళ్ళాడితివి. దీనినంతయు గుర్తుంచుకొనుము. ఈమెను తక్కిన నీ భార్యలయందొకతెగా చూసుకొనుము. అటుపై ఈమె అదృష్టాన్ని బట్టి వుండగలదు. అమ్మాయి వైపు వారు యింతకన్నను ఎక్కువ మాట్లాడరాదు‘ అని విన్నవిస్తాడు. ఈ శ్లోకంలోని భావాన్ని యధామూలంగా అనుసరిస్తూ కందుకూరి వారి చక్కని ఉత్పలమాల పద్యాన్ని సంతరించారు.

ఉ. ‘‘మమ్ముల సత్తపోధనుల మాన్య భవత్కులమున్‌, స్వ బంధులన్‌

సమ్మతి వేడ కీమె యెటొ సల్పిన నాపయి కూర్చినెంచి మా

కొమ్మను నేలుకొమ్ము సరి కొమ్మలతో సమ గౌరవమ్మునన్‌

బిమ్మట దెల్ల భాగ్యమగు బేర్కొన రాదది యింతి బంధువుల్‌’’ (పుట. 412)

ఇందులో ఒకవైపు దుష్యంతుని భయపెట్టడం, మఱియొక వైపు మాకు తెలియకుండా వివాహమాడితివనడం, వినయంగా బ్రతిమాలడం వంటివన్నీ ద్వంద్వార్థంగా కనిపిస్తాయి. తపస్సంపన్నుడైన ఆయన  తలచుకుంటే ఒక్కసారి శపించగలడు. కాని కూతురు పరిస్థితి అడ్డు వస్తున్నది. ఇటువంటి పరిస్థితులు నేటి సమాజంలో అనేకంగా కనిపిస్తున్నాయి. నీవు ఉత్తమకుల సంజాతుడవనడంలో వ్యతిరేకంగా నడచుకొనవు అను వ్యంగ్యార్థం యిమిడి వుంది. బంధువులు కల్పించుకొనక ప్రేమించి పెండ్లాడావనడంలో మాకు చెప్పక మా అమ్మాయిని వలలో వేసుకొన్నావు అని యెత్తిపొడిచినట్లుంది. నీవీమెను ప్రత్యేకంగా చూడవలసిన పని లేదు, నీ యితర భార్యలలో ఒకతెగా చూడమనటంలో శకుంతలను ఆయనకు భార్యగా గుర్తింపు తెప్పించాలనే ఆరాటముంది. కన్య తండ్రి యింతకన్నను యెక్కువ మాట్లాడరాదు, తదుపరి ఈమె అదృష్టమనటంలో ‘అన్నీ తెలిసి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి‘ కనిపిస్తుంది. లౌకిక జనులు పడే యింతటి మానసికాందోళన కణ్వమహర్షి కనబరుస్తాడు. 

శ్లోక చతుష్టయంలో నాల్గవ శ్లోకము శుశ్రూషస్వ గురూన్‌ అనే శ్లోకం. కణ్వమహర్షి శకుంతలకు తల్లి , తండ్రి కూడ తానై పెంచాడు. కూతురునత్తవారింటికి పంపునపుడు తల్లి మెట్టినింట్లో నడుచుకోవలసిన పద్ధతిని తెలియజేస్తుంది. ఆ మాటలను కణ్వమహర్షి యెంత సుమధురంగా చెప్పాడో - ఈ శ్లోకంలో కనిపిస్తుంది.

శుశ్రూషస్వ గురూన్‌, కురు ప్రియసఖీవృత్తిం సపత్నీజనే,

భర్తు ర్విప్రకృతాపి రోషణతయా మాస్మ  ప్రతీపం గమః,

భూయిష్ఠం  భవ దక్షిణా పరిజనే, భాగ్యేష్వనుత్సేకినీ,

యాంత్యేవం గృహిణీపదం యువతయో, వామాః కులస్యాధయః    (4.18)

పట్టమహిషి, ఉత్తమైన ఇల్లాలుగా ఉండాల్సిన వేళ తండ్రిస్థానంలో ఉండి కణ్వుడు శకుంతలకు సుద్దులు, బుద్ధులు చెప్పి పంపిస్తున్న ఘట్టంలో ఈ శ్లోకంలో ఎంతో విలువలతో కూడిన సంభాషణలున్నాయి. వాటిని ఏ ఒక్కటి జారిపోనివ్వకుండా ఎంతో శ్రద్ధగా కందుకూరి వారు అనువదించారు. 

చ. గురులకు సేవ జేయు మనగుం గతి జూడుము నీ సపత్నులన్‌

వరు డలుకన్‌ వహించినను భర్తృ విరుద్ధవు గాకు మీసునన్‌

బరిజనులందు జూపుము గృపం గడు బొందకు భాగ్య గర్వమున్‌

దిరిగిన నిట్లు - కాంతురు సతీత్వము కాంతలు నింద్య లొండుచోన్‌’’  (పుట. 412-413)

‘అత్తమామలకు సేవలు చేయి. సవతులతో స్నేహంగా మెలగుము. భర్త నీకయిష్టమైన పని చేసినను కోపపడకుము. భర్తకు విరుద్ధంగా నడచుకొనవద్దు. పరిజనులతో దయకలిగి వుండుము. సంపదలు కలిగినందుకు పొంగిపోవద్దు. యువతులు ఈ విధంగా నడచుకొని మంచి ఇల్లాళ్ళని పేరు తెచ్చుకుంటారు. అట్లా నడచుకొనని యువతులు పుట్టినింటికి, మెట్టినింటికీ కూడ మనోవ్యథను కలిగిస్తారు ‘ అని కణ్వమహర్షి శకుంతలకుపదేశిస్తాడు. పై శ్లోకాలు చదివిన వెంటనే యెంతటి వారి గుండె అయినా ద్రవించి కంట నీరు కారవలసినదే. మెట్టినింటికి వెళ్ళే అమ్మాయికి ఇంత మధురంగా ఉపదేశం చేయడం నేటి వారికి సాధ్యమవుతుందా? అది మహాకవి కాళిదాసు కణ్వమహర్షి నోట పలికించాడు. అంతే కరుణరసాన్ని కందుకూరివారు కూడా వారి కలంనుండి జాలువార్చారు.

పంచమాంకం - అనువాదం:

ఈ అంకంలో కథ దుష్యంతుడి రాజసభలో జరుగుతుంది. కణ్వుడి ఆశ్రమం నుండి వెళ్లలేక వెళ్లలేక వెళ్ళిన శకుంతల, మరికొందరు ఆశ్రమవాసులకు దుష్యంతుడికి మధ్యలో జరిగిన సంభాషణలు ఈ అంకంలో ప్రధానమైనవి. ఈ అంకం ప్రారంభంలోని ఈ క్రింది శ్లోకంలో చక్కని ధ్వని కనిపిస్తుంది.  రమ్యాణి వీక్ష మధురాంశ్చ నిశమ్య శబ్దాన్‌  పర్యుత్సుకీభవతి యత్సుఖితోపి జన్తుః  తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం భావస్థిరాణి జననాన్తర సౌహృదాని. (5.2) దుష్యంతుడు ఆకాశం నుంచి వచ్చే పాట విన్న తర్వాత ఎంతటి సుఖావస్థలో ఉన్న ప్రాణి అయినా, అందమైన దృశ్యాల్ని చూసిన తర్వాత, మధురమైన శబ్దాల్ని విన్న తర్వాత, ఇలాంటి పర్యుత్సుకతని పొందుతూనే ఉంటుంది. పూర్వం తెలియని ఏదో ఒక విషయాన్ని గురించి మనసులో నెమరు వేసుకుంటూనే ఉంటుంది. అందువల్లే, పూర్వజన్మల్లో ఏర్పడ్డ స్నేహాలు మనస్సుల్లో గాఢంగా నాటుకుని ఉంటాయి. ఈ భావాన్ని చిన్న తేటగీతిలో వీరేశలింగం గారు విషయబోధకంగా తెలియజేశారు.

తే.గీ. ము న్నెఱుగకయు - మది నంటు పూర్వజన్మ 

భవ్యసఖ్యముల్‌ స్మరణకు వచ్చు గాన, 

జనుడు సుఖితు డయ్యు - సురూపచయము గనియు

సుస్వరంబుల వినియు - నుత్సుకత గాంచు.  (పుట. 417)

అందమైన దృశ్యాలను, వస్తువులను చూసినప్పుడు, మధురమైన ధ్వనులను విన్నప్పుడు ఏ కారణం లేకుండానే సుఖంగా ఉన్న ప్రాణి మనసు ఒకానొక అలజడికి లోనవుతుంది. దేన్నో చేరుకోవాలనే తపనని అనుభవిస్తుంది. ఆ వ్యక్తి తాను ఇంతకు పూర్వం తెలుసుకొనని ఒకానొక అనుభూతికి లోనవుతారు. బహుశా పూర్వజన్మలో అతడికి ఇతరులతో ఏర్పడిన స్నేహ సంబంధమే దీనికి కారణం కావచ్చు. ఇది కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం’’ పంచమాంకంలో దుష్యంతుని మానసిక స్థితిని వర్ణించే సందర్భంలోని శ్లోకం. అద్భుతమైన మానసిక విశ్లేషణతో ‘‘సురూపచయము గనియు, సుస్వరంబులు వినియు’’ అన్న రెండే వాక్యాలలో శ్లోకసారం మొత్తం నిబిడీకృతమై ఉంది అనడంలో సందేహంలేదు. స్మరతి అన్న పదాన్ని ‘‘స్మరణకు వచ్చుగాన’’ అంటూ అనువదించండం, ఈ అంకంలో ప్రధానమైన దుర్వాసమహర్షి శాపవృత్తాంతం, శకుంతలవివాహం స్మరణకు రాకపోవడం లాంటి కాళిదాస రచనోద్దేశాన్ని స్ఫురింపజేసేదిగా ఉంది.

ముగింపు:

ఈ విధంగానే చక్కని అనువాదంతో ఆరు, ఏడు అంకాల కథ మరికొన్ని మలుపులు తిరుగుతూ సుఖాంతం అవుతుంది. ‘‘శాకుంతల నాటకము నాతరువాత నెందఱాంధ్రీకరించినను వీరేశలింగము గారిదే వ్యాప్తిలోనున్నది’’ (నవయువనిర్మాత శ్రీవీరేశలింగకవి, భారతి మాసపత్రిక 1948, పుట. 307) అన్న నిడదవోలు వెంకటరావుగారి ప్రశంస, తెలుగు అనువాదనాటకాలలో కందుకూరి శాకుంతల నాటకానువాదం స్థానాన్ని తెలియజేస్తోంది.  పరిశోధనపత్రవిస్తృతిని దృష్టిలో ఉంచుకుని ఈ అనువాద పరిశీలనను ఇంతటితో ముగిస్తున్నాను.


ఉపయుక్తగ్రంథసూచి:

1. ఏంఏ సంస్కృతం మొదటి సంవత్సరం పాఠ్యసామగ్రి, సంస్కృతనాటకం, మొదటిభాగం, అభిజ్ఞాన శాకుంతలం, హైదరాబాద్‌: దూరవిద్యాకేంద్రం, పొట్టీశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2008.

2. కాళిదాసు, భోగీశ్వరశర్మ, నోరి (అను.), శ్రీ మహాకవి కాళిదాస విరచితమ్‌ అభిజ్ఞానశాకుతంలమ్‌, విజయవాడ :శ్రిశివకామేశ్వరీ గ్రంథమాల, 2004.

3. కుటుంబరావు, కొడవటిగంటి (సంక్షిప్తము), స్వీయచరిత్ర సంగ్రహము : కందుకూరి వీరేశలింగము, న్యూఢల్లీి: నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా, 1981.

4. వీరేశలింగము, కందుకూరి, అభిజ్ఞాన శాకుంతలనాటకము (ఏడవ కూర్పు), రాజమహేంద్రవరం: సత్యానందప్రెస్‌, 1931.

5. వీరేశలింగము, కందుకూరి, కామేశ్వరరావు, భమిడిపాటి (సంపా.), కందుకూరి వీరేశలింగ కవికృత గ్రంథములు, మూడవసంపుటము - భాషాంతరీకృతనాటకములు, రాజమహేంద్రవరం: హితకారిణీ సమాజము, 1950.

6. వెంకటరావు, నిడదవోలు, శంభుప్రసాద్‌ శివలెంక (సంపా.), నవయుగనిర్మాత శ్రీవీరేశలింగకవి (వ్యా.), భారతి మాసపత్రిక సంపుటి 25, సంచిక 4. (ఏప్రిల్‌, 1948), మద్రాసు: ఆంధ్రపత్రికా ముద్రాలయము, 1948.

7. శివరామ్‌ విక్టరీగైడ్‌, అభిజ్ఞానశాకుతంలము (కందుకూరి వీరేశలింగముగారి అనువాదం), నెల్లూరు: సిటీపబ్లిషింగ్‌ హౌస్‌, 1978.

8. సూర్యప్రకాశరావు, సహదేవ, కందుకూరి నాటకాల పరిశీలము (వ్యా.), లోవెలుగు (ప్రథమభాగము), రాజమహేంద్రి: రాజమహేంద్రి టౌవున్‌ హాల్‌ ట్రస్ట్‌ బోర్డ్‌, 1986.