AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-5 | May 2022

2. మన గోవులు – స్థితిగతులు

డా. వీపూరి వేంకటేశ్వర్లు

పి.జి.టి.(తెలుగు), సెయింట్ జోసెఫ్ ఆంగ్ల పాఠశాల, కర్నూలు.
ఇంటి నెంబర్ : 40-807, పి.ఎస్.ఆర్.హోమ్స్, ప్లాట్ నెంబర్ :5,
నెహ్రూ నగర్, కర్నూలు -518004, ఆంధ్రప్రదేశ్

సెల్ : 9885585770.


మహాస్త్వేవ గోర్మహిమా – శతపథ బ్రాహ్మణం. గోమహిమ మహోన్నతమైనది, అపారమైనది. స్థూలదృష్టికీ, పరిమితమైన అజ్ఞానానికీ అది గోచరించదు, అందుకే గోవధ జరుగుతున్నా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. గోసేవ చేయాలని అనుకోవడం లేదు. శాస్త్రాలు చెబుతున్న సత్యాలను చాదస్తాలని కొట్టిపారేస్తున్నాం.

గోవు శరీరంలో ప్రత్యణువులో దేవతాశక్తులు ఉన్నాయని అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మహర్షులు దర్శించి చెప్పారు. గోవు నుండి ప్రసరించే శక్తి తరంగాలు మహాశక్తివంతమైనవి. వాటి ‘ఆరా’ (కాంతి ఆవరణ) చాలా దూరం విస్తరించి ఉంటుంది. అందుకే గోశాల దేవాలయమంతటి పవిత్రమైనది.

సర్వదేవతామయమైన గోవును సేవిస్తే దేవతలందరూ సంతోషిస్తారు. గ్రహదోషాలు పోవాలంటే గోవును సేవించు కోవడం అన్నిటికంటే అత్యుత్తమైన మార్గం. పితృతిథులలో – శ్రాద్ధాదులలో, సక్రమంగా విధివిధానంగా చేసే అవకాశం లేనివారు ఆవుకు ‘గోగ్రాసం’ సమర్పణ చేస్తే చక్కగా సత్ఫలితాలు దక్కుతాయి. గోగ్రాసాదులను పుష్కలంగా ఏర్పాటు చేసిన వారికి గొప్ప యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. గోవు సమీపంలో ఉండి దేవతాస్తోత్రాలు, పారాయణలు, జపాలు చేస్తే అత్యధిక ఫలం లభిస్తుంది. గోశాలను శుభ్రపరచి, గోవును పూజించి, శాలలో ఒకవైపు దీపాన్ని వెలిగించితే అన్ని దుష్టశక్తులూ అంతరించి, ఐశ్వర్యం – మంగళం లభిస్తాయి. అంతెందుకు ఇంటి ముంగిట గోవు పేడతో కల్లాపి జల్లినా ఇంట్లోకి విషశక్తులు ప్రవేశించలేవు. ఆవునేతితో దీపాన్ని వెలిగించితే ఆ ఇంట్లో మహాలక్ష్మి కొలువుంటుంది…. ఇవన్నీ వేదశాస్త్రాలు చెప్పిన సత్యవచనాలు. మనం గోవుని పెంచలేకపోతే, వాటిని పోషించే గోశాలకు వెళ్ళి ఈ సేవలు చేయవచ్చు లేదా గోపోషణ చేసే అవకాశం ఉన్నవారికి గోవును సమర్పణ చేయవచ్చు.

అయితే అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే ఈ భారత భూమిపై మేధావులు “గోవధను నిషేధించవచ్చా? నిషేధించకూడదా?” అని చర్చించడం! “వధించవచ్చా?” అన్న దానిపై చర్చ పెట్టవచ్చేమో గానీ, వధించడాన్ని నిషెధించటంపై చర్చించడం, తర్జనభర్జనలు చేయడం కన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది? ఎందుకంటే మన రామాయణ భారతాదులను గౌరవించేటట్లయితే, అవి గౌరవించిన గోవును మనం పూజించవలసిందే! మన శాస్త్రాలు ధర్మ, అర్ధ, కామ, మోక్షాలకు గోవును సాధనంగా చెప్పారు. ‘వేదం, అగ్ని, గోవు బ్రాహ్మణులను’ ప్రథమ సృష్టిగా పురాణాలు చెబుతున్నాయి.

“కర్మ బ్రహ్మోద్భవం విద్ధి” అన్నట్లు యజ్ఞాది కర్మలు గోవు నుండి వచ్చిన పంచామృతాలతోనే సిద్ధిస్తాయి. “అగ్ని ముఖాహి దేవాభవంతి” దేవతలందరికి అగ్నిముఖంగా ఇచ్చే హవిస్సులు గోదత్తమైనవే కదా! కనుకనే గోవును ‘హవిద్దుఘా’ అని సార్థక నామంతో పిలుస్తారు. ఇంకా అగ్నిలో వేసే హవిస్సులు అన్నీ ఎద్దుల కృషి చేతనే ఉత్పన్నమవుతున్నాయి. గోధుమ, తిలలు, బియ్యం, పేలాలు వగైరాలు. అయితే మనవాళ్ళకు ‘గోవు’ అంటే ‘ఆవు’ అనే అనుకున్నారు గానీ, వృషభం (ఎద్దు) కూడా ‘గో జాతికి చెందినదే’ అనే కనీసపు అవగాహన లేకపోవడం శోచనీయం!

మన సంస్కృతిలో యజ్ఞవేదులేగాక గృహాల ముంగిళ్లల్లో గృహాలను పవిత్రం చేసుకొనేందుకు గోవుపేడ – గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. యజ్ఞాగ్నిని మండించటానికి పేడతో చేసిన పిడకలు వాడతారు. అవి భస్మమయ్యాక ఆ భస్మాన్ని పవిత్రంగా భావించి నుదుట విభూతిరేకలు దిద్దుకుంటారు. శివునికి భస్మాభిషేకం చాలా ప్రియమైనది. అంతేకాదు అభిషేకంలో శివునికి వాడే పంచామృతాలలో గోక్షీరం, పెరుగు, నెయ్యి ప్రధానమైనవి. పంచగవ్యప్రాశన పవిత్రమైన తీర్థంగా చెప్పబడింది. ఇలా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ‘గోమాహాత్మ్యం వర్ణించతరం కాదు.

గావో మే హృదయే సంతు, గావో మే సంతు పృష్టతః| గావోమే హృదయే సంతు, గవాం మధ్యే వసామ్యహం||

“గోవులు నా ముందు, వెనుక, హృదయంలో కూడా ఉండును గాక! నేను గోవుల మధ్య నివసింతును గాక!” అని దీని అర్ధం. ఇలా శ్రీకృష్ణునికి గోపులంటే అంత ఇష్టం! మనం శ్రీకృష్ణుని చిత్రపటాలను గమనిస్తే బాలకృష్ణుడు వెన్నముద్దలు తింటున్నట్లు, తరుణ కృష్ణుడు గోవు ముందు నిలబడి మురళి వాయిస్తున్నట్లు, గోపికలతో రాధతో ఉన్న కృష్ణుడు వెనుక గోవులున్నట్లు చిత్రించబడి ఉంటాయి.

శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగాడు. గోవులతో ఆడి, గోపాడితో వృద్ధినొంది స్వయంగా గోపాలకుడైనాడు. మహాభారతం అశ్వమేధ పర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు గోవు విశిష్టత, గోదాన మహిమను వివరిస్తాడు. అలాగే అనుశాసన పర్వంలో భీష్ముడు “గోభిస్తుల్యం న పశ్యామి ధనం కించిదిహాచ్యుత” (గోవుతో సమానమైన సంపదలేదు) అని అంటారు. ఇలా ఆవును ఒక పశువుగా గాక సంపదగా భావించేవారు. ఒకప్పుడు పెళ్ళైన ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు విలువైన వస్త్రాభరణాలతో బాటు ఆవులను కూడా ఇచ్చి పంపే ఆచారముండేది.

భవిష్యపురాణంలో దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఐదు గోవులు ఉద్భవించినట్లు చెప్పబడింది. వీటిని కామధేనువులు (ఏమి కోరితే అవి ఇచ్చేవన్నమాట!) అనేవారు. దీని సంతతే గోజాతి. ఒక్క గోవేకాదు, ఐరావతము (ఇంద్రుని వాహనమైన ఏనుగు), ఉచ్ఛైశ్రవము (గుర్రము), లక్ష్మీదేవి, చివరగా అమృతం పుట్టింది. ఇవన్నీ గోవుకు తోబుట్టువులు. గోసంతతి ఎద్దు (నందిగా) శివుని వాహనమైనది. ఆ అమృతం త్రాగిన దేవతలు మరణంలేని అమరులైతే, ఈ గోవుపాలు త్రాగినవారు పూర్ణాయువు కలవారవుతారు. ఎందుకంటే గోవుపాలు అమృతంతో సమానమని ఆయుర్వేద శాస్త్రమంటుంది.

‘గవాం హి తీర్థే వసతీహా గంగా, పుష్టి స్తధా తద్రజసి ప్రవృద్ధా। లక్ష్మీం కరీషి ప్రణతేచ ధర్మః తాసాం ప్రణామం సతతీంచ కుర్వాత్ ॥

అని శాస్త్రముంటుంది. “గోతీర్థంలో (ఆవు మూత్రంలో) గంగ, గోధూళిలో పుష్టి, గోవుపేడలో లక్ష్మి, గోవుకు చేసే నమస్కారంలో ధర్మవృద్ధి ఉంటాయి. కనుక ఎల్లప్పుడూ గోవుకు నమస్కరించాలి” అనేది భారతీయులకు గోవు పట్ల గల పవిత్ర భావన. అంతేకాదు అనునిత్యం ఆలయాల్లో పూజ ముగించాక స్వస్తి వచనాల్లో “గో బ్రాహ్మణ్యేభ్యః శుభమస్తునిత్యం, లోకాస్సమస్తాః సుఖినోభవంతు” అనటం మనం వింటుంటాం! గోవులకు బ్రాహ్మణులకు వీరిద్దరికీ శుభం కలిగితే అందరూ సుఖంగా ఉంటారని ఇందులోని భావన. ఎలాగంటే గోవులు బాగుండాలంటే వాటిని సంరక్షించే రైతులు బాగుండాలి. గోవుల వల్ల రైతుకు పాడి పరిశ్రమ, సేద్యానికి ఎద్దులు, పొలాలకు ఎరువులు….. ఇలా చేతినిండా పని, సేద్యాలయ్యాక నాట్లకు కలుపులకు శ్రామికులు, తద్వారా శ్రామికులకు భుక్తి, ధాన్యం అమ్మటం వల్ల వర్తకుల చేతికి పని, సేద్యానికి కావల్సిన నాగలి – బండ్లు మొదలైన పనిముట్లు తయారీ వల్ల వడ్రంగికి ఆదాయం, ధాన్యం తయారీలో వాడే చేటలు – గంపలు మొదలగు వాటి వల్ల మేదరవానికి ఆదాయం, ఆ పంట వల్ల వచ్చిన ధనంతో చీరలు – నగలు కొంటే ఆ వృత్తుల వారికి ఆదాయం ఉంటుంది. ఆదాయం బాగుంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఇలా గోవుల శుభం కోరితే సమాజానికంతా శుభం కలుగుతుంది. ఇక బ్రాహ్మణులు విద్యాబోధన చేసి విజ్ఞానం పంచుతారు. అంతేకాదు మనిషి పుట్టుక నుండి చావు వరకు అన్ని సంస్కార క్రియలకు బ్రాహ్మణుడి మీద ఆధారపడింది సమాజం. కనుక వీరిద్దరూ (గోవులు – బ్రాహ్మణులు)బాగుంటే, అందరూ బాగున్నట్లే! ఇక రామాయణంలో శ్రీరాముని వంశ మూలపురుషుడైన రఘువు గోసేవా ఫలంగా కల్గినవాడే! దిలీప చక్రవర్తి సంతానం లేక వసిష్ఠుని ఆదేశంతో 21 రోజులు గోసేవ చేశాక పుట్టిన వాడే రఘువు. అతని కొడుకు అజుడు, అజుని కొడుకు దశరథుడు, అతని కొడుకు శ్రీరాముడు,

అంతేకాదు భాగవతంలో హిరణ్యకశిపుని ఉగ్రదండనకు భయపడి దేవతలు – కిన్నరులు – సిద్ధులు – సాధ్యులు – వీరంతా గుమిగూడి, రహస్యంగా శ్రీహరిని వెదకుతూ వెళ్ళి, తమబాధలతనికి విన్నవించుకున్నాడు. అపుడాయన వారికి

ఆ. శుద్ధసాధులందు, సురలందు, శ్రుతులందు,
గోవులందు, విప్రకోటులందు,
ధర్మపరులయందు, తవిలి నాయందు వా
డెన్న డలుగు నాడె హింసనొందు!

అని చెప్పి ఓదార్చి పంపుతాడు. అ, ఆలను దిద్దేంచేటప్పుడు కూడా మనం అమ్మ తరువాతి స్థానాన్ని ‘ఆవు’కు ఇచ్చి, ఆవుని ‘గోమాత’ గా ఆరాధిస్తున్నాం! ఇలాంటి పుణ్యభూమికి గోరక్తం నిత్యం తాకుతుంది. క్రూరమృగాల రక్షణ కోసం కూడా చట్టాలను చేసిన మనదేశానికి పాడి జంతువు రక్షణ పట్టడం లేదు.

స్వతంత్ర భారతదేశానికి గోవధ పెద్ద కళంకం. ‘ధర్మ నిరపేక్షత’ పేరిట ఈ కళంకం తుడిచే ప్రయత్నంలో చాలా జాప్యం జరుగుతోంది. సమస్య కేవలం ఆర్థికపరమైనదో, ధార్మికమైనదో మాత్రమే కాదు. మన సంస్కృతికి సంబంధించిన సమస్య. అసలు ఆవుపాలు – ఆవు నెయ్యి దొరకడం గగనమైపోతున్న ఈ రోజుల్లో, సాధారణ జీవితంలో ఒక ఆవును చూడాలన్నా అదంత తేలిక కాని ఈ రోజుల్లో, కసాయి వాళ్ళ కత్తులకు కొన్ని వందల ఆవులు ఎలా లభిస్తున్నాయో? అర్థం కాని ప్రశ్న! కనీసం ‘గోవిందా! గోపాలా!’ అని భజనలు చేసేవారైనా ఈ గోజాతికి జరుగుతున్న అన్యాయం గురించి కాసింతైనా ఆలోచించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం.

మతపరమైన అంశాలకు అతీతంగా ఉంటామని మడికట్టుకున్న ప్రభుత్వాలు కూడా హిందూ వ్యతిరేక అభిమతస్థుల మనోభావాలకు పట్టం కడుతూ మౌనం వహిస్తున్నాయి. స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో కూడా లోకమాన్య తిలక్ స్వయంగా “స్వాతంత్య్రం వస్తూనే గోవధను నిషేధిస్తూ చట్టం తీసుకొనివస్తాం” అని అన్నారు. శ్రీ మదన్ మోహన్ మాలవ్య భారత రాజ్యాంగంలో మొట్టమొదటి క్లాజ్ ‘గోవధ నిషేధం’ గురించే అని కలలు కన్నారు. “స్వరాజ్యం ఎంత ముఖ్యమో గోరక్షణ అంతే ముఖ్యం” అన్నారు మహాత్మాగాంధీ, అంతేకాదు “గోరక్షణ పట్ల విశ్వాసం లేని వ్యక్తిని హిందువుగా భావించలేం!” అని కూడా అంటూండేవారు.

భారత రాజ్యాంగంలో 48వ అధికరణ గోవును, గోవంశాన్ని విధిగా సంరక్షించాలని పేర్కొన్నది. గోసంతతిని చంపడాన్ని నిషేధిస్తూ కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనదేశంలో గోహత్యలతో విదేశీ మారక ధనాన్ని సంపాదించటంలో రాష్ట్రాల మధ్య పోటీలు పెరిగాయి.

స్వాతంత్య్రం వచ్చాక గోహత్య పూర్వం కంటే వందలరెట్లు పెరిగింది. భారతదేశంలో ప్రతి నిమిషం 30 ఆవుల చొప్పున సంహరించబడుతూ ఒక్క రోజులో 50 వేల గోవులను వధిస్తున్నాము. ఇది స్వాతంత్య్ర్య లక్ష్యాన్ని అవహేళన చేయటమే!

గాంధీజీ తన ఆత్మకతలో “నా ఉద్దేశ్యంలో గోరక్ష అంటే గోసంతతి అభివృద్ధి, ఎద్దులు మొదలైన వాటిపట్ల క్రూరత్వం చూపకుండా ఉండటం, గోశాలను నిర్మించటం, బండిలాగే ఎద్దుల పట్ల క్రూరత్వం వహించటం హిందూ ధర్మానికే అపచారం!” అని గోరక్ష ఆవశ్యకతను నిక్కి చెబుతారు.

ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశం దశమ సముల్లాసంలో-‘ పశువులను చంపువారు జనులను చంపేవారని తెలిసికొనుము ‘అని పేర్కొంటారు. అంతేకాదు “ఒక ఆవు సగటున తన జీవితకాలంలో 24,960 మంది మనుష్యుల ఆకలిని తీర్చగలదు. జీవితకాలంలో ఉత్పత్తి చేసిన కోడెదూడల, పెయ్యదూడల తరాలు వాటి యోగదానాన్ని లెక్క తీసుకుంటే 3 లక్షల 74 వేల 800 మంది మనుష్యులు తృప్తులవుతారు. తరతరాల లెక్కవేస్తే లెక్క లేని మనుష్యులు పాలింపబడతారు” అని కూడా వివరించారు. గోహత్య నిషేధంతో ఆహార కొరత ఏర్పడుతుందని వారించే కుహనా మేధావి వర్గానికి ఈ లెక్కలు కనువిప్పు కల్గించాలి.

స్వాతంత్ర్యానికి పూర్వం ఆవును చాటుమాటుగా వధించి తినేవారు. కానీ స్వాతంత్య్రానంతరం గోవధ ఒక భారీ స్వరూపాన్ని సంతరించుకొంది. ఆధునిక పశు వధశాలలకు దేశం నిలయమయ్యింది. ఇలాంటివి దేశంలో 40 వేలకు పైగా చిన్న తరహా పశువధశాలలు కలిపి 10 వేల టన్నుల మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. భారీ గోవధ శాలలు దేశంలో 28. దాకా ఉన్నాయి. వీటికి కావలసిన స్థలాన్ని ఆయా మున్సిపల్ కార్పోరేషన్లు నూటికి నూరు శాతం ప్రకటించడం విడ్డూరం! పశు వధశాలలని పెంచుతూ పశుసంవర్ధకమనే శాఖలు ప్రభుత్వం నిర్వహించటం అత్యంత హాస్యాస్పదం. ‘విదేశీ మారక ద్రవ్యం’ కోసమని చెప్పటం అత్మవంచనం.

యాంత్రిక వధశాలల్లో గోవుల దుస్థితి చూసివచ్చిన డా. గంగా సత్యంగారు చెప్పిన ఉదంతం ప్రకారం గోవులను వధించటానికి ముందు మూడు రోజులు మేపు ఆహారం ఇవ్వరంట. ఏమీ తినకుండా ఉంటే ఆ మాంసం రుచిగా ఉంటుందట. ఆ తర్వాత మరిగే నీళ్ళు వాటిపై విసరుతారట. అలా చేస్తే దాని చర్మం మాంసానికి అంటకుండా త్వరగా వేరౌతుందని దాన్ని హింసిస్తారంట. అవి అరచే వీలు
లేకుండా నోరును కట్టి వేస్తారంట. మూగగా కన్నీరు కారుస్తూ. రోదిస్తాయంట! చంపేముందు కాళ్ళకు తాళ్ళు కట్టి తలక్రిందులుగా వ్రేలాడదీస్తారంట. కోతమిషన్లు కొయ్య దుంగలను అడ్డంగా చీల్చినట్లు ఆ వధశాలలో కూడా మిషన్లు అడ్డంగా వాటి దేహాన్ని రెండుగా చేస్తాయంట. అప్పుడు రక్తం, మాంసం వేరుచేసి ఎగుమతి చేస్తారంట. ఇలా గోవులన్నీ ఘాతుకుల కడుపుల్లోకి వెళ్ళుతున్నాయి. ఇక్కడ వాళ్ళ కడుపునింపటమే కాక, విదేశాల వారి కోసం విమానాల్లో వెళ్తున్నాయి. రూపం మారి, మాంసం ముద్దలుగా వెళ్తున్నాయి. సముద్రాలు దాటి వెళ్తున్నాయి. ఇలా లక్షలాది మూగజీవుల్ని చంపి, ఇతర దేశాలకు ఆహారంగా పంపుతుంటే పాలకులు ప్రజలు ఎవరూ పట్టించుకోకపోవటం ఈ దేశ దౌర్భాగ్యం.

అసలు ఇంత అత్యధిక సంఖ్యలో గోవులు చావటానికి కారణం ప్రభుత్వమే! సంపూర్ణ గోవధ నిషేధ చట్టం అమలు చేస్తే ఈ దారుణం జరుగదు. శిక్షలకు భయపడైనా చాలామంది తగ్గుతారు. ఎక్కడో ఒకటి. అరా జరిగినా, చట్టం దృష్టిలోకి వస్తుంది. అలా చెయ్యకపోగా సుప్రీంకోర్టు 1958లో ఇచ్చిన తీర్పు గోసంతతి ప్రాణాలకు భయంకర శాపంగా మారింది. “ఆ తీర్పులో ముసలివైన నిరుపయోగమైన ఎద్దులను వధించవచ్చు” అనే మినహాయింపు ఉండటంతో దేశంలోని గోసంతతి కసాయిశాలలకు అర్పితమైనది. ఏదేమని నిలదీసి అడిగితే, ‘అవి ముసలివి – పనికిరానివి’ అనే అవకాశముంది కదా!

ఈ గోవధను ఆపటం కోసం ఎందరో ధర్మ వీరులు, మరెన్నో ధార్మిక సంస్థలు ఉద్యమించారు. ప్రభుదత్త బ్రహ్మచారి, శంకరాచార్య స్వామీ, కరపాత్రీ స్వామి, రామచంద్రదీప్ వారి కుమారులు, ఆచార్య ధర్మేంద్ర మహారాజు, ఆచార్య వినోబాభావే మొదలైన మహనీయులెందరో గోరక్షా కార్యక్రమంలో చిరస్మరణీయులుగా నిలుస్తారు. 1964లో గోసంతతి రక్షణా సమితి, అలాగే గోవధ మరియు మాంసం ఎగుమతి నిరోధ సమితి ఏర్పాటయ్యింది. రాష్ట్రీయ గోరక్షా ఆందోళన సమితి ఏర్పడింది. అయితే ఇలా ఇన్ని ఏర్పడినా, ఇందరు ఉద్యమించినా కోరిన ఫలితాన్ని పొందలేకపోతున్నాం. ఉత్సవాలు, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, నిరహారదీక్షలు ఒకటేమిటి? అన్ని విధాల ప్రయత్నించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. అయినప్పటికీ ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.

. ఒకప్పుడు పూజ్య స్థానంలో మాతగా గౌరవించబడిన గోవును – నేటి గోస్థితిని గుర్తు చేసుకుంటే భారతీయుని గుండె మండుతుంది. గోపాలుడైన శ్రీకృష్ణుడు పుట్టిన భూమిమీద, ‘అహింసా పరమో ధర్మః’ అన్న బుద్ధుడు పుట్టినదేశంలో, గోమాత రక్తం యాంత్రిక వధశాలల్లో ఏరులై పారుతోంది. తుపాకిలో ఒక గుండుతో లేక కత్తితో ఒక వేటుతో ప్రాణం పోతుంది. కాని గోవును హింసించి, హింసించి కర్కశంగా చంపుతున్నారు. కనుక గోజాతి మొత్తాన్ని కాపాడుకోవడానికి మనలో ఏ మాత్రపు కదలిక వచ్చినా, అది జ్వాలగా ఎగసి మహాచైతన్యంగా రూపుదిద్దుకుంటుంది. సాత్వికతకు, భారతీయ ధర్మానికీ చిహ్నమైన గోసంతతి పరిరక్షణకు ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు మన భారత భూమికి నిజమైన శాంతి లభిస్తుంది.

గావై పశ్యామ్యహం నిత్యం గావః పశ్యన్తు మాం సదా । గావోస్మాకం వయం తాసాం యతోగావస్తతోవయమ్ ||

గావో మమాగ్రతో నిత్యం గావః పృష్టత ఏవచ । గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహమ్ ।। (మహాభారతం-అనుశాసనిక పర్వం)

“నిత్యం నేను గోవులను చూస్తాను. గోవులను నిత్యం నన్ను చూడాలి. గోవులు మాకు చెందినవి.మేము గోవులకు చెందినవారం!
మాకు ముందు గోవులుండుగాక! మాకు వెనుక గోవులు ఉండుగాక! అన్ని వైపులా సమృద్ధిగా గోవులుండుగాక! గోవుల మధ్యనే నేను నివసిస్తాను” ఇదే భారతీయుల హృదయ స్పందన కావాలి.

ఆధార గ్రంథాలు:

1) విజయలక్ష్మి, డి.జి : ఇదే ‘నా’ సంస్కృతి! మాతృమండలి ప్రచురణలు – కోవెలకుంట్ల ప్రఖండ, కర్నూలు (2011)

2) షణ్ముఖశర్మ, సామవేదం (సంపా) : ఋషిపీఠం మాస పత్రిక, ఋషి పీఠం ప్రచురణ, హైదరాబాదు (జూన్ – 2003).