AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-6 | June 2022

5. ఆశావాది ‘పార్వతీ శతకం’ - జగన్మాత వైభవం

డా. వీపూరి వేంకటేశ్వర్లు

పి.జి.టి.తెలుగు, సెయింట్ జోసఫ్ ఆంగ్ల పాఠశాల,
ఇం.నెం. 40 - 807, పి.ఎస్.ఆర్. హోమ్స్, ప్లాట్ నెం. 5,
నెహ్రూనగర్, కర్నూలు-518004 (ఆం.ప్ర)
సెల్: 9885585770, E-Mail: venkateswaruluveepuri@gmail.com


ఉపోద్ఘాతము:

పద్యకవిత్వాన్ని సుసంపన్నం చేసిన ప్రక్రియల్లో ‘శతకం’ ఒకటి. పద్య కవిత్వంలో ప్రవేశించి బలం పుంజుకోవాలని కోరుకునే వారు ప్రాథమిక దశలో శతకాలు వ్రాస్తారనే మాట కొంతవరకు వాస్తవం. కాని ఈ వాదాన్ని పరాన్తం చేస్తూ కావ్య రచనలో దిట్టలైనవారు కూడా శతకాలు వ్రాసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. దీనికి ఉదాహరణగా ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని విమర్శకులు పేర్కొంటారు. పద్యకవిత్వాన్ని సుసంపన్నం చేసిన ప్రక్రియల్లో ‘శతకం’ ఒకటి. పద్య కవిత్వంలో ప్రవేశించి బలం పుంజుకోవాలని కోరుకునే వారు ప్రాథమిక దశలో శతకాలు వ్రాస్తారనే మాట కొంతవరకు వాస్తవం. కాని ఈ వాదాన్ని పరాన్తం చేస్తూ కావ్య రచనలో దిట్టలైనవారు కూడా శతకాలు వ్రాసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. దీనికి ఉదాహరణగా ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని విమర్శకులు పేర్కొంటారు.

తెలుగు శతకం మకుటనియమం, ఛందోనియమం, సంఖ్యా నియమాలతో ఉంది. శతక పద్యాలలో భావకాఠిన్యం ఉండదు. అలాగే ఒక పద్యానికీ మరొక పద్యానికీ అన్వయం కూడా ఉండదు. పాత్ర చిత్రణ, సంఘటనా నిర్వహణ మొదలైన ఒత్తిడులు ఉండవు. కనుక శతక కవి స్వేచ్ఛగా, హాయిగా, ఆత్మ ప్రబోధకంగా తన భావాలను వెలువరిస్తాడు.

తెలుగు శతకాల్లో సింహభాగం భక్తి శతకాలే! ఏటేటా వందలకొలది శతకాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని భక్తి, వేదాంత, శృంగార, హాస్య, అధిక్షేప, సాంఘిక, తాత్త్విక, చారిత్రక, కథాత్మక, అనువాద శతకాలుగా విభజించవచ్చు. అయితే అన్నింటిలో అంతర్వాహినిగా జ్ఞాన ప్రబోధాత్మక సుభాషితాల దీప్తి కన్పిస్తుంది.

తెలుగు భాషలో వలె వేరే భాషల్లో శతక వాఙ్మయం అభివృద్ధి కాలేదు. సర్వలక్షణ సంపన్నమైన తొలిశతకం పాల్కురికి సోమనాథుని వృషాధిపశతకం. అంతకుముందు ‘మాకు ప్రసన్నుడయ్యెడున్‌’ అంటూ నన్నయ, ‘దారిద్య్ర విద్రావణా’ అంటూ నన్నెచోడుడు మకుటాంతంగా వ్రాసిన పద్యాలు శతక కర్తలకు మకుట యుక్త పద్యాలు వ్రాయటానికి ప్రేరణయని విమర్శకులు పేర్కొంటారు.

పార్వతీ శతకం - పరిచయం:

ఆధునిక శతక పరంపరలో డా. ఆశావాది ప్రకాశరావు గారు రచించిన ‘శ్రీ పార్వతీ శతకం’ ఎన్నదగినది. వీరు దాస సంప్రదాయానికి చెందిన భాగవతులు. గొప్ప వక్త. వీరు తన ప్రసంగంలో రసోచితంగా, ఆలోచనామృతంగా, విషయాలను మృదువుగా అందించడంలో అందెవేసిన చెయ్యి. శ్రావ్యంగా పద్య పఠనం చేయడంలో సిద్ధహస్తులు. తన ప్రతి ప్రసంగంలో ఆద్యంతాలలో మంచి పద్యాల్ని ఉటంకించడం వీరి ప్రత్యేకత. అంతేకాదు వీరు ఏ శుభకార్యాలకు గాని, ఏ సమావేశాలకు గాని వెళ్ళినా పద్యసేసలు చల్లుతారు, పద్యవితరణ చేస్తారు. తెలుగు ప్రజలు ఈ పద్య సమారాధకుడైన ఆశావాదిని అకాడమీల, సాహితీ సంస్థల, వ్యక్తుల రూపంలోనూ అనేక చోట్ల సన్మానించారు. అవధాన కిశోర, పండిత మిత్ర, కళా తపస్వి, అవధానాచార్య, కళారత్న వంటి బిరుదాలను అందజేసి తెలుగు పద్య ప్రియుడైన వీరిని గౌరవించారు. తన స్వస్థానమైన పెనుకొండలో వీరి కాలికి గండపెండేరాన్ని తొడిగి, సముచిత స్థానాన్ని ఆపాదించి, బాధ్యతను పెంచారు.

‘పార్వతీ శతకం’ - జగన్మాత వైభవం:

డా. ఆశావాది గారి ‘శ్రీ పార్వతీ శతకం’, శ్రీ లలితా స్తోత్రావళి, దుర్గాస్తుతులలోని భావాలతో దేవీతత్త్వాన్ని సూచించే రీతిగా రచించబడిన శతకం. 2003లో తొలిసారిగా వెలుగు చూచిన ఈ లఘుశతకం 2005 లోను, తర్వాత 2008లో ఆశావాది సాహితీ స్వర్ణోత్సవ వేళ ఆశావాది సాహితీ మిత్రుడు, హైదరాబాద్‌ పారిశ్రామిక వేత్త కళ్ళెపు సాగరరావు ప్రచురణగా వెలువడిరది.

పార్వతీశతకానికి ‘పార్వతీమాత! ఆశ్రిత పారిజాత!’ అనేది మకుటం. మకుటమంటే కిరీటం. ఈ మకుటాన్ని గురించి కవి ఒక పద్యంలో దేవితో ఇలా విన్నవించుకున్నారు. 

మాన్య దేవతా మాకుటాయమాననీకు

వేరె మకుటంబు వలయునా పేదవాడ

పద్యమకుటమ్మె నిల్పెద పరవశించి

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (101)

సాహితీ ప్రక్రియలో శతక పద్యాలలో చివరి పాద సంబోధనను మకుటమంటారు. ఇది పద్య రత్న ఖచితము. ఇక్కడ మకుటమంటే రత్న ఖచిత కిరీటము. అటువంటి మకుటాన్ని దేవికి ఆశావాది గారు సమర్పించారు. భక్తిలక్షణయుత శతక పద్యాలాపనకు దేవి సంతోషిస్తుంది. ఎందుకంటే దేవికి ‘కావ్యాలాప వినోదినీ’ (613) అనే లలితా సహస్ర నామముంది.

ఈ శతకంలో ఆశావాది తన ఆత్మ నివేదనను, ఆశంసను, దేవి యొక్క నామావళిని, దేవి మహిమాదికాలను, దేవి అవతార ప్రశస్తిని పొందుపరిచారు.

దూడ అంబారవంబున తోషమంది 

మొదవు పరతెంచి పాలిచ్చి ముద్దుగొనదె?

అంబ వీవేను వత్సంబునై రుతింతు 

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (51)

అని ఆశావాది కవి జగన్మాతమైన పార్వతీదేవి తనకు గోవు వంటి తల్లియని, తాను దూడవంటి కుమారుడననియు అలంకారశోభిత రమణీయమైన ఒక పద్యాన్ని దేవికి విన్నవించారు. ఇక్కడ పాలకై లేగదూడ ‘అంబా’ అని అరచినట్లు, వేదజననివైన నిన్ను వేదామృత సారాన్ని అందించమని వేడుకొంటున్నానని దేవికి కవి విన్నపం. ఎందుకంటే దేవికి ‘గోమాత’ (605) అనే లలితా సహస్ర నామముంది. గోవు కామధేను వంశంలో పుట్టినదని పురాణాల కథనం.

సాధారణంగా శతకమంటే పదినీతులు, పది లోకం పోకడలు, కవిగారి కష్టాలు, వారి నివేదన మొదలైన విషయాలు ఉంటాయి. పందుకంటే పూర్తి భక్తి భావ బంధురమైన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ‘రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు’ అని, నరసింహ శతకంలో ‘బ్రతుక జాలక దొంగపనులు జేయుట కంటే కొంగున ముష్టెత్తుకొనుట మేలు’ అని, దాశరథీ శతకంలో ‘అల్లన లింగమంత్రి సూతుడు’ అని ఇలాంటి లౌకిక విషయాల ప్రస్తావన మనకు కన్పిస్తుంది. కాని ఆశావాది గారి పార్వతీశతకం పూర్తిగా ఆధ్యాత్మిక భావసంపన్నమైనది.

అక్షరాత్ములాశావాది యండ్రు నన్ను

నీకే శతకమ్ము నర్పింతు నెనరుగనుము

నే ప్రకాశరావు వధాన నియతినుందు

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (102)

అని కవి తన పేరు ఆశావాది ప్రకాశరావని, తానొక అవధానినని, తాను రచించిన ఈ శ్రీ పార్వతీ శతకాన్ని నీకే అంకితమిస్తున్నానని దేవికి విన్నవించుకున్నారు. ఇక్కడ కవి గారి స్వీయ పరిచయం విశదమవుతుంది. అలాగే ఫలిశ్రుతిగా –

ఎవ్వరీకృతి సద్భుద్ధి నివ్వటిలగ

.. విను, చదువు, వ్రాయు, నవ్వారికెల్ల

ఆయురారోగ్య భాగ్యములమరనిమ్ము! 

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (103)

అని ఈ రెండు పద్యాలలో తప్ప శతకంలో ఎక్కడా లౌకికవిషయాల ప్రస్తావన కనబడదు. పరిశీలిస్తే తేటగీతి ఛందస్సులో ‘‘ఓంకారం’’తో ప్రారంభమై బీజాక్షర ఖచితమైన తొలి శతకం కూడా ఇదే!

ఓం నమోస్తుతే భగవతీ స్ఫూర్తిధాత్రి – 1

శ్రీ మయూరవాహా రుచిస్మేరవదన – 2

హ్రీం సహస్ర సూర్య ప్రభా శంసదాత్మ – 3

క్ష్లీం కృతిస్థాపనా పరిక్లిన్నహృదయ – 4

సౌం భజామి భవత్పద సారసములు – 5

ఇలా 1వ పద్యంలో ఓం; 2లో శ్రీం - లక్ష్మీబీజం; 3లో హ్రీం - మాయాశక్తి బీజం; 4లో క్లీం - కామబీజం; 5లో సౌం-శక్తి బీజం పొదగబడి ఉన్నాయి. మంత్రశాస్త్రంలో ఈ బీజాక్షరాల స్థానం అగణ్యమైనది. ఇవి ఈశాని స్తుతిలో భాగమైనప్పటికీ ఈశ్వరుడు పంచవక్త్రుడు కదా! కనుక ఈ అయిదు బీజాక్షరాలు ఈశాన, వామదేవ, అఘోరాది ఈశ్వర విశ్వ రూపానికి ప్రతీకలు. ఇలా సాహిత్యంలోనికి మంత్రశాస్త్రాన్ని చొప్పించడం అపూర్వ ప్రయోగం. దీనికి ఆద్యుడు ఆదికవి వాల్మీకి. ఆయన గాయత్రీ మంత్ర 24 అక్షరాలను ప్రతి వేయి శ్లోకాలకు ఒకటి చొప్పున నిబద్ధించారు. ఇప్పుడు ఆశావాది గారి పార్వతీ శతకంలో మళ్ళీ బీజాక్షర సందర్శనం జరిగింది.

అంతేకాదు బ్రహ్మాండంలో గల సమస్త జీవకోటికి తల్లి అయిన సాక్షాత్‌ పరమేశ్వరిని ప్రార్థిస్తూ ప్రతిపద్యాన్ని ‘పార్వతీ మాత ఆశ్రిత పారిజాత!’ అనే మకుటంతో ఆశావాది కవి ముగించారు. ఆశ్రితులై దేవిని కొలిచి, ఉపాసించిన భక్తుల యొక్క కోర్కెలను తీర్చే ఆ తల్లిని ‘పారిజాత’గా అభివర్ణించారు. ఆ బ్రహ్మ కీటజనని అయిన పార్వతీదేవిని మాత (శ్రీమాతా) అని ప్రతి పాఠకుని చేతా నోరారా పిలిచేలా చేశారు. ఈ శతకాన్ని చదివిన ప్రతి ఒక్కరూ 108 పద్యాలకు గాను 108 సార్లు పార్వతీ దేవిని ‘అమ్మా’ అని పిలుస్తూ అష్టోత్తర శతనామాల్ని చదివిన ఫలితాన్ని పొందేలా చేశారు.

‘పార్వతీ శతకం’ - విశ్లేషణ:

నిశితంగా ఆలోచిస్తే శతకమెప్పుడూ కలగాపులగంగానే ఉంటుంది. దీన్ని వింగడిరచడం కప్పలను తక్కెడలో వేయడం వంటిది. కొన్ని జారిపోతూ బేజారు పుట్టిస్తాయి. కానీ ఏదో ఒక విభజన లేకుండా విషయ విశ్లేషణ చేయడం కష్టం. కనుక ఆముదాల మురళి, బేతపూడి రాజశేఖర రావు వంటి పెద్దలు తమ పరిజ్ఞాన పరిధిలో ఈ శతకాన్ని 1) స్తుతులు, 2) లీలలు, 3) మహిమలు, 4) విభూతులు, 5) విన్నపాలు అని అయిదు విభాగాలు చేశారు.

1) స్తుతులు:

విశేష్యం యొక్క విస్తృతిని అనేక విశేషణాల ద్వారా కీర్తించడం స్తుతి. ఇది భగవంతునికి భక్తుడు చేసే వాచిక సేవ. ఇందులో లీలావతార, మహిమానుకంప, వ్యక్తావ్యక్తంబులు అన్నీ భక్తుని చేత కీర్తించబడతాయి.శాంత సౌశీల్య సంపన్న శాస్త్రచాపకల్పవల్లీ లసత్కృపా శాంతిరూపవిశ్వకల్యాణ వేదికా వినుతదీప పార్వతీమాత! ఆశ్రిత పారిజాత (82)
ఇలా సకల కల్యాణ గుణాలన్నీ దైవానికి ఆపాదించడం స్తుతియే! ఈ పద్యంలో ఆరు లలితా నామాలున్నాయి.

1) శాంత సౌశీల్య సంపన్న శాంతిమతీ (131) అని లలితా సహస్రనామం దేవి శాంతికి నిలయమైనది. శాంతిని నరులకు చేకూర్చేది కూడా దేవియే!  ఇక్కడ శాంతమే శీలంగా కలదని వాచ్యార్థం.

2) శాస్త్రచాప - శాస్త్రాసారా (845) అని లలితా సహస్రనామం. శాస్త్రచాపమంటే వేదాలే విల్లుగా కలదని అర్థం.

3) కల్పవల్లీ లసత్కపా - భక్తి మత్కల్పలతికా (353) అని లలితా సహస్రనామం. భక్తులకు కల్పలత వలె వారి వారి (ఇహపర సంబంధమైన) కోర్కెలు తీర్చునదని అర్థం.

4) కాంతిరూప - కాంతిః (449) అని లలితా సహస్రనామం. దేవి తేజోవతి.

5) విశ్వకల్యాణ వేదిక కల్యాణీ (324) అని లలితా సహస్రనామం. కల్యాణి అంటే మంగళకరమైన వాక్కులను పల్కునదని అర్థం. దేవియే లోక కల్యాణానికి కర్త.

6) వినుత దీప - స్తుతిమతీ (928) అని లలితా సహస్రనామం. లోక కల్యాణార్థం దుష్టరాక్షస సంహారానికి ముందు, సంహారానంతరం బ్రహ్మేంద్రాదులు దేవిని పరిపరి విధాలుగా స్తుతించగా, దేవి దివ్యతేజంతో వారికి దర్శనమిచ్చిన గాథలు పురాణాలలో అనేకంగా కన్పిస్తాయి.

ఇలా శతకంలో 1, 2, 3, 4, 5, 11, 17, 23, 35, 39, 44, 60, 64, 69, 74, 79, 82, 83, 84, 89, 94, 99, 106, 108 పద్యాలలో దేవి స్తుతులున్నాయి.

జయము సర్వమంత్రాత్మికే జయముజయము 

జయము సర్వశక్త్యాత్మికే జయము జయము

జయము సర్వతంత్రాత్మికే జయము జయము 

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (108)

ఈ శతకంలోని చివరి పద్యంలోని సర్వ మంత్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వ తంత్రాత్మికే అనే శబ్ద ప్రయోగాలు కాళిదాస ప్రోక్తమని చెప్పబడుతున్న శ్యామాలా దండకంలోనివి.

2) లీలలు:

కృప, అనుగ్రహం, పరీక్ష మొదలైన విశేషాల్ని లీలలుగా భావించవచ్చు.

ఓర్మి నశియించి శపియింపనున్న

వేదమూర్తి వ్యాసు నహమ్మును పొలియజేయు

 ఆదరమ్మునకాశిలో నన్నమిడవె

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (32)

వేదవ్యాసుడు ఈశ్వరమాయ వల్ల కాశీలో తనకు తన శిష్యులకు భిక్ష దొరకకపోవడంతో, ఆకలికి ఓర్చుకోలేక, కాశీలోని ప్రజలు మూడు తరాలు మోక్షం, విద్య, ధనం లేకుండా ఉంటారని శపించబోయినప్పుడు, అన్నపూర్ణాదేవి మారు వేషంలో వచ్చి, తన హస్తసంజ్ఞాదర లీలతో దగ్గరకు పిలిచి, ‘నీకంటె న్మతిహీనులే కటకటా! నీ వార ముష్టింపచుల్‌’ (శ్రీనాథుని కాశీఖండం సప్తమాశ్వాసం) అని మందలించిన దేవి లీలాకథ ఈ పద్యం మూడు పాదాల్లో ఇమడ్చబడిరది.

అలాగే -

ధర్మసంస్థాపన ధ్యేయ వర్ముడగుచు

శ్రీశివాజి సమర్థుని శిష్యవరుడుకదన

విజయమ్ము లెల్ల నీ కరుణనొందె 

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (37)

నిన్నుదప్ప అన్యంబు తానెన్నడెపుడు 

నీదు దర్శనాకాంక్ష కన్నీరు విడుచు

రామకృష్ణ పరమహంస ప్రాజ్ఞతముడు

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (38)

ఇలా ‘త్వమేవ శరణంమమ’యన్న శివాజీ, ‘అన్యథా శరణం నాస్తి’ యన్న రామకృష్ణ పరమహంస కథలన్నీ దేవీలీలా విశేషాలే! ఇలాగే 6, 7, 8, 9, 10, 12, 15, 22, 32, 37, 38, 49, 63, 65, 66, 67, 70, 73, 86, 87, 91, 96 పద్యాలన్నీ భక్తి పాదులో మోసులెత్తిన తులసీదళాలే!

3) మహిమలు:

అనన్యసాధ్య విషయాలను అవలీలగా చేయడం మహిమ. దైవానికున్న విశేషశక్తులే మహిమలు. 

కాలకూటమ్ము లోకాల గాల్చుతరిని

సర్వమంగళ నామంబు సార్థకముగ

భర్తచే మ్రింగజేసిన పడతిమిన్న

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (16)

పోతన భాగవతంలో దేవదానవులు క్షీరసాగర మథనం చేసే సమయంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని తన పతిచేత మ్రిగించి, పార్వతీదేవి లోక రక్షణ చేసింది. 

కం. మ్రింగెడువాడు విభుండని

మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్‌

మ్రింగుమనె ‘‘సర్వమంగళ’’ 

మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో. (8-241)

ఎందుకంటే ఆ తల్లికి ‘‘సర్వమంగళా’’ (200) అని లలితా సహస్రనామం. తన మంగల్యానికి ఎటువంటి ఆపద కలగదని ఆ పార్వతీదేవికి తెలుసు.  అలాగే 14, 16, 18, 19, 20, 21, 24, 25, 26, 27, 28, 31, 61, 62, 68, 71, 72, 88, 90, 92, 93, 95 పద్యాలు దేవీ మహిమలను తెల్పుతాయి. అయితే ఇవన్నీ ఆశావాదిగారి లోకజ్ఞత - తత్త్వజ్ఞతలకు నిదర్శనం.

4) విభూతులు: 

అవ్యక్త పరబ్రహ్మం వ్యక్తమవడం విభూతి. పరబ్రహ్మం అంతటా ఉంటుంది. ఎందెందు వెదకి చూచినా అందందు ఉంటుంది. అయితే ఇక్కడుందని చెప్పడం విభూతి. దీనికి భగవద్గీత 10వ అధ్యాయం ఆకరంగా ఉంది.


పుణ్య కృష్ణానదీతీర పూతభూమి

ఇంద్రకీలాద్రిపై దీప్తి నెసగజేయు

కనకదుర్గవై బెజవాడ గడపనుంటె

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత (33)


విజయవాటిక, విజయవాడ పేర్లు గల బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవి కనకదుర్గమ్మ. దేవికి ‘దుర్గా’ (190) అని లలితాసహస్రనామముంది.
అలాగే 34, 36, 41, 47, 75, 76, 77, 78, 80, 81, 91 పద్యాలలో దేవి విభూతులను తెలియజేసే అంశాలున్నాయి.


‘హరిమయము విశ్వమంతయు’ అన్న భాగవతత్త్వాన్ని అనుసరించి, దేవి సమస్త యోనులయందు తన భగవతీతత్త్వాన్ని ప్రదర్శించడాన్ని సాధకులకు అందించిన దార్శనికులు ఆశావాదిగారు.

5) విన్నపాలు:

భక్తుల గోడును శ్రద్ధగా వినేవాడు భగవంతుడొక్కడే! కనుక కవి తన విన్నపాలను దేవి ముందు వెళ్ళబోసుకున్నాడు. ఈ విన్నపాలు సామాజిక, వైయక్తిక, లౌకిక, పారమార్థికాది భేదాలతో కన్పిస్తాయి.

గాడి తప్పిన నామది జాడనెట్లొ 

శీల సంపన్నమును జేసి చెలిగివచ్చి

భ్రమరకీట న్యాయమ్మును నమలుపరుపు

పార్వతీమాత! ఆశ్రిత పారిజాత! (45)

భ్రమరం (తుమ్మెద) తానొక కీటకాన్ని (పురుగు)ను తెచ్చి, రaుమ్మను శబ్దం చేస్తూ, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తత్ఫలితంగా ఆ పురుగు తుమ్మెదగా మారుతుంది. ఇదే భ్రమరకీటన్యాయం.


ఇక్కడ దేవిని తుమ్మెదతోను, జీవుణ్ణి పురుగుతోను పోల్చి, జీవుడిని అజ్ఞాన తిమిరం నుండి రక్షించమన్న విన్నపముంది. ఆలోచిస్తే ప్రతిదేహంలో ఉండే పరమాత్మ, జీవుని జన్మజన్మల పరంపరలో, జీవుని వెన్నంటి ఉంటూ, ‘త్వమేవాహం’ (నీవేనేను) అనే సంకేతాన్ని ఇస్తూ ఉంటాడు. చిట్టచివరకు జీవుడు జ్ఞానియై పరమాత్మనెరిగి, ‘అహంబ్రహ్మాస్మి’ (నేనే బ్రహ్మమును) అని భావిస్తూ, పరబ్రహ్మంలో లీనుడవుతాడు. ఇదే జీవ బ్రహ్మైక్య యోగం.

అలాగే శతకంలో 40, 42, 43, 45, 46, 47, 48, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 59, 97, 98, 100 పద్యాలన్నీ ఆశావాది కవి దేవి ముందు విన్నవించుకున్న విన్నపాలే! అయితే, ఈ విన్నపాలన్నీ ‘ఋషీణాం పునరాద్యానాం వాచ మర్థోనుధావతి’ (భవభూతి ఉత్తరరామచరితం, 1-10) అన్నట్లుగా ఉపనిషత్సరిత్తులో కలుస్తున్నాయి.

ముగింపు: 

మూకకవి, కాళిదాసు మొదలైన వారి చేత కవిత్వం చెప్పించిన మహిమాన్విత, ఆశ్రిత పారిజాత పార్వతీ మాత! ‘‘మూకం కరోతి వాచాలం’’ అన్న భావనకు నిర్ధుష్టమైన ఆధారం. అట్టి దేవి స్తుతులను, లీలలను, మహిమలను, విభూతులను, విన్నపాలను శతకంలో వర్ణించి, ఆస్తిక లోకానికి తెలియజేసిన డా. ఆశావాది గారి రచనా వైవిధ్యం కొనియాడదగింది. అంతేకాదు పార్వతీ శతకం శ్రుతి, స్మృతి, పురాణేతిహాస సార  సంగ్రహంగా దర్శనమిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత చిన్న విషయం కాదు. దీని వెనుక వీరి ప్రాక్తనవాసనా పరీమళం, అద్యతన సంస్కృత సంస్కార సమ్మేళనం ఎంతో ఉంది.   

ఆధార గ్రంథాలు:  

  1. ప్రకాశరావు, ఆశావాది: శ్రీ పార్వతీ శతకము, కె. సాగర్‌ రావు ప్రచురణ, హైదరాబాద్‌ (2008).
  2. రాజశేఖరరావు, బేతపూడి: లలితా సందర్శనము (పార్వతీశతక విశ్లేషణ), శ్రీ లలితాంబికా ప్రచురణలు, కర్నూలు (2013).
  3. ప్రకాశరావు, ఆశావాది: తెలుగు పద్య కవితా ప్రస్థానం, తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరాబాద్‌ (2012).
  4. ఏకాంబరాచార్యులు, రాపాక అనంతాచార్యులు, మాడభూషి (సంపా): హిరణ్మయి, కె. నర్సింగరావు ప్రచురణ, హైదరాబాద్‌ (2009).
  5. వేంకటేశ్వర్లు, ఇంద్రకంటి: శ్రీ లలితా సహస్రనామావళి: సరళార్థ వివరణము, విద్యార్థి మిత్ర ప్రచురణలు, కర్నూలు (2018).