AUCHITHYAM | Volume-3 | Issue-6 | June 2022
4. ఉత్తరాంధ్ర సామాజిక, సాంస్కృతిక వికాసంలో పత్రికల పాత్ర
డా. జి. లీలావరప్రసాదరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్,
డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.
సెల్:8309519615, E-Mail: leelaprasad939@gmail.com
ఉపోద్ఘాతము:
ఆధునిక ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రగానూ, తెలుగుదేశంలో ఉత్తర కోస్తాలో భాగంగానూ, భాషా, సాహితీ పరంగా ప్రత్యేక మాండలిక మండలంగానూ నేడు ప్రాచుర్యం పొందిన ఈ ప్రాంత విశిష్టత, దాని పయనం తెలుసుకోవాలంటే కళింగ దేశ చరిత్రను, అప్పటి సమకాలీన పరిస్థితులను ఒకసారి చుట్టి రావలసిందే. ప్రాచీన, మధ్యయుగాలలో ప్రస్తుత ఈ ప్రాంతం, కళింగ దేశంలో అంతర్భాగాలుగా ఉండేది. అందుకే ఈ ప్రాంతాన్ని కళింగాంధ్ర అంటూ పిలుస్తూ వచ్చారు. తూర్పు కనుమల ఒడిలో సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న భూభాగమే కళింగ దేశం. సామాజిక, రాజకీయ, పాలన, సాంస్కృతిక మార్పులకు లోనయ్యి నేడు ఉత్తరాంధ్రగా ప్రాచుర్యం పొందింది. 1936 వరకూ ఉత్తరాంధ్ర, ఉత్కళాంధ్రలు కళింగాంధ్రలో అంతర్భాగంగా వుంటూ వచ్చాయి. 1950లో విశాఖ జిల్లా రెండు జిల్లాలుగానూ, 1979లో మూడు జిల్లాలుగా, 2022లో ఆరు జిల్లాలుగా రూపాంతరం చెందింది. అటువంటి ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సామాజిక, ఆచార సంప్రదాయాలు, నాటి ఉద్యమాలు, కళలు, సాహిత్యం వంటివి వాటికి, నాటి చరిత్రకు చక్కని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అప్పటి పత్రికలు. వాటి ప్రస్థానం, పయనం ఉత్తరాంధ్ర సాంస్కృతిక, సాహితీ, సామాజిక వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఉత్తరాంధ్ర విశిష్టత పెంపులోనూ, వ్యాప్తిలోనూ, ప్రభావితంలోనూ పలు పత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. పలువురు పాత్రికేయులు తమదైన శైలిలో పత్రికలను నడిపి ఈ ప్రాంత సాంస్కృతిక పరిరక్షణకు బాసటగా నిలిచాయి.
తెలుగు జర్నలిజానికి సుమారు 188 ఏళ్ల చరిత్ర ఉంటే అందునా ఉత్తరాంధ్ర జర్నలిజానికి 148 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన తెలుగు జర్నలిజానికి బాసటగానూ, చైతన్య వాహికలుగానూ ఉత్తరాంధ్ర పత్రికలు ఆది నుంచి నిలుస్తూ వచ్చాయి. తెలుగు ముద్రణారంగానికి భారత్లోని రాంపూర్, మద్రాస్, బళ్లారి ప్రాంతాలు ఒకవైపు వేదికగా నిలిచిన తొలినాళ్లలోనే ఉత్తరాంధ్ర కూడా తెలుగు ముద్రణను తన అక్కున చేర్చుకుంది. 1804లోని లండన్ మిషన్ సొసైటీ మిషనరీ ప్రతినిధులు తొలిసారిగా ఉత్తరాంధ్ర నేలపై అడుగిడునారు. రెవరెండ్ ఆగష్టన్ డే గ్రేండ్, జార్జి క్రాస్ అనేవారు తెలుగు నేర్చుకొని ముత్తయి, మార్కు, లూయీ సువార్తలను ఇక్కడ నుంచి అనువదించారు. వీటిని తొలుత సిరాంపూర్లో ముద్రించగా వాటిని విశాఖపట్నంలోనే ఆంధ్రీకరించి ఆధునీకరించారు. విశాఖ పట్నం మిషన్కు చెందిన జాన్గార్ధన్, ఎడ్వర్ట్ప్రిచ్చెట్లు ఈ ఆధునీకరణ అనువాదంలో పాలు పంచుకున్నారు. 1818లో ఈ కొత్త అనువాదాన్ని మద్రాస్లో ముద్రించారు. దీని రెండవ ముద్రణ 1829లో తిరిగి జరిగింది. అదేవిధంగా మద్రాస్ ఆక్సిలియరి బైబిల్ సొసైటీ వారికి కూడా పాత నిబంధనను విశాఖపట్నంలోనే ముద్రించారు. విశాఖపట్నంలో నేడు లండన్ మిషనరీ వారిచే స్థాపించిన ముద్రశాలలో, తెలుగులో అనేక క్రైస్తవ బోధనలకు సంబంధించిన పుస్తకాలను ముద్రించారు. ఈ మిషన్ వారు పద్దెనిమిదేళ్ల పాటు ఈ ముద్రణా కార్యకలాపాలను నిర్వహించి సుమారు 80 చిన్న గ్రంథాలు, పుస్తకాలను వెలువరించారు. తర్వాత తెలుగు ముద్రణ, విశాఖపట్నం నుంచి వివిధ తెలుగు ప్రాంతాలకు విస్తరించింది.ఆ విధంగా తెలుగు జర్నలిజంలోనే కాకుండా ఇండియన్ జర్నలిజంలోను ‘ఉత్తరాంధ్ర’ ముద్రణకు జర్నలిజానికి తొలినాళ్లలోనే స్థానం ఉంది.
1830 తొలి దశకం నుంచి తెలుగు జర్నలిజానికి ఆధారాలు కనిపిస్తుంటే అక్కడికి నాలుగు దశాబ్దాలకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పత్రికల ప్రచురణ ఆరంభమయ్యింది. 1873లో తొలి పత్రిక ‘సకల విద్యాభివర్థిని’ విశాఖపట్నం నుంచి ప్రచురించబడిరది. వారపత్రికగా పరవస్తురంగా చార్యుల (మహోపాధ్యాయ బిరుదాంకితుడు) ఆధ్వర్యంలో ఇది వెలువడేది. సాహితీ అంశీలకు ప్రాధాన్యత ఇచ్చేది. అదే విధంగా శాస్త్ర అంశాలకు కూడా స్థానం కల్పించేవారు. పలు అంశాలను ప్రశ్నోత్తరూపంలో ప్రచురించేవారు. 1880లో విజయనగరం ప్రాంతం నుంచి ‘ది తెలుగు హార్స్’ అనే ఆంగ్ల వారపత్రిక కిళాంబి రామానుజాచార్యులు మరియు ఎఫ్.ఎస్.టి స్ట్రేక్ నేతృత్వంలో వెలువడ్డాయి. మహాకవి గురజాడ సాహిత్యాన్ని చాలా వరకు రికార్డు చేసిన పత్రికగా ‘ది తెలుగు హార్స్’ గుర్తింపు పొందింది. కొంతకాలం ఈ పత్రికకు సి.వై. చింతామణి, వంగు మాధవ రామనాయుడు వంటి వారు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా 1881లో ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ నేతృత్వంలో ‘సుజన ప్రయోనిధిని’ అనే పత్రిక ప్రారంభమయ్యింది. ఒక వినూత్నమయిన మార్గాన్ని ఆయన ఈ పత్రిక ద్వారా ఎంచుకున్నారు. విజ్ఞాన, రసాయన, భూ, వృక్ష, కీటక, ఖనిజ, తత్వశాస్త్రాలకు చెందిన అంశాలను వ్యాసాలుగా ఈ పత్రికలో ప్రచురించేవారు. తెలుగులో ఈ నాటికీ ఈ తరహా పత్రికలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇదే సంవత్సరం విశాఖపట్నం నుంచి ‘యదార్థ వాది’ అనే మాసపత్రిక మొదలయ్యింది. దీనికి గురుడకుర్మయ్య సంపాదకత్వం వహించారు.
1884లో శ్రీకాకుళంలోని జలుమూరు ప్రాంతం నుంచి భుగతా జమ్మయ్య శాస్త్రి నేతృత్వంలో ‘‘నీతి దర్పణం’’ అనే మాసపత్రిక వెలువడిరది. రెండేళ్లపాటు ఇది కొనసాగింది. శైవ గ్రంథాలను ఈ పత్రిక ప్రచురించేది.
విశాఖపట్నం నుంచి ‘‘గ్రంధపుదర్మిని’’ మాసపత్రిక, పి. శ్రీనివాస జగన్నాథ నేతృత్వంలో 1886లో వెలువడిరది. 1888లో శ్రీకాకుళంలోని జలుమూరు నుంచి ‘సుమనోభిరంజని’ అనే మాసపత్రిక డబ్బీరు కృష్ణమూర్తి నేతృత్వంలో ప్రారంభమయ్యింది. ఇది సాహితీ, సంస్కృతి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే ఏడాది విశాఖపట్నం నుంచి ‘‘టీచర్’’ అనే మాసపత్రిక సి. గోపాలయ్య నేతృత్వంలో ప్రారంభమయింది. విద్యా సంబంధిత అంశాలను ఇది ప్రచురించేది. ఇదే కాలంలో 1887వ సంవత్సరాన ప్రముఖ కవి గురజాడ అప్పారావు ‘ప్రకాశిక’ అనే పత్రికను నడిపినట్లు తెలుస్తున్నది. అవసరాల సూర్యారావు సంపాదకత్వాన ప్రచురించిన గురజాడ అప్పారావు లేఖల సంపుటిని పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుందని ప్రముఖ తెలుగు పాత్రికేయుడు నామాల విశ్వేశ్వరరావు వ్రాసిన తెలుగు జర్నలిజం చరిత్ర`1లో వివరించారు. తర్వాత పలు పత్రికలు ప్రచురణకు ఉత్తరాంధ్ర వేదికగా నిలిచింది.
తొలిదశలో సాహిత్యానికే పెద్దపీట :
1875-1900 మధ్యలో పాతికేళ్లలో తెలుగులో సుమారు 120 కు పైగా వివిధ రకాల పత్రికలు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభం కాగా అందులో 15 వరకూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే మొదలయ్యాయి. శ్రీకాకుళం నుంచి కళింగ, బాలిక, విశాఖపట్నం నుంచి వెలువడిన కళాభివృద్ధి, ధర్మవర్థిని, శారద వంటి పత్రికలన్నీ ఈ కాలం నాటివే. ఇదే కాలంలో కాలకొలను నరహరిరావు, శ్రీకాకుళం నుంచి ‘గాయత్రి’ పక్షపత్రికలను నడిపారు. భాషకోసం వాదోపవాదాలు జరుగుతుండటం, సాహితీ సౌరభాలు ఆయా జమీందారీ సంస్థానాల్లో విరజిల్లుతుండటంతో తొలిదశలో వచ్చిన ఉత్తరాంధ్ర పత్రికలన్నీ దాదాపుగా సాహిత్యానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ఆనాడు తెలుగు ప్రాంతంలో ఇతర పత్రికలు మత ప్రచారానికి, సంఘసంస్కరణలకు, వార్తారచనలకు, విమర్శనాస్త్రాలు సంధించుటకు ప్రాధాన్యత ఇస్తే ఉత్తరాంధ్ర పత్రికలు మాత్రం భాషాభివృద్ధి, సాహిత్య వాప్తికి పెద్దపీట వేశాయి. ప్రాచీన కావ్యాలను, నవలాభివృద్ధికు, గ్రంథ సమీక్షలు, ప్రవాసనాలు, కథలకు ఇవి ప్రాచుర్యం కల్పిస్తూ వచ్చాయి. అయితే ఆనాటి పత్రికా రచన అధిక భాగం గద్యపద్య భూయిష్టంగా ఉండేది. మరోవైపు 1874-1894 మధ్య కాలంలో రాజమండ్రి నుంచి, ఆధునిక తెలుగు జర్నలిజం పితగా పేరు గాంచిన కందుకూరి వీరేశలింగం అయిదు పత్రికలను నిర్వహించడం, భాషాపరంగా, సాహిత్యపరంగా పలు మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ ప్రభావం ఉత్తరాంధ్ర పత్రికలపై కూడా పడిరది. సారస్వత, సాహితీ, సంస్కృతి అంశాలకు, భాషా వికాసానికి ఉత్తరాంధ్ర పత్రికలు కూడా ప్రాధాన్యం ఇచ్చాయి. యదార్ధవాది, గ్రంధపుదర్శిని, కళాభివృద్ధి, శారద, ప్రకాశిక, సుమనోభిరంజని, బాలిక వంటి వన్ని పూర్తి స్థాయిలో సాహిత్య పత్రికలుగా వెలువడగా మిగతావి కూడా ఇతర అంశాలకు చోటిస్తూనే సాహిత్యాన్ని కూడా ప్రోత్సహించేవి. దాదాపుగా 19వ శతాబ్ది చివరి దశకంలో వచ్చిన పత్రికలన్నీ సంస్కృతి, సామాజిక సంస్కృతంలో ప్రాధాన్యం ఇచ్చేవి.ఆనాటి కావ్య ప్రబంధాల ప్రచురణకు, భాషా సాహిత్య విమర్శకు, సాహిత్యవాద వివాదాలకు, నవలలు, వ్యాసాల ప్రచురణకు, పుస్తక పరిచయాలకు, నాటకాల ప్రచురణకు, సారస్వత విషయాలుపై ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉపన్యాసాలు, చర్చలకు అధికంగా ప్రాముఖ్యత ఇచ్చేవి. 19వ శతాబ్ధి సమాప్తితో ఉత్తరాంధ్ర పత్రికల్లో గొప్ప మార్పు వచ్చింది. ఒక వైపు జాతీయోధ్యమం వేగవంతం కావడం, దీని ప్రభావంతో మాతృదేశ భాషా సారస్వతాలపై అభిమానం ప్రజల్లో పెరగడం, పాశ్చాత్యుల ఆధునిక పద్ధతులు భాషా సాహిత్యంపై ప్రభావం చూపడం వంటివి చోటుచేసుకోవడంతో 20వ శతాబ్ది నుంచి ప్రచురితమయిన ఉత్తరాంధ్ర ప్రాంత పత్రికలో మార్పు స్పష్టంగా కనిపించింది.
కల్పలత:
`భాష కవితతో పాటు తెలుగు కథానికను, విజ్ఞాన శాస్త్ర అంశాలను కలగలిపి వెలువడిన తొలిపత్రికగా ‘కల్పలత’ను చెప్పవచ్చు. ఆధునిక రూపురేఖలతో కథానికలను, ఆధునిక కవితలను ప్రచురించిన తొలిపత్రిక ఇదే. చాటువులను, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని, వైజ్ఞానిక అంశాలను పరికూరి ఈ పత్రికలో ప్రచురించేవారు. దీనిలోని వ్యాసాలన్నింటిని దాదాపుగా సంపాదకుడు సాంఖ్యాయన శర్మగారే వ్రాసేవారు. డాక్టర్ తిరుమల రామచంద్ర వ్రాసిన ‘తెలుగు పత్రికల సాహిత్యసేవ’ రచనను పరిశీలించినట్లయితే 1903లో ఇందులో సాంఖ్యాయన శర్మ స్వయంగా వ్రాసిన ‘లలిత’ అనే కథే. తొలి తెలుగు కథానిక అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పత్రిక సాహిత్య ప్రతిభాపాటవ పరీక్షలను కూడా నిర్వహించే వారు. తెలుగులో ప్రముఖ కవులుగా ప్రసిద్ధి చెందిన వెంకట పార్వతీశ్వర జంట కవులు, ఈ పత్రిక ద్వారే వెలుగులోకి వచ్చారు. ‘కల్పలత’ నవ్య కవితా వ్యాప్తిని ఒక ఉద్యమంగా చేపట్టిందని ప్రముఖ పరిశోధకుడు డా. వి. లక్ష్మణరెడ్డి విశ్లేషించారు. ఈ పత్రిక 1904 ఆగష్టు సంచికలో ‘బొండుమల్లె’ అనే శీర్షికతో గీత మాలికను సాంఖ్యాయన శర్మ ప్రచురించారు. ఈ పత్రిక రెండు రకాల విశిష్టతను కలిగి ఉంది. ఒకటి - తొలి తెలుగు కథను ప్రచురించిన పత్రికగా చరిత్ర సృష్టించగా, రెండు - సంపాదకుడే అన్ని వ్యాసాలు వ్రాసి పత్రికగా మరో రికార్డు సొంతం చేసుకుందని నామాల విశ్వేశ్వరరావు తన తెలుగు జర్నలిజం చరిత్ర - 1 లో పేర్కొన్నారు.
ఈ ఇరవై శతాబ్ధి మొదటి దశకంలో పలు చైతన్యదాయకపత్రికలు ఉత్తరాంధ్రలో పుట్టాయి. పలు రాజకీయ, మత, విద్య, హాస్య సంబంధిత అంశాలకు ఇవి ప్రాధాన్యత ఇచ్చాయి. 1901లో విశాఖపట్నం వెలువడిన ప్రసన్నమంజిరి మాసపత్రిక ఈ ప్రాంతంలో వెలువడిన తొలి మతపరమైనపత్రిక. మత వ్యాప్తికి ఇది ప్రాధాన్యతనిచ్చింది.
1909లో శ్రీకాకుళం ప్రాంతం నుంచి ‘వివేకవతి’ అనే మాస పత్రిక ప్రారంభమయ్యింది. మద్రాస్ క్రిస్టియన్ లిటరరీ సొసైటీ ఆధ్వర్యంలో మిస్ ఆర్బిహిబాల్ట్ నేతృత్వంలో ప్రచురించిన ఈ పత్రిక మత ప్రచారానికి, బాలసాహిత్యానికి కృషి చేసింది. ప్రముఖ రచయిత గిడుగు సీతాపతి కూడా ఇందులో రచనలు చేశారు.
1905లో విశాఖపట్నం ప్రాంతం నుంచి న్యాపతి రంగమన్నార్ నేతృత్వంలో ‘ఆంధ్రాఅడ్వాకేట్’ అనే ద్విభాషా వారపత్రిక వెలువడింది. న్యాయ, విద్యా సంబంధిత అంశాలకు ఈ పత్రిక ప్రచురించేది. అదే విధంగా ఇదే ఏడాది విశాఖపట్నం నుంచి మరో రెండు పత్రికలు ప్రారంభమయ్యాయి. ఎస్. వి. రాఘవాచార్యుల నేతృత్వంలో ‘సుశీల’, డి. లాజరస్ నేతృత్వంలో ‘‘ఈస్ట్ కోస్ట్ మ్యాప్ అండ్ అడ్వర్టైజర్’’ పత్రికలు మొదలయ్యాయి. ఈ రెండూ కూడా వారపత్రికలు.
మరోవైపు శ్రీకాకుళం ప్రాంతం కూడా పలు పత్రికలు ప్రారంభానికి ఈ సమయంలోనే వేదికగా నిలిచింది. టి.ఎస్. రామశాస్త్రి సంపాదకత్వంలో ‘బేనర్’ అనే ఆంగ్ల మాసపత్రిక వెలువడిరది. బరంపురం (నాడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది) నుంచి జి. బలరాందాస్ నేతృత్వంలో ‘భారతి పత్రిక’, బి. శ్యామసుందర్ సంపాదకత్వంలో Bandu Seva పత్రికలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు పక్ష పత్రికలుగా తెలుగు, ఇంగ్లీషు, ఒరియా భాషాల్లో (త్రిభాషా) ముద్రితమయ్యేవి. తెలుగు జర్నలిజంలో త్రిభాషా పత్రికలు వెలువడేందుకు తొలిదశలోనే ఉత్తరాంధ్ర చిరునామాగా నిలిచింది.
ఇదే ఏడాది విజయనగరం ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రలో తొలి హాస్య పత్రిక మొదలయ్యింది. ఎం. వెంకటసుబ్బయ్య సంపాదకత్వంలో ‘నవ్వులమూట’ అనే మాసపత్రిక 1905లో ప్రారంభమయ్యింది. హాస్యరచనలకు, జోకులకు, వినోదరస అంశాలకు ఈ పత్రిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే ఏడాది విజయనగరం నుంచి ‘నవశక్తి’ అనే వారపత్రిక కె. వెంకట కృష్ణారావు నేతృత్వంలో వెలువడింది.
రాజకీయ, సామాజిక చైతన్యం కలిగించిన పత్రికలు కూడా ఈ శతాబ్ధి మొదటి దశకంలోనే ఉత్తరాంధ్రలో ఆరంభమయ్యాయి. ‘భారతమాత’ అనే మాస పత్రిక బి.వి. నాధ్ నేతృత్వంలో 1906లో విజయనగరం నుంచి ప్రారంభమయ్యింది. 1908లో ఇది వారపత్రికగా మారింది. దీనికి ఓరుగంటి సోమయాజులు సంపాదకత్వం వహించారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు వ్రాసిన ‘ముత్యాలస్వరాల’ను ఓ శతవధాని ఆంధ్రపత్రికలో విమర్శిస్తే, ఈ ‘భరతమాత’ పత్రిక దాన్ని ఖండిస్తూ వ్యాసాలు రాసింది. దీనికి కొనసాగింపుగా గురజాడ, ‘ముత్యాల సరాల లక్షణం’ అనే మరో గ్రంథాన్ని రచించారు. 1906లోనే పురాణం సూర్యనారాయణ తీర్థాలు నేతృత్వంలో ‘కామేశ్వరి’ అనే పత్రిక ప్రారంభమయ్యింది. పురాణ తీర్థ, కావ్యతీర్థ బిరుదు గ్రహీతలయిన ఈయన ఈ పత్రిక ద్వారా సాహిత్య కృషి జరిపారు. ఈ దశాబ్ధంలో వివిధ ప్రాంతాల నుంచి తెలుగు జర్నలిజంలో సుమారు 70 పత్రికలు వెలువడగా అందులో 14 పత్రికలు వరకూ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే వెలువడ్డాయి. గత దశాబ్ధంలో వీటితో పాటు పక్ష, వార పత్రికలు కూడా బాగానే ప్రచురితమయ్యాయి.
20వ శతాబ్దిలో రెండవ దశకాన్ని (1910-1920) పరిశీలించినట్లయితే కాస్త తక్కువగా పత్రికలు వెలువడ్డాయి. బరంపురం నుంచి 1912లో ‘గురుబోధిని’ అనే మాసపత్రిక ఆర్. రంగయ్య శాస్త్రి నేతృత్వంలో వెలువడిరది. విద్యా అంశాలకు ఇది ప్రాధాన్యత ఇచ్చేది. 1913లో విశాఖపట్నం నుంచి ‘దేశీయ మిషనరీ’ అనే పత్రిక ప్రారంభమయ్యింది. క్రైస్తవ మత ప్రచారానికి నేషనల్ మిషనరీ అనే సంస్థ దీనిని ప్రచురించేది. 1914లో ‘వేగుచుక్క’ అనే వారపత్రిక బరంపురం నుంచి దేవరాజు వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వెలువడింది. ఇది రాజకీయ అంశాలను అధికంగా ప్రచురించేది. అయితే ప్రథమ ప్రపంచ యుద్ధ ప్రభావం కారణంగా మూతబడి 1923లో తిరిగి పున: ప్రారంభమయ్యింది. 1919లో బుర్రా శేషగిరిరావు విజయ నగరం నుంచి ‘సాహిత్య’ అనే మాసపత్రికను ప్రారంభించారు. సాహిత్య, సారస్వత అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
తెలుగు:
1919లోనే ప్రముఖ తెలుగు భాషా ఉద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు ‘తెలుగు’ అనే మాసపత్రికను పర్లాభిమిడి ప్రాంతం నుంచి ప్రారంభించారు. 1919 -1920 మధ్యలో ఒక ఏడాది మాత్రమే ఈ పత్రిక వెలువడినప్పటికీ తెలుగు జర్నలిజంలో ఉత్తరాంధ్ర ఖ్యాతిని మరింత పెంచింది. 1919 సెప్టెంబర్లో తొలి సంచిక వెలువడిరది. తొలి సంచికలో ‘గిడుగు’ అన సంపాదకీయంలో ఇలా వ్రాశారు.
‘‘ఎందుకీ కొత్త పత్రిక మరి ఒకటి? దేశంలో కావలసివన్ని ఉన్నవే పత్రికలు అనేక విధములైనవి. వాటివల్ల నెరవేరనదీ, దీనివల్లనే కాదగ్గదీ ఏమున్నది విశేష ప్రయోజనము? ఈ ప్రశ్నలకు ప్రత్యుత్తరము వివరించే ప్రయత్నం చేస్తున్నాను. చదువరులు సావధానముగా పక్షపాతం లేక చిత్తగింతురు గాక! నిజమే! అనేక పత్రికలున్నవి. పత్రికాధిపతులూ, సంపాదకులూ చాలా కష్టపడి జనులకు అనేక విధాల ఉపకారము చేయడానికి ప్రయత్నము చేస్తున్నారు. వారి ఉద్దేశం, ఉద్యమం కొనియాడదగినదే గాని, వారి ఉద్యమ పూర్ణంగా ఫలించడం లేదని మాకు తోస్తున్నది. ఇట్లే పుస్తకములు వ్రాస్తున్నవారి ఉద్యమం సార్థకము కావడము లేదు. లోక వ్యవహారమున తేటతెలుగున నలుగురూ వాడుకునే మాటలతో చెప్పితే స్పష్టముగా బోధపడే విషయము. వాడుకలో లేని మాటలతో చెప్పితే వృథా ప్రయాసము గాదా? దాని వలన ఏమైనా లాభమున్నదా? లేదని తెలిసినా చాలామంది వ్యర్థముగా తాము ఆయాసపడి చదివే వారిని ఆయాస పెట్టుతున్నారు.’’
‘తెలుగు’ పత్రికలో ఈ విధంగా తొలి సంచిక సంపాదకీయ ద్వారా తన లక్ష్యాన్ని, పత్రిక ఏర్పాటు పరమార్థాన్ని ‘గిడుగు’ వివరించే ప్రయత్నం చేశారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్ల, బెంగాలీ భాషల ప్రభావం, మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం (1914), జాతీయ ఉద్యమ స్ఫూర్తి వంటి వన్ని తెలుగు పత్రికారంగ భాషను మీమాంసంలో నెట్టి వేసింది. ఈ తరుణంలో గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని తన భుజాన వేసుకొని తెలుగు జర్నలిజానికి, రచనలకు కొత్త మార్గాన్ని చూపాడు. గ్రాంధిక వాదులయిన పండితులకు భాషా స్వరూపం గురించి తెలియదని, వారు వాడే భాష మంచిది కాదని తన పత్రిక ద్వారా ‘గిడుగు’ నిరూపించే ప్రయత్నం చేశారు. ‘తెలుగు’ పత్రిక రెండో సంచికలో ‘బాలకవి శరణ్యము’ను ప్రచురించారు. ఇది వ్యావహరికాంధ్ర భాషకు వ్యాకరణంగా మారింది. ఏడు, ఎనిమిది సంచికల్లో పలువురు పండితుల భేషజాన్ని విమర్శిస్తూ ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాబేజము’ అని ప్రచురించారు. ఈ విధంగా తెలుగు జర్నలిజానికి గిడుగు వారి ‘తెలుగు’ పత్రిక కొత్తమార్గాన్ని, ప్రజలకు ఉపయోగపడే రచనలను అందించింది. నేడు పత్రికలతో పాటు తెలుగు ప్రసార మాద్యమాలన్నీ వ్యవహారిక భాషను వాడుతున్నాయంటే 1919లోవెలువడిన గిడుగు - తెలుగు చలువే. ‘తెలుగు’ పత్రిక భాషా ఉద్యమానికి తన ‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సంఘం’ ద్వారా కందుకూరి వీరేశలింగం బాసటగా నిలిచారు. అప్పటిక ప్రముఖ దినపత్రిక అయిన ‘ఆంధ్రపత్రిక’ 1919లో తెలుగు పత్రికను సమర్థిస్తూ సంపాదకత్వాన్ని వెలువరించింది.
అంతకు ముందు దశాబ్దాలుతో పోల్చుకుంటే ఈ దశాబ్ధంలో చాలా తక్కువ పత్రికలు వెలువడ్డాయి. అవి కూడా ఎక్కువ కాలం మనగలగలేకపోయాయి. సాహితీ, వేగుచుక్క వంటి పత్రికలు కొద్ది నెలలు మాత్రమే ప్రచురించబడ్డాయి. తెలుగు జర్నలిజంలో ఇరవై శతాబ్ధిలోని రెండో దశకంలో సుమారు 85 పత్రికలు వెలువడగా అందులో కేవలం అయిదు పత్రికలే ఉత్తరాంధ్ర నుంచి వెలువడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం వలన (1914) కాగితం తదితర వనరుల కొరత వంటివి పత్రికల సంఖ్య తగ్గేందుకు కొంత కారణం అని చెప్పవచ్చు.
ఇరవై శతాబ్ది మూడో, దశాబ్ధాల్లో విభిన్న రకాల పత్రికలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలువడ్డాయి. కుల, మత, విద్యా, రాజకీయ రంగ పత్రికల ప్రచురణల సంఖ్య పెరిగింది. తొలిసారిగా 1923లో కుల ప్రాతిపదిక పత్రికలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి.
నరసన్నపేట నుంచి పొట్నూరు స్వామినాయుడు సంపాదకత్వంలో వైశ్య (మాస), విజయనగరం నుంచి ‘అగ్నికుల ప్రకాశిక’ అనే మాసపత్రిక పి. లక్ష్మణస్వామి నేతృత్వంలో మొదలయ్యాయి. అదేవిధంగా రాజపుత్రాభివర్థిని (1927), రెడ్డి పత్రిక (1930) అనే రెండు కుల పత్రికలు విశాఖపట్నం నుంచి వెలువడ్డాయి. వీటితో పాటు ఆర్యవైశ్య, వైశ్యవాణి అనే రెండు కులపత్రికలు 1927లో శ్రీకాకుళం, గంజాంల నుంచి వెలువడ్డాయి. మరోవైపు ప్రఖ్యాత ఎడిటర్ న్యాపతి నారాయాణమూర్తి ‘ఆంధ్రావాణి’ అనే రాజకీయ వారపత్రికను 1923లో ప్రారంభించారు. బరంపురం నుంచి ఇది ద్విభాషా పత్రికగా వెలువడేది.
అదే విధంగా ఇక్కడి నుంచే ‘కళింగ’ అనే రాజకీయ వారపత్రికను 1927లో ప్రారంభించారు. 1928లో శ్రీకాకుళం జిల్లా బారువా ప్రాంతం నుంచి ‘స్థానిక స్వపరిపాలన’ అనే మాసపత్రికను టి. బలరామయ్య ప్రారంభించారు. వీటితో పాటు ఆంధ్రావాణి (1924 వార), ఆర్యప్రభ (1925), స్వశక్తి (1925), ఆంధ్రలక్ష్మీ (1921), వేగుచుక్క (1923), జ్యోతి (1924), మురళీ (1926), గ్రామోపాధ్యాయ (1926), నవనీతం (1923), మాతృసేవ (1926) వంటి పత్రికలు ఉత్తరాంధ్ర నుంచి వెలువడ్డాయి. ప్రత్యేకంగా న్యాయసంబంధిత అంశాలను ప్రాధాన్యమిస్తూ విజయనగరం నుంచి లాయిర్ (1925), క్రిమినల్ లానోట్సు (1927) అనే రెండు పత్రికలు వెలువడ్డాయి. అదే విధంగా విజయ నగరం కళాశాల పత్రిక (1925 ` విద్య), నాటకకళ (1923 - ఆర్ట్), ఆయుర్వేద (1922 -హెల్త్), రాష్ట్రేతరాంధ్రులు (1924 - రాజకీయ), లలిత (1926 - కల్చరల్) గంధర్వ (1928 - మ్యూజిక్) వంటి విభిన్న పత్రికలు ఈ దశాబ్ధాలలో ఉత్తరాంధ్ర నుంచి వెలువడ్డాయి. తారక్ సందేశ్ (1922), జ్ఞాన దీపిక (1923) వంటివి మత ప్రచారాన్ని భుజానుకెత్తుకున్నాయి. ‘లలిత’, ప్రథమ సంచిక 1926 నవంబరులో వెలువడిరది. ఇందులో ‘వొడియాలు’ ఫీచర్ను వ్యవహారికంలో, భోగరాజు నారాయణమూర్తి రాశారు. సంపాదకీయం గ్రాంథికంలో ఉంది. పత్రిక గురించి ప్రకటన కూడా గ్రాంథికంలో ఉంది. గత దశాబ్ధంతో పోల్చితే ఈ ఇరవై శతాబ్ధిలోని మూడో దశకంలో విభిన్న, వినూత్నమైన పత్రికలుతో పాటు ప్రచురణల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలుగు భాషలో వివిధ ప్రాంతాల నుంచి పత్రికల సంఖ్య పెరగడం, చైతన్యం ఉత్తరాంధ్రపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో తెలుగులో సుమారు 240 పత్రికలు వెలువడగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 30 పత్రికలు మొదలయ్యాయి.
1930 -1940 సంవత్సరాల మధ్య పరిశీలించినట్లయితే పత్రికల ప్రచురణ సంఖ్య బాగా తగ్గింది. గత దశాబ్ధిల్లో ప్రారంభమైన చాలా పత్రికలు ఈ సమయంలో మూతబడ్డాయి. విశాఖపట్నం నుంచి ‘విశాఖ’ అనే వార్షిక సంచిక 1931లో మారేపల్లి రామచంద్రశాస్త్రి, పురిపండ అప్పలస్వామి ఆధ్వర్యంలో వెలువడిరది. ఇది సాహిత్య అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. వార, పక్ష, మాస పత్రికలు సంఖ్య తగ్గుముఖానికి ఇది చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు. 1933లో ‘సరస్వతి’ అనే సాహిత్య వారపత్రిక విశాఖ నుండి వెంపటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యింది. ఇదే ఏడాది బరంపురం నుంచి ఎం.వి. రమణారావు ఆధ్వర్యంలో ‘భారతి’ పత్రిక మొదలయ్యింది. ఇది కూడా సాహితీ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేది.
1934లో అనకాపల్లి ‘సత్యవాణి’, విజయనగరం నుంచి ‘కళ్యాణి’ పత్రికలు ప్రారంభమయ్యాయి. గంటి సూర్యనారాయణ శాస్త్రి తొలుత ‘కళ్యాణి’ పత్రికను మద్రాస్ నుంచి 1931లో ప్రారంభించారు. తర్వాత 3 ఏళ్ల తర్వాత దీనిని విజయనగరం నుంచి నడపటం మొదలుపెట్టారు. దీనిలో ‘మయూరుని’, సూర్య శతకంపై వ్యాసాలు ప్రచురించటంతో పాటు ఆంధ్ర భాషా సంజీవని, కల్పలత మొదలయిన పత్రికల వ్యాసాలను పునర్ముద్రించారు. అదే విధంగా విజయనగరం నుంచి ఇదే దశాబ్దంలో అడ్వర్టైజర్ (1937), విజయ (1937), మాతృసేవ (1938), ప్రభు హరనాథ్ (1939) పత్రికలు మొదలయ్యాయి. ఈ దశకంలో ప్రారంభమయిన పత్రికల్లో (15) దాదాపుగా 9 పత్రికలు సాహిత్యానికే ప్రాధాన్యతనిచ్చాయి.
దేశంలో ఏర్పడిన ఆర్థికమాంద్యం , ధరలు విపరీతంగా పెరగడం, కాగితం కొరత వంటి అంశాలు ఉత్తరాంధ్ర పత్రికారంగం పై కూడా ప్రభావం చూపాయి. 1830 -1930 మధ్యకాలంలో సుమారు 540 వివిధ రకాల పత్రికలు తెలుగు భాషలో వెలువడగా అందులో 1940 చివరి నాటికి కేవలం 180 మాత్రమే మనుగడ సాధించాయి. ఈ దశకంలో కేవలం 15 పత్రికలే ప్రారంభంకాగా, అధిక సంఖ్యలో పత్రికలు మూతపడ్డాయి.
1940`50 దశకం దేశ చరిత్రలోనూ, ఆంధ్ర నాట చారిత్రాత్మక దశాబ్ధం అయితే పత్రికారంగాన మాత్రం ప్రతికూల ప్రభావం చూపిన రోజులని చెప్పవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం జరగడం, గాంధీ ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా ఉద్యమం జరగడం, భారత స్వాతంత్య్రోద్యమం తీవ్రరూపం దాల్చటం వంటి కారణాలు వలన రచనారంగం, పాత్రికేయరంగంలో స్తబ్ధత ఏర్పడిరది. ఉత్తరాంధ్రలోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పత్రికలు నిర్వహిస్తున్న పలువురు ముఖ్యులు స్వాతంత్ర సమరంలో పాల్గొనటం, వారి పట్ల బ్రిటీష్ అధికారులు ఉక్కుపాదం మోపడం వలన పలు పత్రికలు మూతపడ్డాయి. వీటిని ఎదుర్కొని నిలబడిన కొన్ని పత్రికలను కూడా నిషేధించారు. మరోవైపు యుద్ధకాలంలో న్యూస్ప్రింట్, తదితర ముడి పదార్థాలకు విపరీతమైన కొరత ఏర్పడిరది. వస్తు సామాగ్రి ధరలు అందుబాటులోకి లేకపోవడం వలన పత్రికలు ప్రారంభం ప్రచురణల సంఖ్య బాగా తగ్గింది.
1942లో ‘విశాలాంధ్ర వాణి’ అనే పత్రిక దేవరాజు వెంకట కృష్ణారావు నేతృత్వంలో బరంపురం నుంచి ప్రారంభమయ్యింది. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం, స్వరాజ్యసిద్ధి సంబరాలు జరుపుకోవడంతో 1947లో ఉత్తరాంధ్ర ఉత్సాహంతో ఉప్పొంగింది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది మూడు పత్రికలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నుంచి తిమ్మరాజు వెంకట శివరావు సంపాదకత్వంలో 1947 ఆగష్టు 15న ‘మహోదయ’ అనే వారపత్రిక మొదలయ్యింది. అది నేటికీ కొనసాగుతూ చిన్న పత్రికలకు ఆదర్శంగాను, పత్రికా వ్యవస్థకు స్ఫూర్తిదాయకంగాను నిలిచింది.
అదేవిధంగా ఉత్తరాంధ్ర పత్రికల్లో సుదీర్ఘంగా కొనసాగిన పత్రికగా చరిత్ర సృష్టించింది. 1947లో విజయనగరం నుంచి రెండు వారపత్రికలు ప్రారంభమయ్యాయి. స్వరాజ్య సిద్ధి స్ఫూర్తిగా నిలుస్తూ ఇవి మొదలయ్యాయి. గురజాడ నారాయణ మూర్తి నేతృత్వంలో ‘విజయ’, కళాంభి రామానుజాచార్యులు, ఎల్. సుందరం నేతృత్వంలో ‘వందేమాతరం’ పత్రికలు ఆ సమయంలో వెలువడ్డాయి. సామాజిక, రాజకీయ, సమకాలీన అంశాలకు ఇవి ప్రాధాన్యతనిచ్చాయి. 1948లో గురజాడ సూర్యనారాయణ మూర్తి నేతృత్వంలోని ‘వాణి’ అనే పత్రిక మొదలయి కొన్నాళ్లు నడిచింది. మిగతా దశాబ్దాలుతో పోల్చుకుంటే 1940-50 మధ్య పత్రికల ప్రచురణ సంఖ్య ఇక్కడి నుంచి తక్కువేనని చెప్పవచ్చు. ప్రపంచాన్ని కుదిపేసిన రెండో ప్రపంచ యుద్ధానికి తోడు, గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియాలో పలువురు పాల్గొనడంతో పత్రికల ప్రచురణ తెలుగునాట మాదిరి ఉత్తరాంధ్రలోనూ మందగించింది. గాంధీ పిలుపు మేరకు కొన్ని పత్రికలను తాత్కాలికంగా నిలిపివేయగా, స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నందుకు మరికొన్ని పత్రికలను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. దశాబ్ధం చివరిలో స్వరాజ్యం రావడం, ఆ స్వేచ్ఛావాయువుల్లో తేలి ఆడుతుండటంతో పత్రికలు అంతగా వెలువడలేదు.
1950 దశాబ్ధాంలో సగ భాగం కూడా ఈ విధమైన వాతావరణమే కనిపించింది. విశాలాంధ్రదోద్యమం, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, 1955 నాటి మధ్యంతర ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం వంటి పరిణామాలు వరుసగా జరగటం మూలంగా నాటి పత్రికా సంపాదకులు, రచయితలు, ప్రచురణ కర్తలు వీటికి సాక్ష్యాలుగా, ఆ ఘటనల్లో భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. ఇటువంటి కారణాలు వలన ఈ దశాబ్ధి ప్రథమార్థంలో పత్రికలు ఉత్తరాంధ్ర నుంచి అంతగా వెలువడలేదు. జాతీయోధ్యమం, స్వాతంత్రోద్యమం, ఆంధ్రోద్యమం వంటి వన్ని ముగియడంతో ఆ ప్రభావం నుంచి ఇక్కడి పత్రికలు బయటపడ్డాయి. 1950 ద్వితీయార్థంలో పలు రంగాలకు ప్రాతినిధ్యంగా పత్రికలు వెలువడడం ఆరంభమయ్యాయి. 1956లో శ్రీకాకుళం నుంచి జె.వి. సుబ్బారావు నేతృత్వంలో వెలువడిన ‘స్వరాజ్యం’ వారపత్రిక తప్పించి మిగతావన్నీ కూడా వివిధ రకాలకు చెందినవి. గరిమెళ్ల వెంకటరమణ మూర్తి నేతృత్వంలో శ్రీకాకుళం నుంచి 1957లో ‘కేసరి’ అనే ద్విభాషా వారపత్రిక, సోంపేట నుంచి ఇదే ఏడాది డి. ఆదినారాయణ నేతృత్వంలో ‘కళింగ’ వారపత్రిక, 1957లో సి.ఎస్. ఆచారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ‘ప్రజావాణి’ రాజకీయ వారపత్రిక, కె. గోపాలరావు సంపాదకత్వంలో 1958లో వైద్య సంబంధిత అంశాలతో ‘హోమియో ప్రచార్’ ద్విభాషా మాస పత్రిక విజయనగరం నుంచి వెలువడ్డాయి. 1956లో విశాఖ నుంచి ‘శ్రీ కుసుమ హరనాథ్’ అనే ఆధ్యాత్మిక మాస పత్రిక పి.వి.ఎస్. పట్నాయక్ నేతృత్వంలోనూ, ఎస్. వెంకటరమణ ఆధ్వర్యంలో ‘న్యూ డిటెక్టివ్’ అనే మాస పత్రికలు ముద్రితమయ్యాయి. 1959లో విశాఖ నుంచే ‘విశ్వవీణ’ పక్షపత్రిక ఎం. శ్రీనివాస్ నేతృత్వంలో, ‘షిప్యార్డ్ రివ్యూ’ అనే త్రైమాస పత్రిక కె.ఎం. రెడ్డి ఆధ్వర్యంలో వెలువడ్డాయి. ఇదే ఏడాది విజయనగరం నుంచి కె. నాగేశ్వరరావు, కె.వి. నరసింగరావుల ఆధ్వర్యంలో ‘ది అడ్వటైజర్’ అనే ద్వైభాష పత్రిక, ‘జలజ’ అనే పత్రిక కె. జగన్నాధంల నేతృత్వంలో ప్రచురించబడినవి. 1960లో విజయనగరం నుంచి ‘వాణిజ్యవాణి’ అనే బిజినెస్ ద్విభాషా మాస పత్రిక ప్రచురితమైంది.
ఉత్తరాంధ్రలో వెలువడిన తొలి పత్రికలు
వ.నె. ఏరకమైనది పత్రిక పేరు సం. స్థలం
- తొలి దినపత్రిక విశాఖవాణి 1964 విశాఖపట్నం
- తొలి వారపత్రిక సకల విద్యాభివర్థిని 1873 విశాఖపట్నం
- తొలి ద్వివార పత్రికలు (1) ఆర్యప్రభ 1925 విజయనగరం
(2) స్వశక్తి 1925 విశాఖపట్నం
- తొలి పక్షపత్రిక ప్రకాశిక 1884 విజయనగరం
- తొలి మాసపత్రిక రాజయోగి 1880 విజయనగరం
- తొలి త్రైమాసిక ఎంఆర్ కళాశాల పత్రిక 1925 విజయనగరం
- తొలి అర్థవార్షిక మున్సిపల్ హైస్కూల్ మ్యాగజైన్ ? విజయనగరం
- తొలి వార్షిక విశాఖ 1931 విశాఖపట్నం
ముగింపు:
ఉత్తరాంధ్ర జర్నలిజం తీరుతెన్నులను, సాగించిన పయనాన్ని విశ్లేషించినట్లయితే గత 14 దశాబ్దాలలో పలు ప్రయోగాత్మకాలకు, వినూత్న రచనా సరళికి ఇక్కడి పత్రికలు వేదికగా నిలిచాయి. తెలుగు ప్రాంతంలో రాయలసీమ కేంద్రంగా తొలి అడుగులు వేసిన తెలుగు జర్నలిజం ఉత్తరాంధ్ర వరకూ వ్యాప్తి చెంది పలు స్ఫూర్తిదాయకమయిన, సంస్కరణవంతమైన చైతన్యదాయకమైన రచనలకు నాంది పలికింది.
తొలినాళ్లలో పరవస్తు రంగాచార్యులు, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ వంటి ప్రసిద్ధ పాత్రికేయులు వేసిన బాటలు ఉత్తరాంధ్రులకు జర్నలిజంలో మార్గదర్శిగా నిలిచాయి. తెలుగులో పత్రికలు సాహిత్య విమర్శలకు, చర్చలకు ప్రాధాన్యత ఇస్తూ రాగా ఆ కాలంలోనే ఉత్తరాంధ్ర పత్రికలు నవ్యతకు పట్టంకట్టి నూతన పంథా వైపు కొనసాగాయి. ‘కల్పలత’ వంటి పత్రికలు కొత్తమార్గాన్ని ఎంచుకొని తెలుగు జర్నలిజానికి వెలుగులను ఇచ్చాయి. గిడుగు రామూర్తి పంతులు వంటి వారు చేపట్టిన వ్యవహారిక భాషోద్యమం, ఆయన నడిపిన ‘తెలుగు’ పత్రిక తర్వాత కాలానికి ఒక దిక్సూచిగా నిలిచింది. జాతీయోద్యమం, స్వాతంత్రోద్యమం, ఆంధ్రద్యోమం, భాషోద్యమం, రైతుకూలీ ఉద్యమం, జమీందార వ్యతిరేకోద్యమం... ఉద్యమం ఏదైనా ఉత్తరాంధ్ర పత్రికలు వాటికి బాసటగా నిలిచేందుకు ప్రయత్నించాయి. చరిత్రకారులు, అధ్యయనకారులు ఎంతో విశిష్టమైన, ప్రభావితం చేసిన ఉత్తరాంధ్ర జర్నలిజాన్ని దాని పయనాన్ని విస్మరించినప్పటికీ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న నాటి ప్రస్థానాన్ని ఎవరూ కాదనలేని కళ్లముందు సాక్ష్యం.
‘ఈనాడు’ పుట్టుక ఒక చారిత్రాత్మకమైన మలుపుగా భావిస్తే పలు పత్రికలకు నేడు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం నిలుస్తుండడం భవిష్యత్తు చిత్రపటాన్ని సూచిస్తుంది. మరోవైపు ‘ఆకాశవాణి’ రేడియో కేంద్రం ఇక్కడ ఏర్పాటు, పలు టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లకు వేదికగా విశాఖ నిలుస్తుండడం ఉత్తరాంధ్ర మీడియా రంగానికి నిండుతనాన్ని చేకూర్చి పెట్టినట్లయింది. ఎందరో సీనియర్ పాత్రికేయులు చైతన్యవంతమైన సంపాదకులు ఉత్తరాంధ్ర గడ్డపై పుట్టి జాతీయ స్థాయిలో ప్రభావితం చేయడం ఈ ప్రాంతానికే ఎంతో గర్వకారణం. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో రచయితలు, పాత్రికేయులు, కలంవీరులు ఈ రంగాన సమిథులై తెలుగు జర్నలిజం ఖ్యాతిని పెంచారు. ఎంతో చారిత్రాత్మకమైన కళింగాంధ్ర నేడు ఉత్తరాంధ్రగా ముఖచిత్రం మార్చుకున్న నాటి నుంచి జరిగిన జర్నలిజం ప్రస్థానం, పయనం ఈ ప్రాంతానికి చక్కటి మార్గదర్శకాన్ని అందించింది. ఈ ప్రాంత ఆచార వ్యవహరాలు, సంప్రదాయాలు, ప్రజాసంస్కృతి, సామాజిక, సాహితీ అంశాల పరిరక్షణకు, ప్రచారానికి ఇక్కడి పత్రికలు ఎంతగానో తోడ్పడ్డాయి.
ఉపయుక్త గ్రంథాలు, ప్రచురణలు:
- లక్ష్మణరెడ్డి, వి. డా. (2002): ‘‘తెలుగు జర్నలిజం, అవతరణ - వికాసం’’, రచన జర్నలిజం కళాశాల, హైదారాబాద్.
- ఆచార్య మూర్తి, డి.వి.ఆర్.: ‘విశాఖలో పత్రికలు ఆవిర్భావం, వికాసం’, రీసెర్చి ఫోరమ్ జర్నల్, ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఏప్రిల్-2000.
- ధర్మారావు, నల్లి ‘‘ఉత్తరాంధ్ర పత్రికలు - ఉద్యమ వాహికలు’’, ఉత్తరాంధ్ర మాసపత్రిక, ఆగష్టు - సెప్టెంబరు, 2000.
- సత్యన్నారాయణ మూర్తి, తల్లాప్రగడ, ‘‘కళింగసీమలో విశాఖపట్నం’’, ఉత్తరాంధ్ర మాసపత్రిక, డిసెంబర్ - 2000.
- సత్యన్నారాయణ, కంభంపాటి(1982): ‘‘ఆంధ్రుల సంస్కృతి, చరిత్ర-2’’, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్
- డా.రమాపతి, అక్కిరాజు (1988): ‘గిడుగు రామూర్తి, జీవితం-ఉద్యమం’, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదారాబాద్.
- బాలశౌరిరెడ్డి, డా. (2010): ‘‘తెలుగు పత్రికల చరిత్ర (1947`2006)’’, ఎమెస్కో బుక్స్ ప్రచురణ సంస్థ, హైదరాబాద్.
- వెంకటేశ్వరరావు, పొత్తూరి: ‘‘ఆంధ్రజాతి అక్షర సంపద ` తెలుగు పత్రికలు’’, ఎపి ప్రెస్ అకాడమీ, హైదరాబాద్.
- శేషగిరిరావు, కె. ఆర్ (1968): ‘‘స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం’’, నార్ల షష్ఠిపూర్తి ఉత్సవ కమిటీ, న్యూఢిల్లీ.
- విశ్వేశ్వరరావు, నామాల (2003): ‘తెలుగు జర్నలిజం చరిత్ర’, పోగ్రసివ్ కమ్యూనికేషన్, హైదరాబాద్.