AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-6 | June 2022

3. పోతన భాగవతం - భక్తితత్త్వం

పెరుమాండ్ల శివ కళ్యాణి

తెలుగు ఉపన్యాసకురాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల
ములుగు @ SBIT ఒగ్లాపూర్, హన్మకొండ జిల్లా, తెలంగాణ
సెల్: 8978905817, E-Mail: saishivani1978@gmail.com


ఉపోద్ఘాతము:

"భాగవతం". ఈ పేరు వింటేనే మన మనస్సులలో భక్తి అనేటువంటి భావము ఏమూల ఉన్నను, అది బయటికి నదిలా ప్రవహిస్తుంది. మనలను అందరిని కూడా భక్తి అనేటువంటి సాగరంలో ముంచుతుంది. భవబంధముల నుండి మనల్ని విముక్తుల్ని చేసి మోక్షమునకు దారి చూపేదే "భాగవతము”.

కవి పరిచయం:

సహజ పండితుడు అనే బిరుదును కలిగినటువంటి పోతనామాత్యుడు 15వ శతాబ్దికి చెందినవాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. ఇతడు బమ్మెర అనే గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతము ఇది తెలంగాణలో ఉన్నది.

రచనలు :

పోతన భాగవతముతో పాటు వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకము మొ॥ రచనలు చేసాడు. కానీ అందులో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కావ్యము మహాభాగవతము అని పేర్కొనవచ్చును. ఇతడు రాచకొండ ప్రభువు సింగభూపాలుని కోరిక మేరకు భోగినీ దండకం రచించి అతనికే అంకితం ఇచ్చాడు. తన మహాభాగవతమును నరాంకితము చేయక తను నమ్మిన మరియు తన ఇష్టదైవమయిన ఆ “శ్రీరామ చంద్రునికే” అంకితము చేసినాడు. నన్నయ, తిక్కనలు తమ పుణ్యం కొద్దీ భాగవతమును తెలుగు జేయక వదలి వేయగా, దానిని తాను తెనిగించి "పునర్జన్మ" లేకుండా చేసుకుంటానని పేర్కొన్నాడు.

భక్తితత్త్వం:

భాగవతము భక్తి రసముతో కూడుకున్నది. అందులోని ఏ స్కంధమును చూసిన చెఱుకుగడలోని తీపిలాగ అనగా చెఱుకుగడను ఏ వైపునుండి కొరికినా తీయగా ఉన్నట్టు భాగవతములో ఏ స్కంధమును చూసిన అది చెఱుకుగడలోని తీపిని కనబరుస్తూ, భక్తితో మనలను అందరినీ కూడా ఓలలాడిస్తుంది అని తెలుపవచ్చును.

పోతనామాత్యుడు మొదటి నుండి చివరి వరకు ఒకటే మాటను చెప్పాడు. "ఆ శ్రీరామచంద్రుడే” నా చేత ఈ కావ్యాన్ని రచింపచేస్తున్నాడు. అతని దయ అనే సముద్రంలో నేను ఉన్నాను. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం వలనే నేను రచనలు చేయగలుగుతున్నాను అని పేర్కొన్నాడు.

భాగవతములో ప్రతి పద్యము, ప్రతి వచనము భక్తితో కూడి ఉండి చదువరులను ధన్యులను చేస్తుంది. అందుకు ఉదాహరణగా ఈ క్రింది పద్యమును చూడవచ్చును.

"అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ.... అనే పద్యము భక్తులకు ప్రార్థనా గీతముగా మారినది అని తెలుపవచ్చును.

మకరందం తొమ్మిది విధాలా:

భగవంతుడిపై భక్తిని ప్రకటించేందుకు నవ విధ మార్గాలను భాగవతములో పోతనామాత్యుడు పేర్కొన్నాడు. అవి ముఖ్యముగా తొమ్మిది విధాలుగా ఉంటాయి.

1) శ్రవణం, 2) కీర్తనం, 3) స్మరణం, 4) అర్చనం, 5) పాదసేవనం, 6) వందనం, 7) దాస్యం, 8) సఖ్యం, 9) ఆత్మ నివేదనం.

భాగవతములో అనేక రకాల భక్తుల కథలు కలవు. ఎవరి భక్తి వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే, ఎవరికి వారే సాటి అని చెప్పవచ్చును. గజేంద్రమోక్షము అనే ఘట్టమును మనము పరిశీలించినట్టయితే ఇందులో భక్తిరసముతో పాటు మిగతా రసములు కూడా పేర్కొనబడ్డాయి.

క. కలఁడందురు దీనుల యెడఁ

గలఁడందురు పరమయోగి గణముల పాలం

గలఁడందు రన్ని దిశలను,

గలఁడు గలండనెడి వాడు గలడో లేడో.

అని గజేంద్రుడు భగవంతుడు ఉన్నాడో, లేదో అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చుతాడు. మరొక పద్యమును చూసిన యెడల

శా. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యె, బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె, దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్

నీవే తప్ప నితః పరంబెఱుగ, మన్నింపందగున్ దీను నిన్,

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

భగవంతుడు దీనుల పక్షము వహిస్తాడు అని అంటారు. మరి అలాంటి భగవంతుడు ఈ రోజు దీనావస్థలో ఉన్న నన్ను ఆదుకోవడానికి ఎందుకు రావడం లేదు. నా ధైర్యమును కోల్పోయాను, మూర్ఛ వస్తుంది, శరీరం అలసి పోయింది. ఈ మకరితో ఇక పోరు సల్పలేను. నన్ను త్వరగా వచ్చి కాపాడు ఓ విష్ణుమూర్తి అంటూ తన మొరను ఆలకించమని చెబుతూనే, తాను శారీరకంగాను మరియు మానసికంగాను కూడా అలసిపోయినాను అని తెలియజేస్తున్నాడు.

"ఓ! కమలాప్త! యో వరద! యో ప్రతి పక్ష విపక్ష దూర!" అంటూ నీవు అజాత శత్రువువే, మునులు, యోగులు, కవులు అందరి చేత నమస్కారాలు అందుకొనే వాడివే నన్ను ఎందుకు కరుణించుట లేదు, నాకు ఎందుకు మోక్షమును ప్రసాదించుట లేదు అని అంటూనే నీరాక ఆలస్యం అయిన యెడల నా ప్రాణాలే పోతాయి అని కూడా ఇందులో తెలిపాడు. భక్తితత్త్వానికి మనుషులే కాదు ప్రాణంతో ఉన్న ప్రతి జీవి కూడా అర్హులే అని తను నిరూపించాడు.

ఇక ప్రహ్లాద చరిత్రను చూసినట్లయితే కన్న తండ్రికే కనువిప్పు కలిగించిన పాత్రగా పేర్కొనవచ్చును. శివకేశవులు ఇరువురు ఒకరే. శివతత్త్వం వేరు, విష్ణుతత్త్వం వేరు అన్న భావన మనము ఏర్పరుచుకున్నది, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని ఈ పాత్ర తెలియజేస్తుంది.

"కమలాక్షు నర్చించు కరములు కరములు" అని అంటూనే "హరి చేరుమని యెడి తండ్రి తండ్రి" అని తన తండ్రికే నీవు చేసే పనులు ఉత్తమ గుణములతో కూడిలేవు. ఏ కన్న తండ్రి కూడా తమ సంతానాన్ని చంపరు. కాని నీవు అలాంటి పనిని చేస్తున్నావు. నీవు తండ్రివే కాదు అని ప్రహ్లాదునితో పలికించాడు. అంతేకాదు నేటి నృసింహమూర్తి అవతారానికి నాంది పలికినవాడు. భక్తప్రహ్లాదుడు అని పేర్కొనవచ్చును.

హిరణ్యకశిపుని చంపిన తరువాత ఆ ఉగ్రనరసింహున్ని శాంత పరచడము ఎవరి తరము కాలేదు. చివర ఆ మహాలక్ష్మి కూడా స్వామి వారిని శాంతపరచలేకపోయినది. ప్రహ్లాదుని యొక్క ప్రార్థనతో నృసింహస్వామి వారిని శాంతమూర్తులుగా మార్చటము జరిగినది.

ఇక్కడ మనము రెండు విషయాలను గమనించాలి. అది ఏమిటి అనగా 1) గజేంద్ర మోక్షములో విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించడానికి - 

"సిరికిం జెప్పడు శంక చక్రయుగముంజేదోయి సంధింపడే పరివారంబును జేరడభ్రగపతిం బన్నింప డాకర్ణి కాంతర ధమ్మిల్లము”... అంటూ తాను ఎక్కడ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించకుండా తను ఉన్న పరిస్థితిని మరిచిపోయి తన భక్తుని ప్రాణాలను కాపాడడానికి ఆ స్వామి వారు పరుగులు తీసారు.

రెండవ విషయం:

ఇక్కడ ప్రహ్లాదుడిని అతని ప్రాణాలను కాపాడిన పిదప తన ఆగ్రహ జ్వాలలను తన భక్తుని పలుకులతోనే శాంతి పొందుట. అంటే భగవంతుడు భక్తులకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నాడో మనకు ఈ రెండు సన్నివేశాల ద్వారా కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి.

ఇప్పుడు భాగవతములోని దశమ స్కంధములో శ్రీకృష్ణ లీలలను చూసినట్లైతే అవి నేటికినీ కనువిందుగా కనిపించే రమణీయ దృశ్యాలుగా చెప్పుకొనవచ్చును.

"ఓయమ్మ! నీ కుమారుడు

మా యిండ్లను పాలు  బెరుగు, మన నీడమ్మా..."

అంటూ శ్రీకృష్ణుని చేష్టలను ఈ పద్యంలో పేర్కొనటం జరిగింది. వారికి యశోదాదేవి సమాధానం బహురమణీయము, పోతన గారు భగవంతున్ని రకరకాల పేర్లతో స్మరించడము ఇందులో మనకు కనబడుతుంది. మంజులవాణి, లలితాంగీ, లత, కొమ్మ అంటూ మరియు శ్రీకృష్ణున్ని అనేక రకాల పేర్లతో వర్ణించుట జరిగింది.

చల్దులారగించేటప్పుడు శ్రీకృష్ణుడు వికసించిన పద్మం వలె మధ్యలో ఉండగా అతని చుట్టూ గోపబాలకులు తామరపువ్వు రెక్కలుగా ఉన్నారని వర్ణించటము జరిగినది. అలాగే శ్రీకృష్ణుడు వారి అందరి ఆహార పదార్థములు రుచి చూసిన తరువాతే వారు తినేవారు. ఇక్కడ భగవంతునికి ఏ విధముగా అయితే మనము నైవేద్యము సమర్పిస్తామో అదే విధముగా ఇక్కడ కూడా భగవంతునికి ప్రత్యక్షంగా సమర్పించుట జరిగినది అనే విషయాన్ని తెలుపుట జరిగినది.

మోక్ష సాధనలో లింగ వర్ణాదులు ఏవి అడ్డు రావని భాగవతము మనకు తెలియజేయు చున్నది. హరి భక్తి లేని జీవితం వ్యర్ధమని స్పష్టముగా తెలుపుతున్నది.

"విష్ణు భక్తి లేని విబుదుండు విబుదుడే

పాదయుగము తోడి పశువు గాక"

అంటూ పోతన గారు మరొక మారు తన భక్తిని అతని తత్పరతను చాటుకున్నారు.

"నిగమములు వేయు చదివిన

 సుగమంబులు గావు భక్తి సుభగత్వంబుల్

సుగమంబు భాగవతమను

నిగమంబు పఠింప ముక్తి నివసనముబుధా"

నేటికి మహాభాగవతమును నిత్య పారాయణ గ్రంథముగా విరాజిల్లుతున్నది. ఇప్పటికి కూడా వివాహం కాని పడుచులు వివాహ దోషములు ఉన్న యెడల "రుక్మిణీ కళ్యాణము" అనే ఘట్టమును చదివి తమ దోషములకు నివారణ చేసుకుంటున్నారు.

పోతన గారి భాగవతము ప్రతి ఇంట పారాయణ గ్రంథమై చిరస్థాయిగా నిలిచి పోయినది. అందుకే

"తింటే గారెలే తినాలి

వింటే భారతమే వినాలి

చదివితే భాగవతమే చదవాలి”.

సర్వేజనా సుఖినోభవంతు.

ఉపయుక్త గ్రంథములు:

  1. తెలంగాణ ప్రాచీన కవిత్వం- డా. ద్వా.నా. శాస్త్రి
  2. తెలుగు సాహిత్య చరిత్ర - డా.ద్వా.నా.శాస్త్రి