AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-6 | June 2022

2. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసి కళారూపాల సౌందర్యం

డా. మురహరి రాథోడ్

గ్రామం, పోస్ట్ : కొల్హారి, మండలం: గుడిహత్నూర్,
జిల్లా: ఆదిలాబాద్, పిన్: 504308. తెలంగాణారాష్ట్రం.
సెల్: 7702062870, e-mail: muraharirathod123@gmail.com


ఉపోద్ఘాతము:

తెలంగాణలో ముఖ్యంగా అడవి ప్రాంతంలో ఉన్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు తెలంగాణ ప్రజలకు ఏమి తెలియవు. వారు తెలంగాణలో బ్రతుకుతున్న అది వారి వారి ప్రాంతాలకే పరిమితం అయిపోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండాపోయాయి.  అందుకు కారణం  వారి బ్రతుకంతా అడవులకే పరిమితమై ఉండడం. ఇతరులకు ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే.

1940 సంవత్సరం కుమ్రంబీం వీరమరణం తరువాత మానవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమ్స్ డార్ఫ్, బెట్టి ఎలజిబత్ దంపతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిశోధన పర్యటనలో భాగంగా మార్లవాయి గ్రామానికి వచ్చారు. ప్రొఫెసర్ హైమ్స్ డార్ఫ్, ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేసారు.  వారు ఏ విధంగా  దోపిడికి గురవుతున్నారో ప్రత్యక్షంగా  చూసారు. ఆదివాసులకు జల, జంగల్, జమీన్.. తోపాటు ముఖ్యంగా విద్య చాలా అవసరం ఉంది అని మార్లవాయిలోని మొదటి విద్యా కేంద్రం ప్రారంభించారు.

20 రోజుల ఉత్సవాలు:

ఆదివాసుల అతి పెద్ద పండుగ దండారి గుస్సాడి పండుగ. దండారి గుస్సాడి ఆదివాసి పండుగ దండారి గుస్సాడి ఆదివాసి ఏత్మసూర్ పయిన్ (దండారి దేవత) ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇసర దండారిలతో (సోరిక్) గోత్రం వారితో సంబంధాలు పెట్టుకుంటారు. ఉత్సవాలకు ఒక సంవత్సరం వారు మరొక సంవత్సరం వీరు వెళ్తూ ఉంటారు. ఈ పండుగ ఆషాఢ మాసమ్ నుండి జూలై ఆశ్వయుజ అమావాస్య వరకు (అక్టోబర్) నాలుగు నెలల పాటు చచ్చోయ్ (కోలాటం) వంటివి నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రి దండారి ఉన్న వారి ఇంటి గుమ్మంలో గ్రామస్తులందరూ కలిసి ఆడుతారు. దీపావళికి పదిరోజుల ముందు పదిరోజుల తర్వాత దాదాపు ఇరవై రోజుల దండారి ఉత్సవాలు ప్రతి ఆదివాసి  గూడెంలో చిన్న పెద్ద తేడా లేకుండా నిర్వహించుకుంటారు. ఇలా ఏత్మనూర్ దండారికి వేసే వేషధారణే గుస్సాడిలు అంటారు.

గుస్సాడిలను దైవంతో సమానంగా భావించి మొక్కుతారు. శరీరమంతా మసి,బూడిద రాసుకుంటారు. కుడి జబ్బకు జోలి (జోలే) ఎడమ జబ్బకు జంతువుల తోలు చేతికి గంగారాం సొట (దుడ్డుకర్ర) ప్రకృతి ఒడిలో దొరికే పూసలు, కాయలు, గింజలు మొదలైన వాటితో తయారు చేసిన దండలను మెడనిండా వేసుకుంటారు. అందమైన నెమలీకలతో తయారైన టోపికి ముందు భాగాన జంతువుల కొమ్ములు (పోటెలు) అడవి దున్న, జింక కొమ్ములు అలంకరిస్తారు. నడుముకు పెద్ద గజ్జెలు చేతి దండకు చిన్న గంటలు వంటి వాటితో అలంకరించుకుంటారు. ఇలా తయారై 20 రోజుల పాటు  చివరి రోజు (కొలబడి) వరకూ మొహం కడగకుండా ఉండడమే పవిత్రంగా భావిస్తారు. చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి.  ఎన్ని కష్టాలు వచ్చిన ఇష్టంగా స్వీకరిస్తారు. ఇది దేవుని మహిమగా భావిస్తారు.

 గిరిజనుల కళారూపాలు:

ఆదిలాబాద్ జిల్లాలో అటు ఆసిఫాబాద్ నుండి ఇటు ఇంద్రవెల్లి, బోథ్ వరకు అన్ని ప్రదేశాల్లోను కలిపి మొత్తం 9 తెగల గిరిజన జాతులున్నాయని, వారి జనాభా 4 లక్షల 95 వేల 794 అని ఐటిడిఎ (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) అధికారి ఉదాహరించారు.

ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, లంబాడీలు, ప్రధాన్, మన్నేవార్, కొలాం, నాయక్ పోడ్, తోటీ, ఎరుకల, ఆంద్, కోయా ఇతరులు ముఖ్య జాతులు. నాయక్ పోడులు ప్రధానంగా చెన్నూర్, సిర్పూర్, కాగజనగర్ మండలాల్లో కనిపిస్తారు. జైనూర్, కెరమెరి, నార్నూర్, ఆసిఫాబాద్, ఏజెన్సీ ప్రాంతాల్లో గోండులు, కోయలు ఎక్కువ. బోథ్, నెరెడిగొండ, ఇంద్రవెల్లి మండలాల్లో గోండులు, ప్రధాన్ లు తోటీ, అంధ్ లు ఎక్కువగా కనిపిస్తారు.

ఖానాపూర్, ఇట్నూర్ మండలాల్లో లంబాడీలు, గోండులు అభయారణ్యంలో నివసిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కనిపించే జాతి బంజారా. వీరినే సుగాలీలని, లంబాడీలని, లబానీ అని కూడా పిలుస్తారు. ఇక ఎరుకలు, నాయక్ పోడు, మైదాన ప్రదేశాల్లో నివాసాలు ఏర్పరుచుకున్నవారు ఉన్నారు. గిరిజనులకు సంవత్సరం  పొడుగునా వ్యవసాయమే జీవనాధారం. గోండులు, లంబాడీలు, కోయలు, ప్రధాన్ లు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని భూములను సేద్యం చేసుకుంటారు.

లంబాడీలు, తోటీ, ఎరుకల, ఆంద్ లు నిలకడగా ఒకచోట కాక, తమకు తోచిన ప్రదేశాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. ఇక కోలంలు, నాయక్ పోడులు మొదలైన గిరిజన జాతులు కూడా పోడు వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయాల కోసం ప్రయత్నిస్తారని, మడిపల్లి బద్దయ్యగారు రాశారు. అలా గిరిజనులు జీవిత విధానాలను సాగించుకుంటూ ఆనందం కోసం సంగీతాన్ని, నృత్యాన్ని వాయిద్యాన్ని జోడించి, ఎన్నో కళారూపాలను సృష్టించుకున్నారు.

గోండుల గుస్సాడి నృత్యం:

ఆదిలాబాద్ జిల్లా రాజ గోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యే సరికి పంటలన్ని చేతికి వచ్చి ఉంటాయి. తాబు చెమటోడ్చి చేసిన కష్టం ధాన్య లక్ష్మిగా నట్టింట చేరి ఉంటుంది. గోండులందరు ఆట, పాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమయ్యాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెళ్తారు. కొమ్ములూదుతూ  తప్పెట్లు వాయిస్తూ, యాత్రలు సాగిస్తారు. గోండుల పురాణ గాథలలోని ధండారియారౌడ్, సిసిసెర్మారౌడ్ అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు. గోండు యువకులు 20 నుండి 40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో గుస్సాడీ నృత్యం ఒక భాగం. గుస్సాడీ నృత్యంలో ఎందరో పాల్గొనవచ్చు. దీపావళి నెలలో సాంప్రదాయకమైన ఈ నృత్యం జరుగుతుంది.  పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. చతుర్థశి వరకు జరుగుతుంది. గుస్సాడీ నర్తకునికి కావాల్సిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలి పింఛంతో కొమ్ములను కూడా అమర్చుతారు. కృత్రిమ గడ్డాలు, మీసాలుతో వేషం కడతారు. కప్పుకుంటారు. ఇక వాయిద్యాలు డప్పు, తుడుము, పిప్రి, బాకా, కలికోయ్ (తప్పెట) మొదలైనవి వాద్యబృందానికి హుషారునిస్తాయి. సంగీత వాయిద్యాలను గుస్సాడీ నృత్య పరికరాలను గోండులు పరమ పవిత్రంగా భావిస్తారు. నాట్యరంభానికి ముందు వాటికి పూజ చేస్తారు.

దండారీ కోలాట నృత్యం:

ఏత్మాసారేపేన్-పేరుమీద గుస్సాడీ వేషధారణ చేస్తారు. వీరితో పర్రపోరి (పెపోరి), గుమ్మల పోరి, మొదలైన వేషాలు ధరించి, నృత్యం చేస్తారు. ఒక ఊరి నుండి వేరే ఊరికి దండారీ అనగా నృత్యం, గుస్సాడీ నృత్యంలో భాగం. దండారీ నృత్యం చేస్తున్న బృందంలోకి గుస్సాడీ బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోండు భాషలో గుస్సాడీ అంటే అల్లరి అని అర్థం. దండారీ నృత్యం గుమేలా అనేది బుర్రకథ, ఢక్కి శబ్దాలకు అనుగుణంగా లయబద్దమై ఉంటుంది.

దండారీ నృత్యంలో గుస్సాడీల ప్రవేశం:

దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురైదుగురు గుసాడీలు హఠాత్తుగా దండారీ వలయం లోకి చొచ్చుకొని వస్తారు. తలకు నెమలి ఫించాలను ధరించి, కృత్రిమ గడ్డాలు, మీసాలు శరీరంపై మేక చర్మం ధరించి వచ్చే గుస్సాడీల చేతల్లో కర్రలుంటాయి. మెడలో గవ్వల హారాలు, తుంగ కాయల హారాలుంటాయి. నడుముకు, మణికట్టుకు చిరుగజ్జెలుంటాయి. కంటి చుట్టు తెల్లరంగు పూసుకుంటారు. మొలకు నారింజరంగు లంగోటీలు తప్పించితే శరీరంపై మరే ఇతర అచ్ఛాదన ఉండని గుస్సాడీల వేషం. వింతగా ఉంటుంది. శరీరంపైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకరణలు ఉంటాయి. గుస్సాడీలు ప్రవేశించగానే దండారీలు చెల్లా చెదురవుతారు, ఇవి ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది.

ఢెంసా నృత్యం:

ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధమైన నృత్యాలలో ఢెంసా నృత్యం ఒక్కటి. వృద్ధులు, యువకులు, ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు డెంసా నృత్యం కార్యక్రమంలో పాల్గొంటారు. కష్టజీవులైన గిరిజనులకు ఈ కార్యక్రమాలు అంతులేని ఆనందాన్నిస్తాయి. థెంసా నృత్యం అందరిని అలరించడమేగాక, గ్రామీణ ప్రజల మధ్య సఖ్యతను, సహృద్భావాన్ని పెంపొందిస్తుంది. ఢెంసా నృత్యాన్ని చైత్ర పర్వంలోనూ వివాహ సమయంలోనూ పండుగ పర్వదినాలోనూ ప్రదర్శిస్తారు.

ఢెంసా నృత్యంలో విలక్షణమైన సంగీత వాయిద్యాలున్నాయి. తుండి, మోరీ, కిరిడి, తుడుము, డప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహాకారంతో లయబద్దంగా సాగుతుంది. ఈ నృత్యంలో కళాకారులను ఉత్తేజపరచడానికి మధ్య మధ్య జోడుకొమ్ము బూరలను ఊదుతారు. స్త్రీ పురుషులందరు సాంప్రదాయమైన ఆభరణాలు ధరించి రంగురంగుల దుస్తులను అలంకరించుకొని నృత్యానికి హాజరవుతారు, ధింసా నృత్యంలో 8 రకాలున్నాయి. అందులో బోడే ఢెంసా, గుండెరి ఢెంసా, పోతార్లా, బాగ్ ఢెంసా, మొదలైన నృత్యాలున్నాయి.

కోయ నృత్యం:

ఇది నెన్నెల మండలంలోని కోయ జాతి వారు విత్తనాలు నాటే సందర్భంలో చేసే నృత్యం ఇది కూడ ఆడ, మగ కలిసి చేసే బృందం నృత్యం, వరికోత నృత్యం ఆసిఫాబాద్, బెజ్జూర్ ప్రాంతాల్లో గిరిజనులు చేసే నృత్యం, వరి పంట చేతికి వచ్చిన సందర్భంలో చేసే నృత్యం. ఇది కూడ స్త్రీ, పురుషులు కలిసి చేసే నృత్యం.

లంబాడీ నృత్యం:

లంబాడీలకు జీవనాధారం పశుసంపదే. నిత్యవసర వస్తువులకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేయడానికి పశువులను ఉపయోగించుకుంటారు. పశు సంపద అభివృద్ధి కొరకు వాటి ఆరోగ్యం కొరకు శీతలాదేవీని లంబాడీలు పూజిస్తుంటారు. శీతలాభవాణి ముందు బలి ఇచ్చిన మేకపోతు కడుపులో నుండి చిన్న ప్రేగులను తెగ కుండా బయటకు లాగుతారు. వాటిని శీతలా భవాణికి ఎదురుగా ఉన్న లుంకాడియా (పోతలింగం) దేవునికి తగిలిస్తారు. వీటిపై నుండి పశువులను కేకలు వేస్తూ దాటిస్తారు. ఆదిలాబాద్ జానపదులు కూడ ఇదే విధంగా ఊరు చుట్టూరా పొలాలపైన చల్లుతారు. దీనిని సరువు వేయడం అంటారు. బలి ఇచ్చిన తరువాత లంబాడీ స్త్రీలు బృంద నృత్యం చేస్తూ పాటలు పాడుతారు.

లంబాడీ తీజ్ నృత్యం:

దీనిని ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లోని తాండవాసులు జరుపుకుంటారు. ఇది పండుగల సందర్భంగా ఆడవాళ్లు చేసే బృందం నృత్యం. ఈ నృత్యాలను గిరిజనులు చేసేటప్పుడు తుటుంపర్ర, వెట్టి, డప్పు మొదలైన తోలు వాయిద్యాలను బంసారి కొమ్ము, సన్నాయి మొదలైన వాయిద్యాలు కిన్నెరమెట్ల, కిన్నెర, డోలు, కామారో ఇత్యాది తీగవాయిద్యాలు ఎక్కువగా వాడుతారు. అలంకరణ దుస్తులు సంప్రదాయక పద్ధతుల్లో ఉంటాయి.

పురుషుల నృత్యం:

హోలీ నృత్యం ఆదిలాబాద్కు చెందిన లంబాడీ జాతివారు హోలీ పండగ సందర్భంలో చేస్తారు. దీనిని లేంగీ నృత్యం అని కూడ అంటారు. ఇది స్త్రీ, పురుషులు కలిసి చేసే నృత్యం. పురుషులు అడుగులు వేసే పద్ధతి స్త్రీల కంటే భిన్నంగా ఉంటుంది. నాట్యం చేస్తున్న బృందంతో పాటు వాద్యకారులు పక్కగా వెంటవెంటనే ముందుకు అడుగులు వేస్తారు. ప్రారంభంలో మట్టుకు వాయిద్యాలను పట్టుకున్న కళాకారులు రంగస్థలం మధ్య కనిపిస్తారు. అడుగులు ముందుకు వేసేటప్పుడు మొదట కుడిపాదం వేసి ఆ తరువాత ఎడమ పాదాన్ని కుడిపాదం మడమదాకా ముందుకు తీసుకొస్తారు. ఆ విధంగా మళ్లీ కుడిపాదంతో అడుగు వేయడానికి వీలు కలుగుతుంది. ఈ నృత్యం వాయించే రెండు రకాల చర్మవాద్యాలు అడుగులు వేసేటప్పుడు లయబద్ధంగా చేయడానికి తొడ్పడతాయి. వాయిద్యాలను మరింత వేగంగా వాయించిన కొలది నాట్యంలో ఉత్సాహం కూడా పెరిగి మరింత చురుకుగా సాగుతుంది. అర్థరాత్రిలోగా విందులు ముగించి స్త్రీలు, పురుషులు, పిల్లలు మళ్లీ నృత్యం ప్రారంభిస్తారు.

ఉపయుక్త గ్రంధాలు:

  1. నల్లగొండ జిల్లా బంజర సాహిత్య జీవన చిత్రం, డా॥ సూర్యధనుంజయ్-2011
  2. ఆదిలాబాద్ జిల్లా లంబాడి సాహిత్యం, డా॥ మురహరి రాథోడ్ - 2019
  3. కరీంనగర్ జిల్లా - లంబాడిల ఆచార వ్యవహారాలు, డా॥ జనపోల శంకరయ్య - 1995