AUCHITHYAM | Volume-3 | Issue-8 | August 2022
5. జానపద సాహిత్యం - వివిధ ప్రక్రియల అవగాహన
ఇనపకుర్తి అప్పన్న
తెలుగు అధ్యాపకులు, శ్రీ జి.సి.యస్.ఆర్. కళాశాల,
రాజాం, శ్రీకాకుళం. 9966338730
ఉపోద్ఘాతం :
తెలుగు సాహిత్య ఉద్యానవనంలో కల్పవృక్షం వంటిది జానపదం. జానపదం అనగా పల్లెటూరు. జానపదులు అంటే పల్లెటూరు వాసులు. ఈ జనపదాలలో పుట్టి పెరిగిన మన జానపద వాఙ్మయంలో వచ్చిన వచనం, గేయం, కథలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, కులపురాణాలు వంటివి. ఇవి జానపదమనే ‘వృక్షానికి వికశించిన పుష్పాలు’’ వలే జానపద విజ్ఞానంలో ప్రత్యేకతను సంతరించుకొన్నవి.
జానపద సాహిత్యం మౌఖిక సాహిత్యం. ప్రాచీన కాలం నాటి విభిన్న సాంస్కృతిక సమూహాల సంస్కృతీ వికాసాలను గుర్తించడానికి, వారి ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, కళలు, సాహిత్యాది విషయాల్ని తెలుసుకోవడానికి మనకు రెండు రకాలైన ఆధారాలున్నాయి. మౌఖిక సంప్రదాయాంలో నిలిచిపోయిన విజ్ఞానం ఒకటి. నాగరికతా ప్రవాహానికి లోనై గ్రంథస్థ రూపం పొందిన విజ్ఞానం మరొకటి. మొదటిది సాంప్రదాయిక విజ్ఞానం, దీన్నే జానపద విజ్ఞానం అంటాం. రెండోది గ్రాంధిక విజ్ఞానం.
జానపద విజ్ఞానాన్ని, ఆచారాలను, సంస్కృతిని, కళలను, సాంప్రదాయాలను, ప్రపంచానికి తెలియజేయడంలో ప్రముఖపాత్ర పోషించి ‘‘మూడు పూవులు `ఆరుకాయలు‘‘గా వికశింపచేసినవే జానపద ప్రక్రియలు. వాటిలో కొన్నింటిని ఈ దిగువన వివరించడమైనది.
వచనం :
‘‘గద్యం కవీనాం నికషం వదన్తి’’ అన్నట్లు జానపదులు యొక్క సంస్కృని తెలియజేయడంలో వచనం అనేది ప్రధమంగా చెప్పొచ్చు. జానపద వచనం నిరక్షరాస్యులకు సులభంగా అర్ధమయ్యే విదంగా ఉంటుంది. ఉదా :` గంగిరెద్దుల వాళ్ళు అయ్యవారికి దణ్ణంపెట్టు అనే మాటలు. పాములవాళ్ళు పాముల ఆడిరచేటప్పుడు మాటలు, సంచార సంచార జీవనం సాగిస్తున్న కొన్ని వృత్తులు, కోతులు తిప్పటం వంటివి వచన రూపంలో సాగుతుంటాయి.
గేయం:
జానపద కవిత్వంలో ప్రధానాంగం గేయం. గాన యోగ్యమైనది గేయం. రాతకోతలతో నిమిత్తంలేని జానపదులు అలసట నుండి రసోద్రోక్తులై ఆలపించు సుమధుర భావనిర్భర గీతాలే జానపద గేయాలు. ఒక భావంలో లీనమైనప్పుడు, ఒక రసంలో తన్మయత్వం పొందినపుడు, అపూర్వానుభూతితో పాటు హృదయస్పందన అవుతుంది. అదే జానపదగేయంగా ప్రచారమవుతుంది. కాబట్టి జానపద గేయం స్వయంభువు. గంధవహుని వలె విహరించి ఆనోటి నుండి ఈ నోటికి ఎగిరిపోయేది జానపద గేయం అని శ్రీ పాద గోపాల కృష్ణమూర్తి గారి నిర్వచనం.
అజ్ఞాత కాలనిర్ణయం, గానయోగ్యం, శైలీ నిరాడంబరం, భావనిబ్బరం, రసప్రధానం వంటివి జానపద గేయానికుండే లక్షణాలు. వ్యవసాయ కూలీలు, శ్రామికులు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేస్తున్నప్పుడు శరీరం కదిలికలుకు అనుకూలంగా ధ్వనులు వ్యక్తీకరించడం వల్ల గేయాలు ఆవిర్భవించి, శ్రామికులను ఉత్తేజ పరుస్తూ ఉల్లాసంగా పనిలో నిమగ్నంచేస్తాయి. జానపద గేయాలు పాటలుగా కూడా పరిణమించును.
శ్రీ టేకుముళ్ళు కామేశ్వరరావు జానపద గేయాలను తొమ్మిది విభాగాలుగా గుర్తించారు. జంగం కధలు, పౌరాణిక గేయాలు, స్త్రీల పాటలు, వాగ్గేయములు ఇవే కాకుండా ఆర్.యస్. బాగ్స్, పి. సాంబమూర్తి గారు వంటి వాళ్ళు జానపద గేయాలను వర్గీకరించారు. జానపద గేయాలన్నింటిని పురుషుల పాటలు, స్త్రీల పాటలు, స్త్రీ పురుషోభయుల పాటలు, పిల్లల పాటలు, వలపు పాటలు, హాస్యపు పాటలు శ్రామిక గీతాలు, క్రీడా గీతాలు, నృత్యగీతాలు, లాలిపాటలు, జోలపాటలు, వేడుక పాటలు, పెండ్లిపాటలు.
బాంధవ్యగేయాలలో:-
"కలవారి కోడలు కలికి కామాక్షి పాటలో - అరటితోటలోనున్న ఓ అత్తగారు మాఅన్నలోచ్చారు మమ్ముంపుతారా?
పిల్లల పాటలలో - చందమామ రావే - జాబిల్లి రావే, కొండెక్కిరావె, గోగుపూలు తేవె,
శృంగార గేయాలలో - నిమ్మపండూ గొయ్యపోతే నిమ్మముల్లూ రొమ్ము జేరు
నాసామి ..." వంటీ గేయాలలో జానపదల భాందవ్యాలు, మాధుర్యం, శృంగారం, వంటివి పునికి పుచ్చుకుంటాయి.
కథలు:
ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా జానపద కథలను చెప్పేవాళ్ళూ, వినేవాళ్ళూ అధిక సంఖ్యలో కన్పిస్తారు. భారతదేశంలో కథలంటే చెవి కోసుకొనేవాళ్ళు అధికం. భారతదేశం జానపధ కథలకు పుట్టినిల్లు. కుతూహలాన్ని రేకెత్తుస్తూ కథను ఒక కళ, ఈ కథలు చెప్పడంలో ఆరితేరిని వారు ప్రతీ గ్రామంలో దర్శనమిస్తూ, వినేవాళ్ళ హృదయాల్ని రంజింపజేస్తారు. జానపద కథలు చెప్తూఉంటే ఊ కొట్టడం పరిపాటి. జానపద కధలకు వెన్నె తెచ్చిన వారిలో నాయని కృష్ణకుమారిని పేర్కొన వచ్చును.
కేవలం ఆనోటి నుండి ఈ నోటికి, ఆ చెవి నుండి ఈ చెవికి తరతరాలుగా సంప్రదాయ బద్దంగా అందించబడ్డ కథా కథనమే జానపద కథ. జానపద కథలలో మానవులే కాక జంతువులు, దేవతలు, దయ్యాలు, బ్రహ్మరాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, నరనాగులు, నరసింహులు మొదలైన పాత్రలన్నీ కనబడతాయి. దుష్టశిక్షణ ` శిష్టరక్షణ వంటి అంశాలలో నవరసభరితంగా కథలు నడుస్తాయి.
వేదకాలం నాటికే వేదాల్లో జానపద బీజాలు మనకు కల్పిస్తాయి. రామాయణం మహాభారత, భాగవత కథల్లో సందర్భానుసారంగా జనుల వాడుకలో ఉన్న జానపద కథలు చేర్చబడ్డాయి. గుణాడ్యుడడు - బృహక్కధమంజరి, విష్ణుశర్మ -పంచతంత్రం వంటి వాటిల్లో జానపద కధలనేకం కన్పిస్తాయి. జానపద కథలలో అద్భుత కధలు, వినోద కధలు, ప్రాణికధలు, నీతి కథóలు, సమస్యాత్మక కథలు ముఖ్యమైనవి.
సామెతలు:
నిత్య జీవితంలో మానవుడు సుఖ దు:ఖాలను రెండిరటిని సమానంగా అనుభవిస్తాడు. తాను అనుభవించిన దాన్ని ఇతరులకు ఉపదేశాత్మకంగా, సందేశరూపంలో చిన్న వాక్యంలో అందిస్తాడు. అల్పాక్షరాలలో ` అనల్పభావాన్ని ఇస్తుంది సామెత. సామతెలు అనుభవాలు నుంచి పుట్టాయని, అనుభవం కేవలం ఒక్కరిదే కాదని జనసామాన్యులందరిదని చెప్పవచ్చు. సామెతకూర్పు ఒక్కరే కావచ్చు కాని అది పలువురి అనుభవం మీద ఆధారపడి ఉంటుంది.
సామెతలు జానపదులు నిత్యవ్యవహారాలలో వినిపించే జీవన సత్యాలు. ఒక భాషకున్న అస్తిత్వాన్ని, సాంస్కృతిక నేపధ్యాన్ని తెలుసుకోవడానికి సామెతలు ఎంతగానో తోడ్పడతాయి. సామెతలు బోధించే నీతివాక్యాలతో ఎందరో తమ జీవితాలను చక్కదిద్దుకొని వుంటారు. అంటే సామెత మనిషిని ఎన్నో విధాలుగా చైతన్యపరిచి, స్పృహకల్పించి తన జీవితంలో పూలబాట వేస్తుందని చెప్పక తప్పదు. మనిషికి సరైన జీవన మార్గనిర్ధేశాన్ని చేయడంలో ప్రముఖపాత్ర పోషించేవి మచ్చుకు కొన్ని:-
మొక్కై వంగనిది - మానైవంగునా
అడుసుతొక్కనేల - కాలుకడగనేల
పులిని చూసి - నక్క వాతపెట్టుకొన్నట్లు
ఉంటే ఉగాది, లేకపోతే ఏకాసి
దేవుడు వరం ఇచ్చినా - పూజారి వరం ఇయ్యడు
కాకిపిల్ల - కాకికి ముద్దు
రామాయాణం అంతావిని - రాముడకి సీతేం అయ్యందన్నట్లు
కుంచాలమ్మ కూడిదీస్తే - మంచాలమ్మ యాయచేసింది.
ఇంట గెలిచి - రచ్చ గెలివాలి మొదలగునవి
మనిషికి ఎంతో షృజన కల్పించి, పాత్రపోషిస్తాయని చెప్పడం కద్దు.
జాతీయాలు :
ఒక ప్రత్యేక జాతికి సంబందించిన ప్రత్యేక విషయాలను వ్యక్తీకరించేవే జాతీయాలు. ఒక భాషకున్న శైశిష్ట్యాన్ని లేదా ప్రత్యేకతని జాతీయాలు చక్కగా రూపొందిస్తాయి. వ్యవహారిక భాషా సౌందర్యం వీటిలో తొణికిసలాడుతుంది. జానపదుల భాషా వ్యవహారంలో భావవ్యక్తీకరణ బలంగా హృదయానికి తాకేలా వుండడానికి, నిగూఢార్ధాన్ని స్పష్టంగా తేటతెల్లం చేయడానికి, ఆయా భాషీయుల సంస్కృతిని ఇముడ్చుకొని వుండే జాతీయాలు భాషఅనే ముఖానికి తిలకం దిద్దినట్లు ఉంటాయి. వీటికే పదబందములు, నుడికారములు అని పేర్లు.
జానపదలు వ్యవసాయ క్షేత్రాలలో, వచన రూపంలో ఉన్న కథలు చెప్పుకొంటూ, పాటలు పాడుకుంటూ, సంబంధ భాందవ్యాలు నెలకొల్పుకున్నపుడు వాడే కొన్ని జాతీయాలు కత్తిమీద సాము, ముక్కుపిండి. పాలకంలో పుడక, తేనెపూసిన కత్తి, పక్కలో బల్లెము, పిండార బోసినట్లు, కయ్యానికి కాలుదువ్వు, తలలో నాలుక, నీళ్ళునములు, మూణ్ణాళ్ళముచ్చట, గుండి చెరువు, రెండు నాలుకలు, అడవిగాచిన వెన్నెల, కళ్ళు కాయాలు కాయడం, వంటివి సందార్భాన్ని బట్టి అసంఖ్యాకంగా వాడుతూ భాషామృతాన్ని వెల్లడిస్తాయి.
పొడుపు కథలు :
పొడిచేలా ప్రశ్నించు అనే అర్ధంలో వాడేదాన్ని పొడుపు లేదా పొడుపుకథ అనవచ్చు. కథ అనటంలో ఇక్కడ విషయం అని అన్వయించవచ్చు. వినోదాన్ని, విజ్ఞానాన్ని సమానంగా పంచే ప్రక్రియయిది. సామాన్య మానవుని బుద్ధిచాతుర్యం, హాస్యప్రియత్వం, సమస్యా పరిష్కారతపన, పొడుపు కథలు రూపుదాల్చడానికి కారణాలౌతాయి. ప్రత్యుత్తరం తెలియని వారి బుద్ధి కుశలతను పరీక్షించాడానికి, వారికి తికమక పెట్టడానికి తయారు చేసిన ప్రశ్నలు పొడుపుకథలు. ఇవి జానపదులకు, పని పాటలు విషయములో ఎంతో ఆహ్లాదాన్ని, ఆలోచనను, మనోరంజకత్వమును కలిగిస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదు. దీనిని సంస్కృత, తమిళ, కన్నడ, మలయాళం మొదలగు భాషలలో ప్రహేళిక వివిధ నామాలతో వ్యవహరిస్తారు. రామాయణ, భారత, భాగవత ఘట్టాలలో వీటిని విరివిగా వాడిన వారు కందుకూరి రుద్రకవి, తెనాలి రామకృష్ణుడు గారు వంటి వాళ్ళును పేర్కొనవచ్చు.
ఉదా : కుంజరయూదంబు దోమకుత్తుక జొచ్చెన్
చాపచుట్టలేము చక్కబెట్టలేము
వంకటింక శో
వానితమ్ముడు. అ
రెండు మిద్దెలకు ఒకటే దూలం, వంటి పొడుపు కథలు కాలక్షేపం కోసం సృజింప బడ్డ ప్రక్రియే అయినా ఇది పెద్దలు, పిన్నలు, మధ్య సామాజిక విషయ సామాగ్రిగా బుద్ధికి గోచరిస్తుంది.
కుల పురాణాలు:
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జానపద అంశ కలిగిన దేవతలను కొలుస్తుంటారు. వీళ్ళందరూ గురించి, ప్రాంతీయ పరమైన క్షేత్ర సంబంధమైన మత, కుల, వర్గ సంబందమైన పురాణాలు తెలియజేస్తాయి.
గౌడ పురాణం - గాండ్ల వారు
విశ్వకర్మ పురాణం - విశ్వబ్రాహ్మణులు
జాంబ పురాణం - దళితులు
మల్లన్న పురాణం - యాదవులు
పాండవుల కధ - ముత్తరాసి (ముదిరాజు)వారు
శాలివాహన పురాణం - కుమ్మరి వారు
మడేలు పురాణం - రజకులు
అద్దపోళ్ళు పురాణం - నాయీ బ్రాహ్మణులు - వంటి పురాణాల ద్వారా జానపద కుల విశిష్టత స్పష్టమౌతుంది.
ముగింపు :
జానపద వాఙ్మయ విజ్ఞాన రంగంలో బిరుదురాజు రామరాజు, తూమాటి దోనప్ప, నేదునూరి గంగాధరం, నాయనికృష్ణకుమారి, జి.యస్. మోహన్, తంగిరాల వేంటక సుబ్బారావు, ఆర్.వి.యస్. సుందరమ్ వంటి జానపద పరిశోదకుల కృషి, జానపద సాభిత్యాభివృద్ధికి ‘మూడు పువ్వులు ` ఆరు కాయలు’’ గా వృక్షానికి కాసిన సుమధుర ఫలాలుగా సమాజంకు ఉపయోగపడుచున్నవి.
ఉపయుక్త గ్రంథ సూచి:
- డా. జి.యస్ మోహన్ - జానపద విజ్ఞానాధ్యయనం
- టేకుముళ్ళ కామేశ్వరరావు - జానపద గేయ వాఙ్మయ చరిత్ర
- నాయని కృష్ణకుమారి - జానపధ గేయ గాథలు
- శ్రీపాద గోపాలకృష్ణమూర్తి - దేశి సారస్వతం