AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-8 | August 2022

4. మహాభారతం - చార్వాక వధ పరిశీలన

డా. వీపూరి వేంకటేశ్వర్లు

పి.జి.టి.తెలుగు, సెయింట్ జోసఫ్ ఆంగ్ల పాఠశాల,
ఇం.నెం. 40 - 807, పి.ఎస్.ఆర్. హోమ్స్, ప్లాట్ నెం. 5,
నెహ్రూనగర్, కర్నూలు-518004 (ఆం.ప్ర)
సెల్: 9885585770, E-Mail: venkateswaruluveepuri@gmail.com


ఉపోద్ఘాతం:

1. చార్వాకుడు:

చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తికమతాన్ని వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంతకర్త. కనుక ఇతడు ‘లోకాయతికుడు / లోకాయతుడు’ అని పిలువబడ్డాడు. ఇతడు ఆత్మ లేదనే వాదం చేసేవాడు.

2. చార్వాకమతం:

ఇదొక నాస్తిక మతం. దీనికే ‘లోకాయతం’ అనే పేరుంది. సాయణ మాధవాచార్యులు రచించిన ‘సర్వదర్శన సంగ్రహం’లోని చార్వాక దర్శనంలో ‘లోకే అయతం లోకాయతమ్‌’ అని నిర్వచనం చెప్పారు. ‘లోకంలో విస్తృతమైనది’ అని అర్థం.

చతుర్విధ పురుషార్థాలలో ధర్మాన్నీ, మోక్షాన్నీ పక్కనపెట్టి అర్థకామాలకు మాత్రమే సామాన్యులు ప్రాధాన్యం ఇవ్వడం లోకరీతి. లోకంలో ఎక్కువ మంది ఇలాగే వ్యవహరిస్తుంటారు. కనుక ఇది లోకమంతటా ఉన్నదే! కనుకనే దీనిని ‘లోకాయతం’ అన్నారు. సార్థకమైన పదమిది.

నేల, నీరు, నిప్పు, గాలి అనే నాలుగు భూతాలు (ఐదుకాదు) కలవనీ, వాటి కలయికే చైతన్యాన్ని కలిగిస్తుందని కూడా చార్వాకుల భావన. కిణ్వం అనే ఒక విధమైన చెట్టు జిగురు ఇతర పదార్థాలు కొన్నిటితో కలిసినప్పుడు ఎలా దానికి మాదక (మత్తు) గుణం కలుగుతుందో, అలా నాలుగు భూతాలు కలిసినప్పుడు చైతన్యం పుడుతుందని చార్వాక దర్శన వ్యాఖ్యానం తెలియజేస్తున్నది. నేల, నీరు మొదలైనవి నశించడంతోనే చైతన్యమూ నశిస్తుంది. నరక లోకమంటూ మరే లోకమూ లేదు. స్త్రీ పురుషుల కౌగిలింత సుఖమే సుఖం. ముల్లు గుచ్చుకొన్నప్పుడు నొప్పికలగడం లాంటివి నరక బాధలు. ఇంకా ఇలాంటి భావనలే చార్వాకంలో కన్పిస్తాయి.

3. వ్యాస భారతం - చార్వాకవధ:

కురుక్షేత్ర సంగ్రామ అనంతరం సూత మాగధులు, వైతాళికులు ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవంలో ధర్మరాజును స్తుతిస్తున్నారు. ధర్మరాజు, గాంధారీధృతరాష్ట్రులు, కుంతి, ద్రౌపది, కౌరవ స్త్రీలు, విదురుడు ఇతర మొదలైన వారందరూ హస్తినాపుర నగరంలో ప్రవేశిస్తుండగా, వీళ్ళు అభినందన వాక్యాలు పలుకుతూ, పుష్పాలు చల్లుతున్నారు. వేలకొలది బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతున్నారు. శంఖాలు, దుందుభులు మ్రోగుతున్నాయి. జయజయ ధ్వానాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇంతలో విప్రజనుల మధ్య నుండి దుర్యోధనుని మిత్రుడైన చార్వాకుడనే రాక్షసుడు సన్న్యాసి రూపంలో, శిఖ - త్రిదండాలు ధరించి, నిర్భయంగా ముందుకు వచ్చాడు. బ్రాహ్మణులందరూ ఆశీర్వాదం పలకబోతుండగా, ఆ విప్రులనెవరినీ పలకరించకుండగానే, ధర్మరాజుతో ‘‘ఈ విప్రులందరూ నా ముఖం ద్వారా ఇలా అంటున్నారు: ‘‘ఛీ! ఛీ! జ్ఞాతులనందరినీ నశింపజేసిన ఈ కునృపతి ఉండి ప్రయోజనం ఏమిటి? గురువులను చంపించినవాడు జీవించి ఉండడం కంటె మరణమే మేలు’’ అని అన్నాడు.

దుష్టుడైన ఆ రాక్షసుని మాటలు వినగానే అటు బ్రాహ్మణులు, ఇటు ధర్మరాజు కూడ సిగ్గుపడుతూ, చాలా కలవరం చెంది మౌనంగా ఉండిపోయారు. చివరకు ధర్మారాజు ‘‘నేను ప్రణామం చేస్తూ ప్రార్థిస్తున్నాను. ఓ! పూజ్యులారా! దుఃఖంతో ఉన్న నన్ను ఈ విధంగా ధిక్కరించకండి’’ అన్నాడు.

అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ‘‘రాజా! ఇది మా మాటకాదు. ‘శ్రీరస్తు’ నీకు సకల సంపదలు కలుగుగాక!’’ అని ఆశీర్వదించారు. తర్వాత వారందరూ తమ తపోబలం చేత చార్వాకుని గురించి తెలిసికొని ఇలా అన్నారు: ‘‘ఇతడు దుర్యోధనుని మిత్రుడైన చార్వాకుడనే రాక్షసుడు. పరివ్రాజక రూపంలో అతనికి హితం చేయడానికి వచ్చాడు. మహాత్మా! మేం ఇలా అనడం లేదు. నీకేమి భయం వద్దు! నీకు, నీ సోదరులకు మంగళం కలుగుగాక!’’ అని అంటూ ఆ రాక్షసునిపై హుంకరించారు. వెంటనే అతడు భస్మమైపోయాడు. అందరూ సంతోషించారు.

అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ‘‘ఇతడు చార్వాకుడనే రాక్షసుడు. పైగా దుర్యోధనునికి మిత్రుడు. ఇతనికి బ్రాహ్మణావమానం చేస్తే తప్ప మరణముండదని బ్రహ్మ వరమిచ్చాడు. ఇప్పుడు బ్రాహ్మణులను అవమానించడం చేత మరణించాడు. ఇప్పుడు జరిగిన దానిని గూర్చి విచారించకు’’ అని అన్నాడు.

తర్వాత ధౌమ్యుడు మొదలైన పురోహితులు, మంత్రి సామంతాదులు, ప్రజలు ధర్మరాజును సామ్రాజ్యాభిషిక్తుని చేశారు. వైదికాశీస్సులతో, జయజయ ధ్వానాలతో, మంగళవాద్యఘోషతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది.

ఇలా ఈ చార్వాకవధ వృత్తాంతం, సంస్కృత మహాభారతంలో శాంతిపర్వం (12-39-22)లో కన్పిస్తుంది.

4. తిక్కన భారతం - చార్వాకవధ:

చ॥ వినుము నరేంద్ర! సర్వమగు విప్రజనంబును గూడి నన్నుఁ బం

చిన విధ ‘మీతఁడేటిపతి? సేసిన పాపము పెద్ద చంపుచో

జనకుఁడు భ్రాత పుత్రుడను శంక యొకించుక లేదు సద్గురుం

డనయెడి కొంకు బుద్ధి నిసుమంతయుఁ బుట్టదు వీనిఁ గాల్పనే!’

వ॥      అనుమని రని పలికి వెండియు

ఆ॥      ఇట్లు శిష్టజనము లేవగింపఁగఁజేయు

              రాజ్యమేల బంధురాజి నెల్లఁ

              బొలియఁజేసి యెట్టి భోగంబు లనుభవిం

              చెదవు? కల్మషంబు చిక్కె నీకు

                                                                                       (శాంతిపర్వం: ప్రథమాశ్వాసం - 361,362, 363)

‘‘ధర్మరాజా! బ్రాహ్మణులు కలిసి నన్ను పంపిన కారణం వినుము. ఘనమైన పాపం చేసిన ఇతడేం రాజు? చంపే సమయంలో తండ్రి, సోదరుడు, కొడుకు అని కూడ సందేహించలేదు. విద్య నేర్పిన గురువని మనసులో కొంచెం కూడ భయపడలేదు. వీడిని తగలపెట్టినా తప్పులేదు కదా! అనుమని అన్నారు.’’ అనిచెప్పి, ఇంకా ` ‘‘ధర్మరాజా! ఈ విధంగా సజ్జనులంతా అసహ్యించుకొంటూ ఉండగా రాజ్యం చెయ్యటం ఎందుకు? బంధువులనందరినీ చంపి నీవు ఎటువంటి భోగాలు అనుభవిస్తావు? నీకు పాపం కలిగింది!’’ అని అన్నాడు.

తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చార్వాకుని వృత్తాంత్తాన్ని చెప్పి, చార్వాక శవాన్ని బయట పారవేయించి, ధర్మరాజుతో ఇలా అన్నాడు:

ఆ॥      మాఱు కొన్నవారి నీఱు సేయుము ప్రజ

              నరసి మనుపు, ధరణిసురులఁ బ్రోవు

             ......................................................

              వృత్తి మనుపు పెంపు వెలయనధిప!

                                                        (శాంతి: ప్రథమాశ్వాసం - 370)

‘‘ధర్మరాజా! ఎదురించిన వాళ్ళను మసిచేయుము. ప్రజల కష్టసుఖాలు విచారించి రక్షించుము. నీ గొప్పతనం ప్రకటమయ్యే విధంగా బంధువులను, ఆశ్రయించుకొన్నవారిని సుఖంగా ఉండేటట్లు కాపాడుము’’.

5. చార్వాకవధ - ఆలోచనాంశాలు:

శ్రీకృష్ణుడు చార్వాకవధ తర్వాత అన్న ఈ మాటల్ని వెనుదిరిగి మరోమారు పరిశీలించాలి. చిన్ననాటి నుండీ దుర్యోధనాదులు పాండవుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ, ఆత్యాచారాలు సాగిస్తూనే ఉన్నారు.       

విషం కలిపిన అన్నం పెట్టారు. పాములతో కరిపించారు. కాళ్ళూ చేతులూ కట్టి నదులలో పారవేయించారు. లక్క ఇంట పెట్టి నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. జూదంలో మాయ చేసి అడవుల పాలు చేశారు. నిండు సభలో ఆ ఇంటి కోడలైన ద్రౌపది జుట్టుపట్టి లాగి, వస్త్రాపహరణ ప్రయత్నం చేశారు.

ఇన్ని అత్యాచారాలు సహించి, శాంతంతో బ్రతుకుదామని పంపిన రాయబారాలు కూడా విఫలమయ్యాక, సంగ్రామ రంగంలో దిగారు. అధర్మ పక్షం వహించడం వల్ల భీష్మ ద్రోణాదులు కూడా బలికావలసి వచ్చింది.

ఈ విషయాలు ఏవి గ్రహించకుండా, బుద్ధిస్థిరత లేని చార్వాకుడు ధర్మరాజును నిందించాడు. మిత్రుడైనా దుర్యోధనుని పని చేయాలనుకొని బ్రాహ్మణులకు బాధ కలిగించే పని చేశాడు. తన వినయరాహిత్యం వలన బ్రాహ్మణుల దండనచేత చంపబడ్డాడు.

మొత్తానికి చార్వాకుడు నాస్తికుడు. కానీ దుర్యోధనుని మిత్రుడు. దైవం మీద నమ్మకం లేనివాడు. ధర్మంపై విశ్వాసం లేనివాడు అవకాశం చిక్కినప్పుడల్లా తన నాస్తికవాదాన్ని వినిపిస్తూ, అటు దుర్యోధనునికి ` ఇటు సమాజానికి అధర్మ జీవనాన్ని ఆవిష్కరించే పని కలవాడు.

మహర్షులు కూడా నోరు తెరవక ధర్మజ పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షిస్తున్న తరుణంలో, ‘తగుదనమ్మా!’ అంటూ ముందుకొచ్చి, ఈ నాస్తికపాషాణం ప్రవర్తించిన తీరు చాలా ఘోరంగా ఉంది.

మహాభారత కాలంలో కూడా ఈ అధర్మపరులు, నాస్తికవాదులు ఉండేవారని తెలుస్తోంది. అంతేకాదు బరితెగించి ఎక్కడైనా, ఎలాగైనా పలవరించే సామర్థ్యం ఆ రోజుల్లో కూడా ఉన్నట్లు చార్వాకుడిని చూస్తే అర్థమవుతుంది. కానీ, ఇటువంటి నాస్తికపాషాణాన్ని ‘దుర్యోధనుడు కూడా ఎందుకు ఆదరించాడో? అనేదే అర్థం కాదు. ఆ రోజుల్లో నిజమైన ప్రజాతంత్ర పరిపాలన సాగుతూ ఉండేది. కనుక నాస్తికునికి కూడా దుర్యోధనుని మనసులో సముచిత స్థానం లభించింది. బహుశా బ్రతుకు చెడకుండా, మెతుకు దూరం కాకుండా (రాజ్యం చేజారిపోకుండా), ఉండాలంటే, చేసిన తప్పిదానికి అతుకు వేసుకోవడమే సముచితమని భావించి, ఆస్తికత్వం నుంచి నాస్తికత్వాన్ని ఆలోచించకుండా దుమికాడేమో దుష్టుడైన దుర్యోధనుడు. ఎందుకంటే ధర్మం మీద విశ్వాసం లేనివాడు మనసును తేలిగ్గా చంపుకోగలడు. చార్వాకుని దృష్టిలో కూడా పరలోకం లేదు. చింతకాయ లేదు. ప్రత్యక్షమే సత్యం! పరోక్షమంతా బూటకమే! కనుక అతనికి ధర్మార్థముల కొరకు శ్రమించేవారంటే జాలి వేస్తుంది. ఎందుకంటే ఈ ధర్మం మాయలోపడివారు ఇక్కడ దుఃఖజీవితాన్ని అనుభవిస్తారు. మరణానంతరం ఎలాగో నశించిపోతారు.

‘ఋణం కృత్వా ఘృతం పిబేత్‌’ ఇది చార్వాక సిద్ధాంతం, అంటే అప్పుచేసి అయినా నేతికూడు తినాలని’ అర్థం. ఇందులో ధర్మాధర్మాల ప్రసక్తి లేదు. ముఖ్యంగా ‘ఆత్మ’ అనే పదార్థ చర్చలేదు. పుట్టడం, పెరగడం, క్షీణించడం, నశించడం అనేవి ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేహధర్మాలు. ఇవేవి ఆత్మధర్మాలు కావు.

అమావాస్యనాడు చంద్రుడు కనిపించనంత మాత్రాన చంద్రుడు నశించినట్లేనా? అమావాస్యనాడు చంద్రుని స్థూల శరీరం క్షీణిస్తుంది. అందుకని చంద్రదర్శనం కాదు. ఆత్మ కూడా అంతే! శరీరం ఉన్నంతవరకు చేతనత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. శరీరం నశించగానే శరీరి చంద్రుడులాగా కనిపించడు.

అమావాస్య తర్వాత మరొక సమయంలో చంద్రుడు ఎలాగైతే మళ్ళీ ప్రకాశమానమవుతాడో, శరీరి శరీరం ద్వారా చైతన్య కిరణాలను వెదజల్లుతూ, విరజిమ్ముతూ శోభిస్తాడు. ఇలా ‘ఆత్మయే తాను’ అని తెలుసుకొనిన వాడు ఆత్మవిదుడు. అతడు అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటాడు.

ధర్మరాజు ఆత్మవిదుడు. అతడికి శత్రువులు లేరు. తానెవ్వరికీ శత్రువు కాడు. అతడు అజాతశత్రువు, సర్వులకు హితము చేయుటయందే ఆసక్తి కలవాడు. అందరికీ పూజ్యుడు. పైగా నిరంతరం మంగళకార్యాలే చేస్తాడు. కనుక అతనిని ప్రేమించని వారెవరుంటారు? అందుకే బ్రాహ్మణులందరూ కలిసి చార్వాకుడు చేసిన ధర్మరాజు నిందకు నొచ్చుకొని, అతణ్ణి చంపినారు.

6. ఉపసంహారం:

అత్యాచారాలు చేసే ఆకతాయిలు బాహాటంగా రొమ్ము విరుచుకు తిరిగే దృశ్యాలు నేడు ప్రపంచమంతటా నిత్యం కనిపిస్తున్నాయి. దక్షులైన వారు కూడా ఉపేక్షా భావంతో ఉండడం వల్ల దుర్యోధన చార్వాక ప్రకృతి విజృభించి సర్వనాశనం చేస్తున్నది. ఈ సమయంలో ధర్మజుని ఆత్మతత్త్వం ఒంటబట్టించుకొని లోభగ్రస్త హృదయులు, ఆత్యాశాపరులు, అవినీతి పరాయణులయిన వారిని చెరుకు తోట నరికినట్లు నరకడానికి తగిన శక్తిని, ధైర్యాన్ని సాధించాలి. అందుకే చార్వాకవధ అంతరార్థం తెలుసుకొని యువతరం మనస్సును దృఢం చేసుకోవాలి.

ఆధార గ్రంథాలు :

  1. వేంకటేశ్వరరావు, పొత్తూరి: పారమార్థిక పదకోశం, ఎమెస్కో పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ (2010).
  2. శ్రీరామచంద్రుడు, పులెల్ల: మహాభారతసార సంగ్రహము, స్వీయ ప్రచురణ, హైదరాబాదు (2014).
  3. సుబ్రహ్మణ్యం, జి.వి. (సంపా) : కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము - 12, తి.తి.దే. ప్రచురణ, తిరుపతి (2008).
  4. స్వామిసుందర చైతన్యానంద: చైతన్య మహాభారతము - 2, సుందర చైతన్యాశ్రమం, హైదరాబాదు (2006).
  5. ఉషశ్రీ: భగవద్గీత, శ్రీమహాలక్ష్మీ బుక్‌ కార్పోరేషన్‌, విజయవాడ (2019).
  6. స్వామి సుందర చైతన్యానంద: చైతన్య రామాయణము - 1, సుందర చైతన్యాశ్రమం, హైదరాబాదు (2013).