AUCHITHYAM

An On-line Research Journal for Telugu Language & Literary Studies

Home About Us Editorial Board Archives Call For Papers Contact Us

AUCHITHYAM | Volume-3 | Issue-8 | August 2022

1. జగద్గురు ఆదిశంకరుల అపరోక్షానుభూతి

ఆచార్య సార్వభౌమ డా. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి

ఎం.ఏ., తెలుగు పిహెచ్.డి., ఎం.ఏ., సంస్కృతం పిహెచ్.డి.,
విశ్రాంతాచార్యులు, తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వవిద్యాలయం,.
విశాఖపట్నం, స్థిరవాణి: 0891-2541003.


ఉపోద్ఘాతం:

శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామివారి ఆదేశం పురస్కరించుకొని అపరోక్షానుభూతికి వివరణ రచించడం సంభవించింది. కాబట్టి వారికి భక్తిపూర్వక ప్రణామాలు. ప్రస్థానత్రయ భాష్యంలో నిరూపించిన అద్వైత సిద్ధాంత సారాన్ని మధ్యమాధికారులు గ్రహించడం కోసం శంకరభగవత్పాదులు కొన్ని ప్రకరణ గ్రంథాలు రచించేరు. శాస్త్రంలో ముఖ్యమైన సిద్ధాంత సారాన్ని ఇతర శాస్త్ర విషయ సమన్వయంతో సంగ్రహంగా రచింపబడిన గ్రంథాన్ని "ప్రకరణమ"ని పండితులు చెప్తారు.

"శాస్త్రికదేశ విషయం శాస్త్ర కార్యాంతరే స్థితమ్

ఆహుః ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చితః"

అపరోక్షానుభూతి:

శంకరభగవత్పాదులు రచించిన ప్రకరణ గ్రంథాలన్నింటిలో "అపరోక్షానుభూతి" స్వరూపంలో చిన్నది. కాని తత్త్వనిరూపణలో అత్యంత విశిష్టమైనది. దీనిని అధ్యయనం చేస్తే విషయ సమగ్రత చేకూరుతుంది. అద్వైతతత్త్వం దృఢంగా నిలుస్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని స్థాలీపులాక న్యాయంగా ఈ వ్యాసంలో వివరిస్తాను. ఇంతకు పూర్వం పండితులు ఎందరో ఈ గ్రంథానికి వివరణ రచించేరు. అవి నాకు ఎంతగానో సహకరించేయి. ఆ పండితులకి కృతజ్ఞతాభివందనాలు.

అపరోక్షానుభూతి అంటే ప్రత్యక్ష జ్ఞానరూపమైన బ్రహ్మనుభూతి. బ్రహ్మానుభవం ప్రాప్తించిన ఆ క్షణంలోనే అజ్ఞానంచే అనుభవింపబడుతున్న సంసారం సమస్తమూ నశిస్తుంది. ముక్తి లభిస్తుంది. మోక్షప్రాప్తికి జ్ఞానరూపమైన బ్రహ్మము యొక్క అనుభవం అత్యంతావశ్యకం. కాబట్టి ఆ జ్ఞానం యొక్క అనుభవానికి సంబంధించిన అంశములను, పెక్కింటిని నిరూపిస్తూ జగద్గురు శ్రీ శంకరభగవత్పాదులు ఈ “అపరోక్షానుభూతి" అనే గ్రంథాన్ని సంతరించేరు.

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశృఋషిభ్యో మహద్భ్యో గురుభ్యః ।।

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్।

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్॥


శ్రీమద్గంటి కులోద్భూతం లక్ష్మీనారాయణాభిధమ్ ।

బ్రహ్మతత్వోపదేష్టారం వందే వేదాంతదేశికమ్ ॥

అపరోక్షానుభూతి - మంగళాచరణవిధానం:

శ్రీహరిం పరమానంద ముపదేష్టారమీశ్వరమ్వ్యాపకం।

సర్వలోకానాం కారణం తం నమామ్యహమ్ ॥ 1

తత్త్వాన్ని ఉపదేశించువాడు, సమస్తానికీ ప్రభువు, అంతటా వ్యాపించి యున్నవాడు, సర్వలోకాలకీ కారణమైనవాడు, పరమానంద స్వరూపుడు అయిన శ్రీహరికి నమస్కారం. శంకరభగవత్పాదులు దేవతానమస్కృతితో గ్రంథ రచన ఆరంభించేరు. “మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్” అన్న సంప్రదాయానికి అనుగుణంగా శ్రీహరి నమస్కృతిని నిర్వహించేరు. గురుపరంపరని “నారాయణ సమారంభామ్” అని స్మరించడం ప్రాచీన సంప్రదాయం. కాబట్టి శంకరులు ముక్తి ప్రదాయకమైన అపరోక్షానుభూతిని నారాయణ పర్యాయవాచకమైన శ్రీహరిశబ్దంతో శుభారంభం చేసియుంటారు.

అంతేగాదు శంకర భగవత్పాదుల గురువు గోవింద భగవత్పాదులు. శ్రీహరి అనే పదం గోవింద పదానికి కూడా పర్యాయవాచకమే. కాబట్టి గురుస్మరణ కూడా భంగ్యంతరంగా నిర్వహింపబడినట్లే అని కూడా సమన్వయింపవచ్చు. "గురుః సాక్షాత్పరంబ్రహ్మ". అందుకే పరమానందమ్ అని రెండవపదంగా ప్రయోగించి తమకు అద్వైతతత్త్వాన్ని ఉపదేశించినవారు అవడం చేత వెనువెంటనే ఉపదేష్టారమ్ అని కూడా శంకరదేశికులు పేర్కొనియుంటారని భావింపవచ్చు.

అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్షసిద్ధయే ।

సద్భిరేషా ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహుః ॥ 2

మోక్ష ప్రాప్తికోసం “అపరోక్షానుభూతి" అనే పేరుగల ఈ గ్రంథం చెప్పబడుతోంది. పండితులచే మాటమాటకీ ఈ గ్రంథం పరిశీలింపదగ్గది. ప్రత్యక్షమైన బ్రహ్మానుభవాన్ని కల్గిస్తుంది కాబట్టి ఈ గ్రంథాన్ని ఒకటి రెండు ఈ సార్లు అనుశీలనం చేస్తే చాలదు. బ్రహ్మానుభవం కలిగేవరకు నిత్యం ఈ గ్రంథం సేవింపదగ్గది. అందుకే శ్లోకంలో శంకరులు "ముహుర్ముహుః" అని ప్రయోగించేరు. బలీయమైన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నిరంతరం అపరోక్షానుభూతి అనే వేదాంతగ్రంథం అధ్యయనం చేయదగ్గదని తాత్పర్యం.

అపరోక్షానుభూతి - జ్ఞానావశ్యక వివరణం:

నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణాన్యసాధనైః।

యథా పదార్థభానం హి ప్రకాశేన వినా క్వచిత్॥ 11

ఒక్క జ్ఞానంచేత మాత్రమే ఆత్మానుభవం ప్రాప్తిస్తుంది. జ్ఞానం విడిచి పెట్టి, మరి ఏ ఇతర సాధనాలతో ఎంత విచారించినప్పటికీ ప్రయోజనం ఉండదు. “జ్ఞానాదేవ హి కైవల్యమ్" అని ఉపనిషద్వాణి కూడా వివరిస్తోంది. ఏదైనా వస్తువుని, అది ఆ వస్తువు అని గుర్తించాలంటే, ఆ వస్తువు మీద వెలుగు పడినప్పుడే సాధ్యమౌతుంది కదా. వస్తుజ్ఞానానికి ప్రకాశం ఎంత ముఖ్యమో, ఆత్మానుభూతికి కూడా జ్ఞానం అంతే అవసరం.

కోऽహం కథమిదం జాతం కో వా కర్తాऽస్య విద్యతే ।

ఉపాదానం కిమస్తీహ విచారః సోऽయమీదృశః ॥ 12

సంసారం నుండి ముక్తిని కోరుకొనేవాడు వైరాగ్యాది చతుష్టయాన్ని పొంది జ్ఞానప్రాప్తికి ఏ విధమైన విచారం చేయవలసి యుంటుందో ఆదిశంకరులు వివరిస్తున్నారు. నేను ఎవణ్ణి? ఈ ప్రపంచం ఎట్లు ఆవిర్భవించింది? దీనికి కర్త ఎవ్వడు?  దీనికి ఉపాదానకారణం ఏది? వైరాగ్యాది చతుష్టయం కల్గినవాడు ఈ విధంగా విచారించాలి.

ఈ శ్లోకంలో చెప్పిన ప్రకారం విచారిస్తే ఈ సంసారం భ్రమవల్ల ఏర్పడిందనీ అంతటా వ్యాపించియున్నది. అద్వితీయమైన బ్రహ్మము మాత్రమే అని విశదమౌతుంది. ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి ముఖ్యమైన కారణాన్ని ఉపాదానకారణమంటారు. కుండ మూకుడు మొదలైన మట్టిపాత్రలు ఆవిర్భవించడానికి మట్టి ఉపాదానకారణం. అది లేకపోతే ఆ వస్తువులు ఉత్పన్నం కావు. కుండలాలు, కేయూరాలు మొదలైన స్వర్ణాభరణాలని తయారుచేయడానికి బంగారం ఎంతో ముఖ్యం. కాబట్టి వాటికి బంగారం ఉపాదానకారణం.

ఆత్మనస్తత్ప్రకాశత్వం యత్పదార్థావభాసనమ్ ।

నాగ్న్యాది దీప్తివద్దీప్తిర్భవత్యాంధ్యం యతో నిశి॥      22

ఇది కుండ, ఇది చెట్టు, ఇది స్వర్ణాభరణం అని వస్తు జ్ఞానం కల్గడానికి ఆత్మ ప్రకాశమే కారణం. ఆ వెలుగు ఆయా వస్తువులపై పడినప్పుడు ఆయా వస్తువులకి సంబంధించిన జ్ఞానం కల్గుతుంది. రాత్రి యందు ఇది చీకటి అని గుర్తించడానికి కూడా లోపల ఉన్న ఆ వెలుగే కారణం. ఆ ఆత్మ ప్రకాశం అగ్ని మొదలైన వాటివల్ల కలిగే కాంతి వంటిది కాదు. సూర్యుని కాంతి పగలుకి పరిమితం. అగ్ని యొక్క కాంతి రాత్రికి పరిమితం. ఆత్మ ప్రకాశం అన్ని కాలాలలోను ఉంటుంది. చీకటిని చీకటిగా గుర్తించడానికి కూడా అదే ఆధారం. కాబట్టి ఆత్మ ప్రకాశం తక్కిన వెలుగులకంటే భిన్నమైనది. "తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి” అని ఉపనిషత్తు (ముండ. 2-2-10)

భగవద్గీతలో సూర్యుడు చంద్రుడు అగ్ని కూడా పరమాత్మ స్థానాన్ని ప్రకాశింపజేయలేవు అని పరమాత్మ - “న తత్ భాసయతే సూర్యో న శశాంకో న పావకః" (15-6) అని అంటాడు. ఆత్మ ప్రకాశమందు సూర్యాదుల కాంతి స్వల్పమే అని స్పష్టం. ఆ సందర్భంలోనే "సూర్యచంద్రాగ్నులలో నున్న వెలుగు సమస్తం కూడా నాదే" అని పరమాత్మ ఇలా వివరిస్తాడు. "యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్||" (15-12) సూర్యచంద్రాగ్నులని ప్రకాశింపజేసేది ఆత్మప్రకాశమే అని తాత్పర్యం.

స్వప్నో జాగరణే లీకః స్వప్నేం పి హి న జాగరః ।

ద్వయమేవ లయే నాస్తి లయో పి హ్యుభయోర చ ॥ 57

జాగ్రదావస్థలో స్వప్నం ఉండదు. మిథ్యయే అవుతుంది. స్వప్నావస్థలో జాగ్రదావస్థ ఉండదు. ఆ జాగ్రత్ స్వప్న అవస్థలు రెండూ సుషుప్తియందు (లయమందు) ఉండవు. అట్లే స్వప్న జాగ్రదావస్థలు రెండింటిలోను సుషుప్తి ఉండదు. కాబట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడూ అసత్యాలు అనిత్యాలు.

మెలకువగా ఉన్నంతకాలం స్వప్నానుభవం అసంభవం. స్వప్నానుభవం ఉన్నంతకాలం మెలకువగా ఉండడం కూడా అసంభవమే. గాఢనిద్రలో జాగ్రత్ స్వప్నావస్థలు రెండూ కూడా ఉండవు. కేవలం ఆత్మ తనదైన ఆనందానుభవంలో ఉంటుంది. కాబట్టి ఆ దశలో ఎంతో సుఖాన్ని అనుభవించేను అని ప్రతి వ్యక్తీ తలుస్తాడు. స్వప్న జాగ్రదావస్థలు రెండింటిలో ఆసుషుప్తి యొక్క అనుభవానికి అవకాశమే లేదు. కాబట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి దశలు మూడు కూడా యథార్థములు కావు. మిథ్యయే అని తాత్పర్యం.

స్వప్నదేహో యథాధ్యస్తః తథైవాయం హి దేహకః ।

అధ్యస్తస్య కుతో జన్మ జన్మాభావే స్థితిః కుతః ॥   93

నిద్ర నుండి లేచిన వెంటనే స్వప్నదేహం లయమవుతుంది. భ్రాంతి వల్లనే అది ఏర్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. స్వప్నదేహమనేది లేకపోయినప్పటికీ ఉన్నట్లు అధ్యాసవల్ల భాసిస్తోంది. అట్లే ఆత్మయందు దేహం కూడా అధ్యాసవల్ల ఏర్పడ్డదే. భ్రాంతి మూలకమే. దేహం భ్రాంతివల్ల అనుభవంలో ఉంటునప్పుడు ఆ దేహం పుట్టడం ఎలా సాధ్యమౌతుంది? జన్మేలేనప్పుడు దానికి సంబంధించిన కర్మ ఎక్కడ నుండి వస్తుంది?

భావితం తీవ్రవేగేన వస్తు యన్నిశ్చయాత్మనా ।

పుమాం స్తద్ధి భవేచ్ఛీఘ్రం జ్ఞేయం భ్రమరకీటవత్ ॥    140

తుమ్మెద ఏదో పురుగుని తెచ్చి దాని చుట్టూ అరుస్తూ తిరుగుతూ ఉంటుంది.క్రమంగా ఆ పురుగు తుమ్మెద అవుతుంది. అదే విధంగా ఏ పురుషుడైనా తీవ్రమైన వేగంతో దృఢనిశ్చయంతో ఏ వస్తువునైనా భావిస్తూ యుంటే అతడు శీఘ్రంగా ఆ వస్తువే అవతాడని తెలుసుకోవాలి. తీవ్రమైన వేగంతో దృఢనిశ్చయంతో బ్రహ్మమునే ఎల్లప్పుడూ భావించేవాడు బ్రహ్మమే అవతాడని తాత్పర్యం. 

ముగింపు:

ఇలా మొత్తం 144 శ్లోకాలలో అపరోక్షానుభూతిని ఆదిశంకరులు వివరించారు. స్వచ్ఛమైన హృదయంతో పునః పునః విచారణ చేస్తే ఆత్మాజ్ఞానం కలుగుతుందని శంకరులు స్పష్టంచేసారు. ఈ "అంతిమ విముక్తి"ని అంటే మోక్షాన్ని పొందడం కోసం అపరోక్షానుభూతి (ఆత్మ-సాక్షాత్కారం) అవసరమనే బోధ ఇందులో కనిపిస్తుంది. ఆత్మ - అనాత్మల మధ్య భేదాన్ని తెలియజేయడంలో ప్రధానమైన సాధనచతుష్టయాన్ని గురించి జగద్గురువులు చక్కగా వివరించారు. వైరాగ్యం, వివేకం, శమదమాది షట్సంపత్తి, ముముక్ష మొదలైన వాటిని అలవర్చుకోవడంలోని ఆవశ్యకతను తెలిపారు. మానవుడు జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇవి ఎలా తోడ్పడతాయో కూడా ఈ గ్రంథంలో సంక్షిప్తసుందరంగా తెలియజేశారు.

ఉపయుక్తగ్రంథాలు:

1. అపరోక్షానుభూతి, ఆదిశంకరాచార్యులు, విద్యారణ్యస్వామి వ్యాఖ్యానసహితం.

2. శ్రీమద్భగవద్గీత, ఘోరక్ పూర్, వారణాసి.

3. ముండకోపనిషత్.

4. వాచస్పత్యం, ఛౌకాంబా ప్రచురణాలయం, వారణాసి.